మెయన్ ఫీచర్

ఒప్పందాల్ని కాదంటే పాక్‌కు గుణపాఠమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని విధాలుగా భారత్‌లో అంతర్భాగంగా ఉన్న కశ్మీర్‌పై ‘శే్వతసౌధం అధిపతి’, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ అనుచితం. కశ్మీర్ సమస్యను దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గతంలోనే నిర్ణయించాయి. ఇందులో మూడవ దేశానికి స్థానం లేదు. 1947లో అఖండ భారతదేశం భారత్, పాకిస్తాన్‌లుగా విభజన చెందినప్పటి నుంచి ఇంతవరకు కశ్మీర్‌ను వివాదాస్పదం చేసేందుకు పాక్ చేయని ప్రయత్నం లేదు. అన్ని యుద్ధాల్లో చిత్తుగా ఓడినా పాక్‌కు బుద్ధి రాలేదు. ప్రపంచంలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా కశ్మీర్ ఉండడానికి ఆ దేశ దుష్టపన్నాగాలే కారణం. భారత ఉపఖండం సహా ప్రపంచంలో ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఆజ్యం పోస్తోంది.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక గత మూడేళ్లలో అన్ని వైఫల్యాలే. ఉత్తర కొరియా అధినేత కిమ్‌తో ట్రంప్ రెండు దఫాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మెక్సికో పౌరులు తమ దేశంలోకి రాకుండా అడ్డుగోడ నిర్మించాలన్న ట్రంప్ ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. ట్రంప్ ఉచిత సలహాను దుయ్యబడుతూ మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ రాజ్యసభలో ఘాటైన సమాధానం ఇచ్చారు. ఎవరెన్ని చెప్పినా భారత్, పాక్‌ల మధ్య కశ్మీర్‌పై చర్చలు 1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ డిక్లరేషన్‌కు లోబడి ఉండాలి. సిమ్లా ఒప్పందం 1972 జూలై 2న సిమ్లాలో జరిగింది. తూర్పు పాకిస్తాన్‌లో బెంగాలీయుల తిరుగుబాటుతో తోకముడిచిన పాకిస్తాన్ చర్యల వల్ల బంగ్లాదేశ్ అవతరించింది. ఆ తర్వాత లక్ష మంది పాక్ సైనికులు భారత్‌కు బందీలయ్యారు. భారత్‌తో జరిగిన యుద్ధంలో ఓటమి చెందిన పాకిస్తాన్ తలవంచి సిమ్లాకు చర్చలకు వచ్చింది. ఈ ఒప్పందంపై ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాందీ, పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. తూర్పు పాకిస్తాన్‌లో ప్రజల సంస్కృతి, భాషలను అణచివేయాలన్న దుష్టసంకల్పంతో అనేక దుర్మార్గాలకు పాక్ పాల్పడింది. ఆ పాలనకు చరమగీతం పాడేందుకు బెంగాలీయులు జరిపిన వీరోచిత పోరాటానికి భారత్ బాసటగా నిలిచింది.
సిమ్లా ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య ఉన్న అంశాలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి. ఇరు దేశాలు తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను, రాజకీయ స్వతంత్రతను గౌరవించుకోవాలి. 1971 డిసెంబర్ 17న వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణ జరిగినట్లు తీర్మానం చేశారు. ఇరు దేశాలు ఈ రేఖను మార్చడానికి ప్రయత్నించరాదు. ఎటువంటి పరిస్థితుల్లో లక్ష్మణ రేఖను దాటకుండా చర్చల ద్వారానే అన్ని అంశాలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. కశ్మీర్ ఇరు దేశాలకు మధ్య ద్వైపాక్షిక అంశంలో భాగమని ఒప్పందంలో స్పష్టంగా ఉంది. ఐక్యరాజ్య సమితి ప్రమేయానికి సైతం అవకాశం లేకుండా ఇరుదేశాలు చర్చించుకోవాలని తీర్మానించాయి. అందుకే కశ్మీర్ అంశంలో సిమ్లా ఒప్పందం కీలకమైంది. ఈ ఒప్పందాన్ని అతిక్రమించి పాకిస్తాన్ ఎన్ని వేషాలు వేసినా ఒక అడుగు ముందుకేయలేదు.
భారత్, పాకిస్తాన్‌లు తమ తమ వారసత్వ సంస్కృతి, చరిత్రకు ప్రతిబింబాలు. మతం అనే అంశం కేవలం వెయ్యేళ్ల ఏళ్ల క్రితం వచ్చింది. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఇరుదేశాలకు సంబంధించి ఆణిముత్యాల్లాంటి వ్యాఖ్యలు చేశారు. ‘మనం ఎవరైనా స్నేహితులను మార్చుకోవచ్చు. కాని ఇరుగు పొరుగువారిని మార్చలేం. పొరుగువారు శాశ్వతంగా ఉంటారు. మనకు ఎంతో ఇష్టమైన స్నేహితులు ఎంత దూరంగా ఉన్నా, అన్నీ వదిలిపెట్టి వారి వద్దకు వెళ్లి ఎంతో సేపు గడుపుతాం. ఆందోళనలను తగ్గించుకునేందుకు స్నేహితులతో మాట్లాడుతాం. కాని అవి పరిష్కారం కావు. ఎందుకంటే వారు ఇచ్చే సూచనలు, ఇంటి వద్ద ఉన్న వాస్తవాలకు పొంతన ఉండదు. చివరకు మళ్లీ మనం మన ఇంటికి రాకతప్పదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇరుగుపొరుగు వారితో ఉన్న సమస్యలేమీ పరిష్కారం కావు. ఇల్లు వదిలిపెట్టి ప్రపంచమంతా తిరిగినా ఇంటికి వచ్చే సరికి ఆ సమస్యలు అలాగే ఉంటాయి. అందుకే భారత్, పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారానే అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలి..’ అని వాజపేయి చెప్పారు.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య 1999 సంవత్సరంలో నూతన శకం ప్రారంభానికి నాంది పలికింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం 1999 ఫిబ్రవరి 21న లాహోర్‌లో కుదిరింది. ఇది చారిత్రాత్మకమైన డిక్లరేషన్. ఉభయ దేశాల పార్లమెంట్లు ఈ డిక్లరేషన్‌కు ఆమోదముద్ర వేశా యి. దీనిపై ఆనాటి ప్రధాని వాజపేయి, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంతకం చేశారు. 1998లోనే ఇరు దేశాలు తమ ప్రాంతాల్లో అణ్వస్త్ర ప్రయోగాలు చేశాయి. ఇరు దేశాల వద్ద అణుబాంబులు తయారు చేసే టెక్నాలజీ ఉంది. దీని వల్ల లాహోర్ డిక్లరేషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరుదేశాలు అణ్వస్త్ర ప్రయోగాల విషయంలో సంయమనం పాటించాలని, శాంతితో మెలగాలని తీర్మానించాయి. దౌత్య సంబంధాలు క్షీణించిన దశలో లాహోర్ ఒప్పందం ఇరుదేశాల మధ్య రాకపోకలకు జీవం పోసిందని చెప్పవచ్చు. ఇరుదేశాల మధ్య సంఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉండడం, అణ్వస్త్ర సంపత్తి కలిగి ఉండడం వల్ల ఎంతో జాగ్రత్తగా మెలగాలని, ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని లాహోర్ డిక్లరేషన్ స్పష్టం చేస్తోంది. సిమ్లా ఒప్పందాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారత్, పాకిస్తాన్‌లో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని లాహోర్ డిక్లరేషన్ ఆదేశిస్తోంది. అర్థవంతమైన చర్చల ద్వారానే ఇరు దేశాలు అడుగు వేయాలని తీర్మానించాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు జరపాలని, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా భారత ఉపఖండంలో శాంతి వెల్లివిరిసేందుకు పాటుపడాలని తీర్మానించాయి. నిరంతర చర్చల ద్వారానే అన్ని అంశాలకు పరిష్కార మార్గం సాధించాలని డిక్లరేషన్‌లో తీర్మానించాయి.
దేశ విభజన తర్వాత పాకిస్తాన్ కశ్మీర్ విషయంలో తప్పటడుగులు వేస్తోంది. చారిత్రక సత్యాలను దాచిపెట్టి ఏటికి ఎదురీదుతోంది. మహోన్నత సంస్కృతి, నాగరికత విలసిల్లిన భారత ఉపఖండంలో భాగమైన పాకిస్తాన్ పాలకులు మతం ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడం, ఆ దిశగా అడుగులు వేస్తూ తమ గోతిని తామే తవ్వుకుని కష్టాల్లో చిక్కుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వద్దకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెళ్లడం కొత్త కాదు. గతంలో పాక్ పాలకులు చాలా మంది అమెరికా అధిపతుల వద్దకు వెళ్లి సాగిలపడినవారే. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అమెరికాకు పాదాభివందనం చేయడం, కశ్మీర్ సమస్యను ప్రస్తావించడం, వారు ఇచ్చే నిధులు తెచ్చుకోవడం పాక్‌కు అలవాటు. దీనివల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకిగా మారింది. 1990 దశకంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లను అమెరికా ప్రోత్సహించి చివరకు వారి చేతిలోనే దారుణంగా దెబ్బతింది. అన్ని దేశాల్లో ఉగ్రవాదం పెను సవాలుగా మారింది. ఈ పరిస్థితులు కాస్త చక్కబడే సరికి మళ్లీ అమెరికా ప్రపంచ దేశాలపై తన పెత్తనాన్ని కొనసాగించేందుకు తయారవుతోంది.
అత్యంత భీతిని కొల్పే ఉగ్రవాద సంఘటనలు మూడున్నాయి. 1972లో మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో ఊచకోతలు, 2001లో సెప్టెంబర్ 11న అమెరికా నగరాలపై వైమానిక దాడులు, 2008 నవంబర్ 26న ముంబయిపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేసిన ఘటనలు ప్రపంచ నాగరికత చరిత్రలో మాయనిమచ్చలు. ఉగ్రవాదంపై అధ్యయనం చేయాలంటే మూలాల్లోకి వెళ్లాలి. ఈరోజు భారత్, పాక్‌ల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగాల్సిన అవసరం ఉందా? ఇరుదేశాలూ లక్షలకోట్ల రూపాయలను రక్షణ రంగానికి ఖర్చుపెడుతున్నాయి. పాకిస్తాన్ సమాజంలో మత ఛాందసవాదం గతంతో పోల్చితే తగ్గుతోంది. మీడియాలో వచ్చే కథనాలు చూసి ఒక నిర్ణయానికి రాకూడదు. పాకిస్తాన్ సమాజంలో గత 70 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. పాత అలవాట్లు ఒక పట్టాన పోవు.
కశ్మీర్‌పై మాట్లాడకపోతే రాజకీయంగా తమ ఉనికిని కోల్పోవాల్సి వస్తుందనే భయం పాక్ పాలకులను నిత్యం వెంటాడుతోంది. ఐక్యరాజ్యసమితి సమావేశాలు, అంతర్జాతీయ వేదికలు, అగ్రరాజ్యాధినేతలను కలుసుకున్నప్పుడల్లా ‘కశ్మీర్’ పల్లవిని అందుకుని నిధులు తెచ్చుకోవడం పాక్‌కు నిత్యకృత్యమైంది. భారత్ అభివృద్ధిని చూసి ఓర్వలేని దేశాలు అంతర్లీనంగా పాకిస్తాన్‌కు సహకరిస్తున్నాయనేది వాస్తవం.
సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్‌ను అతిక్రమించి కశ్మీర్ విషయంపై పాక్ ఎంత రాద్ధాంతం చేసినా కంఠశోషే! ప్రధాని మోదీ కశ్మీర్ అంశానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేయాలి. 370వ అధికరణ రద్దుపై బలమైన సంకల్పంతో నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. పాక్ పాలకుల మెడలు వంచే శక్తి భారత్‌కు ఉంది. పుల్వామా దాడి ఘటనకు దీటుగా మన జవాన్లు జరిపిన సర్జికల్ దాడులతో పాకిస్తాన్ కుదేలైంది. కశ్మీర్‌పై పాక్ దుస్సాహసానికి దిగితే- తగిన గుణపాఠం చెప్పేందుకు మోదీ సర్కార్ తగిన ప్రణాళికను ఖరారు చేసే సమయం ఆసన్నమైంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097