సబ్ ఫీచర్

మహాకవుల స్మారకాలను రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వం మహా కవులైన పాల్కురి సోమన, బమ్మెర పోతన జన్మస్థలాలను అభివృద్ధి పరచాలని నిర్ణయించడం అభినందనీయం. ప్రాశ్చా త్య దేశాలలో ఆయా దేశాల చారిత్రక, సాంస్కృతిక రంగాలను మలుపుతిప్పిన మహాపురుషుల స్మారక స్థలాలను భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా అభివృద్ధిపరిచారు. అంతేకాదు. వారు ఆ స్థలాలను పవిత్రంగా భావిస్తారు. కాగా మన దేశంలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర, సంస్కృతులు వున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇక్కడి సంస్కృతి ప్రతిబింబిస్తుంది. కొంతకాలం ఇక్కడ రాచరిక వ్యవస్థ కొనసాగినా దాన్నిబద్దలుకొడుతూ అదే స్థాయిలో ప్రజలు ప్రతిఘటించి తమ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. చరిత్ర, సంస్కృతులు జాతికి ఒక్క రోజులో నేర్పితేనో, నేర్చుకుంటేనో వచ్చేవి కావు. అవి ఒంట్లో రక్తకణాల్లా ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తాయి. అలా తెలంగాణ ప్రజా సంస్కృతికి నాంది పలికిన యుగకర్తలు సోమన, పోతన. సమైక్య రాష్ట్రంలో ఇక్కడి కవులకు కళాకారులకు సముచిత స్థానం దక్కలేదన్నది చారిత్రక వాస్తవం. రెండవది తమ ప్రతిభ, పాటవాల పట్ల మన సాహితీవేత్తలకు వున్న ఉదాసీనత కూడా మరో కారణం. ప్రచార ఆర్భాటాలకు పోకపోవటం, ప్రసార సాధనాలకు ఎక్కకపోవడమే దీని ప్రత్యేకత అనుకుంటాను.
ఈ నేపథ్యంలో తెలుగు భాషా, సంస్కృతులకు ఒక కొత్త చూపును, రూపును కలిగించిన సోమన, పోతనలు తెలంగాణ తత్త్వాన్ని తీర్చిదిద్దిన యుగ పురుషులు. ఎక్కడో కన్నడ ప్రాంతంలో వ్యాపించిన వీరశైవాన్ని ఆలంబనగా చేసుకొని నన్నయ నుండి సంప్రదాయబద్ధంగా వస్తున్న మార్గ కవితని కాదని దేశీ కవిత్వానికి పట్టం కట్టిన ప్రజాకవి పాల్కుర్కి సోమనాథుడు. కుల, మత, ప్రాంత, లింగ వివక్షతలకు అతీతంగా సాహిత్య సృజన కావించి సామాజిక వర్గాలకు ముఖ్యంగా అట్టడుగు, బడుగు బలహీనవర్గాలకు సాహిత్య స్థాయిని, స్థానాన్ని కల్పంచిన వైతాళికుడు సోమనాథుడు. సోమన, పోతనలకు మధ్య 200 సంవత్సరాల అంతరం వున్నప్పటికినీ భావజాలంలో మాత్రం అదే గుణాత్మకమైన మార్పు సాగడం విశేషం. సింగ భూపాలుని ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని రాజరిక వ్యవస్థను నిరసిస్తూ, ‘‘ఇ మనుజేశ్వరాధముల్’’, ‘‘్ధనమధాందుల కొలువేల తాపసులకు’’ అనటం పోతనకే చెల్లింది. నన్నయ ఇత్యాది కవులు రాజస్థానాలలో వుంటే సోమన, పోతనలు ప్రజాస్థానంలో నిలిచారు. అదే వీరి ప్రత్యేకత. వందల ఏళ్ళ క్రితమే ఇంతటి మహత్తరమైన భావజాలాన్ని తమ సాహిత్యం ద్వారా ప్రజలకు అందించిన మహాకవులను వారి జన్మస్థలాలను విస్మరించి వారి జయంతులను తూతూ మంత్రంగా ఇంతవరకు పట్టణాలలోనే జరిపారు. 1994లో ఆనాడు తెలుగు యూనివర్సిటీకి ఉపాధ్యాయులుగా దివంగత ఆచార్య పేర్వారం జగన్నాథం వ్యక్తిగతంగా చొరవ తీసుకొని పాలకుర్తిలో రెండురోజులపాటు సోమనాథుని అర్థ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు.
మహాకవుల జన్మస్థలాలైన పాలకుర్తి, బమ్మెరలను చూడాలని ఎంతోమంది రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి సాహితీప్రియులు, పరిశోధకులు, ధార్మికులు వచ్చి ఆ గ్రామాల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులను చూసి చలించి పోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభు త్వం వాటి అభివృద్ధి దిశగా ముందడుగు వేయడం హర్షణీయం. ప్రధానంగా ఈ కర్తవ్యాన్ని పూర్తిచేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారిపై కెసిఆర్ ఈ బాధ్యత మోపారు. సాహిత్య సాంస్కృతిక రంగాలంటే నిత్యం తపించే రమణాచారి కృషితో సోమన, పోతన నడయాడిన ప్రదేశాలు గొప్ప సాహిత్య సాంస్కృతిక కేంద్రాలుగా మారుతాయి. పవిత్ర స్థలాలను పర్యాటక కేంద్రాలుగా మార్చడంకన్నా వాటిని పరిశోధన కేంద్రాలుగా మార్చడం మంచిది. భాషా, సంస్కృతుల పరిరక్షణకు, పరిశోధనకు అవి నెలవులు కావాలి. తెలంగాణ భాషా, చరిత్ర, సంస్కృతులు ప్రతిబింబేలా అక్కడ ఒక మ్యూజియంను ఏర్పాటుచేయాలి. నాటినుంచి నేటివరకు వచ్చిన సాహిత్యాన్ని అక్కడ గ్రంథాలయం ఏర్పాటుచేసి అందులో భద్రపరచాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో మరుగున పడిపోయిన మన కళారూపాలను వెలికి తీసేందుకు అధ్యయన కేంద్రాలతోపాటు, ఆడిటోరియాన్ని నిర్మించాలి. ఆ గ్రామాల్లో మహాకవుల స్మారకాలను పరిరక్షించాలి. కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించిన నేపథ్యంలో ఇక్కడి కవుల రచనల్లోని విశేషాలను విశే్లషించాలి. పాలకుర్తి బమ్మెరలను సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అప్పుడే మన భాషను, సంస్కృతిని సంరక్షించిన వారమవుతాం.
కడియం శ్రీహరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ కల్చరల్ హెరిటేజ్‌ను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశిం చడం అభినందనీయం. లండన్ పక్కనే ఉన్న షేక్స్‌ఫియర్ పుట్టిన స్థలాన్ని పుణ్యస్థలంగా చూస్తారు. చైనాలో, అనేక లాటిన్ అమెరికన్ దేశాలలో కవులను కల్చరల్ అంబాసిడర్‌లుగా చూస్తారు. మా వూరు పక్కనే బమ్మెర ఉంటుంది కాబట్టి ఆనాటి మండలి చైర్మన్ చక్రపాణిని బమ్మెర తీసుకుపోయాను. బమ్మెర పోతన సమాధి దగ్గరకు కాలిబాటన నడుచుకుంటూ పోయాం. ఆ మట్టిని చక్రపాణి తన సంచిలో వేసుకుని గర్వంగా వెళ్లాడు. ఇతర దేశాలలో మహాకవుల సమాధులను గొప్పగా చూసుకుంటారు. సత్కారాలకు కూడా ఆర్థిక వ్యవస్థ దోహదం చేస్తుంది. తెలంగాణ ప్రజలు ఇక్కడి కవులను తమ గుండెల్లో దాచుకున్నారు. ఇప్పటికీ ఆ వూరిలోని బావిని పోతన బావి అని ప్రజలు పిలుచుకుంటారు. ఆ ప్రజల నోటినుంచి వచ్చే ఆ మాటే అతనికిచ్చే సన్మానం. పాల్కురికి సోమనాథుడు రాసిన కావ్యం తాను నివసించే గుట్టకు, ప్రకృతికే అంకితమిచ్చారు. అందుకే ఇపుడది పాలకుర్తి సోమనాథుని గుట్ట అయ్యింది. వాల్మీకి కావ్యం అంకితమిచ్చింది వల్మిడికి అంటారు. బమ్మెర పోతన పుట్టిన ప్రదేశాన్ని టూరిజం సెంటర్‌గానే కాకుండా కల్చరల్ సెంటర్‌గా మార్చిండి. అక్కడ ఒక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాలి.

- చుక్కా రామయ్య