S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనసు పొరలపై చెదిరిపోని జ్ఞాపకాలు

వనంలో వసంతం.. ఉరికే జలపాతం.. ఆదివాసీల మోముపై అమాయకత్వం.. పసిపిల్లల బోసినవ్వులు.. ఇలాంటి దృశ్యాలను చూస్తే పులకించని మనసుంటుందా..? ప్రకృతి రమణీయతే కాదు.. అరుదైన సందర్భాలు సైతం మనలో వింత అనుభూతులు కలిగిస్తాయి. కొన్ని అద్భుత దృశ్యాలు మన మనోఫలకాలపై జ్ఞాపకాలుగా చిరకాలం మిగిలిపోతాయి. ఎప్పుడో మనం చూసిన, చూడని దృశ్యాలు కళ్లముందు కదలాడాలంటే అది ఛాయాచిత్రాల (్ఫటోలు) వల్లే సాధ్యం. అలనాటి స్మృతులు అరుదైన ఫొటోల రూపంలో పదిలంగా ఉంటాయి. ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కతీ సంప్రదాయాలకు అద్దం పట్టే కుంభమేళాలు, పుష్కరాలు, జాతరలు- తరాలు మారినా ఎప్పటికీ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటాయి. వీటి గురించి గతకాలపు జ్ఞాపకాలు ప్రస్తుత తరానికి, భావి తరాలకు తెలియజేయడంలో ఛాయాచిత్రాల పాత్ర అమోఘం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా విశిష్టతను సంతరించుకున్న ‘సమ్మక్క-సారలమ్మ’ జాతరకు సంబంధించిన ఛాయాచిత్రాలు ఎప్పటికీ నిత్యనూతనమే.

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ‘మేడారం జాతర’ ఆదివాసీల విలక్షణ ఆచార వ్యవహారాలను మన కళ్లెదుట ఆవిష్కరిస్తుంది. దశాబ్దాల క్రితం నాటి జాతర విశేషాలను ‘దృశ్య’రూపంలో అందరికీ అందించేందుకు ‘కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్’ తాజాగా రెండు పుస్తకాలను ముద్రించింది. ‘రంగుల కల’తో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సినీ దర్శకుడు బి.నరసింగ రావు సంపాదకత్వంలో 'Goddess of Folk' పేరిట ఇంగ్లీష్‌లో, ‘మేడారం జాతర-సమ్మక్క సారలమ్మ’ పేరిట తెలుగులోనూ విడుదలైన పుస్తకాలు అలనాటి అపురూప దృశ్యాలతో మనల్ని ఎంతగానో అలరిస్తాయి. మేడారం కోలాహలం ఈనాటిది కాదు. రవాణా, సమాచార వ్యవస్థ, ఆధునిక సాంకేతిక లేని రోజుల్లోనూ వనదేవతలైన సమ్మక్క- సారలమ్మలను మనసారా కొలిచేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తజనం తరలివచ్చేది. జాతరకు వెళ్లే దారిపొడవునా రమణీయ దృశ్యాలే కాదు, ఆదివాసీల ఆచార వ్యవహారాలు చూపరులకు వింత అనుభూతిని కలిగిస్తాయి. ఒకప్పుడు జనం ఎడ్లబండ్లపై మేడారం చేరుకుని చిన్న చిన్న గుడారాలు వేసుకుని అక్కడే వంటలు చేసుకుని వనదేవతలకు మొక్కులు చెల్లించేవారు. రహదారులు లేకున్నా, రవాణా సౌకర్యాలు లేకున్నా పుట్టలూ, గుట్టలూ దాటుకుంటూ ఎన్నో వ్యయప్రయాసలు పడి జాతరకు వచ్చేవారు. జంపన్నవాగులో స్నానాలు చేసి భక్తిశ్రద్ధలతో అమ్మవార్లను దర్శించుకోవడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తోంది. ఇటీవలి కాలంలో రహదారులు, రవాణా, వసతి సౌకర్యాలు మెరుగుపడడంతో ఈ మహాజాతరకు వచ్చే జనం సంఖ్య అనూహ్యంగా పెరిగింది. తండోపతండాలుగా జనం మేడారం బాట పట్టడం, అమ్మవార్ల సన్నిధికి బంగారం (బెల్లం) మోసుకువెళ్లడం, తలనీలాలు సమర్పించడం, జాతర వద్ద సంతలో తమకు నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేయడం, గుడారాల వద్ద వండుకోవడం, వనదేవతల వద్దకు జన సంద్రం నెమ్మదిగా సాగిపోవడం... ఇవన్నీ అపురూప దృశ్యాలే. దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులు మన కళ్లెదుట కదలాడాలంటే వాటిని ఫొటోల్లో చూడాల్సిందే. ఈ ఉద్దేశంతోనే ‘కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్’ సమర్పణలో ననుమాస స్వామి అధ్యయనంలో వెలువడిన ఈ రెండు పుస్తకాలు అలనాటి జ్ఞాపకాలను మన కళ్లలో ఆవిష్కరిస్తాయి.
ఆర్భాటాలకు, ఆడంబరాలు దూరంగా అత్యంత సహజంగా, సాదాసీదాగా కనిపించే గిరిజనుల ఆచార వ్యవహారాలు ఆధునికులకు విస్మయం కలిగిస్తాయి. బెల్లం, పుసుపుకుంకుమలే సమ్మక్క-సారలమ్మ జాతరలో ప్రధాన వస్తువులుగా కనిపిస్తాయి. విలక్షణమైన ఆదివాసీల భక్త్భివన కూడా నాగరికులకు వింతగా తోస్తుంది. వీరి సంప్రదాయంలో విగ్రహారాధన ఎక్కడా కనిపించదు. వీరు ఆరాధించే వనదేవతలు ప్రాకృతిక సంబంధమైన భావనలతోనే మనకు గోచరిస్తారు. సుమారు 900 ఏళ్ల క్రితం తమను నమ్మిన జనం కోసం, జాతి ఆత్మాభిమానం కోసం కాకతీయ ప్రభువులతో యుద్ధం చేసి ప్రాణాలను త్యజించి వీరమరణం పొందిన ఆదివాసీ యువతులైన సమ్మక్క, సారలమ్మలు వనదేవతలుగా జన హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. వీరి త్యాగాలను స్మరించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు ఆదివాసీలు ఈ జాతరను నిర్వహించడం ప్రారంభించారు. కాలగతిలో ఇది మహాజాతరగా మారింది. తెలంగాణ జిల్లాల నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.
ఈ మహాజాతరకు సంబంధించిన అలనాటి ఛాయాచిత్రాలతో పాటు కోయజాతి చరిత్ర, సమ్మక్క కొలుపులు, జాతర చరిత్ర, శివసత్తుల కథనాలు, జనం విశ్వాసాలు, కాకతీయుల శాసనాలకు సంబంధించిన వివరాలు ఈ పుస్తకాల్లో అందించారు. 1955లో అప్పటి ములుగు శాసనసభ్యుడు ఎం.కృష్ణ తీసిన జాతర ఫొటోలు పాఠకులను కట్టిపడేస్తాయి. రమ వీరేశ్ బాబు, పి.విజయభాస్కర రెడ్డి, అనుమల్ల గంగాధర్, ఏలె లక్ష్మణ్, కుసుమ ప్రభాకర్, ఎన్.ఆర్. సుధాకర గౌడ్ వంటి ఫొటోగ్రాఫర్లు తీసిన అరుదైన ఛాయాచిత్రాలు ఈ పుస్తకాలకు నిండుదనం ఇచ్చాయి. ‘తరతరాల మేడారం జాతర’కు ఈ ఫొటోలు అపురూప నిదర్శనాలు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజుల్లో కోలాహలంగా సాగే ఈ ‘గిరిజన కుంభమేళా’ను కనులారా వీక్షించాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. అయితే, మహాజాతర జ్ఞాపకాలు అనునిత్యం మన కళ్లెదుట కదలాడాలంటే అపురూప ఛాయాచిత్రాలను చూడాల్సిందే.

-ఎస్