మెయన్ ఫీచర్

అవినీతిపై కెసిఆర్ యుద్ధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి అంశాలను క్రమంగా ఒక కొలిక్కి తీసుకొస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, అవినీతిని కూడా పూర్తిగా నియంత్రించనున్నారా? ఆ ప్రసక్తి ఆయన నోటివెంట ఇటీవలి వారాలలోనే రెండుసార్లు వచ్చింది. నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, ‘‘రాజకీయ అవినీతిని నూటికి నూరు శాతం’’ అరికట్టామని ప్రకటించారు. ఆ మాటను ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. తర్వాత ఐటి పాలసీ ఆవిష్కరణ సందర్భంగా దేశవిదేశాలకు చెందిన వందలాది మంది ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్న కార్యక్రమంలో ప్రసంగిస్తూ, టిఎస్-ఐపాస్ కింద ఇప్పటికి వందలాది పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని, వాటిలో ఎక్కడా అవినీతి చోటుచేసుకోలేదన్నారు. ఈ మాట కూడా ఒకటికి రెండుసార్లన్నారు. దాన్ని బట్టి రాజకీయ అవినీతి, ఉన్నత స్థాయిలో బురాక్రటిక్ అవినీతి నిలచిపోవడమన్నమాట. ఈ మాటలు ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలోగానే ఆత్మవిశ్వాసంతో ప్రకటించడగలగడం ఎవరికైనా సాధారణ విషయం కాదు.
గమనించదగినదేమంటే, ఈ ప్రకటనను ఇతరులు కాదుగదా, ప్రతిపక్షాలు, ప్రభుత్వ వ్యతిరేక మీడియా కూడా కొట్టివేయలేకపోతున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ల్లో ‘కుంభకోణా’లంటూ కాంగ్రెస్ వాదులు, కమ్యూనిస్టులు మాట్లాడుతుండటం నిజం. కాని, అందుకు ఏమాత్రం ఆధారాలున్నా చూపాలని, అవి నిజమైతే తాము పదవులకు రాజీనామా చేయగలమని ప్రభుత్వ పక్షం నుంచి ఎదురవుతున్న సవాళ్లకు వారిలో ఇంతవరకు ఒక్కరైనా, ఒక్కసారైనా స్పందించినట్లు లేరు. ఇతరత్రా కూడా వారు అసెంబ్లీలో గాని, బయట గాని ఇంతవరకు నిర్దిష్టంగా వెలుగులోకి తెచ్చింది శూన్యం. దాన్ని బట్టి, నిజమైనా కాకున్నా అవినీతి అంటూ మాట్లాడటం ప్రతిపక్షాల ధర్మమని వారు భావిస్తున్నారనుకోవాలి. ఆ మేరకు తమకు ఆత్మసంతృప్తి కలుగుతుండవచ్చుగాని, ఆ మాటలు వినే ప్రజల్లో విశ్వసనీతయ ఏమిటి? తెలంగాణ ప్రతిపక్షాలు, అనేక విధాలుగా ప్రజల దృష్టిలో విశ్వసనీయతా లేమితో బాధపడుతున్నాయి. ఆ స్థితి ఏ స్థాయికి చేరినట్లు కనిపిస్తున్నదంటే, రేపు ఎప్పుడైనా నిజంగా అవినీతి జరిగి, అందుకు ఆధారాలను వారు బయటపెట్టినా ప్రజలు నమ్మగలరా అనిపిస్తున్నది. ఇటువంటి పాఠాన్ని వారు, నెలలు గడిచిపోయి రెండేళ్లకు వస్తున్నా గ్రహించలేకపోవడం వారికే చేటు తెస్తున్నది. ఈ ధోరణిని మరొక రెండు అంశాలు ధ్రువపరుస్తున్నాయి.
కుంభకోణాలు అని పైకి అంటున్న వారితో జనాంతికంగా మాట్లాడినపుడు, అదేమీ లేదని స్వయంగా అంగీకరిస్తున్నారు. కొన్ని పథకాలు అమలు మాట అట్లుంచి ఇంకా ఆలోచన దశలో ఉండగానే కుంభకోణం అన్నారు గదా అదెట్లా సాధ్యమనే ప్రశ్నకు కూడా వారినుంచి చిరునవ్వు మినహా సమాధానాలుండటం లేదు. ఇది ఒకటి కాగా, కొత్త ప్రభుత్వం తమ గతకాలపు అవినీతిని ఎక్కడ వెలికి తీయగలదోనన్న భయం వారిని వెన్నాడుతున్నది. వాస్తనికి ఇంకా పూర్తిగా కాకున్నా తగినంత అవినీతి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చివుంది. లేని ఒప్పందాలు, లేని ప్రాజెక్టులకోసం కాలువల తవ్వకం కాంట్రాక్టులు వేలరూపాలతో కూడిన ఒక కుంభకోణం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరొకటి. ఏళ్ల తరబడి సాగిన రేషన్ బియ్యంది ఇంకొకటి. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఈ వివరాలు బయటపెడితే కాంగ్రెస్ వారు చాలామంది జైలుకు పోతారని కొందరు మంత్రులు ఇప్పటికే వ్యాఖ్యానించారు. ఆ హెచ్చరికలకు కాంగ్రెస్ వారు వౌనం వహించారు తప్ప, విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని ఎందువల్లనో ప్రకటించలేకపోయారు. ఈ రెండింటి మధ్య సాధారణంగా జనాభిప్రాయం ఏమై ఉం టుందో వేరే చెప్పనక్కరలేదు. వారి దృష్టిలో కాంగ్రెస్, టిడిపిలు నీతి అవినీతులు అంతటివి. టిడిపి పాలన 2004లో ముగిసి పుష్కర కాలమైనందున అంతగా జ్ఞాపకాలలో లేదుకాని, గుర్తు చేసుకుని మాట్లాడవలసి వస్తే మాత్రం ఆ అనుభవాలు భిన్నమైనవి కావు. తర్వాత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి మరింత పెచ్చరిల్లింది. ఇది ప్రజలకు తాజా జ్ఞాపకం. ఈ జ్ఞాపకాలు ప్రజలకున్నాయని, అందువల్ల తమ విశ్వసనీయత తక్కువని ఆ పార్టీ నాయకులకు తెలుసు. ప్రస్తుతం తాము గట్టిగా మాట్లాడలేకపోవడానికి అదొక కారణం. పైగా మాట్లాడేందుకు వారికి నిర్దిష్టంగా ఆధారాలతో ఏమీ కనిపిస్తున్నట్టు లేదు.
అయితే ఒకటి చెప్పుకోవాలి. అవినీతి జరగకుండా నిఘావేసి ఉండటం ప్రతిపక్షాల బాధ్యత. తమ గత రికార్డు నిజమైనా, కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు రాజకీయ అవినీతి, ఉన్నతస్థాయి బురాక్రటిక్ అవినీతి లేకపోయినా, భవిష్యత్తుకు సంబంధించి వారు వేయి కళ్లతో కనిపెట్టి ఉండవలసిందే. లేనట్లయితే అది మరొక వైఫల్యం అవుతుంది. అవినీతిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి ఎంత పట్టుదలగా ఉన్నా, మంత్రుల నుంచి మొదలుకొని అందరూ అంతే నిష్ఠతో ఎల్లప్పుడూ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. పదవులలో లేని నాయకుల విషయం అంతే. అదేవిధంగా ఉన్నతస్థాయి బురాక్రాట్లు. కనుక ప్రతిపక్షాలు తమ విధిలో తాము ఉండవలసిందే. కాకపోతే విశ్వసనీయమైన విధంగా.
ఇంతవరకు చెప్పుకున్నది రాజకీయ అవినీతి, ఉన్నత స్థాయి బురాక్రటిక్ అవినీతి గురించి. కాని అవినీతి అన్నది ఇంతకు పరిమితమైంది కాదు. అది చాల విస్తృతమైంది. కింది స్థాయలో మూల మూలలకు విస్తరించి సామాన్యుడిని వేధిస్తుంది, పీడిస్తుంది. ఇది ఎంతవరకు అదుపులోకి వస్తున్నదనే దానిని బట్టి సామాన్యుడికి అవీనీతి గురించి ప్రత్యక్షానుభవం కలుగుతుంది. రాష్ట్రంలో అవినీతి ఉందా లేదా అనేందుకు వారికి గల గీటు రాయి అదే. రాజకీయంగా, ఉన్నతస్థాయి బురాక్రసీలో, కాంట్రాక్టర్ల స్థాయిలో ఇంతకాలం అవినీతి ఉన్నట్లు వారికి తెలుసు. అందువల్ల కలిగే హాని గురించి స్థూలమైన అభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ అది వారికి పరోక్షంగా హాని చేసేది. తమ దైనందిన జీవితాలతో నిమిత్తం లేని సుదూర విషయం. అటువంటి అవినీతి నిర్మూలనమైతే వారు తప్పక సంతోషిస్తారు. కాని నిజమైన ఆనందం కలిగేది కిందిస్థాయి అవినీతి అదుపులోకి వచ్చినప్పుడు. తమకది రోజువారీ పీడ కనుక. అదే కారణంగా వారిపై ఆర్థిక భారం పడటంతోపాటు కిందివారు పనులు చేయకుండా వేధిస్తుంటారు. కనుక కావలసింది ఈ నియంత్రణ. ఇందుకు సంబంధించిన చర్యలు కెసిఆర్‌కు తదుపరి లక్ష్యమవుతాయా?
మనం వింటున్న దానిని బట్టి ఆయనకు దీనిపై ఒక స్పష్టమైన దృక్పధం ఉంది. అవినీతి అన్ని స్థాయిల్లో అదుపు కావలసిందే. కాని అందుకోసం మొదట కింది స్థాయికన్న పై స్థాయిపై దృష్టి పెట్టాలి. ఆ పని చేసినట్లయితే కింది వారికి సిగ్నల్స్ వెళతాయి. ఆ ప్రభావం వారితో కొంత వెరపును కల్పిస్తుంది. తర్వాత కిందిస్థాయిపై దృష్టి పెట్టినట్లయితే ప్రభుత్వానికి కొంత నైతిక బలం కూడా వచ్చి ఉంటుంది. అటువంటి నైతికతను ముందు సమకూర్చుకోనట్లయితే, ‘‘పెద్దవాళ్లు తినడం లేదా?’’ అనే ఎదురు వాదన కిందివారినుంచి వస్తుంది. అందుకు సమాధానం చెప్పడం సాధ్యం కాదు. కనుక ముందు తిమింగలాలను అరికట్టి, సిగ్నల్స్ పంపి, తర్వాత కిందిస్థాయి అవినీతిని అరికట్టడం కెసిఆర్ ఆలోచన అయినట్లు మనం వింటున్నాము.
ఈ 22 మాసాలలో కిందిస్థాయిలో జరిగిందేమిటి? సిగ్నల్స్ ఎంతవరకు వెళ్లాయి? ముఖ్యమంత్రి అంచనాలకు తగినట్లు, ప్రజలు కోరుకున్న విధంగా ఎంతవరకు జరిగిందో చెప్పలేము గాని, సిగ్నల్స్ వెళ్లడమంటూ మాత్రం మొదలైనట్లు కనిపిస్తున్నది. కాకపోతే ఇప్పటికింగా అది చాలా పరిమితంగా ఉంది. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో, పలు శాఖలతో తమకిపుడు లంచాలు ఇవ్వకుండా పనులు జరుగుతున్నట్లు చెప్పేవారు అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఆ మాట ఆశ్చర్యపోతూ చెబుతున్నారు. అదే సమయంలో పాత పరిస్థితి ఏమీ మారలేదనే నిస్పృహ కూడా బాగానే కనిపిస్తున్నది. అవినీతి నిరోధక శాఖకు ఉద్యోగులు తరచు పట్టుపడటం తగ్గలేదు. పట్టుపడే వారిలో సాధారణ ఉద్యోగులకు పై అధికారాలు తీసిపోవడం లేదు. జిల్లాలలోనూ ఈవిధంగానే ఉంది. అనగా సిగ్నల్స్ ఇంకా పోవలసినంతగా పోవడం లేదనుకోవాలి. లేదా ఏమీ కాదు లెమ్మన్న గత కాలపు బేసికల్ ధోరణి కొనసాగుతున్నదన్నమాట. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. ఎసిబి వారు పట్టుకుంటున్నారు, ఆ రోజున వార్తలు, ఒక్కోసారి ఫోటోలు వస్తున్నాయి గాని, తర్వాత ఎమవుతున్నదీ తెలియడం లేదు. కేసులు పెట్టారా లేదా అవి ఏమవుతున్నాయి, పట్టుబడినవారు పైరవీలు చేసి తిరిగి ఉద్యోగాలలోకి రావడం వెనుకటివలెనే జరుగుతున్నదా వంటివేమీ ప్రజలకు తెలియవు. ఇటువంటి కేసులకు ఫాస్ట్ ట్రాక్ విచారణ సాధ్యమయ్యేదీ లేనిదీ తెలియదు. ఇటువంటి వివరాలతో ఎసిబి వారు కనీసం మూడు మాసాలకోసారి అన్ని కేసుల వివరాలతో స్టేటస్ రిపోర్టులు విడుదల చేయడం వల్ల విషయం ప్రజలకు తెలియడంతోపాటు కిందిస్థాయి ఉద్యోగులపై ప్రభావం ఉండవచ్చు.
కిందిస్థాయిలో జరుగుతున్నదేమిటో ముఖ్యమంత్రికి మొదటి నుంచీ తెలుసు. అందుకే ఉన్నతస్థాయి అవినీతిని ముందుగా అరికట్టాలనే వ్యూహాన్ని అమలు పరుస్తూనే, సరీగ్గా ఏడాది క్రితం వరంగల్‌లో మూడు రోజులు బస చేసి మురికివాడల్లో పర్యటించిన సందర్భంగా, ‘‘ఎవరన్నా లంచమడిగతే తోలు తీస్తా’’ నని ఆగ్రహంగా హెచ్చరించారు. అవినీతి ఫిర్యాదులకు తమ కార్యాలయంలో ప్రత్యేక నెంబర్లు కేటాయించారు. ఆ స్ఫూర్తితో ఎసిబి ఎంత పనిచేస్తున్నదో తెలియడం లేదు. ఉద్యోగులకు సిగ్నల్స్ ఎంత పోయాయో కూడా అర్థం కావడం లేదు. ఏడాది తర్వాత అదే వరంగల్‌లో మంత్రి కెటిఆర్, ‘‘లంచమడిగితే చెప్పుతో కొట్టండి’’ అని మరింత తీవ్రంగా హెచ్చరించవలసి వచ్చింది. అంతకు ముందు అదే వరంగల్‌లోనే ఒక ఉద్యోగి తెలంగాణ అమరవీరుని కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం నుంచి లంచం తీసుకునే సిగ్గుమాలిన దుస్సాహసం చేసి యావత్ తెలంగాణను తలవంచుకునేట్లు చేశాడు. ఉన్నతస్థాయి అవినీతి 100 శాతం ఆగినందున కెసిఆర్ ఇక కిందిస్థాయిపై దృష్టి పెట్టడం అవసరం.

- Tankasala ashok (cell : 9848191767)