S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (వాసుదాసు వ్యాఖ్యానం)

వాలి తనను దూషించిన వృత్తాంతాన్ని
శ్రీరాముడికి చెప్పిన సుగ్రీవుడు
*
కిష్కింధకాండ
*
వాలికి, తనకు విరోధం వచ్చిన కారణాన్ని చెప్పడం కొనసాగిస్తూ శ్రీరాముడితో సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు. ‘‘దురాగ్రహంతో మండిపడుతున్న ఆ కపిరాజు వాలి మీద ఉన్న గౌరవంతో ఉన్న విషయాన్ని విన్నవించుకున్నాను. కట్టెలాగా ఆయన పాదాల మీద పడి ఇలా వేడుకున్నాను.’’
‘‘అన్నా! మహా శౌర్యశాలీ! మా భాగ్యం వల్ల శత్రువైన మాయావిని నువ్వు చంపి వచ్చావు. దిక్కు లేని వారికి దిక్కైన నువ్వే ఈ దిక్కులేని వాడికి దిక్కు. చంద్రుడిలాగా ప్రకాశించే తెల్ల గొడుగును నీకు నేను పడ్తాను. నిర్మలమైన మనస్సుతో అంగీకరించు. ఒక్క సంవత్సరం నేను బిలం ముఖం వద్ద కాచుకుని కూర్చున్నాను. అప్పుడు నెత్తురు ప్రవాహాలు అంతకంతకూ ఎక్కువై పారడం జరిగింది. రాక్షసుల సింహనాదాలు వినపడ్డాయి కానీ నీ గొంతు వినపడలేదని బాధపడ్డాను. అప్పుడు, నిన్ను చంపిన రాక్షసులు నా మీదకు యుద్ధానికి వస్తారేమోనని భయపడి ఒక కొండను బిలద్వారంలో పెట్టి ఏడ్చుకుంటూ, కలవరపడుతూ నగరానికి చేరుకున్నాను. అన్నా! ఇది యదార్థంగా జరిగిన సంగతి. దుఃఖంతో పరితపిస్తున్న నన్ను నేను వద్దంటున్నా బలవంతంగా మంత్రులు రాజ్యాభిషిక్తుడిని చేశారు. దేవా! నన్ను దయ చూడు. అన్నా, నువ్వే రాజుగా ఉండు. నేను ఎప్పటిలాగా యువరాజుగా ఉంటాను. రాజు లేకుంటే రాజ్యం అరాచకం అవుతుందని మంత్రులీ విధంగా చేశారు. రాజ్యం, రాజుతనం నేను కోరలేదు. ఇది నిజం. నీ రాజ్యాన్ని నువ్వే తీసుకో. అన్నా! నేను నీకు తమ్ముడిని. శత్రువును కాదు. నీ విషయంలో నేను ఎలాంటి ద్రోహం చేయలేదు. నన్ను క్షమించు. నీ పాదాల మీద పడతాను. చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను.’’
‘‘అని ఎంతగా వినయంగా నేను వేడుకున్నా ఆయన కోపం వదల లేదు. ధిక్కార స్వరం మారలేదు. ఎన్నో విధాలుగా తిట్టాడు. పురజనులను, మంత్రులందరినీ సభలో చేర్చి నన్ను చూసి వాలి ఇలా అన్నాడు.’’
‘‘ఒక అర్ధరాత్రి, ఒక రాక్షసుడు, యుద్ధానికి నన్ను పిలిస్తే నేను వెంటనే ఇల్లు వదిలిపోయాను. ఈ మోసగాడు కూడా నా వెనకే వచ్చాడు. ఇది మీకు తెలిసిన విషయమే. మమ్మల్ని ఇద్దరినీ చూసి మాయావి భయపడి పరుగెత్తాడు. నేను వాడి వెంట పరుగెత్తాను. ఈ పాపచారి నా వెంట వచ్చాడు. ఇలా పరుగెత్తి వాడు అడవిలో భూమిలో ఉండే ఒక బిలంలోకి దూరాడు. నేను విరోధం మానకుండా వాడి వెంట పోవాలని, ఈ నీచుడితో, నేను రాక్షసుడిని చంపి వచ్చే వరకు ఈ బిలం దగ్గరే ఉండమని చెప్పాను. విరోధిని చంపినా తరువాతే ఊళ్లోకి వస్తానని కూడా చెప్పాను. అలా సుగ్రీవుడిని బిలం వాకిట్లో ఉంచి నేను ఆలస్యం చేయకుండా లోపలికి పోయాను. పోయి అక్కడ రాక్షసుడిని వెతికాను. ఒక సంవత్సరం గడిచింది. అప్పుడు వాడు కనబడ్డాడు. వాడిని యుద్ధంలో వాడి బంధువులతో సహా చంపి మళ్లీ మన ఊరికి రావాలని ప్రయత్నం చేస్తే, బిలద్వారానికి కొండ అడ్డంగా ఉండడం వల్ల దారి కనపడలేదు. నేను గట్టిగా ఎన్నో సార్లు సుగ్రీవా! సుగ్రీవా! అని అరిచాను. వాడి దగ్గర నుండి సమాధానం లేదు. బయటికి రావడానికి దారి తెలియలేదు. నేను ఉండమని చెప్పి వచ్చిన సుగ్రీవుడి గొంతు వినపడలేదు. అప్పుడు నేను పడ్డ బాధ ఏమని చెప్పాలి? కడుపులో చేయి పెట్టి కెలికినట్లయింది. ఇలా ఇబ్బంది పడుతూ బిలద్వారంలో ఉన్న కొండను కాలితో తన్ని తన్ని పడగొట్టి ఎంతో కష్టం మీద బయటపడ్డాను. రాజ్యలక్ష్మి కొరకు వీడెంత పాపం చేశాడో చూశారా? వాడికి అన్నని కదా? ఇలా ప్రవర్తించవచ్చా? అని ఆలోచించలేదు. ఈ నీచుడు ఎంత చెడ్డ పని చేశాడో చూశారా? వీడిని మన్నించవచ్చా?’’
‘‘ఇలా అంటూ నన్ను ఊరు వెడలగొట్టాడు. నా భార్యను గ్రహించాడు. అంతటితో ఆగకుండా నన్ను చంపడానికి రావడంతో ప్రాణ భయంతో అనేక దేశాల్లో తిరిగి చివరకు ఈ గుట్టకు అతడు రాలేకపోవడానికి కారణం ఉండడం వల్ల ఇక్కడ స్థానం ఏర్పాటు చేసుకున్నాను. బుద్ధిపూర్వకంగా నేను ఏ అపకారం చేయలేదు. అలా అయినప్పటికీ పడరాని కష్టాలను పడుతున్నాను. నా మీద దయ చూపించి సర్వభూత రక్షకుడవైన నువ్వు ఈ దీనుడిని, దరిద్రుడిని రక్షించు. దీనరక్షకుడని కీర్తిని సంపాదించు.’’
(సుగ్రీవుడు జరిగినదంతా సత్యంగానే చెప్పాడు కానీ, తాను రాజుగా ఉన్న సమయంలో అన్న భార్య తారను గ్రహించిన సంగతి చెప్పలేదు. ఈ కలహంలో మొదలు సుగ్రీవుడు మీద అనుమానం రావడం సహజమే. కానీ సుగ్రీవుడు బుద్ధిపూర్వకంగా చేయాలని పొరపాటు చేయలేదు. వాస్తవంగా రాజ్యకాంక్ష వల్ల వాలికి ద్రోహం చేసినట్లయితే అతడు కిష్కింధకు వచ్చినప్పుడు తన బలంతో వాలిని నిగ్రహించగలిగే వాడే! వాలిసుగ్రీవులు ఇద్దరూ ఇంచుమించు సమానమైన బలవంతులే. వాలి దగ్గర ఇంద్రదత్తహారం ఉండడం వల్ల ఎక్కువ బలశాలి అయ్యాడు. హనుమంతుడు, నీలుడు లాంటి వారు సుగ్రీవుడి సహాయకులు. సుగ్రీవుడు వాలితో యుద్ధానికి పూనుకుంటే ఒక్క హనుమంతుడే వాలిని మట్టుబెట్టగలడు. కాబట్టి సుగ్రీవుడిలో ద్రోహబుద్ధి లేదు. సుగ్రీవుడి విషయంలో వాలి అనుమానపడ్డాడు. బిలద్వారం మూయడం, రాజ్యాభిషిక్తుడు కావడం ద్రోహబుద్ధితో చేశాడని నమ్మాడు. తాను జీవించి ఉండగా తన భార్య తారను గ్రహించాడని తెలిసీ ఆయన ఏం అనలేదు. వాలి కుల మర్యాదను, శాస్త్ర మర్యాదను ఉల్లంఘించడం వల్లే శిక్షార్హుడయ్యాడు).
సుగ్రీవుడు ఇలా చెప్పడంతో రామచంద్రమూర్తి అతడితో, ‘మిత్రమా! బాధపడవద్దు. నా బాణాలతో నీ పగ తీరుస్తాను. ఆ పాపాత్ముడెంత వరకు నా కంట పడడో అప్పటివరకే సుఖంగా ఉంటాడు. కపీశ్వరా నా దుఃఖంలాంటిదే నీ దుఃఖం. దాన్ని ఉపశమించేట్లు చేస్తా. సంతోషించు.’’
-సశేషం
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12