చెరపకురా చెడేవు-- (sisindri) కథ
Published Sunday, 26 February 2017అనగనగా ఒక మహానగరంలో సముద్రగుప్తుడనే సముద్ర వ్యాపారి ఉండేవాడు. అతనికి ఓర్వలేనితనము. గొప్ప కోటీశ్వరుడినన్న గర్వం ఎక్కువ. ఒకసారి సముద్రంలో అతను ఒక పెద్ద ఓడలో ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి అయ్యింది. అతనితోపాటు అందరు వ్యాపారులు గాఢనిద్రలో ఉన్నారు.
* * *
ప్రమాదవశాత్తూ అతని ఓడ మునిగిపోయింది. కాని అతను మాత్రం అతి కష్టం మీద ఈదుకుంటూ అక్కడ దగ్గరలో ఉన్న ఒక దీవిని చేరుకున్నాడు.
అక్కడ ఎక్కడ చూసినా వజ్రాలు, ముత్యాలు, పగడాలు గుట్టలుగుట్టలుగా పడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. మనుషులెవ్వరూ లేకపోవటం చూసి బాధపడ్డాడు.రెండు పడవలు తెడ్లతోపాటు సిద్ధంగా కనిపించాయి. ఆనందంగా ఒక పడవ నిండా వజ్రాలు నింపుకొని ఆహారంగా అక్కడ లభించే పండ్లు, దుంపలు, మంచినీటిని నిల్వ జేసుకొని తన నగరం వైపు బయలుదేరాడు.
అలా నగరం చేరుకోగలిగితే ప్రపంచంలోనే తనకన్నా గొప్ప ధనవంతులు మరొకరుండరని గర్వంగా అనుకున్నాడు. మరెవరైనా ఈ దీవిని తన వలే చేరుకోగలిగితే వాళ్లు తనకు పోటీ అవుతారేమోనని అసూయ చెందాడు.
వెంటనే అక్కడ వున్న రెండవ పడవను బలవంతంగా సముద్రంలో ముంచేశాడు.
ఆనందంగా తన వద్ద ఉన్న దిక్సూచిని సరిజేసి పడవలో పెట్టుకొని తన నగరం వైపు బయలుదేరాడు.
హఠాత్తుగా పడవలోకి నీళ్లు రావటం మొదలైంది. పడవ అడుగు భాగంలో పెద్ద చీలిక లాంది ఏర్పడి అది పెద్దది అయ్యింది. ప్రాణ భయంతో సముద్రంలోకి దూకేశాడు. మళ్లీ అదే దీవికి చేరాడు. మరో పడవ కూడా లేదు. తానే చేతులారా నడిసముద్రంలో ముంచేశాడు. తన అసూయ తనకే అపకారం చేసిందని అర్థం చేసుకున్నాడు. హఠాత్తుగా దగ్గరలో పులులు, సింహాలు కనిపించటంతో ‘కాపాడండి’ అంటూ భయంతో గట్టిగా కేకలు వేశాడు.
చావు తప్పదనుకున్నాడు.
కానీ..
కళ్లు తెరిచి చూసేసరికి అతను తన ఓడలోనే సురక్షితంగా పడకపై వున్నాడు.
తాను కలగన్నానని గ్రహించాడు.
ఇక కలలో కూడా అసూయతో ఇతరుల అవకాశాలను చెడగొట్టరాదు అనుకున్నాడు. తోటి మనుషులకు తోచిన సహాయం చేస్తూ మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.