ఈ వారం స్పెషల్

‘ముక్తి’ మార్గంలో సాహసయాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్ర ఆధ్యాత్మిక శిఖరాలుగా హిమాలయ పర్వతాల్లో వెలిసిన ‘చార్‌ధామ్’ను చేరుకోవడం
ఆధ్యాత్మిక సాహసంగానే చెప్పవచ్చు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా భక్తజనులు
భక్తిశ్రద్ధలతో ఈ దైవికధామ్‌లను దర్శించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రయాణం సాగిస్తారు.

ఈ సువిశాల విశ్వంలో కోట్ల కొద్దీ నక్షత్రాలున్నా.. నిరంతరం భగవద్ధ్యానంలో నిమగ్నులై ఉండే ఏడుగురు రుషులు కొలువైన ‘సప్తర్షి మండలాని’దే ప్రత్యేకస్థానం..
ఎన్ని గ్రహాలున్నా.. నవగ్రహాలదే ప్రముఖ స్థానం..
అలాగే.. భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలున్నా.. ‘చార్‌ధామ్’నే ప్రత్యేక ఆధ్యాత్మిక పుణ్యభూమిగా కొనియాడుతారు..
సమస్త పాపాలను హరించి, మోక్షానికి మార్గం చూపించే ‘చార్‌ధామ్ యాత్ర’లో విశేషాలు అనేకం.. నిజానికి అదో సాహసాల సమాహారం!
ముక్తిని, మోక్షాన్ని కలిగించే తీర్థాల్లో చార్‌ధామ్‌కే అగ్రతాంబూలం దక్కుతుంది. మన దేశంలోని ఉత్తరాఖండ్‌లో హిమాలయ స్థాణువుల్లో అత్యంత శీతల ప్రాంతంలో.. సముద్ర మట్టానికి 10వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను సర్వపాపాలను హరించే చార్‌ధామ్‌గా మన ఇతిహాసంలో చెప్పారు. ‘సనాతన ధర్మానికి, హైందవ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా, నాలుగు వేదాల పవిత్రతను మించి స్వర్గప్రాప్తిని కలిగించే పవిత్ర తీర్థాలే చార్‌ధామ్’ అని త్రిమూర్తులే చెప్పారని మన ఆధ్యాత్మిక చరిత్ర చెబుతోంది. చార్‌ధామ్‌కు వెళ్ళేందుకు గంగాద్వార్, స్వర్గద్వార్, మాయాపురిగా జన బాహుళ్యంలో పేరున్న ప్రసిద్ధమైన హరిద్వార్, రిషికేష్‌ల మీదుగా అత్యంత క్లిష్టమైన మార్గాల్లో ప్రయాసపడి వెళ్లాలి. చార్‌ధామ్‌కున్న విశేష ప్రాశస్త్యం గంగానది ద్వారంగా చెప్పబడే హరిద్వార్, రిషికేష్ క్షేత్రాలకు వర్తిస్తుందన్నది స్థల పురాణం. పవిత్ర ఆధ్యాత్మిక శిఖరాలుగా హిమాలయ పర్వతాల్లో వెలిసిన ‘చార్‌ధామ్’ను చేరుకోవడం ఆధ్యాత్మిక సాహసంగానే చెప్పవచ్చు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా భక్తజనులు భక్తిశ్రద్ధలతో ఈ దైవికధామ్‌లను దర్శించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రయాణం సాగిస్తారు. ఈ నాలుగు ముక్త్ధిమ్‌లను చేరుకునేందుకు భక్తులు బస్సుల్లో, వ్యానుల్లో, జీపుల్లో, వివిధ రకాల వాహనాల్లో.. ఆ తరువాత కాలినడకన వెళ్లాల్సి వస్తుంది.
యమునోత్రి, కేదార్‌నాథ్ క్షేత్రాలను చేరుకునేందుకు మాత్రం నడవక తప్పదు. ఇప్పుడు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సౌకర్యాన్ని కల్పించారు. ఆర్థిక స్థోమత కలిగిన భక్తులు సీతాపూర్ నుండి రూ.8,000- 10,000 వరకు చెల్లించి 16 కిలోమీటర్ల దూరంలో హిమగిరి శిఖరాల నడుమ అతి శీతల ప్రాంతంలో, శీతల గాలుల వింజామరల మధ్య ఉన్న కేదార్‌నాథ్‌కు చేరుకుంటారు. యమునోత్రికి మాత్రం జానకిచెట్టి నుండి 6 కిలోమీటర్లు అతి ఎత్తయిన, లోయలతో కూడిన హిమాలయ కొండల్లో కాలినడకన ప్రయాణించి చేరుకోవాల్సి ఉంటుంది. నడవలేనివారికి గుర్రాలు, డోలీలలో స్థానిక కూలీలు తీసుకెళ్ళే ఏర్పాట్లు ఉన్నాయి.
గంగోత్రి, బద్రీనాథ్ క్షేత్రాలకు అత్యంత ప్రమాదకరమైన ఘాట్ మార్గంలో, వాహనంలో నేరుగా ప్రయాణించి చేరుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక సాహస యాత్ర ఎంతో వ్యయ ప్రయాసలు, ప్రమాదాలతో కూడుకున్నదని చెప్పవచ్చు. ఒక ముక్త్ధిమం నుండి మరొక ముక్త్ధిమానికి చేరుకునేందుకు నేరుగా మార్గం లేనందున వెళ్ళిన మార్గంలోనే తిరిగి కొంత దూరం వెనక్కు వచ్చి, ఇంకో మార్గంలో మరో ముక్త్ధిమం చేరుకోవాల్సి ఉంటుంది. ఇందుకు 24 గంటల మొదలు 48 గంటల వరకు సమయం పడుతుంది. ఈ ముక్త్ధిమాలను చేరుకునేందుకు హిమాలయ శిఖరాల్లో అత్యంత ఎత్తయిన ఘాట్ మార్గంలోనే ప్రయాణించాల్సి ఉండడం, రోడ్డు మార్గం కూడా అత్యంత భయానకంగా ఉండడం, అనేక చోట్ల మట్టిరోడ్లే ఉండడం, అవి కూడా దెబ్బతిని ప్రమాదకరంగా, ఇరుగ్గా ఉండడం వల్ల చిన్న బస్సుల్లో, చిన్న వాహనాల్లో మాత్రమే ప్రయాణం చేయక తప్పదు. ఎదురెదురుగా వాహనాలు వస్తే రాకపోకలు సాగేందుకు అయిదు నుండి పది నిమిషాల సమయం పడుతుందంటే ఈ ఘాట్‌రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఈ మార్గాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నందునే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తుంది. ఎంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ప్రయాణం సాగుతున్న కొద్దీ ప్రకృతి రమణీయ దృశ్యాలతో భక్తులు ఆనందపరవశులవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. గంటకు 25 నుండి 30 కిలోమీటర్లు మించి ప్రయాణం సాగని ఈ అత్యంత పొడవైన ఘాట్ రోడ్లలో ఆరేడు రోజులు ప్రయాణం చేస్తే కానీ నాలుగు పుణ్యక్షేత్రాలను చేరుకోలేము. ప్రయాణంలో వాహన చోదకులు ఏమాత్రం ఏమరుపాటుకు గురైనా వందలు, వేల అడుగుల లోతున్న లోయల్లోకి వాహనాలు పడిపోవడం తథ్యం. అందువల్లే చార్‌ధామ్ యాత్రలో భక్తులు ఎంత స్థాయిలో ఆధ్యాత్మిక పరవశానికి గురవుతారో అంతే స్థాయిలో మనసులో భయాందోళనలున్నా ప్రమాదాన్ని లెక్కచేయకుండా భగవంతునిపై భారం వేసి ముందుకెళతారు.
ప్రకృతి భగవంతుని స్వరూపమంటారు. చార్‌ధామ్ యాత్రలో భక్తులను అడుగడుగునా ఆకట్టుకునేవి ప్రకృతి రమణీయ సుందర దృశ్యాలే. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అడ్డంకులను ఆధిగమిస్తూ యాత్రికులు ముందుకు సాగుతారు. హిమగిరి శిఖరాల్లో ప్రతి శిఖరానికి ఓ విశిష్టత ఉంది. హిమాలయ స్థాణువుల్లో సూర్యోదయం, అస్తమయం కూడా సాధారణం కంటే భిన్నంగా ఉండడం విశేషం. ఉదయం నాలుగున్నర గంటలలోపే సూర్యోదయ కాంతులు, రాత్రి ఏడున్నర గంటల వరకూ సూర్యాస్తమయం ఉండడం విశేషం. అంతకు మించి చల్లని గాలులకు తోడు అడుగడుగునా ప్రయాణంలో గంగ, యమున, అలకనంద, మందాకిని నదుల గలగల శబ్దాలతో ప్రవాహాలు, పక్కనే ఘాట్‌రోడ్లు ఉండడం మనసును ఆహ్లదపరుస్తుంది. చార్‌ధామ్ యాత్రకు వెళ్లేవారు రిషీకేష్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల నిబంధన విధించింది. ఐడెంటిటీ కార్డు చూపిస్తే చాలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. కాగా, హిమాలయ శిఖరాల్లో నీటి సమస్య లేకపోయినా భూమి కొరత స్పష్టంగా కనిపిస్తుంది. భూమి కొరత కారణంగా హిమగిరి శిఖరాలతో కూడిన ఉత్తరాఖండ్ ప్రజలు అనువుగా ఉన్న ప్రతి కొండపై భూమిని చదును చేసి వ్యవసాయంతో పాటు నివాస స్థలాలను సమకూర్చుకోవడం ఆశ్చర్యచకితులను చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘పరీక్షా సమయం’.. యమునోత్రి ప్రయాణం
సముద్ర మట్టానికి సుమారు 10,500 అడుగుల ఎత్తులో ఉన్న యమునోత్రికి చేరుకోవడం భక్తులకు నిజంగా అగ్నిపరీక్షే. హరిద్వార్ నుండి 240 కిలోమీటర్లు హిమాలయ శిఖరాల్లో ఘాట్‌రోడ్డులో ప్రయాణించిన తరువాత జానకీచెట్టీ అనే గ్రామానికి ప్రయాణం ఇరుకు రోడ్లపై సాగుతుంది. అక్కడి నుండి యమునోత్రికి 6 కిలోమీటర్లు కాలినడకన కొండలపై ప్రయాణించడం గగుర్పాటు కలిగిస్తుంది. ఘాట్‌రోడ్డుపై సుమారు 6 కిలోమీటర్లు కాలినడకన కొండలు ఎక్కడం భక్తులకు ఇబ్బందే. అయినా యమునానది పుట్టిన యమునోత్రికి చేరుకునేందుకు ఎన్నో కష్టనష్టాలకోర్చి 3 నుండి 4 గంటలు పైగా కాలినడక వెళ్లాల్సిందే. కొండల దిగువన 500 అడుగుల నుండి 1000 అడుగుల పైబడి లోయల్లో యమునా నది ప్రవహిస్తుంటుటే కొండ చివరన భక్తులు నడిచి యమునోత్రికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు ఘాట్‌రోడ్డులో కాలినడక, మరోవైపు అతి శీతల గాలులు, రక్తం గడ్డకట్టే చలి.. భక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేతులకు, కాళ్లకు, తలకు శీతల గాలుల నుంచి రక్షణ కల్పించుకుంటూ విభిన్న వయస్కులైన భక్తులు ‘యమునమ్మకు జేజేలు’ అని చేసే నినాదాలు హిమాలయ శిఖరాల్లో మార్మోగుతాయి. ఎత్తయిన ప్రాంతంలో ఉన్న యమునోత్రికి చేరుకునేటప్పటికీ చల్లని గాలులు శరీరాన్ని అతి శీతలంగా మార్చివేయడం, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమయ్యేలా అనిపిస్తుంది. కాలినడకలో ఒక్కోసారి భక్తులు కాలు తీసి కాలు వేయలేని పరిస్థితికి చేరుకుంటారు. నడవలేని యాత్రీకులను గుర్రాలపై, డోలీల్లో స్థానికులు తీసుకెళుతుంటారు. నలుగురున్న డోలీకి సుమారు రూ.2500 నుండి రూ.3500 వరకు, ఒకరే ఉన్న డోలీకి రూ.1500 నుండి రూ.2500 వరకు, గుర్రానికైతే రూ.1000 నుండి రూ.2000 వరకు స్థానిక కూలీలు వసూలు చేస్తారు.
ప్రయాణంలో అలిసిపోయిన భక్తులకు యమునోత్రి దర్శనంతో ఒక్కసారిగా సాంత్వన కలుగుతుంది. ఒకవైపు శీతలధారగా ప్రవహించే యమునకు మరోవైపు ఉష్ణజల ప్రవాహం ఉంది. యమునానదిలో మునిగితే కోటిజన్మల పాపాలు తొలగిపోతాయంటారు. యముని సోదరిగా, సూర్యభగవానుని కూతురిగా, శ్రీకృష్ణ్భగవానుని అష్ట్భార్యలలో కాళిందిగా యమున ప్రసిద్ధి చెందింది. సుదీర్ఘ హిమాలయ శిఖర ప్రాంగణంలో 3వ శిఖరం నుండి జాలువారే యమునానది పుట్టుక అంచనాకు దొరకదంటారు. యమునోత్రి వద్ద తప్తకుండ సరోవర్‌లో నిత్యం ఊరే ‘ఉష్ణకుండ్’లో స్నానాలు చేసి భక్తులు సేద తీరుతారు. ఈ వేడినీటిలో బియ్యం, రొట్టెలు, బంగళాదుంపలను భక్తులు ఉడికించి వంటలు చేసుకుంటారు. ఉష్ణకుండ్‌లో నీళ్లు అన్ని కాలాల్లోనూ ఆవిర్లు చిమ్ముతుంటాయి. యమునోత్రి ఆలయంతో పాటు, సీతారామ ఆంజనేయస్వాముల మందిరంలో భక్తులు పూజలు చేస్తారు. యాత్రికుల దర్శనార్థం అక్షయ తృతీయ మొదలు దీపావళి వరకు యమునోత్రి ఆలయాన్ని తెరచి ఉంచుతారు. కాలినడక దారిలో భైరవ మందిరం కూడా భక్తులను ఆకట్టుకుంటుంది.
సర్వోత్తమ తీర్థం గంగోత్రి
సాటిలేని సర్వోత్తమ తీర్థంగా గంగోత్రి హైందవ సంస్కృతిలో పేరుగాంచింది. నిర్మలమైన గంగానది వల్ల మోక్షం సంప్రాప్తమవుతుందన్నది పెద్దల మాట. యమునోత్రి నుండి సుమారు 228 కిలోమీటర్ల దూరంలో గంగోత్రి దివ్యస్థలం దర్శనమిస్తుంది. గంగోత్రికి వెళ్ళే మార్గంలో ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ భక్తులు పరవశులవుతారు. ఎన్మో కొండలు మలుపులు తిరుగుతూ దరాసుపాడు ప్రదేశం చేరుకున్న తరువాత పావన గంగోత్రి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భయంకరమైన లోయలు, గంగానదీ ప్రవాహం, పచ్చటి వృక్షాలతో కూడిన పర్వత శ్రేణులు, ఆకాశ మార్గాన పరిగెత్తే మేఘాలు, చుట్టూ హరిత వనాలతో గంగోత్రి మార్గం అలలారుతుంది. ఇక్కడి గాలి, జలం స్వచ్ఛతకు ప్రతీకలు. కపిలముని క్రోధం వల్ల దగ్ధమైన తన పితరులకు పుణ్యలోకాలు కల్పించేందుకు భగీరథ మహారాజు జలం కోసం కఠిన తపస్సు ఆచరించగా ఉద్భవించినదే గంగానది. సముద్ర మట్టం నుండి సుమారు 10,300 అడుగుల ఎత్తులో ఉన్న గంగోత్రికి ప్రయాణం హిమాలయ శిఖరాల అంచుల మీదుగానే ఘాట్‌రోడ్డులో సాగుతుంది. ఉత్తర కాశీ నుండి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రి మార్గం ప్రమాదాలకు నిలయమనే చెప్పవచ్చు. ఏ మాత్రం భారీ వర్షం పడినా ఈ మార్గంలో రాకపోకలు స్తంభించిపోతాయి. ఉత్తరకాశీ నుండి సాగే ఘాట్‌రోడ్డులో వేల అడుగుల లోతున ఎన్నో లోయలు ఉంటాయి. కొన్ని చోట్ల మలుపులు మరీ ప్రమాదకరంగా కొండల అంచులను తాకుతూ కనిపిస్తాయి. ఈ మార్గం ప్రస్తుతం దెబ్బతిని ఉండడంతో గంగోత్రికి వెళ్లే భక్తులు ప్రాణాలపై ఆశలు వదలుకొని ప్రయాణించాల్సిందే. అత్యంత ప్రమాదకరమైన గంగోత్రి ఘాట్ రోడ్డు ప్రకృతి రమణీయతను ఆస్వాదించకుండా చేస్తుందనడంలో సందేహం లేదు. సుమారు 10కిలోమీటర్ల పొడవున రహదారి మరీ దెబ్బతిని ప్రయాణానికి ప్రతిబంధకంగా ఉంటుంది. ఈ మార్గంలో గంగానీ అనే గ్రామం వద్ద గరంకుండలో కొండల నుండి వచ్చే వేడినీరు భక్తులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆ వేడినీటిలో భక్తులు స్నానమాచరిస్తారు. గంగోత్రికి చేరుకున్నాక- అక్కడ పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గంగానదిని చూసిన భక్తులు కష్టాలన్నీ మరచిపోయి భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. గంగానదిలో స్నానమాచరించాక- గంగోత్రి మందిరంలో కళ్యాణకారి, పవిత్ర పావని, అమృత స్వరూపిణి అయిన గంగామాతను దర్శించుకోవడంతో తమకు ఉత్తమ గతులు లభిస్తాయని, ఇది తమ పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. సకల శుభాలు కలిగించే గంగానది నీటిని తమకు తోచినంత సీసాల్లో తీసుకొని భక్తులు భద్రపరచుకుంటారు. ఏటా వేసవిలో ఆరు నెలలు మాత్రమే గంగోత్రి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. మిగతా ఆరు నెలలు ఆలయాన్ని మూసివేస్తారు.
కేదారేశ్వర దర్శనం..
సముద్ర మట్టానికి సుమారు 11,750 అడుగుల ఎత్తున హిమగిరి శిఖరాల్లో హరిద్వార్ నుండి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో జ్యోతిర్లింగ స్వరూపమైన కేదారేశ్వరున్ని దర్శించుకోవడం భక్తులకు అనిర్వచనీయ ఆధ్యాత్మికానుభూతిని మిగులుస్తుంది. స్వర్గప్రాప్తిని, మోక్షాన్ని కలుగజేసే దివ్యపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిచెందిన కేదార్‌నాథ్ తీర్థం అన్ని తీర్థాల్లోకెల్లా ఉత్తమమైనది. కేదార్‌నాథ్‌కు చేరుకోవడం అంత సులభం కాదు. శ్రీ మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ క్షేత్రం ఒకటి. గతంలో వరదల వల్ల దెబ్బతిన్న కేదార్‌నాథ్ క్షేత్రం ఈ మధ్యనే పూర్వ వైభవం సంతరించుకొంటోంది. కేదారేశ్వరస్వామి ఆలయం వెనుకభాగాన వరద తాకిడికి కొట్టుకొచ్చిన రాళ్లగుట్టలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఆలయం వెనుకభాగాన 30 అడుగుల దూరంలో ఉన్న ఓ పెద్ద బండరాయి వల్లనే వరద ధాటికి ఆలయం చెక్కుచెదరకుండా నిలబడిందని భక్తుల నమ్మకం. ప్రస్తుతం ఈ రాయిని భక్తులు భీమ్‌శిలగా, రక్షశిలగా పిలుచుకుంటున్నారు. గుప్త కాశీ సమీపం నుండి 16 కిలోమీటర్లు కొండలపై చల్లని శీతల గాలులు, మంచుతెరల మధ్య కాలినడకన ప్రయాణిస్తే కానీ కేదారినాథ్‌కు చేరుకోలేము. అత్యంత క్లిష్టమైన ఈ మార్గంలో భక్తులు కేదారేశ్వరుణ్ణి స్మరించుకుంటూ కాలినడకన కష్టాలను మరచి గమ్యస్థానం చేరుకొంటారు. కేదారేశ్వరంలో 3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నేపథ్యంలో మంచుగాలుల మధ్యన ఊపిరి తీసుకోవడం కూడా కష్టం. స్వామిని భక్తితో ఆరాధించి, నెయ్యితో అభిషేకాలు చేసి తమ జీవితం ధన్యమైందని భక్తులు భావిస్తారు. ఆలయానికి చేరుకున్నాక కష్టాలన్నీ మరచిపోయి

శివనామస్మరణతో భక్తులు పారవశ్యానికి గురవ్వడం తథ్యం. ఇక్కడి చారిత్రాత్మక, ఆధ్యాత్మిక విశేషాలు ఈ క్షేత్రాన్ని పుణ్యధామంగా నిలిపాయి. కొనే్నళ్ల క్రితం వరద తాకిడికి ఆలయ పరిసరాలు కొంత దెబ్బతిన్నాయి. ఈ క్షేత్రం నుండి మొదలయ్యే మందాకిని నదికి ప్రత్యేక స్థానముంది. ఇక్కడ ఉన్న అనేక కుండాలు, తీర్థాలకు ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. వీటిలో స్నానమాచరించడంతో ముక్తి లభిస్తుందని, మహాశివుడే పార్వతీమాతకు ఈ క్షేత్రం ప్రాముఖ్యతను వివరించాడని భక్తులు చెబుతుంటారు. ఇక్కడ పార్వతీదేవి, వీరభద్రస్వామి, లక్ష్మీనారాయణులను, నందీశ్వరులను కూడా భక్తజనులు దర్శించుకొని పూజలు చేస్తారు. కేదారేశ్వర క్షేత్రానికి చేరుకునేందుకు హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది. గుప్తకాశీ నుండి హెలీకాప్టర్ ద్వారా కేదారేశ్వర క్షేత్రానికి కేవలం 8 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు.
నారద క్షేత్రం.. బద్రీనాథ్
వైకుంఠప్రాప్తిని కలిగించే నారద క్షేత్రంగా బద్రీనాథ్ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. సముద్ర మట్టానికి సుమారు 10,350 అడుగుల ఎత్తులో హిమగిరి శిఖరాల నడుమ జోష్‌మట్‌కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్రీనాథ్ క్షేత్రం ముక్తికి మార్గాన్ని చూపుతుందని భక్తుల విశ్వాసం. ద్వాపరయుగంలో బ్రహ్మాది దేవతలు నారద క్షేత్రం నుండి విగ్రహం తీసుకొచ్చి బద్రీనాథ్‌లో ప్రతిష్టించినట్టు స్థల పురాణం. విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించగా, నారదుడు ప్రధాన అర్చక బాధ్యతలు నిర్వర్తించేవాడన్నది ఇతిహాసం. అందువల్లే నారదక్షేత్రంగా గుర్తింపుపొందింది. కాలక్రమంలో బదరీనాథుని విగ్రహం దెబ్బతిన్నప్పుడు శంకరాచార్యులు తిరిగి నారద క్షేత్రం నుండి విగ్రహం తీసుకొచ్చి వచ్చి పునఃప్రతిష్టించినట్టు చరిత్రకారులు చెబుతారు. స్కంద పురాణంలో బదరీ క్షేత్రానికి నాలుగు పేర్లున్నాయి. కృతయుగంలో ముక్తిప్రద, త్రేతాయుగంలో యోగసిద్ధి, ద్వాపర యుగంలో విశాల, కలియుగంలో బదరీ ఆశ్రమంగా పేర్కొంటారు. బదరీ అనగా రేగుచెట్టు అని అర్థం. రేగుచెట్టు లక్ష్మీదేవికి నివాస స్థలం కావడం వల్ల భగవంతునికి ఈ చెట్టు చాలా ప్రియమైనదంటారు. బద్రీనాథ్ ఆలయంలో 12 నెలలు గడచినా ఆరిపోకుండా వెలిగే అఖండజ్యోతి ఉంది. ఈ అఖండజ్యోతిని వెలిగించాక ద్వారాలన్నీ మూసివేస్తారు. 6 నెలల తర్వాత ద్వారాలు తెరిచినప్పుడు అఖండజ్యోతి వెలుగుతూ కనబడడం భగవంతుని మహిమగా భక్తులు చెబుతారు. ఆలయాన్ని మూసివేసినప్పుడు నారదమహర్షి బదరీనాథుడిని ఆరాధిస్తారంటారు. కాగా, ఇప్పుడున్న ఆలయం పురాతనమైనది కాదని కొంతమంది చరిత్రకారుల వాదన. పురాతన మందిరం శిథిలమై ఉండవచ్చని కొందరి అభిప్రాయం. 15వ శతాబ్దంలో వరదరాజాచార్యులు ఇప్పటి దేవాలయాన్ని కట్టించినట్టు చారిత్రక కథనం. బద్రీనాథ్ మందిరంలో ప్రధాన ద్వారం దాటిన తరువాత వెండి సింహాసనంపై ధ్యానతత్పరుడైన బదరీనాథుడి విగ్రహం సుమారు అడుగు మొదలు అడుగున్నర ఎత్తున ఉంటుంది. కుబేరుడు, గరుత్మంతుడు, నరనారాయణులు, శ్రీదేవి, భూదేవి, వీణాసహిత నారదమహర్షి తదితర విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయం వెలుపల ఆంజనేయస్వామి, శ్రీ మహాలక్ష్మీదేవి, మహాశివుడు, కామధేను ఆలయం ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని చేరుకొనేందుకు నేరుగా రోడ్డు మార్గం ఉంది. అయితే అత్యంత ప్రమాదకరమైన ఘాట్‌రోడ్డులో కొండల మధ్య నుండి జోష్‌మట్ నుండి సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. మార్గమధ్యంలో మంచుకొండలు సైతం దర్శనమిస్తాయి. కొండల్లో ప్రమాదకరమైన మలుపుల మధ్య చాలాచోట్ల మటిరోడ్లపై ప్రయాణిస్తే కాని గమ్యానికి చేరుకోలేము. బద్రీనాథ్ క్షేత్రం వద్ద వసతి సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. శీతల గాలులు, చలి కారణంగా భక్తులు తప్పక ఉన్ని దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఈ క్షేత్రంలో అలకనంద నది ప్రవహిస్తూ ఉంటుంది. బద్రీనాథ్ ఆలయ సమీపాన తప్తకుండలో వచ్చే వేడినీటిలో భక్తులు స్నానమాచరిస్తారు.
చారిత్రక విశేషాల సమాహారం..
బద్రీనాథ్ క్షేత్రం చారిత్రక విశేషాల సమాహారంగా భాసిల్లుతోంది. ఇక్కడికి సమీపాన కొండగుహలో- వ్యాసుడు చెబుతుండగా వినాయకుడు మహాభారతాన్ని రాశాడని ప్రతీతి. ఇక్కడి గుహలో వ్యాసుని విగ్రహ ప్రతిష్ఠ ఇందుకు తార్కాణమని చెబుతారు. వినాయకుడి గుహలో ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. ఈ గుహలకు సమీపంలో సరస్వతీ నది పుట్టుక కనిపిస్తుంది. ఈ నది కొంత దూరం వరకే కనిపిస్తుంది. ఆ తరువాత ఆ నది అంతర్వాహిని అవుతుందంటారు. ఇక్కడే సరస్వతీదేవి మందిరం ఉంది. ఈ మందిరాన్ని చేరుకునేందుకు భీమసేనుడు వంతెనగా ఓ బండశిలను ఏర్పాటు చేశాడని, ఇప్పుడది భీమశిలగా ప్రసిద్ధి చెందింది. బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఓ పెద్ద బండరాయిపై ముక్కంటి రూపం దర్శనమిస్తుంది. బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళే గోవింద్‌ఘాట్ సమీపంలో భీమసేనుడు నిర్మించినట్టుగా చెప్పబడుతున్న హనుమంతుని ఆలయం ఉంది. మనదేశపు చివరి గ్రామమైన మానా ప్రాంతం చైనా సరిహద్దులో బద్రీనాథ్ క్షేత్రానికి అతి సమీపంలో ఉంది. ఈ గ్రామంలోనే చివరి ‘టీ’ దుకాణం ఉంది. ఈ గ్రామం సమీపంలో మిలటరీ గస్తీ ఉంటుంది. మన సైనికులు ఈ గ్రామం సమీపంలో గుడారాలు వేసుకొని కనిపిస్తారు. బద్రీనాథ్ మార్గంలో గోవింద్‌ఘాట్ వద్ద నుండి వెళితే సిక్కుల గురువు గురుగోవింద్‌సింగ్ తపస్సు చేసిన ప్రాంతం ఉంది. సిక్కులు ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో వస్తుంటారు.
ప్రకృతి రమణీయత..
ప్రకృతి రమణీయ దృశ్యాలు చార్‌ధామ్ యాత్రలో హిమగిరి శిఖర మార్గంలో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హిమగిరి శిఖర మార్గంలో అందాలు వర్ణనకు అందనివి. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలకు వెళ్ళే మార్గంలో అడుగడుగునా ప్రకృతి రమణీయత వెల్లివిరుస్తుంది. ఈ ప్రాంతం దేవభూమిగా, వేదభూమిగా భాసిల్లుతోంది. ఆకాశాన్ని తాకేలా హిమ శిఖరాలు, శిఖరం చివరి అంచున మంచుపలకలు చూపరులను ఆనందపరవశులను చేస్తాయి. ఈ హిమగిరులు ఆకుపచ్చని అందాలతో సుందరంగా శోభాయమానంగా గోచరిస్తాయి. ముల్లోకాలను పాలిస్తూ సంరక్షించే త్రిమూర్తులు ఈ హిమగిరులను నివాసంగా ఎంచుకున్నట్టు భక్తులు భావిస్తారు. ఈ మార్గంలో యాత్రికులు అడుగిడిన వెంటనే వారి మనసుల్లో ఆధ్యాత్మిక, ధార్మిక సంబంధ అధ్యయన శక్తి ఏర్పడుంటంటే అతిశయోక్తి కాదు. హిమగిరి శిఖరాల్లో పుష్ప, ఫల భరిత వృక్ష సంపద బారులు తీరి యాత్రికులను స్వాగతిస్తాయి. మార్గమధ్యంలో లోయలు, పొదలు, కొండల నడుమ నదీ ప్రవాహాలు, ఎత్తయిన వృక్షాలు, ప్రకృతి సోయగాలు కనువిందు చేస్తాయి. చెట్ల నుండి చల్లని గాలి రివ్వున హృదయాన్ని తాకుతుంది. పలురకాల పూలవాసనలు మనసులను మత్తెక్కిస్తాయి. స్వచ్ఛమైన గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడి హిమనగాల అందాలను పురాణేతిహాసాల్లో ప్రస్తావించారు. చార్‌ధామ్ యాత్రలో ప్రకృతిని వీక్షిస్తే- సహజ సుందర దృశ్యాలతో అలరారే పచ్చటి కొండలు వెలకట్టలేని దివ్యాభరణాలుగా గోచరిస్తాయి. కొన్ని ఇబ్బందులున్నా- చార్‌ధామ్ యాత్ర సదా మనోల్లాసమే. ఇక్కడ ఏ ప్రదేశంలో భక్తులు కూర్చొన్నా మానసిక తృప్తి, అలౌకిక శాంతి, ఆధ్యాత్మికతను పొందుతారనడంలో సందేహం లేదు. ఈ మార్గంలో ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు, తీర్థాలు, ఆలయాలు చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తాయి.
నిజంగా సాహసమే..
మంచు శిఖరాలు, భయంకరమైన లోయల నడుమ సాగే చార్‌ధామ్ యాత్ర నిజంగా ఓ సాహసమే. అడుగడుగునా ప్రమాదం.. అడుగు దూరంలోనే ప్రమాదం అన్నట్టుగా ప్రయాణం సాగుతుంది. ఘాట్‌రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధిపరచకపోవడంతో యాత్రికులకు రక్షణ నామమాత్రమే. ఘాట్‌రోడ్ల కింద దాదాపు రెండు వేల అడుగులకు మించి లోయలు దారిపొడవునా ఉంటాయి. ఘాట్‌రోడ్డు విస్తీర్ణం తక్కువగా ఉండడం వల్ల ఎదురెదురుగా వాహనాలు వస్తే రాకపోకలు సాగేందుకు వాహనదారులు ఇబ్బంది పడక తప్పదు. అనేకచోట్ల వాహనానికి అడుగు దూరంలోనే లోయలు ఉంటాయి. కొండ శిఖరాలు రోడ్డుపైకి దూసుకొచ్చినట్టు ఉంటాయి. అత్యంత ప్రమాదకరమైన మలుపులు వద్ద సమీపంలోనే లోయలుంటాయి. గతంలో వరదల్లో దెబ్బతిన్న రహదారులకు ఇంకా మరమ్మతలు పూర్తికాలేదు. అనేక చోట్ల మట్టిరోడ్లు వాహనం వెళితే కుంగిపోతాయా? అన్నట్టు కనిపిస్తాయి. ఈ మార్గంలో 100 కిలోమీటర్లు ప్రయాణించేందుకు నాలుగైదు గంటల సమయం పడుతుందంటే రహదారులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో ఊహించవచ్చు. వాహనాలు ఘాట్‌రోడ్లపై వెనక్కి వచ్చే పరిస్థితులు ఉంటాయంటే అతిశయోక్తి కాదు.
అందాల హరివిల్లు హరిద్వార్
చార్‌ధామ్ యాత్రలో భక్తులు మొదట చేరుకునే హరిద్వార్ క్షేత్రాన్ని ‘గంగానది తొలి ద్వారం’ అభివర్ణిస్తుంటారు. ఇక్కడ గంగలో స్నానం చేయడం, గంగామాతను స్తుతించడం భక్తులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ క్షేత్రంలో నిత్యం జరిగే ‘గంగాహారతి’కి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. హరిద్వార్ క్షేత్రం- హరికి, శివుడికి, బ్రహ్మకు ఉమ్మడి నివాస స్థలంగా చెబుతారు. ఈ క్షేత్రంలో కొండలపై ఉన్న మానసాదేవి, చండీదేవి ఆలయాలకు వెళ్ళేందుకు ‘రోప్ వే’ సౌకర్యం ఏర్పాటు చేశారు. చండీదేవి ఆలయంలో అంజనీమాత విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని ప్రతీతి. ఇక్కడి దక్షప్రజాపతి మందిరం కూడా ప్రసిద్ధి చెందింది. గంగానది ఒడ్డున గంగాదేవి గుడి భక్తుల కొంగుబంగారంగా శోభిల్లుతున్నది. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలకు హరిద్వార్ నిలయంగా ఉంది. *

భక్తుల సందడి ప్రారంభం..
కేదారినాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలకు సాగే ‘చార్‌ధామ్’ యాత్ర సందర్భంగా సుమారు ఏడు నెలల పాటు భక్తజనుల కోలాహలం కనిపిస్తుంది. ఏడాదిలో ఆరునెలల పాటు మాత్రమే ఈ నాలుగు ఆలయాలను భక్తుల కోసం తెరుస్తారు. అత్యంత శీతల వాతావరణం కారణంగా మిగతా ఆరునెలల పాటు ఈ పుణ్యక్షేత్రాలను మూసివేస్తారు. ప్రస్తుత వేసవికాలంలో ‘చార్‌ధామ్’ సందడి ఇప్పటికే ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కేదారినాథ్ ఆలయాన్ని ఈనెల 9న, బద్రీనాథ్ ఆలయాన్ని ఈనెల 10న, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఈనెల 7వ తేదీన తెరిచారు. కేదారినాథ్ ఆలయాన్ని వచ్చే అక్టోబర్ 29న, బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 9న, గంగోత్రిని అక్టోబర్ 28న, యమునోత్రి ఆలయాన్ని అక్టోబర్ 29న తిరిగి మూసివేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.

భగీరథుడి తపస్సు..
దివి నుండి భువికి గంగను తెప్పించేందుకు భగీరథ మహరాజు తపస్సు చేసిన స్థలం ‘గంగోత్రి’ భక్తులను ఎంతగానో ఆకట్టుకొంటుంది. గంగోత్రి మందిరానికి కింద గంగానదికి పైన భగీరథుడు తపస్సు చేసిన స్థలంలో ఓ మందిరాన్ని నిర్మించారు. మందిరంలో భగీరథుని విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం పక్కనే ఉన్న రాయిపై భగీరథుడు గంగ కోసం ఘోర తపస్సు చేశాడని చెబుతుంటారు. ఆ ప్రదేశాన్ని కనులతో వీక్షించి, చేతులతో స్పృశించి భక్తులు వింత అనుభూతిని పొందుతారు. భగీరథుని విగ్రహానికి భక్తితో పూజలు నిర్వహిస్తారు. మందిరం పక్కనే సిద్ధి,బుద్ధి అనే భార్యలతో కొలువైన గణపతి, హనుమాన్, మహాశివుని ఆలయాలు దర్శించుకున్నాక గంగోత్రి ప్రయాణం సఫలీకృతమైందని, తమ జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు. గంగానదికి పూజలు చేయడంతో పాటు తర్పణాలు, పిండ ప్రదానం, అస్తికలు కలపడం వంటి పనులను పూర్తి చేస్తారు.

ఉష్ణజలం.. భగవంతుడి లీల!
చార్‌ధామ్ యాత్రలో భక్తులను ఆశ్చర్యచకితులను చేసేలా నాలుగు ప్రాంతాల్లో ఉష్ణజలాలతో కూడిన తీర్థాలున్నాయి. యుమునోత్రిలో ఉష్ణకుండ్, గంగోత్రికి వెళ్ళే దారిలో గరం కుండ్, కేదార్‌నాథ్‌లో గౌరీ తీర్థం కుండ్, బద్రీనాథ్‌లో తప్తకుండ్‌లలో వేడినీరు పొగలు చిమ్ముతూ ఉంటుంది. సహజ సిద్ధంగా వేడినీరు అన్ని కాలాల్లోనూ ఉబికి వస్తుంది. శీతల గాలులతో కూడిన ప్రాంతంలో ఇలా వేడినీరు రావడం భగవంతుడి లీలగా భక్తులు భావిస్తారు. అందుకే వేడినీటిలో భక్తులు స్నానమాచరిస్తారు. పుణ్యనదుల్లో నీరు అతి చల్లగా శరీరాన్ని గడ్డకట్టించేలా ఉండగా- ఈ ప్రాంతంలోనే వేడినీరు రావడం భక్తులకు ఉపశమనం కలిగిస్తుంది. కాగా, వరదల కారణంగా కేదార్‌నాథ్‌కు సమీపంలోని గౌరీతీర్థం కుండ్ ఇటీవల కనిపించడం లేదని స్థానికులు చెబుతుంటారు.

-మలిశెట్టి చంద్రవౌళి 98485 33634