సాహితి

ఆధునిక కవితా క్రీడాభిరామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవంశమ్ (కావ్యకృతి)
కవి: శేషేంద్ర
పుటలు; 272 వెల: రూ.450;
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
**
వ్యాస మహర్షి మహాభారతానికి హరివంశమ్ లాగా, రామాయణానికి ఉత్తరకాండలాగా, గ్రీసులో హోమర్ కావ్యం ఇలియడ్‌కు అడిస్సీలాగా- ఆధునిక మహాభారతానికి అనుబంధ కావ్యం ప్రజానుబంధ కావ్యంగా వచ్చింది ఈ జనవంశమ్. ఇది ఆధునిక జన ఇతిహాస కావ్యానుసరణం. జనవంశ కావ్యకర్త సుప్రసిద్ధకవి గుంటూరు శేషేంద్రశర్మ.
ఇదివరకే అచ్చయి వచ్చిన ఆధునిక మహాభారతం, ఈ జనవంశమ్ తిరిగి అచ్చు వెలుగులు చూడడానికి చలనచిత్ర ప్రముఖులు ఇద్దరు కారకులు. మొదటి దాని ముద్రణ ధర్మకర్త చలనచిత్ర నటుడు పవన్‌కల్యాణ్, రెండవ దానికి నిత్యనూతన ఆలోచనా ప్రయోగశీలి, దర్శకుడు త్రివిక్రమ శ్రీనివాస్ ముద్రణ ధర్మకర్త. సమీక్షా పరిధిలోకి రాకపోయినా వీటిని పేర్కొనడం దేనికంటే వీరిని ఆదర్శంగా చలనచిత్ర ప్రముఖులు తీసుకుంటే సత్కావ్యాలు బయటికి వస్తాయి సత్కార్యాలు చేసినవారూ అవుతారు. జన వంశమ్ జనోపయోగ మహాప్రయోగ కావ్యం. ప్రజలకు అందుబాటులో ఉండే వచన కవిత్వమూ, విద్వాంసులకు లేదా కొద్దిపాటి సాహిత్య అధ్యయనపరులకు అందే పద్య కవిత్వమూ రెండూ అఖండాలై ఒక కవితా మయూరి పురివిప్పి చేసిన రసరమ్య నాట్యం ఈ కావ్యం.
ప్రజల కష్టసుఖాలు, వారి అభ్యుదయ ఆకాంక్షలు, పాలకవర్గ దుష్టచేష్టల విమర్శలు, స్నేహమోహన ‘సమ్’్భషణలు, ఉమర్‌ఖయ్యం వంటి వారల భావపరంపరల వంటివి; ప్రాకృతిక అభివర్ణనలు, సమయ సందర్భ దృశ్యమన రచనలు. ప్రముఖ కవి, పండిత గుణగానాలు, తాను చూసినవి, అనుభూతి చెందినవీ మనకు అందించడాలు ఇటువంటి అంశాలు కేళాకుళులై(్ఫంటీన్స్) దర్శనమిస్తాయి ఈ కావ్యంలో.
ఆధునిక కాలంలో ఛందోబద్ధ పద్య ప్రక్రియారంగంలో విశృంఖల క్రీడాకారులుగా ఉన్న కవులు శ్రీశ్రీ, గుంటూరు శేషేంద్రశర్మలు.
‘తలకాయలు తమతమ జే
బుల లోపల వేసి కొనుచు
పోలింగుకు పో
వలసిన రోజులు వస్తే సెలవింక డెమోక్రసీకి
సిరిసిరిమువ్వా’
అన్నారు శ్రీశ్రీ- ఆయనే ‘మళ్ళీ ఇన్నాళ్ళకు పద్యాలు రాయడం ఎటువంటిదంటే పళ్ళూడిన ముసలిది కుచ్చెళ్ళను సవరించుకోవడం వంటిది అన్నారు చమత్కారంగా. కానీ శ్రీశ్రీ పద్యరచన యువతి కుచ్చెళ్ళను సవరించుకొనే సొగసుగానే వుంటుంది. అది అలావుంచితే శేషేంద్రశర్మ వృత్తరచనల్లోనూ ఉత్తమ క్రీడాకారుడు అని ఈ కావ్య పద్యాల నిర్మాణాల, భావాల పరుగులు చెబుతాయి. ఎనె్నన్ని పోకడలు, శక్తి ప్రాచీనం అభివ్యక్తి ఆధునిక ఇతివృత్తం ప్రజాక్షేమం.
ప్రకాశకీయం, ఋతుకాండ, భ్రమరకాండ, ప్రజాకాండ, చంపూకాండ, యుద్ధకాండ, చమత్కారికకాండ అనే సప్తకాండల సమన్వితం రుూ కావ్యం. ఈ కాండల కవితాఖండికల్లో అద్భుత భావాలు అలవోకగా రాస్తారు.
‘‘పంచాంగాల్లో ఉండవు ఋతువులు/ జీవితాల్లో ఉంటాయి అరణ్యాల్లో ఉంటాయి/ చెట్టుచెట్టునా ఉంటాయి/ రుతువులు చెట్ల సుఖ దుఃఖాలు; ‘శుక్లపక్షం ఊదిన బుడగలా తేలుతున్నాడు చంద్రుడు ఆకాశ నీలిమలో/ వసంత ఋతువంటే చెట్టులోనుంచి/ విరుచుకుపడ్డ విశ్వరూపం కాబోలు’ ‘ఈ రుతువులో సింహాసనం మీద ఉన్న రాజుకంటె/కొమ్మమీద కూర్చున్న కోకిలే మన ప్రభువు-ఇలా మనస్సును హరించే భావాలు పద చిత్రాల సంపదలుగా సొగసులీనుతాయి. ఋతుకాండలో- ఈ ఆకాశం, సముద్రాలు, అందాల చెట్ల ప్రపంచం, విశ్వవైశాల్యం- ఇవన్నీ చూసి శేషేంద్రశర్మగారి ఊహావిహంగం ఎక్కడెక్కడికి ఎగిరిపోయి తన దర్శనాలు కవితా ప్రదర్శనశాలగా రూపొందిస్తుంది. ప్రకృతి సౌందర్యాల్ని చూపుతూ ప్రాకృతికంగా బ్రతకమని అన్యాపదేశంగా ప్రబోధిస్తారు.
‘బరువులు మొయ్యలేని అవయవాలు పూలవి/ చిత్రం సౌందర్యం లోకపు అన్ని వస్తువులకంటె బలవాలి’; / కొమ్మల్లో ఆ చైత్రమాస దేవత పాడే పాట విను/ జన్మలో వంచనాశిల్పం లేని పక్షుల్లా పువ్వుల్లా బ్రతుకు.../ నీకివ్వబడిన ఈ జీవితం/ స్వప్నాల్ని బాణాల్లా సంధించే ఇంద్రధనుస్సు’- ఇలా భావరస వాక్యాలు రసజ్ఞ హృదయ తంత్రుల్ని మీటుతాయి. కొన్ని పద్యాలు నయాగరా జలపాత ప్రవాహవేగాల్లా ఉంటాయి. భ్రమరకాండలో ‘గగనంలో ఎగిరే పక్షికి/ పాప పుణ్యాల చింతే లేదు/ భూమిమీద నడిచే మనిషికి పునర్జన్మ అంటే భయం’అంటూ ‘గాలి మబ్బుల్లో చేసిన చిరు నీలి చెలమలో/ చూడు ఒక నక్షత్రం నగ్నంగా స్నానం చేస్తోంది’ అనే ఒక వాక్యంతో మన గుండెల్ని తడిమేస్తూ అసాధారణ భావుకతతో మనల్ని నిశ్శబ్దంలోకి తోసేస్తారు. నిజానికి కవిత్వాన్ని నిశితంగా తీసుకునేవాడికి ఎంత ఆనందమో అంత చింతనా బాధ కూడా కదా అనిపిస్తుంది. ప్రకృతినో, సౌందర్య సీమల్నో ప్రేమస్థానాల్నో పట్టించుకుని కవిత్వం రాసినంత మాత్రాన- సమాజాన్ని, ప్రజాసమస్యల్నీ దూరంచేసుకోవలసిన అవసరంలేదని, వీటిని పట్టించుకుని తాదాత్మ్యచిత్తంతో రాసినంత మాత్రాన ఏ ప్రేయసి గురించో సౌందర్య సీమల గురించో రాయకుండా వుండనవసరం లేదని-
కవిత్వం మానవ బహుకోశం దర్శన సమగ్ర స్వరూపమని మానవ సహజీవనం లాగే కవిత్వంలో పద్యం, వచన కవిత్వం, కేవల వచనాగేయం అన్నీ సహజీవనం చేయవచ్చనీ ఈ జనవంశమ్ చెప్పక చెబుతుంది. అందుకే శేషేన్ ‘నేను ఈ శతాబ్దపు శిథిలాల్లోంచి లేస్తున్న కవిని’ అన్నారు.
మన ఋషుల వంటి కవి టి.ఎస్.ఇలియట్ జ్ఞానప్రయోగశాల అనుసరణం శేషేంద్రశర్మ కవిత్వంలో అటనట కన్పిస్తుంది. ‘తన కన్నుల్లో నీరు తెచ్చుకునే వాడికంటే/ అన్యులకన్నుల్లో నీరుతెచ్చేవాడే కవి!/ ఒరే ప్రజలారా? నేను కవిని/ మీరు నాకు అప్పగించబడిన పిల్లలు/ మీ ముసలి నమ్మకాలు మీ రక్తంలో/ భయాల్ని పొదుగుతున్నాయి/ మీ రక్తం పారబోసి నా కవిత్వం/ నింపుకోండి’ అనగలిగిన కవి ధీమా శర్మగారిది. ప్రజల పట్ల కవికి వుండవలసింది పితృస్థానం అనడంలో ఎంత ఉదాత్తత! అందులో ఎంత బాధ్యత?
ప్రజాకాండలో ‘మనమంతా భూమిపుత్రులం/ మనకు మాత్రం భూమి లేదు/ అంటారు. ‘‘దేశంలో రాజకీయ వాయుపీడనం చేత/ దేశభక్తితరిగిపోయి దైవభక్తి పెరిగింది/ గుళ్ళమీద భక్తజనులు గుంపులుగుంపులుగా దూకి/ చేసే భజనల దెబ్బకి శివుడో మాధవుడో ఎవడో/వాడి గూబగుయ్యిమని ఏడుపు మొహమేస్తాడు’అంటారు. దాపరికం లేకుండా వుండే భావప్రకటన ఈ కవిది. ఆకాశాన్ని ఎదిరిస్తూలేస్తున్న బిల్డింగుల భయంకర స్వరూపాల ముందు/ నిలుచుండే మనిషి నలుసుగా కన్పడుతున్నాడని సోదర మానవ బాధ వ్యక్తంచేస్తారు.
‘లక్షాతొంభయి కుంభకోణములు నిర్లక్ష్యంబుగా సల్పుచున్
కుక్షిన్ నింపెడు కుంభకర్ణులను భూగోళంబు గోళంబుగా
భక్షింపంగల బ్రహ్మరాక్షసులు శుంభద్గండ భేరుండముల్
పక్షీంద్రుల్ తమ జీర్ణశక్తి కవిగోబాబూ నమస్కారముల్’
అనే ఈ ఒక్క పద్యం చాలు రాజకీయ పాలక దుర్మార్గుల పట్ల గుంటూరు వారికి గల కసికి తారకాణ. రాజకీయ నాయకులు ఎంత తిన్నా హరాయించుకోగలవారట అందుకే కవివారి జీర్ణశక్తికి నమస్కార సమర్పణ చేస్తున్నారు. జన వంశమ్‌లోని అన్ని కాండలూ కవిత్వ అఖండ దీపాలు ప్రజావ్యతిరేకుల పట్ల యుద్ధకాండలే!
ఆంధ్ర మహాభారతంలో నన్నయ్యగారు ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు అంటూ ఓ పద్యం భారతంలో ఇన్ని వున్నాయంటూ చెప్పారు. ఆ విధంగా శేషేంద్రశర్మగారి ఆధునిక ఇతిహాస అనుబంధ కావ్యం ఈ జనవంశమ్‌లో ఎన్నో వున్నాయి.
ఇది ఆధునిక కవితా బృహత్సంహిత. కవిత్వప్రియులకు ప్రజాసంక్షేమ కవిత్వ ప్రియులకు దరిచేరవలసిన కావ్యం. ఒక రకంగా ఇది ఆధునిక కవితా క్రీడాభిరామం.

- సన్నిధానం నరసింహశర్మ, 9292055531