జాతీయ వార్తలు

చరిత్ర పునరావృతం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మార్చి 11: మధ్యప్రదేశ్‌లో 52 ఏళ్లనాటి పరిస్థితులు పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సింధియా కుటుంబీకులే ఈ భారీ సంచలనాలకు కారకులు కావడం విశేషం. అప్పట్లో గ్వాలియర్ సంస్థానానికి చెందిన ‘రాజమాత’ విజయరాజే సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ వంశానికే చెందిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనతోపాటు 22 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టారు. దీంతో 14 నెలల కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూకు ఎంతో సన్నిహితంగా వ్యవహరించిన విజయరాజే సింధియా సుమారు దశాబ్దంపాటు ఆ పార్టీకి విశిష్ట సేవలు అందించారు. మధ్యప్రదేశ్‌లో తిరుగులేని నేతగా వ్యవహరించారు. అయితే, 1967 జూలైలో ఆమె పార్టీని వీడారు. ఫలితంగా డీపీ మిశ్రా నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కుప్పకూలిపోయింది. అప్పట్లో లోక్‌సభ, రాజ్యసభలకు ఒకేసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరెవరిని ఎంపిక చేయాలన్న విషయంపై మిశ్రా, విజయరాజే మధ్య విభేదాలు తలెత్తాయి. అభ్యర్థుల జాబితాతో ఆమె సుమారు రెండు గంటలపాటు నిరీక్షించినప్పటికీ మిశ్రా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ఆమె తనకు మద్దతునిస్తున్న 36 మంది ఎమ్మెల్యేలతో కలిసి గ్వాలియర్ ఉషాకిరణ్ హోటల్‌లో బస చేశారు. మిశ్రాపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అసెంబ్లీలో మద్దతు కోల్పోయిన మిశ్రా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. విజయరాజే మద్దతు ఇచ్చిన గోవింద్ నారాయణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన ప్రభుత్వం 18 నెలలు మాత్రమే కొనసాగింది. ప్రజాబలం, ఆర్థిక బలం ఎక్కువగా ఉన్న సింధియా కుటుంబానికి మధ్యప్రదేశ్ రాజకీయాలపై గట్టి పట్టు ఉంది. మాధవరావు సింధియా కుమారుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జ్యోతిరాదిత్య సింధియా చాలా తక్కువ కాలంలోనే పార్టీలో కీలక నేతగా ఎదిగారు. పలు హోదాల్లో సేవలు అందించారు.
ఇప్పుడు కమల్‌నాథ్ సర్కార్‌ను భయాందోళనకు గురిచేసేలా ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 22 మంది ఎమ్మెల్యేలు ఆయనకే మద్దతు ప్రకటించడం సహజంగానే కమల్‌నాథ్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టింది. అప్పటి మిశ్రా ప్రభుత్వంలాగానే ఇప్పుడు కమల్‌నాథ్ సర్కార్ కూడా కుప్పకూలుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.