S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సీతా వృత్తాంతం రాముడికి చెప్పి మరణించిన జటాయువు( అరణ్యకాండ)

జటాయువును సీత ఎక్కడున్నదని పదే పదే ప్రశ్నిస్తూ నేలమీద పడి మూర్ఛిల్లిన శ్రీరాముడు తేరుకుని, లేచి లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ‘‘తమ్ముడా! మహోపకారం చేసిన ఈ పక్షిశ్రేష్ఠుడు నాకొరకు తెగించి యుద్ధం చేసి పడిపోయి కొనవూపిరితో వున్నాడు. మాట్లాడడానికి శక్తి కూడా లేదు. ఏదో ఒక మాట చెప్పినా స్వరం హీనంగా ఉంది’’. ఆ తరువాత జటాయువుతో ఇలా అన్నాడు. ‘‘ఓ గద్దరేడా! జటాయూ! నువ్వు మాట్లాడగలిగితే సీతాదేవి గురించి నీకు తెలిసిన విషయం, నువ్వు చంపబడ్డ విధం, ఎందుకు సీతను రాక్షసుడు పట్టుకొనిపోయాడు? వాడికెందుకు నామీద కోపం వచ్చింది? అపుడు సీతాదేవి ముఖం ఎలా వుంది.. లాంటి విషయాలు చెప్పు. ఆ పాపాత్ముడు, రాక్షసుడు తనను తీసుకొనిపోతున్నపుడు సీత ఏమన్నది ఆ మాటలన్నీ స్పష్టంగా చెప్పు. ఆ రాక్షసుడు ఎలాంటివాడు? ఏ దేహం కలవాడు? వాడుండే నగరం ఏది? వాడెంత శూరుడు? తండ్రీ! సీతను ఏ విధంగా వాడు పట్టుకునిపోయాడో సవివరంగా చెప్పు’’.
ఇలా రామచంద్రుడు అడగ్గా, జటాయువు మెల్లగా రెప్పలు తెరిచి, రాముడిని చూసి, చాలా సన్నటి గొంతుతో జవాబిచ్చాడిలా. ‘‘రామా! వాడు మాయగాడు. తన శక్తితో పెనుగాలిని మబ్బుల గుంపును కల్పించి వాటి చాటున ఎవరినీ కానరాకుండా చేసి, రహస్యంగా సీతాదేవిని శూరుడై బలాత్కారంగా పట్టుకుని ఆకాశ మార్గాన పోయాడు. భయంకర యుద్ధంలో ఎదుర్కొన్న నన్ను చూసి, నా మీదపడి, కత్తితో నా రెక్కలు నరికి అమితమైన వేగంగా దక్షిణ ముఖంగా పరుగెత్తాడు. రామా! కళ్ళు తిరుగుతున్నాయి. నా మనస్సు నా స్వాధీనంలో లేదు. ప్రాణవాయువులు వాటి వాటి స్థానాలు వదిలాయి. అదిగో... వట్టివేళ్ళ కొనలున్న బంగారు మెట్లు కనబడుతున్నాయి. రాక్షసుడు సీతాదేవిని అపహరించిన ముహూర్తం ‘వింద’. ఆ ముహూర్తంలో అపహరించబడిన సొమ్ము మళ్లీ స్వంతదారుడికి చేరుతుంది. తప్పదు. ఆ రాక్షసుడు తొందరలో ఇది గమనించలేదు. కాబట్టి నీ భార్యను అపహరించినవాడు కాలం మింగిన చేపలాగా అయిపోయాడు. రామా! సీతకొరకు నువ్వు ఆందోళనపడవద్దు. నువ్వు ఆ రాక్షసుడిని యుద్ధంలో చంపి మళ్లీ సీతను గ్రహించి గొప్ప కీర్తిని సంపాదించి సంతోషంగా అయోధ్యకు పోతావు’.
ఇంతదాకా స్మృతి తప్పకుండా తెలివిగా చెప్పి, రాముడు అడిగిన మిత్రా ప్రశ్నలకు జవాబియ్యదలచి, మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా వీలుకాక, ఆయన నోట్లో నుండి మాంసం, నెత్తురు కక్కుతూ ఏదో చెప్పబోయాడు. ఆయన చెప్పాలనుకున్నది, పూర్తిగా చెప్పలేకపోయింది. ‘‘విశ్రవసుడు అనే ముని కన్నకొడుకు, కుబేరుడి సోదరుడు..(రావణుడు)..’’ అని చెప్తుండగానే ఊపిరి పోయింది. ‘‘చెప్పు చెప్పు’’ అని రాముడు చేతులు జోడించి అడుగుతుండగానే పక్షిరాజైన జటాయువు ఆయన చూస్తుండగానే దేహం విడిచి స్వర్గానికి పోయాడు. కళ్ళు ఎర్రగా కాగా, నోరు తెరిచి, తల నేలమీద వాల్చి, భూమీద పాదాలు వెడల్పుగా కాగా, దేహం వణుకుతుంటే ఊపిరి విడిచాడు.
అలా నేలమీద పడ్డ జటాయువును చూసి రామచంద్రమూర్తి బాగా దుఃఖపడి, తమ్ముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ‘‘తమ్ముడా! ఇతడు అనేక సంవత్సరాలు పాపాత్ములైన రాక్షస స్థావరమైన దండకంలో వుండి, తన పరాక్రమంతో భయం లేకండా గడిపి, చివరకు ఇక్కడే మరణించాడు, చూశావా? చిన్నతనం నుండీ ఇక్కడే వేలాది సంవత్సరాలు తన ఇష్టప్రకారం సంచరించి చివరకు ఇక్కడే చనిపోవడం అంటే కాలం దాటడం ఎవరికీ శక్యం కాదనే కదా? లక్ష్మణా! చూశావా! సీతను రాక్షసుడు తాకకుండా వుండడానికి ఆమెముందు తాను నిలిచి రాక్షసుడిని ఎదిరించి, యుద్ధం చేసి, తన అఖండ పక్షిరాజ్యాన్ని, ఆయుష్షును నా కోసం వదిలి నేలమీద పడ్డాడు. భూమీద ఇలాంటి పరోపకారుడిని, ఉదారచిత్తుడిని, పుణ్యాత్ముడిని చూశామా?’’
‘‘లక్ష్మణా! తండ్రికొరకు నేను రాజ్యాన్ని వదిలితినని గొప్పగా చెప్తారు. తండ్రికొరకు కొడుకు చేయకపోతే తప్పుకాని, చేయడం గొప్పేమీ కాదు. ఇతడేమో మనుష్య జాతిలో చేరినవాడుకాదు. మనకు బంధువు కూడా కాదు. మన దగ్గరివారిలో చేరినవాడూ కాదు. జీతం తీసుకున్న సేవకుడు కూడా కాదు. మనం ఆయనకు చేసిన ఉపకారం ఏదీ లేదు. మన ఉపకారం ఆయన ఆశించినవాడూ కాదు. ఇలాంటివాడు ఒక ఆడదాన్ని రక్షించాలని దీర్ఘకాలంగా ఏలుతున్న రాజ్యాన్ని, అంతకంటే గొప్పదైన తన ప్రాణాన్ని వదిలిపెట్టాడు. ఇలాంటి పనినే కదా ఉపకారం అని, ఔదార్యం అనీ, పుణ్యమనీ, భక్తిఅనీ అంటారు. లక్ష్మణా! పరోపకారులు మనుష్యులోనే వుంటారని, యాత్ర జాతుల్లో, ఇతర ప్రదేశాల్లో లేరని అనుకోవద్దు. ఇతర జాతులైన పశుపక్ష్యాదులలో కూడా శూరులు, రక్షించే యోగ్యతా కలవారు, పరులకు మేలు చేయగోరేవారు, సాధువులు, ధర్మమార్గంలో ప్రవర్తించేవాళ్లు వుంటారు’’.
‘‘మన తండ్రి నాకెలా పూజ్యుడో, ఇతడు కూడా అలా పూజ్యుడే. ఎందుకంటావా? తండ్రైన దశరథ మహారాజు నాకొరకై ఎలా ప్రాణం వదిలాడో తండ్రికి స్నేహితుడైన ఇతడు కూడా అలాగే నాకోసం ప్రాణం విడిచాడు. కాబట్టి తండ్రిలాగా నా చేత సంస్కారం చేయించుకోవడానికి అర్హుడు. మంచి కీర్తికలవాడు. గౌరవించడానికి యోగ్యుడు. ప్రియుడు. ఇతడి పాట్లు చూస్తుంటే సీతకొరకు ఆమెను కోల్పోయిన దుఃఖం నా మనస్సులో లేదు. ఎందుకంటావా? సీతాదేవి, నా సేవవల్ల కలిగే ఆనందానికై, అది అనుభవించడానికి నాతో వచ్చింది. అది సకామ సేవే కదా? ఇతడేమో నావల్ల ఏ లాభం కోరకుండా నాకోసం ప్రాణాలనే ఇచ్చాడు. కాబట్టి ఇది విశేష దుఃఖాన్ని కలిగిస్తున్నది’’.
జటాయువుకు అగ్ని సంస్కారాలు చేద్దామని నిశ్చయించుకున్న రాముడు తమ్ముడితో, ‘‘లక్ష్మణా! నా పనికోసమై ప్రాణాలు విడిచిన ఈ పక్షిరాజును శాస్త్రప్రకారం నా తండ్రిలాగే దహన సంస్కారం చేస్తాను. కాబట్టి చితి పేర్చు’’ అని జటాయువున్న దిక్కుగా చూశాడు. చూసి, ఆయన్ను వైకుంఠం పొందమంటాడు. పక్షి కాబట్టి కర్మాదికారం లేనందున, అగ్ని సంస్కారానికి యోగ్యత లేనందువల్ల, ఉత్తమ లోకాలు లేకపోయినా తన ఆజ్ఞవల్ల ముక్తిని పొందమని అంటాడు జటాయువును. రామచంద్రమూర్తి బ్రహ్మ విధి ప్రకారం సంస్కరించి, యోగులు పొందే సనాతనమైన తన లోకాన్ని ఇచ్చాడు. రామానుగ్రహంవల్ల ఆ గద్ద పరమపదానికి పోయి విష్ణుసారూప్యాన్ని పొందింది.
(జటాయువు ఋషులలాగా మోక్షం కొరకు పరమాత్మోపాసన చేయలేదు. అలాంటివాడికి రాముడెలా మోక్షం ఘఇచ్చాడు? అలాగైతే అందరికీ ఇవ్వవచ్చు కదా? అని ఆక్షేపించవచ్చు. దీనికి సమాధానం.. మోక్షానికి ఆత్మోపాసన ఒక్కటే మార్గం కదా. చాలా మార్గాలున్నాయి. భగవద్గీతలో కర్మ, జ్ఞాన, రాజయోగాలు, భక్తి, ప్రపత్తి, క్షేత్రక్షేత్రజ్ఞ జ్ఞానం, అవతార జ్ఞానం లాంటివి చెప్పడం జరిగింది. బ్రహ్మసూత్రాలలో 32 విద్యలు చెప్పడం జరిగింది. ఇవేవీ లేకున్నా ప్రేమ ఒక్కటే మోక్షసాధనమని శాస్త్రాలు చెప్తున్నాయి. అన్యమనస్కుడై, భగవంతుడికోసం రాజ్యాన్ని, ప్రాణాన్ని విడిచి ఆయన సమక్షంలో ఆయనమీదే దృష్టి నిలిపి ప్రాణం వదిలి, ఆయన చేతులమీదుగా సంస్కారం పొందిన జటాయువుకే మోక్షం లేకపోతే ఇంకెవరికి వుంటుంది? ఇలాంటివారికెవరికైనా మోక్షం ఇస్తాడు రాముడు కాని, ప్రకృతిబద్ధులై, కామదాసులై, భక్తిశూన్యులైన వారందరికీ మోక్షం ఎలా ఇస్తాడు? జటాయువుకంటే ఎక్కువ త్యాగం చేసినవారెవరు? కాబట్టి జటాయువుకు మోక్షమివ్వడం న్యాయమే.)

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690
-సశేషం

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12