మెయన్ ఫీచర్
హిందూత్వ రాజకీయాలకు ఆద్యుడు బలరాజ్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://ftp.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/14e_25.jpg?itok=gKPDUNcz)
భారత రాజకీయాలలో హిందుత్వ సైద్ధాంతిక ప్రాతిపదికతో బలమైన రాజకీయ ప్రత్యా మ్నాయం ఏర్పాటుకు అవిరళ కృషిచేసిన మేధావి, విశేష ప్రజాదరణ పొందిన నాయకుడు, వీరోచిత పోరాట యోధుడు ప్రొఫెసర్ బలరాజ్ మధోక్. విదేశీ సైద్ధాంతిక ఆలోచనలు భారత రాజకీయ రంగాన్ని ముంచి వేస్తున్న రోజులలో ప్రత్యామ్నాయ సామాజిక, రాజకీయ, ఆర్థిక విలువలతో బలమైన రాజకీయ పార్టీ ఏర్పాటుకు విఫల ప్రయత్నం చేశారు.
డా. శ్యామ్ప్రసాద్ ముఖర్జీతో కలసి భారతీయ జనసంఘ్ను స్థాపించి, దానికి ఒక విలక్షణమైన సైద్ధాంతిక రూపు కలిగించారు. అమెరికా, ఇజ్రాయెల్లు భారత్కు ‘సహజ మిత్రులు’ అని, వారితో భారతదేశం సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని దేశం అంతా రష్యా, చైనా మత్తులో ఉన్న సమయంలోనే బలంగా వాదించారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని పార్లమెంట్లో మొట్టమొదటిగా సెప్టెంబర్ 1, 1961న వాదించిన నేత.
అయోధ్యతో పాటు కాశి, మధురలను సహితం హిందువులకు ఇచ్చివేయడం ద్వారా భారతదేశంలో పరస్పరం సుహృద్భావం కలిగి ఉండేందుకు చేతులు కలపాలని ముస్లింలకు పిలుపిస్తూ నిర్దుష్టమైన హిందుత్వ రాజకీయ ఎజెండాను దేశ ప్రజల ముందుంచారు. హిందువులలో రాజకీయ చైతన్యం అవసరమని మొదట గా చెప్పారు.
‘హిందుత్వ రాజకీయ అజెండా... స్పష్టమైన నిర్వచనం ఇచ్చిన ధీశాలి. ‘సాంస్కృతిక హిందు... అంటూ అవకాశం వాదాన్ని ప్రదర్శించడాన్ని నిరసించారు. ‘సాంస్కృతిక హిందుత్వ’ అంటే విస్తృతమైన అంశమని, నేడు భారతీయులకు అవసరమైనది బలమైన రాజకీయ సందేశం అని స్పష్టం చేశారు. భారతదేశం ప్రధానంగా హిందూ దేశం అని, తమ ప్రయోజనాలను హిందువులే కాపాడుకోవాలని అంటూ స్పష్టమైన పిలుపిచ్చారు.
హిందువు అనే పదం ఉపయోగించడానికి భారతీ యులు సంశయించే పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ దానిని ఒక మతంగా లేదా వర్గంగా పరిగణిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. కానీ ఈ పదం ప్రజల ఆరాధనా పద్ధతులలో జోక్యం చేసుకోదని, కేవలం పౌరులు అందరు భారతదేశానికి కట్టుబడి ఉండాలని మాత్రమే కోరుకొంటుందని స్పష్టత ఇచ్చారు. ప్రాచీన భారతీయ సాహిత్యంలో మతం అనే సంకుచిత ధోరణి ఎక్కడా లేదని గుర్తు చేసారు.
ప్రపంచంలో భారతదేశం మాత్రమే హిందువులకు మాతృభూమి కావడంతో, దేశంలోని హిందువులలో రాజకీయ చైతన్యం కలిగించడమే ఈ దేశాన్ని బలోపేతం కావిస్తుందని, దేశ ప్రయోజనాలను కాపాడుతుందని స్పష్టం చేశారు. అటువంటి ప్రయత్నం నాటి భారతీయ జనసంఘ్ నాయకులు గాని, నేటి బీజేపీ నాయకులు గాని మరెవ్వరు చేయక పోవడం గమనార్హం.
దేశ విభజనకు కారణమై, ఇంకా దేశంలోనే ఉంటున్న వారు హిందువులతో పాటు సమానమైన ఆదరణ మాత్రమే పొందగలరని కూడా నిక్కచ్చిగా చెప్పారు. 1946లోనే ముస్లిం సమస్యను చారిత్రక దృక్కోణంలో అధ్యయనం చేసి ఆయన లాహోర్లో రాసిన వ్యాసం ఇండియన్ లిబరల్ లీగ్ నుండి మొదటి బహుమతి పొందింది.
‘‘నేటి మూల సమస్య భారతీయ ఇస్లాం భారతీయ కరణ పూర్తిగా జరకపోవడం. అదే జాతీయవాద శక్తులను బలహీన పరుస్తున్నది. తిరోగమన, జాతి వ్యతిరేక శక్తులకు బలం చేకూరు స్తుంది’’ అంటూ నిర్మొహమా టంగా తన భావాలను వ్యక్తం చేశారు. బలహీనమైన విధానాలు ఏ సమస్యను పరిష్కరింపలేవు. సరైన మార్గం తీసుకొని, దారిలో వచ్చే అడ్డంకులను తొలగించుకొంటూ వెళ్లగల మనోబలం, శక్తీ దేశానికి నేడు అవసరం... అని కూడా చెప్పారు.
జాతీయత ఇటలీ, జర్మనీలను ఐక్యపరిస్తే, ముస్లిం వేర్పాటువాదం భారతదేశ విభజనకు దారితీసినట్లు ఆయన దేశ ప్రజలను హెచ్చరించారు. రాజకీయాల నుండి మతాన్ని విడదీయాలని కోరుకొంటున్న వారు ముందుగా దేశాన్ని నిజమైన లౌకిక రాజ్యంగా మార్చాలని మధోక్ సవాల్ విసిరారు. లౌకిక రాజ్యంలో పౌరుల మధ్య మతం పేరుతో వివక్షత చూపడం తగదని, అందరికి ఒకేరకమైన చట్టాలు ఉండాలని, చట్టం ముందు అందరు సమానమే అని స్పష్టం చేశారు.
లౌకికవాదులం అని చెప్పుకొనేవారు మతాన్ని, రాజకీయాలను మిళితం చేయడమే నేడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని ఎత్తి చూపారు. ఆ విధంగా ముస్లిం లీగ్ మిళితం చేసిన కారణంగానే ఎటువంటి భౌగోళిక, సాంస్కృతిక నేపథ్యం లేకుండా భారత్ విభజనకు గురైనదని గుర్తు చేశారు. మొత్తం భారత్ను ఇస్లామిక్ దేశంగా చేయాలనే కుట్రలు కూడా చేశారని గుర్తు చేశారు. ఆ విధంగా ఒక హిందూ దేశం ఎప్పటికీ మత రాజ్యం కాబోదని స్పష్టం చేశారు. హిందూ దేశంలోనే లౌకికవాదం, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు సాధ్యం కాగలవని కూడా తెలిపారు.
ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న స్కర్దులో 1920, ఫిబ్రవరి 25న జన్మించిన ఆయన శ్రీనగర్, లాహోరుల్లో చదువుకున్నారు. భారత రాజకీయాలలో ఒక బలమైన ప్రతిపక్షం ఏర్పాటులో, సంకీర్ణ రాజకీయాలకు బలమైన పునాది ఏర్పాటు చేయడంలో, స్పష్టమైన జాతీయ అజెండాను దేశం ప్రజల ముందు ఉంచడంలో మొదటగా విశేషమైన కృషి చేసిన ఆయనను ఆయన శతజయంతి సందర్భంగా నేడు స్మరించుకొనేవారు లేకపోవడం దురదృష్టకరం. సైద్ధాంతిక రాజకీయాల దివాళాకోరు తనాన్ని ఇది వెల్లడి చేస్తుంది. ఆ మహానేత నాలుగేళ్ల క్రితం, 1996లో మే 2న ఢిల్లీలో మృతి చెందారు.
1940లో ఆర్ఎస్ఎస్లో చేరి 1942లో ప్రచారక్గా వెళ్లారు. జమ్మూ కశ్మీర్లో క్రియా శీలకంగా పనిచేస్తున్న ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కరించ డానికి ఒక దశలో షేక్ అబ్దుల్లా ప్రయత్నించాడు. జమ్మూలో ప్రజాపరిషత్ స్థాపకులలో ఒకరైన ఆయన 1949లో ఢిల్లీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ను ప్రారంభించడంలో క్రియా శీలకంగా వ్యవహరించి, వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు.
1951లో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరిగా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ ఢిల్లీలో జరిపిన మొదటి సదస్సుకు కన్వీనర్గా ఉన్నారు. ఇద్దరు ఉద్దండులైన శ్యామ్ప్రసాద్ ముఖర్జీ, పండిత దీనదయాళ్ ఉపాధ్యాయులతో కలిసి పనిచేశారు. వారిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం గమనార్హం. పార్టీ మొదటి ఎన్నికల ప్రణాళికను ఆయన తయారుచేశారు. రెండుసార్లు ఢిల్లీనుండి లోక్సభకు ఎన్నికయ్యారు.
దేశవిభజన సమయంలో విద్రోహానికి గురయి, మారణహోమానికి గురయిన హిందువులు, సిక్కుల పక్షాన నిలబడి వారి భద్రతకోసం అవిరామంగా పోరాడిన కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ఆయనను ప్రముఖంగా పేర్కొనవచ్చు. జమ్మూకశ్మీర్లో రాజకీయ ఉద్యమ కారుడిగా పాకిస్తాన్ సైనికుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ భారతీయ సైన్యానికి అందజేస్తూ ఉండేవారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్గా పిలువ బడుతున్న ప్రాంతంలో మిర్పూర్లో చిక్కుకుపోయిన లక్షలాది మంది హిందువులను, సిక్కులను కాపాడటం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన నిర్లక్ష్య ధోరణే అందుకు కారణం.
జనసంఘ్కు స్పష్టమైన ఆర్థిక విధానం రూపొందిం చడం కోసం ఆయన ప్రయత్నించారు. నేడు ఆర్థిక సంస్కరణల పేరుతో 1991 నుండి భారతీయులపై తప్పనిసరి పరిస్థితుల్లో రుద్దబడుతున్న సరళీకరణ ఆర్థిక విధానాలను ఆయన 60 దశకంలోనే ప్రతిపాదించారు. అయితే అందుకు హిందూత్వ జాతీయ, భావన ప్రాతిపదికగా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఆయన నిష్క్రమించిన తర్వాత నాటి జనసంఘ్ గాని, నేటి బీజేపీ గాని స్పష్టమైన ఆర్థిక విధానం అలవరచుకోలేక పోయాయి.
అందుకనే స్వతంత్ర పార్టీ, జనసంఘ్ పార్టీలు విలీనమై కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించడం కోసం తీవ్ర కృషి సలిపారు. 1967లో ఈ రెండు పార్టీలు కలిసి లోక్సభలో సుమారు 80 సీట్లతో ఇందిరాగాంధీకి బలమైన ప్రతిపక్ష కూటమిగా పనిచేశారు. స్వాతంత్య్రం అనంతరం ఇంతటి బలమైన ప్రతిపక్ష పార్లమెంటు అప్పుడే అవతరించింది. జనసంఘ్కు ఒకబలమైన ప్రతి పక్షంగా ఆయనే గుర్తింపు తీసుకు వచ్చారు.
ప్రజాకర్షణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 60, 70వ దశకాలలో భారతీయ యువతను జాతీయవాదం, దేశభక్తి భావనలతో రగిలింప చేసిన నేత. ఏనాడూ రాజకీయ ప్రయోజనాల కోసం సైద్ధాంతిక భూమికను విడనాడలేదు. విధానపర విషయాలలో రాజీలేని ధోరణి ఆవలంబించేవారు. అందుకు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.
అయితే జనసంఘ్కు విలక్షణమైన రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక భూమికను ఏర్పరచడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలను అవకాశవాద రాజకీయాలకు పేరొందిన ఆయన పార్టీ సహచరులే పడనీయలేదు. జనసంఘ్ ను కాంగ్రెస్ కు మూస పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించి చివరకు ఆ పార్టీకే దూరం కావలసి వచ్చింది.
అప్పటి నుండి, నేటి బిజెపి వరకు సైద్ధాంతిక దివాలాకోరుతనం ఆ పార్టీని వెంటాడుతున్నది. అందుకనే భావోద్వేగ, అవకాశవాద రాజకీయాలకు పాల్పడక ఆ పార్టీ నేతలకు తప్పడం లేదు. భారత రాజకీయాలను ఒక మలుపు తిప్పిన ఆ మహనీయుడికి శతజయంతి నివాళి.