బుర్రలో దెయ్యం
Published Sunday, 8 April 2018ఒక ఊళ్ళో గురవయ్య అనే వడ్డీ వ్యాపారి వుండేవాడు. అతను మొదట రైతులకు, కష్టాల్లో వున్న వాళ్ళకు ధర్మవడ్డీకే అప్పులు ఇచ్చినా రానురానూ ఇంటి అవసరాలు తీరి విలాసాలకు అలవాటు పడటంతో అధర్మంగా ఎక్కువ వడ్డీలు వసూలు చేయటం మొదలుపెట్టాడు.
ఆ ఊరి జనం అతను తప్ప మరెవరూ అప్పు ఇచ్చేవాళ్ళు లేరు కనుక అన్యాయమని తెలిసినా, మరో దారిలేక అతని అన్యాయాన్ని ఎదిరించకుండా భరించసాగారు.
ఇలా వుండగా కొన్నాళ్ళకు ఆ ఊరికి లక్ష్మయ్య అనే ఓ బడిపంతులు కొత్తగా వచ్చాడు. అతను ఊరి ప్రజలను గురవయ్య ముక్కుపిండి దోచుకోవటం, తప్పనిసరి పరిస్థితుల్లో ఊళ్ళోవాళ్ళు భరిస్తుండటం గమనించాడు.
ఒకరోజు గురవయ్య దగ్గర అప్పు తీసుకున్న ఓ పేద రైతు చనిపోయాడు. వారం రోజుల తర్వాత తాను స్కూలు నుంచి చీకటిపడ్డాక తిరిగొస్తుంటే ఆ రైతు దెయ్యమై ఊరి చివరున్న మర్రి చెట్టు దగ్గర తనకు కనిపిస్తున్నాడని, అతను గురవయ్య మీద పగ సాధించటానికి వేచి చూస్తున్నట్టు తనతో చెప్పాడని భయంతో వణికిపోతూ గ్రామస్థులకు చెప్పాడు లక్ష్మయ్య.
దాంతో గురవయ్య భయపడిపోయి మంత్రాల మరిడయ్యను కలిసాడు తనను ఎలాగైనా ఆ రైతు దెయ్యం నుంచి కాపాడమని ప్రాధేయపడుతూ.
మరిడయ్య మంత్రా లు చదువుతూ కళ్ళు మూసి తెరిచి, ‘‘అమ్మో..! ఇంతవరకు నేనింత భయానక దెయ్యాన్ని చూడలేదు. అది పగతో రగిలిపోతోంది. అయితే, అదనుకోసం ఎదురుచూస్తోంది. దాని శక్తితో అది నీ బుర్ర లోకి దూరాలని చూస్తోంది. కానీ నువ్వు ధర్మం పాటించినంతవరకు అది నినే్నం చేయలేదు. అధర్మం చేయగానే అది నీ బుర్ర లోకి దూరి నిన్నో ఆట ఆడిస్తుంది. దాన్ని వదిలించడం తరువాత ఆ బ్రహ్మదేవుని తరం కూడా కాదు’’ అని చెప్పాడు.
అంతే! దెబ్బకు హడలిపోయిన గురవయ్య మరెప్పుడూ అత్యాశకు పోకుండా ధర్మంగా వ్యాపారం చేసుకోసాగాడు. లక్ష్మయ్య మాత్రం మరిడయ్య సహాయానికి కృతజ్ఞత తెలుపుకున్నాడు.