ఈయనో ‘అడవి మనిషి’
Published Sunday, 30 July 2017రోజుకో రూపాయి కూడబెడితే పాతికేళ్లకు ఎన్నో వేలు అయినట్టుగా - బంగ్లాదేశ్కు చెందిన అబ్దుల్ సమాద్ షేక్ అనే అరవై ఏళ్ల రిక్షా తొక్కుకునే అతను రోజుకు కనీసం ఒక మొక్క నాటడం అలవాటుగా చేసుకున్నాడు. తన పనె్నండో ఏట ప్రారంభించిన ఈ దినచర్య ఇప్పటికీ 17,500 వృక్షాలకు ప్రాణం పోసింది.
అక్కడే కాదు, ప్రపంచమంతా ప్రతి ఒక్కరూ ఇతనినే ఆదర్శంగా తీసుకుంటే, ఇప్పటికి పర్యావరణమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఎంత అద్భుతంగా ఉండేదో కదా! అందుకే అబ్దుల్ సమాద్ను అతని సొంత ఊరు ఫరీద్పూర్లో ‘చెట్ల సమాద్’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. రిక్షా పుల్లర్గా అప్పట్లో అతడు రోజుకి సంపాదించే సుమారు వంద టాకా (సుమారు రూ.75)లు అతడి కుటుంబాన్ని పోషించడానికి బొటాబొటిగా సరిపోయేది. అయినా.. అతడు ఫరీద్పూర్లోనే హార్టికల్చర్ సెంటర్లో రోజుకు కనీసం ఒక మొక్కైనా కొనేవాడు. అదే ఈ ప్రపంచానికి తాను చేసే సహాయం అని భావించేవాడు. ఏ రోజు మొక్క కొనకపోయినా ఆ రాత్రి నిద్ర పట్టేది కాదని చెప్పేవాడు. ఫరీద్పూర్ డిప్యూటీ కమీషనర్ ఆఫీసుకు చెందిన స్థలంలో రెండు పూరి పాకలు నిర్మించుకొని సమాద్, అతని భార్య జోర్నా, నలుగురు పిల్లలు జీవిస్తున్నారు. పొలం గట్రా లేకపోయినా, ఆదాయం అంతంత మాత్రమే అయినా మొక్కలు కొనడానికి అతడు ఖర్చు పెడుతుంటే, భార్య మందలించినా లెక్క చేయడు. సమాజానికి తన తండ్రి చేస్తున్న సేవను అతడి 30 ఏళ్ల కుమారుడు కుతుబుద్దీన్ మెచ్చుకుంటాడు. ఇరుగు పొరుగు వాళ్లు కూడా సమాద్ చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం గమనిస్తూ అతనిని ఎంతో గౌరవించి, ఆదరిస్తున్నారు. ‘మొక్కలు నాటడమే కాదు.. అతడు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ వెనుకాడడు. ఎవరు ఏది అడిగినా కాదనకుండా తనకు చేతనైన సాయం చేస్తూంటాడు. అటువంటి ఆదర్శప్రాయులు ఈ సమాజంలో ఎంతో అరుదుగా కనిపిస్తారు’ అంటాడు అబ్దుల్ పొరుగున ఉండే సికిందర్ అలీ.
తాను 48 ఏళ్ల కిందట నించి మొక్కలు నాటుతూ వస్తున్నానని, ఇది ఆ భగవంతుని ఆదేశమని సమాద్ చెబుతున్నాడు. అతడి నిత్యకృత్యం లోకానికి ఆయుష్షు పెంచుతోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పేరిట పెరిగిపోతున్న పరిశ్రమల వల్ల వాతావరణం కలుషితమవుతోంది. దీనికి విరుగుడు పచ్చదనమే కదా. అందుకు సమాద్ను ఆదర్శంగా తీసుకుని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తే మానవజాతి మనుగడకు ఢోకా ఉండదు.