మెయన్ ఫీచర్

న్యాయవ్యవస్థ స్వతంత్రత నిలిచేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో అవసరమైన పరుగులు చేసి జట్టును గెలుపుబాట పట్టించినట్టు- భారత సర్వోన్నత న్యాయస్థానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా తనదైన ముద్ర వేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ సంచలనాత్మక తీర్పులతో దేశ ప్రతిష్టను ఇనుమడింప చేశారు. సుప్రీం కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే బాధ్యతలు స్వీకరించారు. గత దశాబ్దకాలంగా న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఏదో ఒక రీతిన దాడులు జరుగుతునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు జవసత్వాలను ఉద్దీపన చేసుకుంటూనే సుప్రీం తన వ్యక్తిగత స్వతంత్రతను, న్యాయవ్యవస్థ ప్రతిష్టను ప్రస్ఫుటింప చేస్తోంది. ఈక్రమంలో చట్టసభలతోను, పాలనా వ్యవస్థలతోను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సంయమనం కోల్పోకుండా నిజాయితీని చాటుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం తన ఉనికిని కాపాడుకుంటోంది. తాజాగా సమాచార హక్కు చట్టం పరిధిలోకి న్యాయవ్యవస్థను తీసుకురావడంతో రానున్న రోజుల్లో జరిగే వివాదాలపై అపుడే న్యాయనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొంగళి పురుగు తన రూపాన్ని మార్చుకొని సీతాకోకచిలుకలా మారే క్రమం ఆసన్నమైందని గుర్తించిన సుప్రీం కోర్టు కొద్ది రోజులుగా తనపై ఉన్న అపవాదులను వదిలించుకునే చర్యలను ఎలాంటి తొందరపాటు లేకుండా చేపట్టింది. అందులోభాగంగానే కీలక కేసుల ప్రత్యక్ష ప్రసారం, ఏ రోజుకారోజు తీర్పుల పాఠాలను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలతో తాజాగా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తనకు తానుగా చేరింది.
నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ముందు ఇపుడు పెను సవాళ్లు ఉన్నాయనేది అందరికీ తెలిసిన అంశమే. కేసుల పరిష్కారం ఒక ప్రధాన సమస్య కాగా, న్యాయమూర్తుల నియమాకాలు, పదోన్నతులు, దేశంలోని ఇతర న్యాయస్థానాలను ఐసీటీ పరిధిలోకి తీసుకురావడం, న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యానికి తావులేని రీతిలో ‘ఫైర్‌వాల్స్’ నిర్మించుకోవడం, చట్టాన్ని న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే అత్యంత ప్రాధాన్యమైన కేసుల్లో ప్రజల మనోభావాలకు అనుగుణంగా స్పందించడం వంటివి అనేవి పెను సవాళ్లే.
జస్టిస్ బాబ్డే 2021 ఏప్రిల్ 23వరకూ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఆ తర్వాత సీజేఐ పీఠం తెలుగువారైన జస్టిస్ ఎన్‌వీ రమణకు దక్కుతుంది. ఆయన 2022 ఆగస్టు 26 వరకూ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. స్వల్పకాలం పాటు జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌కు అవకాశం దక్కనున్నప్పటికీ, ఆ తర్వాత ఎక్కువ కాలం పాటు (2024 నవంబర్ 10 వరకు) జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. చంద్రచూడ్ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నాకు, అనంతరం జస్టిస్ సూర్యాకాంత్‌కు ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కే అవకాశాలున్నాయి. జస్టిస్ సూర్యాకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకూ ఆ హోదాలో కొనసాగుతారు. 2013 ఏప్రిల్ 12 నుండి సుప్రీం న్యాయమూర్తిగా కొనసాగుతున్న బాబ్డే ఎన్నో సంచలన కేసుల్లో భాగస్వామి అయ్యారు. 9 మంది న్యాయమూర్తుల గోప్యత హక్కు కేసుపై తీర్పు వెలువరించిన ధర్మాసనంలో బాబ్డే కూడా ఉన్నారు. ఆధార్ కార్డు లేదనే సాకుతో దేశంలోని పథకాలను, ఇతర ప్రయోజనాలను పౌరులకు నిరాకరించే హక్కు ప్రభుత్వానికి లేదని తీర్పు చెప్పిన ముగ్గురు సభ్యుల ధర్మాసనంలోనూ ఆయన ఉన్నారు. 26 వారాల పిండం కలిగిన మహిళకు గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన కేసులో బాబ్డే ఇచ్చిన తీర్పు పెను సంచలనమైంది. భార త క్రికెట్ కంట్రోల్ బోర్డు పాలనా వ్యవహారాలపై బాబ్డే ఇచ్చిన తీర్పు దిక్సూచిగా చె ప్పవచ్చు. బసవన్నపై వచ్చిన గ్రంథాన్ని నిషేధించడంలో నూ, ఢిల్లీలో కాలుష్యానికి సంబంధించిన కేసులోనూ, అయోధ్య, శబరిమల కేసుల్లో తీర్పులు ఇవ్వడంలో బాబ్డే కీలక భూమికను పోషించారు.
సుప్రీం కోర్టులో వచ్చే ఏడాది జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ దీపక్ గుప్తా పదవీ విరమణ చేస్తారు. పదవీ విరమణ వయసును 68 ఏళ్లకు లేదా 70 ఏళ్లకు పెంచాలని కొత్త ప్రధాన న్యాయమూర్తి కోరుకుంటున్నారు. దీనివల్ల అనుభవం ఉన్న న్యాయమూర్తులను కొనసాగించేందుకు తద్వారా పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించుకోవచ్చన్నది ఆయన భావన. ఇదే జరిగితే సుప్రీంలో న్యాయమూర్తుల రోస్టర్ మారిపోతుంది. ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచకుంటే 2021లో జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ ఇందూ మల్హోత్రా పదవీ విరమణ చేస్తారు. 2022లో 8 మంది, రానున్న మూడేళ్లలో 26 మంది న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ముందు చూపుతోనే సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జీల పదవులను భర్తీ చేయాల్సి ఉంది.
జస్టిస్ గొగోయ్ కంటే ముందున్న ప్రధాన న్యాయమూర్తుల్లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్, జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా, జస్టిస్ ఏ కబీర్, జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ జేఎస్ కేహార్, జస్టిస్ దీపక్ మిశ్రాలు పెండింగ్ కేసుల పరిష్కారంపై ఎంతగానో దృష్టి సారించారు. జస్టిస్ దత్తు తర్వాత అత్యధిక కేసులు పరిష్కరించిన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ రికార్డు సృష్టించారు. ఆ తర్వాతి స్థానాల్లో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ సదాశివం అత్యధిక కేసులను పరిష్కరించారు. అయినా వివిధ కోర్టుల్లో 50 ఏళ్లు దాటిన కేసులు వెయ్యి, పాతికేళ్లు దాటిన కేసులు రెండులక్షలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఎందుకు ఇంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయనే దానికి ఎవరి వద్దా సమాధానం లేదు. ప్రతి వ్యవస్థకూ టైమ్‌లైన్ ఉంటుంది. టైమ్ చార్టర్ ఉంటుంది. బ్యాంకుకు వెళ్తే ఐదు నిమిషాల్లో డీడీ ఇస్తామని, ఐదు నిమిషాల్లో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని, ఐదు నిమిషాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, కొత్త అకౌంట్ ప్రారంభించాలంటే 15 నిమిషాలు పడుతుందని కాలవ్యవధి ఉం టుంది. న్యాయస్థానాలకు కాల వ్యవధి ఏర్పాటు చేసుకోలేదు. ఒక కేసు దాఖలైన తర్వాత దానిని ఎంతకాలంలో పరిష్కరిస్తారనే వ్యవధిని నిర్ణయించుకోలేదు. అలా నిర్ణయించే అధికారం, పరిస్థితి ప్రభుత్వానికి లేదు, పాలనా వ్యవస్థకూ లేదు. చట్టసభలు ఇలాంటి వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటున్నాయి. న్యాయస్థానాలే తమకు తాము జవాబుదారీతనాన్ని నిర్ధారించుకోవల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి కేసుకూ టైమ్‌లైన్ పెట్టుకోవాలి, అపుడు సామాన్యుడు ఆశిస్తున్న న్యాయం సకాలంలో అందే వీలుంటుంది.
ఒక పక్క పాతకేసుల్ని పరిష్కరిస్తున్నా కొత్త కేసులు నమోదుతో గుట్టలా పేరుకుపోతున్నాయి. ఈ సమస్య హైకోర్టుల్లో, జిల్లా కోర్టుల్లో, మెట్రోకోర్టుల్లో మరీ ఎక్కువగా ఉంది. సుప్రీం కోర్టులో 59,867 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ముందు నాలుగు, ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు ఐదు, ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు 47 కేసులున్నాయి. వీటికి అనుబంధంగా మరో 499 కేసులున్నాయి. ఇక హైకోర్టులు, జిల్లా కోర్టులు, కింది స్థాయి కోర్టుల్లో కేసులు గుట్టల్లా పేరుకుపోయాయి. వీటన్నింటినీ పరిష్కరించడానికి, త్వరితగతిన పారదర్శకతంగా జవాబుదారీతనంతో న్యాయాన్ని అందించడానికి కృషి జరగాల్సి ఉంది. రామజన్మభూమి కేసును సుప్రీం పరిష్కరించినా, మరో వర్గం నుంచి ఆ తీర్పుపై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పు చెప్పినా, ఆ అంశంపై దాఖలైన పిటిషన్లను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేశారు. ‘ఆధార్’పై దాఖలైన తాజా పిటిషన్లతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇక న్యాయమూర్తుల నియకామకాలకు ఉద్దేశించిన జ్యుడిషియల్ కమిషన్ ఉనికి ఎటూ తేలలేదు. రాఫెల్ ఒప్పందంపై సుప్రీం తీర్పు చెప్పినా ఆ తీర్పును సమీక్షించాల్సిందేనని రాజకీయ పక్షాలు కోరడమేగాక, రివ్యూ పిటిషన్లకు సిద్ధమయ్యాయి. ఇలా ముగిసిన కేసులే మళ్లీ ఊపిరి తెచ్చుకుని న్యాయస్థానాల్లో మళ్లీ ఊపిరి పోసుకుంటున్నాయి. సుప్రీం కోర్టు గౌరవ ప్రతిష్టల పునరుద్థరణకు కొత్త ప్రధాన న్యాయమూర్తి సత్వర చర్యలు తీసుకోవాలని, లేకుంటే సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్రతకే భంగం కలుగుతుందని జస్టిస్ మదన్ బీ లోకూర్ వ్యాఖ్యానించారు. మతస్వేచ్ఛకు సంబంధించిన కేసులను విచారించినపుడు న్యాయమూర్తులు తమకు వెన్నుముక ఉందని గుర్తుంచుకోవాలని, ఎవరినీ నిష్కారణంగా జైలులో పెట్టరాదని, సీల్డు కవర్‌లో జడ్జీకి సమాచారం ఇచ్చారనో, పూర్తి వివరాలు ఇవ్వడానికి దర్యాప్తు సంస్థలకు సమయం లేదనో, తప్పుడు సమాచారం ఆధారంగానో, ఖైదులో ఉంటేనే వారికి భద్రత ఉంటుందనో ఎవర్నీ జైలులో ఉంచే పరిస్థితులను న్యాయస్థానాలు తీసుకురాకూదని జస్టిస్ లోకూర్ చేసిన వ్యాఖ్యలకు ఇది సరైన సందర్భం. కొన్ని తీర్పుల్లో మరీ పాకినట్టు కాకపోయినా, వంగినట్టు కనిపిస్తున్న న్యాయవ్యవస్థపై సామాన్యుడికి నమ్మకాన్ని ఎలా కల్పించగలుగుతారనేదే ఇపుడు అందరి ముందున్న పెద్ద ప్రశ్న.

-బీవీ ప్రసాద్ 99633 45056