మెయిన్ ఫీచర్

కొత్త వత్సరానికి సుస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాది పండుగ, ఉగాది పండుగ అనే దేశ్యనామాలతో వ్యవహరింపబడే సంవత్సరాది పర్వము, ఏటా రానున్న ఎన్నతగిన ఏభై పైచిలుకు పండుగలలో మొదటిది. తెలుగువారు తమ సంవత్సరాదిని చాంద్రమాన గణనాధారంగా చైత్ర శుక్ల ప్రతిపదతో ప్రారంభించడం సనాతన ఆచారం. చైత్ర శుక్ల పాడ్యమి సంవత్సరాది అని బ్రహ్మపురాణం కంఠోక్తిగా చెపుతున్నది. ఈ ఉగాది రోజునే సృష్టి ప్రారంభింపబడి, ఆయా దేవతలకు సంబంధిత పనులను బ్రహ్మ అప్పగించినట్లు పురాణ కథనం. శాలివాహన శకానికి మొదటి దినం చైత్ర శుక్లపక్ష పాడ్యమిగా భావించబడుతున్నది. వసంత కాలారంభ దినాలలో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది పర్వం జరిపే ఆచారం ఆర్యుల్లో అతి ప్రాచీన కాలం నుండి ఉన్నది. పార్సీలు ఉగాదిని నౌరోజ్ అంటారు. నౌరోజ్ అనగా కొత్తదినం. ఉగాది పర్వాచరణ విధానాలను నూతన సంవత్సర కీర్తనాద్యారంభం, ప్రతి గృహ ధ్వజారోహణం, నింబ వ్రతాశనం, సంవత్సరాది శ్రవణం, నవరాతి ఆరంభమని ధర్మసింధువు స్పష్టం చేస్తున్నది. ప్రతిగృహ ధ్వజారోహణం, అబ్దాది తైలాభ్యంగం, నవవస్త్భ్రారణ ధారణం, ఛత్రచామరాది స్వీకారం, ఉమామహేశ్వర పూజ, దమనేన బ్రహ్మపూజనం, సర్వాపచ్ఛాంతికర మహాశాంతి, నింబ కుసుమ భక్షణం, పంచాంగపూజ, శ్రవణం, ప్రపాదాన ప్రారంభం, రాజదర్శనం, వాసంత నవరాత్రి ప్రారంభం...పది విధాయక కృత్యాలుగా చెప్పబడినాయి.
వసంత నవరాత్రుల ప్రారంభం
చైత్ర వైశాఖమాసాలు వసంతరుతువుకాగా, చైత్రమాస తొలిరోజు ఉగాదితో వసంతరుతు ఆరంభం కాగలదు. చైత్రానికి మధుమాసమని, వసంతమాసమని పేరు. ‘‘మధుశ్చ మాధవశ్చ వాసంతి కావృత్’’ అనే యజుర్వేద వాక్యాన్ని బట్టి వేదకాలంలో చైత్రానికి మధుమాసమని పేరున్నట్లు తెలుస్తున్నది.
రుతురాజైన వసంతునికి స్వాగతోపచారాలు చేయడానికి తొమ్మిది రోజులను నిర్దేశించారు. ఉగాదినాడు కలశ స్థాపన చేసి, నవరాత్ర పూజ చేస్తే అపమృత్యు భయముండదని ధర్మసింధు వివరిస్తున్నది. వాత్సాయన కామ సూత్రాలలో ఈఉత్సవం సువసంతకమని, మదనోత్సవమని పేర్కొనబడింది. రుతురాజైన వసంతుని పూజిస్తే కాలాత్మకుడైన పరమ శివుడు ప్రసన్నుడు కాగలడని భావన. వసంతోత్సవాలు ఆంధ్రభూమిపై గొప్పగా జరిగేవి. ఉత్సవ సందర్భంగా రాజ దర్బారుల్లో ప్రతిదినం నృత్యాలు, నాట్యాలు పాట కచ్చేరీలు, పండిత గోష్ఠులు, శాస్త్ర విచారణలు, నాటక ప్రదర్శనలు జరిగేవి. సంగీతం ప్రధానంగా ఉండేది.
ఆకాలాన ఉపయుక్తమైన వసంత రాగమును మేళకర్తలు ప్రత్యేకంగా కూర్చారు. రెడ్డిరాజుల, విజయనగర రాజుల కాలంలో ఉద్యానవనాల్లో మామిడి చెట్టుకింద మంటపం, దానిపై కలశం నెలకొల్పి పూజాపీఠంపై వసంతుని, రతీ మన్మధులను, లక్ష్మీ నారాయణులను, గౌరీ శంకరులను, శచీ పురంధరులను నెలకొల్పి, మంగళవాద్యాల, వారాంగనల నృత్యాలు, పన్నీరు, వసంతం చల్లుకోవడం, విద్యావినోదాలు, క్రీడా ప్రదర్శనలు జరిగేవి. ప్రభువు హయారూఢుడై ఊరేగి వచ్చి, ఉద్యానవనంలో మంటపం వద్ద దేవతలను పూజించేవాడు. మంగళ వాద్యాలు, వారాంగనల నృత్యాలు, పన్నీరు, వసంతం చల్లుకోవడాలు, విద్యా వినోదాలు, వినోద క్రీడలు జరిగేవి.
ఉగాది పచ్చడి
‘‘యద్వర్షాదా నింబసుమం, శర్కరామ్ల ఘృతైర్యుతమ్, భక్షితం పూర్వయామేస్యా, త్తద్వర్షం సౌఖ్యదాయకమ్’’. అని పెద్దల ఉవాచ. ఉగాదినాడు ఆ ఏటి వేపపువ్వు, చక్కెర (లేదా కొత్తబెల్లం), చింతపండు, నెయ్యి కలిపి చేసే పచ్చడిని మొదటి జామునందే తింటే ఆ వత్సరమంతా సుఖంగా జరుగుతుందని విశ్వాసం. వేపపువ్వు ప్రధాన ద్రవ్యంగా చేసే పచ్చడి గొప్ప ఔషధంగా భావించ బడుతుంది.
ఏరువాక ప్రారంభం
ఉగాదినాడు కొన్ని ప్రాంతాలలో ఏరువాక సాగడం ఆచారం. ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధపరిచిన నాగలిని ఏరువాక అంటారు. రైతులు ఉగాదినాడు తలంటి పోసుకుని, బొట్టు పెట్టుకుని, కొత్తబట్టలు వేసుకుని, నాగలికి పాతతాళ్ళు తీసి, పసుపురాచిన కొత్తవి కట్టి, నాగలికి, కాడికి రావి మండలు కట్టి, ఎడ్లకు పసుపురాసి, కుంకుమ పెట్టి పూజించి, కొబ్బరికాయ కొట్టడం సాంప్రదాయాచరణ.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494