శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం (వాసుదాసు వ్యాఖ్యానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిష్కింధకాండ
*
శ్రీరాముడిని
దూషించిన వాలి
*
గొడ్డలి మొనతో నరకబడ్డ చెట్టులాగా రాముడి బాణం దెబ్బకు నేల మీద చాప పరిచినట్లు వాలి పడిపోయినప్పుడు, భూమి తేజం, చంద్రుడు లేని ఆకాశంలాగా అయిపోయింది. ఆ వీరుడు నేల మీద పడ్డప్పటికీ, ఆయన తేజం కానీ, పరాక్రమం కానీ, ప్రాణాలు కానీ విడువలేదు. ఇంద్రుడు ఇచ్చిన మణులు చెక్కిన బంగారు సరం వాలి తేజస్సు, ప్రాణాలు, పరాక్రమం, కాంతి పోకుండా కాపాడాయి. శ్రేష్టమైన బంగారు మాలిక శరీరం మీద వెలుగుతుంటే పరాక్రమవంతుడైన వాలి, సాయంకాల సమయంలో ఎర్రటి కాంతితో ప్రకాశించే మేఘంలాగా కనిపించాడు. బంగారు సరంతో, ప్రాణాలు తీస్తున్న బాణంతో, నిర్మలమైన శరీరంతో వాలి మూడు రంగుల ప్రకాశించాడు. శత్రువులను సంహరించే శక్తి గల వాలికి, స్వర్గానికి పంపే శక్తి కల రామబాణం ఉత్తమ గతిని (ముక్తిని) కలిగించింది.
జ్వాలలు ఉడిగిన అగ్నిలాగా, ప్రళయకాలంలో నేలపడిన సూర్యుడిలాగా, పుణ్యం క్షీణించడం వల్ల భూమీద పడ్డ యయాతిలాగా, ఇంద్రుడిని అలక్ష్యం చేసేవాడిని, సింహం రొమ్ములాంటి రొమ్ముకల వాడిని, మండుతున్న ముఖం కలవాడిని, దీర్ఘమైన చేతులు కలవాడిని, తాను నేలపడేసినవాడిని, బలశాలిని మెచ్చుకుంటూ, వాడెలాంటివాడో చూడాలనుకుని వాలిని లక్ష్మణుడితో కలిసి సమీపించాడు శ్రీరాముడు. ఇలా తనను సమీపించిన రామచంద్రుడిని, లక్ష్మణుడిని చూసిన వాలి ధర్మంతో కూడిన, వినయంతో కూడిన, కఠినమైన మాటలతో ఇలా అన్నాడు.
‘‘రామా! నువ్వు రాజకుమారుడివి. శాస్తజ్ఞ్రానం చక్కగా తెలిసినవాడివి. స్థిరమైన శోభ కలవాడివి. గొప్పవంశంలో పుట్టావు. మంచి తేజస్సు కలవాడివి. కీర్తికి నువ్వు నెలవైనవాడివి. ఇలాంటి వాడివై ఉండి కూడా యుద్ధ్భూమిలో నేను ఇతరులతో యుద్ధం చేస్తున్న సమయంలో, నా మనస్సు, దృష్టి దాని మీద ఉన్నప్పుడు, చాటున ఉండి నా రొమ్ము మీద కొట్టడంలో ఏం గొప్ప ఉందో చెప్పు. రామచంద్రా! రాముడు కరుణాజ్ఞానం కలవాడనీ, ప్రజల మేలు కోరేవాడనీ, దయాలక్ష్మికి స్థానమైనవాడనీ, ఉచితానుచితజ్ఞానం కలవాడనీ లోకులు నిన్ను పొగుడుతుంటారు. తార నన్ను యుద్ధానికి పోవద్దని, సుగ్రీవుడికి సహాయంగా రాముడు వచ్చాడనీ, ఆయన నన్ను చంపుతాడనీ, చెప్పినా వినకుండా వచ్చాను. బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ విగ్రహం, ఓర్పు, ధర్మం, ధైర్యం, సత్యం, పరాక్రమం, అపరాధులను మాత్రమే దండించడమనే రాజులకుండే ఉచితమైన సద్గుణం... ఇవన్నీ రాముడిలో లేకపోతాయా, ననే్నల నిరపరాధిని చంపుతాడని వచ్చాను. నీ చేతుల్లో చచ్చాను. ఇప్పుడు నేను చెప్పిన రాజగుణాల్లో ఒక్కటి కూడా నీలో లేదు. నువ్వేం రాజువి? సుగ్రీవుడు చెప్పాడని తొందరపడి, కోపగించి, గుణదోషాల విచారణ చేయకుండా, ఇతరులతో యుద్ధం చేసేవాడిని ఎలా చంపాలి? అన్న ఆలోచన చేయక, ధర్మచింతన చేయక, ఎదురుపడి యుద్ధం చేసే ధైర్యం లేక, సత్యాసత్యాలు తెలుసుకోకుండా, పిరికివాడిలాగా దూరంగా మాటు వేసి, నీకే అపకారం చేయని నన్ను దండించావు కదా? నువ్వు మోసగాడివి అని తార తెలుసుకుంది కానీ నేను తెలుసుకోలేకపోయాను.’’
‘‘రాముడు గొప్పవంశంలో పుట్టాడు కాబట్టి గొప్ప గుణాలు కలవాడై ఉంటాడనీ, కళ్యాణ గుణాల మనోహరుడు కాబట్టి హేయ కార్యాలు ఎందుకు చేస్తాడనీ, నేను ఇతరులతో యుద్ధం చేస్తున్నప్పుడు నా మీదకు ఎలా వస్తాడనీ, ననె్నందుకు చంపుతాడనీ, ఇలాంటి అకార్యం ఎందుకు చేస్తాడనీ భావించి, నీ ముఖం ఎన్నడూ చూడని కారణాన మోసపోయి ఈ విధంగా యుద్ధానికి వచ్చి నీ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాను. రాజవేషం ధరించిన పాపపు నడవడి కలవాడివి నువ్వు. మాయలమారివి.. ఈ వాస్తవం తెలుసుకోలేక బుద్ధిహీనత వల్ల ఇలా అయిపోయాను. నేనెప్పుడూ నీ ముఖం చూడలేదు. నగరంలో కానీ, పొలిమేరల విషయంలో కానీ నీకు అపకారం చేయలేదెప్పుడూ.. కాబట్టి నీకు నా మీద కలహకారణం లేదు. అడవుల్లో ఉండి మా ఇష్టప్రకారం ఏదో ఆ వేళకు దొరికిన కాయగూరలు తింటూ బతికే కోతులం. కాబట్టి నీ కూటికి అడ్డం రాలేదు. ఇలాంటి నన్ను యుద్ధం చేస్తున్న సమయంలో చంపడానికి కారణం ఏంటి? రాజుల వంశంలో పుట్టి వేదాలను అధ్యయనం చేశావే? తేజస్సులో అతిశయించావు కదా? నిస్సందేహమైన జ్ఞానం కలవాడివే? అలాంటి వాడిని ఎందుకీ విధంగా ధర్మాత్ములు ధరించాల్సిన వేషాలు వేసుకుని లోకులకు కీడైన క్రూర కార్యం చేయతలపెట్టావు? నువ్వు పుట్టిందా రాజవంశంలోని. ధర్మాత్ముడనే కీర్తి సంపాదించావు. ఇలాంటి క్రూర కార్యం చేసే నువ్వు పెద్దమనిషిలా ఎలా ప్రవర్తిస్తావు? బుద్ధిమంతుల్లో శ్రేష్టులైన వారు సామం, దానం, శౌర్యం, సత్యం, క్షమ, ధర్మం, ధృతి, అపరాధులను దండించడం లాంటివి రాజగుణాలని చెప్పారు.
‘‘మేం అడవుల్లో తిరిగేవాళ్లం. మీరు నగరాల్లో తిరిగేవారు. మేం పండ్లు, కందమూలాలు తిని జీవించే మృగాలం. మీరు ఇష్ట మృష్టాన్నాలు తింటారు. నేనేమో మృగాన్ని. నువ్వో మనుష్యుడివి... నేను నీ సేవకుడిని. నువ్వు రాజైనా బుద్ధిలేని వాడివయ్యావు. చూశావా? భూమికానీ, బంగారంకానీ, వెండి కానీ, కలహకారణాలు కదా? నేను తినే కందమూలాల మీద నువ్వు ఆశపడి, నేను తింటే నీకు లేకుండా పోతుందన్న భయంతో నన్ను చంపావా? నయం, అనుగ్రహం సజ్జనులైన రాజుల్లో ఉంటుంది. దుర్వినయం, నిగ్రహం, దుష్టరాజుల గుణాలు. సాధారణంగా కలవని ఈ రెండూ నీలో మిశ్రమంగా ఉన్నాయి. రాజులైనవారు ధర్మవశులై నడుచుకోవాలి కానీ మేమే ప్రభువులం. మేమెలా చేసినా కాదనేవారెవరు? అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. నువ్వేమో ఇంద్రియాల వల్ల కలతచెంది, కామమే సర్వకాల సర్వావస్తలలో ముఖ్యమని భావిస్తూ, అది నెరవేరకపోతే కోప్పడుతూ చెడు - మంచి రాజుల మిశ్రమ నడవడి కలవాడివై ప్రవర్తిస్తున్నావు. దానివల్ల నువ్వు మంచివాడివో, చెడ్డవాడివో మాలాంటి వాళ్లకు అర్థం కావడంలేదు. నిన్ను శిష్టుడవని నమ్మలేం. దుష్టుడువని అనలేం. విల్లే ఫ్రధాన సాధనంగా తలచి, కలహానికి కాలుదువ్వుతూ, బలవంతుడినన్న గర్వంతో, ధర్మం విడిచి మర్యాద వదిలావు.’’
*
-సశేషం
*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12