డైలీ సీరియల్
యాజ్ఞసేని-47
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://ftp.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/28d_0.jpg?itok=mgTPJHir)
ఏకాంతంలో ద్రౌపదితో కలిసి వున్న వానిని వేరొక సోదరుడు చూస్తే అతడు పండ్రెండు సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. పాండవులందరూ ఈ నిర్ణయం అంగీకరించాలి’’ అని చెప్పాడు.
పాండవులు తమ అంగీకారం తెలిపిన తదుపరి నారదుడు వెళ్లిపోయాడు.
28
అది ధర్మరాజు భవనము.
ధర్మరాజు ఆసనంపై ఆశీనుడై ఏవో రాచకార్యాల గురించి ఆలోచిస్తున్నాడు. ద్రౌపది మెల్లగా దర్మరాజు మందిరంలోనికి వచ్చింది.
‘‘ప్రభూ! అని అన్నది మెల్లగా. ద్రౌపదిని చూచిన ధర్మరాజు ఆమెతో ‘‘ఇటు రమ్ము! ద్రుపదరాజపుత్రీ!’’ అని అన్నాడు ధర్మజుడు. ద్రౌపది చెంతతకు వచ్చి నిలబడింది. చిన్నగా అన్నది.
‘‘ప్రభూ! చిన్న మనవి’’
‘‘నారద మహర్షి వచ్చారు గదా. వారు తమని రాజసూయయాగం చెయ్యమని శెలవిచ్చారని తెలిసింది!’’
‘‘అవును!’’
‘‘రాజసూయయాగాన్ని నిర్వహిస్తే అనేక శుభాలు కలగవచ్చనీ, స్వర్గప్రాప్తి కూడా పొందవచ్చని కదా! అలాగే ఆ యాగాన్ని నిర్వహిస్తే కొన్ని కష్టాలను కూడా అనుభవించవలసి వస్తుందనీ కూడా వింటున్నాము. తమరు ఈ యాగాన్ని జేయతలపెట్టినారా?’’ అని అడిగింది.
‘‘యాజ్ఞసేని! నారదులవారు అనేక విషయాలను వివరించారు. వారు ఆ మధ్య యమసభను సందర్శించారట. అక్కడ మా పితృదేవులైన పాండు మహీపతి మహర్షిని చూచి నమస్కరించి ‘‘మహర్షీ! రాజసూయయాగం చేసిన రాజులందరూ సత్యహరిశ్చంద్రునిలా తమ కోర్కెలు తీర్చుకుంటూ, దేవతల పూజలందుకుంటూ దేవేంద్రుని దగ్గర వుంటారు. మునివర్యా! తమరు మానవ లోకానికి వెళ్లి నేను యమసభలో వున్న విషయాన్నీ, రాజసూయం చేసిన పుణ్యాత్ములంతా ఇంద్రసభలో వున్న విషయాన్ని కీర్తి సంపన్నుడైన నా కుమారుడు ధర్మరాజుకు చెప్పండి. ఆ యాగము చెయ్యటానికి ఉచితరీతిన అతణ్ణి ఆజ్ఞాపించండి. నా కుమారులయిదుగురూ సాటిలేని శక్తి సంపన్నులు. దేవతల వరాలవలన పుట్టిన పుణ్యాత్ములు. పెద్దవాడు ధర్మజుడు తన తమ్ముల భుజబలంతో శత్రువులను జయించి చక్రవర్తియై రాజసూయయాగం చెయ్యగలడు. ఆ విధంగా రాజసూయం చేస్తే నేను ప్రపితామహులతో ఇంద్రలోక సుఖప్రాప్తిని పొందగలను’’ అని అన్నాడు. ఈ విషయాన్ని నీకు తెలియపరుస్తున్నాను. న్యాయమార్గంలో రాజసూయయాగం చేసి మీ పితృదేవతా సమూహాన్ని దేవేంద్ర లోకంలో వుండేటట్లుగా చేయుము’’ అని మహర్షి నన్ను కోరారు. అందువలన రాజసూయాగం చేయవలెననెడి సంకల్పం నాలో కలుగుచున్నది. ఈ విషయం అందరితో సంప్రదించవలసిన అవసరమున్నది’’ అని క్లుప్తంగా చెప్పాడు ద్రౌపదికి.
‘‘ప్రభూ! తమకు తెలియని ధర్మమంటూ లేదు. ఈ యాగం చేయటంవలన కలిగే గొప్పతనాన్ని, పుణ్యకర్మఫలాలను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రాగలరని నా ప్రార్థన. ఈ యాగాన్ని నిర్వహించినందువలన ధార్తరాష్ట్రులు మనపట్ల ఏ విధంగా మెలగగలరో కూడా తమరు పరిగణలోనికి తీసికొనవలసిన ఆవశ్యకత గలదు’’ అని తన అభిప్రాయాన్ని ధర్మరాజుకు చెప్పింది.
‘‘పాంచాల రాజపుత్రీ! నీవు తెలిపిన విషయాలను కూడా అందరితో సంప్రదించిన తరువాత ఒక నిర్ణయానికి రావలసి వుంటుంది’’ అని ధర్మరాజు అన్నాడు.
ద్రౌపది నిష్క్రమించింది. ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు.
***
నారద మహర్షి మాటలను తలంచుకొని రాజసూయయాగాన్ని గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా వుండలేకపోయాడు ధర్మరాజు. బాగా ఆలోచించి యాగంమీద మనసు పెట్టాడు.
పిమ్మట ధర్మరాజు తన మంత్రులనూ, సోదరులనూ పిలిపించుకొన్నాడు. వారికి నారద మహర్షి తెలియపరచిన విషయాన్ని వివరించాడు. రాజసూయయాగం గురించి పదే పదే వారి అభిప్రాయాలను అడిగాడు. అందుకు మంత్రులందరూ కలిసి మహాప్రాజ్ఞుడైన ధర్మరాజుతో-
‘‘రాజా! రాజసూయయాగాన్ని నిర్వహించి అభిషిక్తుడైన రాజు వరుణుని గుణాలను పొందగలడు. కురునందనా! నీవు సామ్రాట్టు గుణాలను పొందటానికి సర్వవిధాలా యోగ్యుడవే. రాజసూయయాగం చేయటానికి ఇదే సమయమని మంత్రులందరూ భావిస్తున్నారు. ఈ యాగాన్ని నిర్వహించినవాడు దర్వీహోమం మొదలుగాగల సమస్త యగాల ఫలాన్ని పొందుతాడు. యజ్ఞవసానంలో అభిషేకాన్ని పొందినవాడు సర్వవిజేతయైన సమ్రాట్టు అని అనబడతాడు.
- ఇంకావుంది