పిచ్చి తిళ్లు తినకండి! కళ్లు పోతాయి!!
Published Saturday, 18 January 2020![](http://ftp.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/meeku_9.jpg?itok=iibc4czv)
‘అబధ్ధాలాడకు! కళ్లు పోతాయి’ అని ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు పిల్లల్ని హెచ్చరించేవాళ్లు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పిల్లలకీ, పెద్దలక్కూడా మార్గదర్శనం చేసేందుకు వయో వృద్ధులు ఉండేవాళ్లు. వాళ్లు కుటుంబ వ్యవస్థను గాడిన పెట్టి కాపాడేవాళ్లు. అది మన వ్యవసాయిక సంస్కృతిలో ఒక భాగం.
1970-80ల తరువాత మనం ఆర్థిక వ్యవస్థలోకి క్రమేణా మళ్లాం. దేశంలో అధిక జనాభా నియంత్రణ కోసం జరిగిన ప్రయత్నాలు ఆ కోణంలో కొంత మంచి ఫలితాలిచ్చాయి. కానీ, పరిమిత కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని దెబ్బతీసింది. వయో వృద్ధులను కుటుంబ వ్యవస్థలోంచి వేరు చేసి వాళ్లని వొంటరి చేసింది.
2000 మిలీనియం యుగంలో, ఈ 20 ఏళ్ల కాలంలో మనం చాలా వేగంగా వాణిజ్య సంస్కృతిలోకి మారిపోయాం. ‘ఐతే నాకేంటి’ అనే ధోరణి నిస్సిగ్గుగా వ్యాపించింది. డబ్బు ధ్యాస జబ్బు ధ్యాసని కప్పేసింది. ఎవరూ ఎవరికీ ఏమీ చెప్పలేని వ్యవస్థను పెంచి పోషించుకుంటున్నాం. కొత్త తల్లిదండ్రులు వాళ్ల తల్లిదండ్రుల నుండి స్ఫూర్తిని పొందింది, పొందుతున్నదీ తక్కువ కాబట్టి, ఇప్పుడు ఇళ్లల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘అబద్ధాలాడకురా! కళ్లు పోతాయి’ అని చెప్పలేక పోతున్నారు. ఏతావతా మన తరువాతి తరానికి సరైన మార్గదర్శనం చేయటంలో విఫలం అవుతున్నాం. విద్యా వ్యవస్థ వ్యాపార ధోరణి పెంచుకుని పిల్లలకు నైతిక విలువల గురించి, శారీరక, మానసిక ఆరోగ్యాల గురించి తెలియచెప్పాలనే బాధ్యతను గాలికి వదిలేసింది. ఇంట్లోనూ బళ్లోనూ కూడా చెప్పకుండా పిల్లలు ఉన్నతులుగా ఎలా ఎదుగుతారో దేవుడికే తెలియాలి.
కానీ, వైద్యశాస్త్రం బాధ్యతగా చెప్పవలసినవన్నీ ఎప్పటికప్పుడు తెలియజెప్తూనే ఉంది. వైద్య గ్రంథాల రచయితల ద్వారా అన్ని పత్రికలూ ప్రజలకు దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నాయి. ఆ ప్రభావాన్ని అందుకోగలవారు అదృష్టవంతులు.
రెండు దశాబ్దాల కాలం కఠోర పరిశోధన చేసిన ఒక నివేదికని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ ద్వారా వెలుగులోకి రాగా, మెడికల్ న్యూస్ టుడే వెబ్ జర్నల్ 2019 డిసెంబర్ 30న దానిని ప్రచురించింది. ‘పిచ్చి తిళ్లు తినకండి - కళ్లు పోతాయి’ అనేది ఈ నివేదిక సారాంశం. ఇది అబద్ధాలాడకురా! కళ్లు పోతాయి లాంటి సూక్తి కాదు. మనం ఆహార విధానాన్ని సరిచేసుకోకపోతే నిజంగానే కళ్లు పోయే ప్రమాదం ఉందనే గట్టి హెచ్చరిక. Should we be keeping more of an eye on what we eat? మనం తింటున్న వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కదా? అని ప్రశ్నిస్తోంది నివేదిక.
పూర్వజన్మలో పాపాలకు మరణానంతరం పడే శిక్షల గురించి గరుడ పురాణం చెప్తుంది. కానీ, ఈ జన్మలో, ముఖ్యంగా ఆహార పరంగా మనం చేసే తప్పులకు కేన్సర్ నుండి కళ్లు పోవటం వరకూ చాలా శిక్షలు ఈ జన్మలోనే పడతాయని వైద్య శాస్త్రం ఘోషిస్తోంది.
అధికంగా కొవ్వు, అధికంగా గొడ్డుమాంసం, వేపుడు కూరలు, ఎక్కువ మరపట్టిన ధాన్యం, నల్లగా మాడ్చిన వంటకాలు, అధిక ఉష్ణోగ్రత దగ్గర వండిన బిస్కెట్లు, కేకులు, తీపి కలిపిన కూల్డ్రింక్లు, ఇతర బెవరేజీలు, రంగులు కలిసిన ఆహార పదార్థాలు, మనం వాడక తప్పని రిఫైండ్ నూనెలు ఒకటేమిటీ.. మన చుట్టూ ఉన్నవి, మనం తిన్నవీ అన్నీ కాలకూట విషాలే.
పిల్లలకు వీటిని పెట్టడం వలన వయసు పెరిగే కొద్దీ వచ్చే అంధత్వం Age related macular degeneration (AMD) ముంధుగానే వస్తుందని హెచ్చరిస్తున్నారు.
రాత్రి తిని పొద్దునే్న నా కళ్లు బాగానే ఉన్నాయిగా అనుకోకండి! ఈ తిళ్లు మితిమీరితే, ఎ. ఎం. డి జబ్బు అతి అవుతుందని గమనించండి అంటున్నారు పరిశోధకులు.
ఎ.ఎం.డి జబ్బుతో కంటి లోపలి రెటీనా తెర బలహీనపడి చూపు మందగిస్తుంది. ఇంతకాలం టీవీల మీదకు ఈ నేరాన్ని నెట్టేసి ఊరుకుంటున్నాం. కళ్లు పోతాయని తెలిసినా టీవీ దుర్వినియోగాన్ని ఆపిన వారు లేరు కదా! ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పిచ్చి తిళ్లు రెటీనాను దెబ్బతీస్తాయని కనుగొన్నారు.
వ్యాధి నివారక, నిరోధక సంస్థ (అమెరికా)Center for Disease Control and Prevention (CDC) వారు 1.8 మిలియన్ల మంది అమెరికన్లు 40 ఏళ్లలోపే ఎ.ఎం.డి.ని తెచ్చుకున్నారని ప్రకటించారు. నాలుగు పదుల వయసు తరువాత చూపు మందగిస్తుంది కాబట్టి చత్వారం అన్నారు. ఈ చత్వారం ఏకంగా అంధత్వానికి దారితీసే పరిస్థితి పిచ్చి తిళ్ల వలన ఏర్పడుతోందన్న మాట. పిచ్చి తిళ్ల విషయంలో ప్రపంచానికి అమెరికా వాళ్ళే మార్గదర్శకులైతే, ఇక్కడ మన వాళ్లు ప్రధాన ప్రవర్తకు లౌతున్నారన్నదే ఆందోళన కలిగించే అంశం. 65 ఏళ్ల తరువాత వచ్చే చూపు మందం 20 ఏళ్లకే వస్తే దాన్ని ఘనతగా భావించగలమా? Unhealthful diet and AMD అనేది వైద్యశాస్త్రాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ముఖ్య విషయం. ఇది వ్యక్తిగతమైన విషయంగా కాక, సామాజికమైనదిగా భావించి తగు చర్యలు తీసుకోవలసిన అంశం అని, ప్రజలు పట్టించుకుని తమను తాము మార్చుకోవటం ద్వారా చూపును కాపాడుకొనేలా వాళ్ల గుండె తలుపులు తట్టాల్సిన అవసరం ఉందని .Dr.Amy Millen, (University at Buffalo, New York) పేర్కొన్నారు.
మొత్తం భోజనంలో పిచ్చి తిళ్లు పెరిగిపోయి, విష దోషాలను హరించే యాంటీ ఆక్సిడెంట్స్కు చోటు తగ్గిపోయి శరీరంలో విష దోషాలు మితిమీరుతున్నాయి. నేటి యువతరం వారి ఆహారపు అలవాట్లలో లోటుపాట్లు రేపటి అంధత్వానికి కారణాలని ఈ హెచ్చరిక సారాంశం. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతీ ఒక్కరికీ ఈ హెచ్చరిక వర్తిస్తుంది. వారిలో మార్పు రావాలంటే మొదట తల్లిదండ్రుల్లో మార్పు రావాలి.
కుర్రకారు ఎక్కువగా ఇష్టపడే బజ్జీలు, పునుగులు, నూడుల్స్, అతి మసాలాలు, పులుసు కూరలు, నరక లోకపు పాపుల్లా సలసలా కాగే నూనెలో వేయించినట్టు నల్లగా మాడ్చిన వంకాయ బొగ్గులు, బెండకాయ బొగ్గులు, దొండకాయ బొగ్గుల్నే కూరగా భావించి తినటం కేన్సర్ మాత్రమే కాదు, అంధత్వానికి కూడా కారణం అవుతుందని ఈ నివేదిక పేర్కొంది. బహుశా 2019 సంవత్సరపు ఆఖరి సందేశం ఇదే! కొత్త ఏడాదిలో మనం మనల్ని సంస్కరించటానికి ఈ నివేదిక ప్రాతిపదిక కావాలి.
ఉదయం పూట టిఫిన్లకు ప్రాధాన్యత తగ్గించి వారంలో 4 రోజులైనా పెరుగన్నం పిల్లలకు పెట్టండి. భోజనంలో కూర ఎక్కువగానూ, అన్నం తక్కువగానూ తినేందుకు వీలుగా కూరలు వండే పద్ధతి మార్పు చేయండి. కూర ఎక్కువగా తినాలని పిల్లలకు హితవు చెప్పండి.
చింతపండు, మసాలా వాడకాలను సాధ్యమైనంత తగ్గించండి. నూనెలో వేసి గానీ, బాగా నూనె పోసి గానీ వండిన వంటలు విషతుల్యాలని గమనించండి. తల్లిదండ్రులు మొదట మారితేనే పిల్లల ఆరోగ్య భవిష్యత్తు బావుంటుంది. *