మీకు మీరే డాక్టర్

పూలకూరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వు
నువ్వుల ఛెట్టు పూలు తినదగిన ఆహార ద్రవ్యమే! కూరగా వండుకుని తింటారు. నువ్వులకన్నా సౌమ్యంగా పని చేస్తాయి. వాత వ్యాధుల్లో మంచి చేస్తాయి. పురరుషుల వీర్యంలో బీజ కణాలను పెంపు చేస్తాయి. నేతితో దోరగా వేయించి మెత్తగా గుజ్జు చేసి పాకంపట్టి హల్వా తయారుచేసుకొని రోజూ తినవచ్చు. వాత వ్యాధులకు వేడి చేయకుండా వాతాన్ని తగ్గించటంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. కారప్పొడిగా కూడా ఉపయోగించుకోవచ్చు. దానికదే బుట్టలో తెలియకుండా మూత్రం అయిపోతున్న వారికి నువ్వులు, నువ్వు పువ్వు కలిపి ఏదైనా వంటకంగా చేసి రోజూ పెట్టవచ్చు. అతిమూత్రం, అత్యవసర మూత్రం, ఆగి ఆగి వచ్చే మూత్రం ఇవి తగ్గుతాయి.
పారిజాతం
కీళ్లవాతం తగ్గించటంలో పారిజాతం ఆకులు, బెరడు, పూలు సమానంగానే పని చేస్తాయి. ఈ పూలను కొద్దిగా నెయ్యి వేసి వేయించి మిక్సీలో గుజ్జుగా చేసి పాకం పట్టి తయారుచేసిన హల్వా వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని కూడా తగ్గిస్తుంది. బాగా చలవ చేస్తుంది. యాలకులు వగైరా చేర్చుకుంటే వెగటు వాసన లేకుండా ఉంటుంది.
పైడిపత్తి
పత్తిచెట్టు లేని తెలుగిళ్లు ఉండేవి కాదు పూర్వం. ఇప్పుడంటే పగిలిపోయిన బక్కెట్లలో ముక్కలు పెంచటం హాబీ. ఒకప్పుడు అది ధర్మం. పుణ్యప్రదం అనే నమ్మకం ఉండేది. మొక్కల్ని కన్నబిడ్డలా సాకేవాళ్లు. కూరలు పండించుకోవడమే గానీ కూరగాయల మార్కెట్లో కొనటం ఉండేది కాదు. ఇప్పుడు మారుమూల పల్లెల్లో కూడా రైతు బజార్లు అవసరం అవుతున్నాయి. ఏరకూడదు, తాకకూడదు. ఇష్టం అయితే కొను లేకపోతే పో... అనే వాళ్లు రైతుబజార్లలో కూర్చుని కూరగాయలు అమ్ముతుంటే రైతులు కూడా వచ్చి కూరల ధరలు మండిపోతున్నాయి అనుకుంటూ కొనుక్కు వెడుతున్నారు. తమ పొలం గట్ల మీద ఉచితంగా గలిజేరు, గంగపావిలి లాంటి మొక్కలు పెరుగుతుంటాయి. వాటితో కమ్మని కూరలు వండుకుందాం అని ఎవ్వరూ ఆలోచించట్లేదు.
పైడిపత్తి, ఊరపత్తి ఇంక అన్ని రకాల పత్తి పూలకూ ఒకే ఔషధ గుణాలున్నాయి. పూలను కడిగి శుభ్రం చేసుకుని తరిగి కూరలా వండుకోవచ్చు. తలతిరుగుడు, పైత్య వికారాలు, ఎసిడిటీ, మైగ్రేన్ తలనొప్పి ఇలాంటి బాధల్ని తగ్గించే గుణం వీటికుంది. షుగరు వ్యాధి మీద కూడా ఇవి పని చేస్తాయి. స్ర్తిల సమస్యలు నివారించే వైద్య గుణం ఈ పూలకుంది. తెల్లబట్ట వ్యాధిలోనూ, నెలసరి సమయంలో అతి రక్తస్రావంలోనూ వీటికి ప్రయోగం ఉంది. అమీబియాసిస్ వ్యాధితో బాధపడే వారికి దీన్ని పెరుగుతో తినిపిస్తుంటే త్వరగా వ్యాధి తగ్గుతుంది.
పొద్దుతిరుగుడు పూలు
పొద్దుతిరుగుడు పూలు తెలుగు నేల మీద బాగానే పండుతున్నాయి. అవకాశం దొరికినప్పుడు వాటిని సేకరించి అట్టే పెట్టుకుని ఎండించి పైపైన దంచిన పొడిని ఓ సీసాలో భద్రపరచుకోండి. ప్రతీరోజూ రెండు పూటలా ఓ చెంచా పొడిని నీళ్లలో వేసి టీలాగా కాచి తాగుతూ ఉంటే చర్మవ్యాధులు తగ్గుతాయి. క్షయ వ్యాధిలో ఉత్తమ ఔషధంలా పని చేస్తుంది. దగ్గు తగ్గుతుంది. ముఖ్యంగా పొడి దగ్గు బాగా తగ్గుతుంది. కడుపులో నొప్పి కూడా తగ్గుతుంది.
మామిడి పూలతో ఉగాది పచ్చడి
ఒకప్పుడు మన పూర్వులు ఆనవాయితీగా పాటిస్తూ వచ్చిన ఆరోగ్య సంప్రదాయాలు మన తరం దాకా రాకుండా ఏ కారణం చేత అంతరించిపోయాయో అర్థం కాదు. ఉగాది నాడు లేత మామిడి పిందెలనే (వడ పిందెలు) కాదు, ఉగాది పచ్చడిలో మామిడి పూలను తప్పనిసరిగా కలిపి తినేవారు. మామిడి పూలను ‘చూతకళిక’ లంటారు. ఉగాది నాడు మామిడి పూలను తినటాన్ని ‘చూతకళికాప్రాసన’ అని పిలుస్తారు. ఉగాది పచ్చడి తినటాన్ని ఒక భక్తి భావంతో కాక ఒక ఫ్యాషన్‌గా పాటించటం వలన కొన్ని ముఖ్యమైన విషయాలు మరుగున పడిపోయా యనిపిస్తుంది.
‘ఆమ్రపుష్ప మతీసార కఫపిత్త ప్రమేహనుత్/ అసృగ్దుష్టి హరం, శితం రుచికృద్గ్రాహి వాతలమ్’ అని ఆయుర్వేద సూత్రం. మామిడి పూలు వగరు, తీపి రుచులు కూడా ఉంటాయి. నీళ్ల విరేచనాలు, జిగట విరేచనాలు దీనివలన తగ్గుతాయి. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తాయి. పైత్యాన్ని పోగొడతాయి. మూత్రవ్యాధుల్లో ఔషధంలా పని చేస్తాయి. షుగరు వ్యాధి ఉన్న వారు దీన్ని కారప్పొడిలా చేసుకుని తినవచ్చు. అధికంగా రక్తస్రావం అవుతున్న వ్యాధుల్లో ఈ పూలు రక్తస్రావాన్ని తగ్గించగలుగుతాయి. శరీరంలో వేడిని బాగా తగ్గిస్తాయి. చలవనిస్తాయి. ఎక్కువగా తింటే మలబద్ధతని కలిగిస్తాయి. చిగుళ్లలోంచి రక్తం కారే వ్యాధిని తగ్గించటం, గొంతుని శుద్ధి చేసి గాత్రం బాగా వచ్చేలా చేసే గుణాలు వీటికున్నాయి. ఈ పూలను, కొద్దిగా ఉప్పునీ నీళ్లలో వేసి కషాయం కాచి ఆ నీళ్లతో పుక్కిలిస్తే పంటిపోటు, చిగుళ్ల వాపు, నోటి పూత తగ్గుతాయి.
(ఇంకా ఉంది)

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com