Others
మనోహితం...జనహితం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దేనితోనూ సంబంధం లేకుండా తన బాధ్యతను మాత్రమే చిత్తశుద్ధితో నిర్వర్తించేవాడు. అంటే, ఏ విషయాలూ పట్టించుకోకుండా సోమరిలా వుండేవాడనో లేక, ఎవరెక్కడపోతే నాకేమని తన స్వార్థం తను చూసుకునే వాడనో కాదు. తనకు సంప్రాప్తించిన జన్మకు సంబంధించి ఏ కార్యములు నిర్వర్తించ తగవాడో, ఏ కర్మలు తనకోసం ఎదురుచూస్తున్నాయో వాటిని విస్మరించకుండా ఫలితములపై ఆపేక్షను చూపని వాడు. అదే సమయంలో ఫలితం ఎటువంటిదైనా సమానమైన భావనతో స్వీకరించే ఆత్మస్థైర్యం కలిగినవాడు.
మనిషి ఆశాజీవి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఆశ అన్నది భవిత మీద ఇష్టం, ఉత్సాహం కలిగించేవిగా మాత్రమే వుండాలి. స్వార్థపూరితమై, అసూయాపరమైనది కాకూడదు. తాను ఆశించినది ఏదైనా తన స్వయం కృషితో, దృఢ సంకల్పంతో ప్రయత్నించి వశం చేసుకోవాలి. అప్పుడే అది జనహితం, స్వయంగా మనోహితం అవుతుంది. తద్వారా ఆనందం లభిస్తుంది. తనవారిలో ప్రత్యేకతను, కీర్తిని తెస్తుంది. అంతేకానీ, తాను ఆశించిన దానికోసం దిగజారటం, కుటిలమైన ప్రయత్నాలు చేయటం, తస్కరించి స్వంతం చేసుకోవటంవల్ల అపకీర్తి, మనోవ్యధ, అశాంతి, శిక్ష సంప్రాప్తిస్తుంది.
ప్రేమ పాశములు, స్నేహబాంధవ్యాలు లేని మనిషి జన్మ వుండదు. అందువల్లనే చాలా మంది ఆశ్రీత పక్షపాతులుగా, బంధుజన హితులుగా వుంటూ మిగిలిన వారితో తెలియని దూరం తెచ్చుకుని అపవాదులకు గురిఅవుతారు. ఇక్కడ ప్రేమ పాశములతో వుంటూనే ధర్మబద్ధత, సమదృష్టి కూడా ముఖ్యమని భావించడం ముఖ్యం. తమవారి శ్రేయస్సుకోసం ఇతరులను వంచించటమో బాధపెట్టడమో మాత్రం తగదు. తనవారి మంచికోసం తన శక్తికొద్దీ మాత్రమే సహాయపడటం చేయాలి. అప్పుడే తనవారితోబాటూ నలుగురూ సన్నిహితులై మెలగే అవకాశం వుంటుంది.
అందుకే, శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర ప్రారంభ సమయంలో అర్జునుని బంధుప్రీతిని చూసి గీతనుపదేశించి స్వార్థచింతనను పారద్రోలుతాడు. తనమన బేధములు వుండవలసినదే. కానీ, తన అభిమానమును చంపుకొని మాత్రమూ కారాదని బోధించాడు. ఉపకారమన్నది తగినవారికే చేయాలి. మంచి ఫలసాయంకోసం కలుపు తీయవలసినదే. సమాజంలో ధర్మము, సత్యము, న్యాయము బ్రతకాలంటే అధర్మపరుల వినాశనం జరిగి తీరాలి. దానికి తగిన శక్తిసామర్థ్యాలు, అవసరమూ, పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకోనివాడు లోక నాశకుడనే అర్థము.
ఎంతటి దుష్కార్యాలనైనా చేయటానికి వెనుకాడని వారికి ప్రాణభిక్ష పెట్టడంవల్ల ఎందరో అమాయకుల బ్రతుకులను అంధకారంలో పడవేస్తూ చేతులు ముడుచుకుని కూర్చొనరాదు. అలాగని, తనది కాని కార్యమూ భుజాలపై వేసుకొనరాదు. తాను న్యాయవాది అయినపుడు అన్యాయము వైపు వాదించుట, తాను రక్షకుడని తెలిసీ అధర్మపరులకు కొమ్ముకాయుట, అధికారదర్పంతో అప్రజాస్వామికముగా పాలించుట, విద్యార్థియై వుండి క్రమశిక్షణ తప్పుట ఎంత తప్పో, ఆయా అధికారములు లేకపోయినా నిర్వర్తించాలని చూడటమూ అంతే తప్పు ఇవన్నీ తగని విషయాలు.
జీవితం క్షణ భంగురం. కీర్తిమాత్రమూ ఆచంద్రతారార్కం అని ప్రతి మనిషీ గుర్తించి ప్రవర్తించడం ముఖ్యం. ఎన్నిరోజులు బ్రతికినా మరణం రాకమానదు. భూమిపైనున్న ఎన్నో జీవరాశులకు లేని అవకాశాలు, రూపము, జ్ఞానము సొంతం చేసుకున్నందుకు పర్యావరణ హితముగా, స్నేహగుణము, ప్రేమ పూర్వకము, నిశ్చలచిత్తమూ కలిగి ప్రవర్తించాలి. అప్పుడే తనచుట్టూ వున్న వాతావరణం ఎప్పుడూ ఆహ్లాద పూరితంగా వుంటుంది.
ఎప్పుడూ చేస్తున్న కార్యం మీద శ్రద్ధమాత్రమే కానీ కోరిక కలిగి వుండకూడదు. అప్పుడు ఆ ఆర్యానంతరం ఏర్పడే ఎటువంటి పరిస్థితీ మనసును కృంగదీయటమో, అత్యుత్సాహపడటమో జరగదు. దానికి ఎంతో సాధన, సంకల్ప రెండూ కావాలి. అర్జునుడు కఠోర సాధన చేత సవ్యసాచి అయ్యాడు. అలాగే, స్థిరబుద్ధితో శివునిగూర్చి తపస్సుచేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు. నరునిగా సహజముగా కలిగే బలహీనత అను మాయ ఆవరించినప్పుడు దైవంమీది నమ్మకం వెన్నంటి వుండి హెచ్చరిస్తుంది, సహకరించి వివేకాన్ని మేల్కొల్పుతుంది. అదే శ్రీకృష్ణుడు చేశాడు.
అందుకే భగవంతుడు అంతటి మహత్కార్యానికి అతన్ని ఎన్నుకున్నాడు. అంతేకాకుండా నడిపించే సారథిగానూ మారాడు. బుద్ధికర్మానుసారణి మాత్రమేకాదు. కర్మలు కూడా బుద్ధిననుసరించి ఏర్పడతాయన్నది విస్మరించలేని సత్యం. కొన్నిసార్లు విచలితవౌతుంది. కొన్నిసార్లు బలహీనపడుతుంది, మరికొన్నిసార్లు ఆకర్షణకు లోనవుతుంటుంది. ఎంత గొప్ప కార్యోన్ముఖునికైనా ముందుకునడిపే చుక్కానివంటి గురువు అవసరమే అవుతుంది.
ప్రతిమనిషీ తనకు కలిగిన గొప్ప చదువువల్లనో, సంపదవల్లనో, శక్తివల్లనో, నేర్పు వల్లనో అధికునిగా భావిస్తాడు. కించిత్తు ఓటమిపాలైనా కుంచించుకుని కృంగిపోవటం జరుగుతుంది. అలాంటప్పుడు తానిలావుండటం తన స్వభావంమాత్రమే దానివల్ల మంచి ఫలితాలకై ప్రయత్నిస్తూనే వుండాలి. పరిణామం అనుకూలమైనా, ప్రతికూలమైన ప్రత్యమ్నాయ ఏర్పాట్లతో ముందుకెళ్ళే ఆలోచనచేయాలి తప్ప క్షీణించి పోకూడదు. అలాగని పొంగిపోయి గర్వపడటమూ అనర్థదాయకమే అని గ్రహించిన ప్రతి ఒక్కరూ నిమిత్తమాత్రులే. మనోనిబ్బరం కలిగి తమ పురోగతికి బాటలు వేసుకోగలిగినవాళ్ళు ఆరోగ్యదాయక సమాజ నిర్మాణానికి తోడ్పడేవాళ్ళవుతారు. అహంకార మమకారాదులు ఏవీ దరిచేరకుండా చూసుకుంటూ జనహితాన్ని మనసున ఉంచుకుని మనోహితమైన కార్యాలు చేస్తూ వాటిని కూడా ఈశ్వరార్పితం చేయడమే మనిషి తన కర్తవ్యంగా భావించాలి. అపుడే జనులే కాదు జనార్దనుడు కూడా మెచ్చుకుంటాడు.