మాత్రలకు లొంగనిధి మలబద్ధకం
Published Saturday, 11 August 2018ప్రశ్న: మలబద్ధతతో బాధపడ్తున్నాను. నా వయసు 70 ఏళ్లు. ప్రతిరోజూ విరేచనానికి వేసుకోవాల్సి వస్తోంది. విరేచనం అయితేనే ప్రాణానికి సుఖంగా ఉంటుంది. నా సమస్యకు పరిష్కారం ఉన్నదా?
-లక్ష్మణయ్య కావూరు (గన్నవరం)
జ: అయ్యవారికి ఈ రోజు పెద్ద విరేచనం అయింది అనగానే ఊరంతా సంబరం చేసుకుంటారు. జంధ్యాలగారి సినిమాలో ఒక హాస్య సన్నివేశం ఇది. ఇంట్లో వయో వృద్ధులున్నప్పుడు ఇది తరచూ ఎదురయ్యే సన్నివేశమే!
వయోధర్మం వలన పేగులు బలహీనపడినప్పుడు వాటి కదలిక మందగిస్తుంది. దాంతో కాల విరేచనం అవదు. ఉదయానే్న విరేచనం కాకపోతే మనసు అతలాకుతలం అవుతుంది. అది అయ్యేదాకా అదే ధ్యాసగా ఉంటారు. కనిపించిన వారందరితోనూ తన విరేచనం కాని తనం గురించి చెప్పుకుంటూ బాధపడ్తుంటారు. వయసులో ఉన్నవారిక్కూడా ఈ పరిస్థితి రావచ్చు.
మలం సాఫీగా కాకుండా బంధించబడటం వలన దీన్ని మలబద్ధత అంటారు. జన వ్యవహారంలో మలబద్ధకం అయ్యింది.
సాఫీగా అవ్వాలంటే మలం మృదువుగా అవ్వాలి. మృదువిరేచనం సుఖాన్నిస్తుంది. నీళ్లుగా విరేచనాలయితే నీరసమే తప్ప విరేచనం అయిన సుఖం కలగదు. అందుకని సుఖ విరేచనం కావాలని వయో వృద్ధులు కోరుకుంటారు.
విరేచనం అయ్యేలా చేసే గుణం ఉన్నవి, విరేచనం మృదువుగా అయ్యేలా చేసేవీ (డఆ్య్య ఒ్యచిఆళశళూఒ), పలుచగా అయ్యేలా చేసేవి (్ఘన్ఘఆజ్పళఒ), తీక్షణంగా విరేచనాలు అయ్యేలా చేసేవి (ఔఖూఘఆజ్పళఒ) ఇలా వివిధ స్థాయిల్లో ఉంటాయి.
వ్యక్తుల శరీర తత్త్వాలను బట్టి తీక్షణ విరేచనకారులు కూడా కొందరికి మృదు విరేచనాన్ని మాత్రమే కలిగించగలుగుతాయి. అందుకని పేగుల తత్వాన్నిబట్టి మనుషుల్ని మృదుకోష్టం, మధ్యమ కోష్టం, క్రూరకోష్టం కలిగిన వాళ్లు అని మూడు రకాలుగా విభజించారు. క్రూర కోష్టం కలిగిన వాళ్లకు సామాన్య విరేచన ద్రవ్యాలు సరిపోకపోవచ్చు. డబ్బాడు మందు మింగినా కడుపు కదల్లేదనే మాట వినిపిస్తుంటుంది వీరి దగ్గర నుండి.
ఒక విరేచనం మాత్ర మనుషులందరి మీదా ఒకేలా పనిచేయదు. వారివారి పేగుల తత్వాన్నిబట్టి, కోష్ఠం తీరునిబట్టి విరేచనం అవుతుంది. ఒక విరేచనం మాత్ర ఒకరికి మృదు విరేచనం కలిగిస్తే ఇంకొకరికి ఎక్కువ విరేచనం అయ్యేలా చేయవచ్చు. అందుకనే మలబద్ధతకు విరేచనం మాత్రలు వాడటం ఎంత మాత్రమూ పరిష్కారం కాదని దీన్నిబట్టి గమనించాలి.
విరేచనం మాత్ర మొదటిసారి వేసుకోబోయే ముందే ఆలోచించాలి. రోజూ విరేచనానికి వేసుకుంటేనే విరేచనం అయ్యే పరిస్థితిని తెచ్చుకోకూడదు. ఎప్పటికప్పుడు ఇంతకన్నా పెద్ద మందు వ్రాసిమ్మని డాక్టర్లను అడిగే పరిస్థితి తెచ్చుకోకూడదు.
విరేచనాల మందుల మీద ఆధారపడితే పేగులు స్వతహాగా పనిచేసే స్థితిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకని విరేచనాల మాత్రలకు అలవాటు పడటాన్ని తప్పించుకో గలగటం అవసరం.
విరేచనం మృదువుగా అవ్వాలి. దానికదే సాఫీగా అయిపోవాలి. ముక్కవలసి రావటం, గట్టిగా ప్రయత్నం మీద విరేచనం అవటం ఇవి వృద్ధాప్యంలో హాని కలిగించే అంశాలౌతాయి.
వ్యక్తి శరీర తత్వాన్నిబట్టి, రోగి పరిస్థితిని బట్టి విరేచనాల మాత్రలు రాసిస్తారు డాక్టర్లు. ఆపరేషన్లు అయినప్పుడు, హెర్నియా లాంటి పరిస్థితుల్ని సరిచేసినప్పుడు, మొలలు, లూఠీలూ బాధ పెడ్తున్నప్పుడూ, గుండె జబ్బులూ, ఊపిరితిత్తుల్లో జబ్బులు ఇలాంటివి ఉన్నప్పుడు మృదు విరేచనకారులైన ఔషధాలను వాడవలసి వస్తుంది. అది కూడా తాత్కాలికంగా ఆ పరిస్థితులు నెమ్మదించేవరకే!
నిత్య వ్యవహారంగా కాల విరేచనం కావటానికి విరేచనాల మందులను వాడుకోవాలని ప్రయత్నించటం తమకు తాము చేసుకునే అపకారం అవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? విరేచనాన్ని మృదువుపరిచే స్వభావం ఉన్న ఆహార పదార్థాలను తెలుసుకుని వాటిని వాడటం, విరేచనాన్ని బంధించే స్వభావం ఉన్న వాటిని మానేయటం అనేవి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు.
ఏ ఆహారం విరేచనం ఫ్రీగా అవటానికి సహకరించదో అది చెత్తతిండి అని భావించటం మొదటి విషయం. విరేచనం కావటం అనేది జీర్ణకోశ వ్యవస్థ బలసంపన్నత మీద ఆధారపడి ఉంటుంది. మలబద్ధత ఏర్పడిన వారిలో జీర్ణశక్తి మందగించటం, తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవటం, గ్యాసు, ఎసిడిటీ, కీళ్లనొప్పులు, ఇతర వాత వ్యాధులు ఇవన్నీ అనుబంధంగా ఉండటాన్ని గమనించవచ్చు. ఇవి మలబద్ధత వలన కలుగుతున్నాయనుకుంటాం. జీర్ణకోశం బలహీనపడటమే వీటన్నింటికీ కారణం.
తేలికగా అరిగే ఆహార పదార్థాలను తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాసు ఎసిడిటీ తగ్గుతాయి. విరేచనం సాఫీగా అవుతుంది. గ్యాసుని తెచ్చేవన్నీ మలబద్ధతనీ కలిగిస్తాయి. అందుకని ఆహార ప్రణాళికను మార్పు చేసుకోవటం అవసరం.
ఎక్కువ కూర - తక్కువ అన్నం తినేవారికి జీర్ణాశయ వ్యవస్థ బలంగా ఉంటుంది. కూరల్లో కలిపి వండే చింతపండు, వెల్లుల్లి, మసాలాలు, శనగపిండి వగైరా ద్రవ్యాలు విరేచనాన్ని బంధిస్తాయి. వీటిని పస్రిమితం చేస్తే కూరని ఎక్కువగా అన్నం తక్కువగా తినటం సాధ్యమవుతుంది. ఇప్పుడు మీ వాటా కింద మీరు తింటున్న కూరని కనీసం రెండు రెట్లకు పెంచి, అన్నాన్ని సగానికి తగ్గించి తినండి. విరేచనం సాఫీగా అవుతుంది.