దేవుడి కథ
Published Tuesday, 10 December 2019భగవంతుడిని అందరూ పూజిస్తారు. ప్రార్థిస్తారు. కోరికలు కోరతారు. బాధ కలిగినప్పుడు నిందిస్తారు కూడా. ఇది సహజం. దేవుణ్ణి ఎలా పూజించాలి? దేవుడిని ఏ విధంగా సంతోషపరచాలి అన్న సందేహం ఆలోచన అందరిలో వుంటాయి.
పాల్ కొహలో ఈ విషయం గురించి ఓ కథ రాశాడు. ఆ కథ పేరు ‘నోవీస్ కథ’
ఆ కథలోని పాత్ర ఓసారి అబ్బట్ మకారిస్ దగ్గరికి వెళ్లి దేవుణ్ణి ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో చెప్పమని అడుగుతాడు.
‘సమాధుల దగ్గరికి వెళ్లి చనిపోయిన వ్యక్తులని అవమానపరచు’ చెప్పాడు మకారిస్.
ఆ వ్యక్తి అదే విధంగా చేశాడు. మరుసటి రోజు అతను మళ్లీ అబ్బట్ మకారిస్ దగ్గరికి వెళ్లాడు.
‘ఆ చనిపోయిన వ్యక్తులు ఏమైనా ప్రతిస్పందించారా?’ అడుగుతాడు మకారిస్ అతన్ని.
‘లేదు’ జవాబు ఇస్తాడు అతను.
‘ఈసారి వెళ్లి వాళ్లని పొగుడు’ అని చెబుతాడు మకారిస్.
అలాగేనని అతను వెళతాడు. మకారిస్ చెప్పిన విధంగా వాళ్లని ప్రార్థించి, అదే రోజు మధ్యాహ్నం మకారిస్ దగ్గరికి వెళతాడు.
‘ఆ చనిపోయిన వ్యక్తులు ఏమైనా ప్రతిస్పందించారా?’ అని అడుగుతాడు మకారిస్ అతన్ని.
‘లేదూ’ అని చెబుతాడు అతను.
‘దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా అదే విధంగా చెయ్యి’ అని చెబుతాడు.
ఇంకా ఇలా చెబుతాడు.
‘నిన్ను ఎవరు తిట్టినా వాటిని పట్టించుకోకు. అవమానపరచినా ఆలోచించకు. అదే విధంగా పొగిడినప్పుడు కూడా. ఆ విధంగా నీ దారిని నిర్మించుకో’
ఈ కథ ఎవరికైనా నచ్చుతుంది. ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు దాన్ని పట్టించుకోవడం మానివేయాలి. ఇది కష్టసాధ్యమైనా, అలవర్చుకోవాలి. ఇతరులని ప్రసన్నం చేసుకోవడానికి మన విలువైన కాలాన్ని వృథా చేసుకోకూడదు.
మకారిస్ మాటలని మరిచిపోవద్దు. ‘ఇతరులు అవమానపరిచినప్పుడు వాటిని లక్ష్యపెట్టకూడదు. అదే విధంగా పొగిడినప్పుడు కూడా.’