మెయిన్ ఫీచర్

వడి వడి రాతలు.. సృజనకు బీటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏది తేలిక మార్గమో దాన్ని ఎంచుకుని తద్వారా తరించటానికి ఏర్పరచుకున్న అనైతిక నేపథ్యాన్ని అనివార్య ప్రయోజకత్వంగా విశే్లషించుకుని బ్రతుకు సాగించటం స్వేచ్ఛా నాగరికత యొక్క వౌలిక స్వభావం. ముఖ్యంగా ఇది సాహిత్యంలోకి చొరబడ్డది. వావి, వరుస తర్కం ముందు తల వొంచుకు నిలబడ్డాయి. కోరుకున్నది పొందగలిగిన వయసు ఈ స్వేచ్ఛా ప్రవృత్తిని సామాజిక స్పృహే అంటుంది. దీనికి ప్రమాణం తమ జీవన విధాన సరళేనని ఢంకా బజాయిస్తుంది.
రచయితకు నీతి, ధైర్యము ఉండాలన్నది అభిజ్ఞుల అభిప్రాయం. ఎవరైతే అనైతిక నేపథ్యాన్ని అనివార్య ప్రయోజకత్వంగా భావించుకుంటున్నారో వారంతా వారి అనైతికతను అభ్యుదయ నీతిగా, వారి బరితెగింపును చేతో ధైర్యంగా బహిర్గతం చేసుకుంటూనే వుంటున్నారు. దీనికి తలపండిన తర్కజ్ఞానం అవసరం లేదు; ఆ చుట్టరికానికి చట్టాల సమర్థింపు అంతకన్నా అక్కరలేదు. అదో కసిమిరి. ‘రాత’ గుణమే వీరి మనస్సు శరీరాలను పెనవేసుక్కూర్చుంటుంది. అక్షరంగా ఆవిష్కరించబడుతుంది. ఆపైన ఏదో అవార్డుకోసం గాత్రాన్నొప్పరగించి ఘనతకెక్కుతారు. బహుమానాలు కదా. ప్రతిక్రియాకల్పంగానే వుంటాయి. అర్థమూ అధికారము- సంగతానందము పరమార్థాలుగా భావించి (పరిగణించి) అంతకంటె మనం సాధించవలసివేవీ లేవనుకుంటూ వాటికోసమే అర్రులు చాస్తూ అవి లభించగానే పరమార్థం ఫలించినట్లు భావిస్తూ ఒక సంకుచిత మార్గంలో పోతున్న వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే వుంది. ‘యశసే అర్ధకృతే’ గదా. అక్షరం ఏమిటి? అనుభవం ఏమిటి? అర్థం ఏమిటి? అధికారం ఏమిటి? కవి కంఠాన్ని కౌగిలించుకున్న హేతువేమిటి? ఆ ఆలింగనోద్భవం ఏమి సాధించింది? ఏమి సాధిస్తోంది? ఈ కల్పనోద్దిష్ట కావ్యజుష్టాన్ని ఎవరారగిస్తున్నారు? వీటిని ఆత్మ విమర్శ వైపు మళ్లించటం లేదని స్పష్టవౌతూనే వున్నది. ఈ హ్రస్వ దృష్టిని తొలగించుకుంటేనే వారికి సత్యదర్శనం అవుతుంది.
అధికార రోగపూరిత బధిరాంతక చక్రవర్తులు- ధనైక లోభులు మత్సరగ్రస్తులు-నికృష్ట దుష్టజాడ్య పీడితులు-జాంతవ లక్షణ లక్ష్య భావుకమ్మన్యులు, వీరంతా దురదృష్టవశాత్తు అక్షరాస్యులైతే-అయ్యా మీకు నీలాకాశ నిభృతజ్యోత్స్నాతపత్ర పఠనం అసమాన ఔషధంగా పనిచేస్తుంది. నక్షత్రావలోకనం నవజీవనాన్ని ప్రసాదిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాపంచిక కోలాహలంలో పెంటో- బురదో పూసుకుని ఇంటికి వచ్చి నిర్మలాకాశం క్రింద పడుకుని సాలబాటలో కాసేపు పచార్లు చేస్తే బయట పూసుకొచ్చిన అమేధ్యజంబాల పటలం వదలిపోయి నిర్మల మనస్కులవుతారు. ఈ అనంత విశ్వంలో తమ స్థానం ఏమిటో తెలుసుకుని, ఏది అల్పం-ఏది అనల్పం ఏది తుచ్ఛం-ఏది స్వచ్ఛం-ఏది ఖాదం-ఏది గాదం అనే సత్యదృష్టి అవతరిస్తుంది. జీవితంలో దేనికెంత విలువనివ్వాలి అనే సమ్యజ్ఞానముదయిస్తుంది. ఇట్లా విశ్వసూత్రాలను విదితం చేసుకోవటంతో దక్పథము-జీవితము-సర్వస్వము మారిపోయి ఇంద్రియ పరిమిత బాధా బంధురమైన శారీరక పంజరం నుంచే ఒకానొక ఆత్మ విముక్తి లాంటి అనుభవాన్ని- తదనుభూతిని పొందగలరు. అప్పటిదాకా వీరి అక్షరాలు పబ్లీకు ‘రాత’లే.
అధర్మానికి రూపాంతరమైన వర్తమాన సామాజిక వ్యవస్థని అధిగమించలేకపోతున్న సామాన్య మానవుడ్ని ఒడ్డును పడేసే కార్యక్రమంగా-అదే అధర్మాన్ని ఆచరించమని తన తత్త్వాన్ని అక్షరబద్ధం చేస్తున్నాడు రచయిత. ఇప్పట్టున రచయిత కుహనాగుణాన్ని అభ్యుదయాదర్శంగా అభివర్ణించి ఆచరణకు ఆదేశిస్తున్నాడు. పెఱగాయసద్దులు పల్లఱుపులు మెట్లుగా తర్కశిఖరాన్న ధిరోహిస్తున్నాడు. ఎంత త్వరగా ఈ వికృతపు చేష్టల్ని మానుకుంటే అంత త్వరగానూ కవితారంగం శుభ్రవౌతుంది. బాధల్ని పట్టుకుని రంగప్రవేశం చేసేవరకు కవులంతా ఒకటే లేక సమానులే. ఇక అక్కడినుంచి కవి అనుభూతి సాంద్రతననుసరించీ, కవితాశక్తిననుసరించీ, పాండిత్యాన్ననుసరించి అభివ్యక్తి పారమ్యాననుసరించి, పదాల పోహళింపుననుసరించీ తారతమ్యాలు ఏర్పడుతాయి. కాదనుకుంటేనే కవి ‘రాత’ల వెంటబడతాడు. పై తెలిపిన విశే్లషణల నుంచే పాఠకుడూ పుడతాడు. దస్తూరి భేదాలు (లింగభేదాలు)తప్ప ‘రాత’లొకటేనని పాఠకుడు గ్రహించాలి. ఎందుచేతనంటే తమకు వాస్తవంగా తెలియని విషయాన్ని నమ్మి చెప్పే మూఢనమ్మకం వున్నవాళ్ళు ఈ ‘రాత’గాళ్ళు మెయిన్ స్ప్రింగులేని గడియారంలాంటివారు. ‘రాత’గాళ్ళు నిర్భయంగా ఏదీ చెప్పలేరు. వికృత నాదమో- వితండ వాదమో ధైర్యం అనుకునేరు..? కాదు. తలకి రోకలి చుట్టుకున్న మేధావులు -బుద్ధిమంతులు. వీరికి నినాదం పరమ ప్రసాదం. అంతా భౌతికయాతనే. వీరు నాదాన్ని ఆశ్రయించలేదు. కవికి బైట ప్రపంచం ఎంత వుందో -లోపలి ప్రపంచం కూడా అంతే వుండాలి. కవి ఈ రెండు ప్రపంచాల్ని మోయాలి. మొదట్లో చెప్పినట్లు బాధల్ని పట్టుకుని రంగ ప్రవేశం చేసే వరకు అందరు కవులూ సమానమే. ఇక అక్కడనుంచీ కవి అనుభూతి సాంద్రత ననుసరించి, కవితా శక్తిననుసరించి, పాండిత్యాన్ననుసరించి, ప్రతిభననుసరించి తారతమ్యాలు ఏర్పడుతాయి. అంతేకానీ కవిత్వము (రాత)యొక్క గుణ దోషముల విచారణ (ఈ దేశంలో) కులమును బట్టి. ఆచారములను బట్టి మతమును బట్టి అధికారమును బట్టి ప్రాంతములబట్టి, రాజకీయములబట్టి అనేక విధములుగా కొనసాగవచ్చునా? కానీ ఇక్కడ ‘కొనసాగవచ్చును’ అన్నట్టుగా పెత్తనము చెలాయించుచున్నది. కనుకనే విమర్శకొక ప్రమాణము లేదనుట. ‘రాత’పతుల లౌకిక స్థితిని బట్టి తమ కొలబద్దలు మార్చుకొను దయనీయ స్థితికి పాల్పడిన విమర్శకులున్న చోట ఈ మాట చెప్పటం దోషం కాదనే నా అభిప్రాయం. తెలుగు విమర్శకులీ దుర్మార్గము నేసుముహూర్తములో పట్టారోకానీ ఇప్పటికీ ఇదే కొనసాగుతోంది. ఆ బరి నుండి బైటపడలేక పోతోందీ గుంపు. కారణం ‘రాత’లగాండ్రు అధ్యయనశీలురు అనుశీలనాపరులు కాకపోవటమే. నినాద ప్రాయమైన వచనాన్ని పట్టుకువ్రేళ్ళాట్టమే. నినాదమే సమస్తమనే అజ్ఞానంలో పడి మూర్ఛిల్లటమే. ఏతావతా అసలు ద్రష్ట కాలేకపోవటమే మూలకారణం. ఈ ద్రష్టుత్వం లేనివాడు కవి ఎలా కాగలడు? కవి ఇచ్చే చైతన్యమే సమాజంలో కార్యానికి నాంది గనుక, మానవ మానవ సంబంధ సమాజ మార్పునకు హేతువు కనుక కవి ఒక్కడే మానవ సమాజానికి నాయకుడు. కవి చేసే ఆత్మ విచారం, ఆత్మ కళాభ్యాసం, హృదయ సంవాదం ఇత్యాది నామక ఆత్మీయ ప్రక్రియల మూలంగా కవికి విశ్వసృష్టి సమగ్ర అవగాహన సిద్ధిస్తుంది. ఇది రుద్రటుడు చెప్పిన ‘‘మనసి సుసమాధిని విస్ఫురణ మనేకధాభిదేస్యి అక్లిష్టాని పదాని చ విభాంతి యస్యాం అసౌశక్తిః’’- అంటే ఆత్మ విచారంలోనుంచి వస్తువుల యొక్క నానా విధాలైన స్ఫురణ కలుగుతుంది. అక్లిష్టములైన పదాలు గోచరిస్తాయి. ఇలాంటి శక్తి ఆత్మవిచారం చేతనే సిద్ధిస్తుంది. అందరిలా వస్తువుల్ని చూడటం కాక కవి వస్తు రహస్యాన్ని చూడటం అనే శక్తిని ఆర్జిస్తాడు. అలా కవి ఎప్పుడు అంతర్నేత్ర దృష్టిని అలవరచుకుంటాడో అపుడు కవికి సృష్టి వాస్తవాలు అవగతవౌతాయి. వస్తువుల్లో ప్రతీకలు ప్రత్యక్షవౌతాయి. సముద్రోపరితలంమీద వెలుగుతున్న అగ్నికి, ఆకాశవీధిలోని మేఘానికి వారి భేదం లేదని తెలుస్తుంది. మాటల్లో ధ్వనులు -్ధ్వనుల్లో మాటలు వినిపిస్తాయి. బ్రహ్మాండ రహస్య దృశ్యాలు సుస్పష్ట చారిమలౌతాయి. మనిషి అసలు అర్థం మనసును పట్టుకుంటుంది. భవిష్యత్తు ఏమిటో-క్రౌంచ మిధునంలోని కాలపదమేమిటో కావ్యగతవౌతుంది. ఆ స్వరూప ప్రభావాలు సాక్షాత్కరిస్తాయి. అపుడు ‘కాలోసి దురతిక్రమః’ అంటాడు కవి. మనకీ లౌకిక జగత్కారణంగా తదనుభూతమానమైనదంతా కలగానే అనిపిస్తుంది. ఈ స్వప్నావిద్యను సాధించినవాడు మాత్రమే కవి కాగలడు. ఇది వైశ్విక సాక్షాత్కారం. ‘రాత’లకివి అనిపించవు కనిపించవు.
ఈ దర్శన శక్తి చేతనే, ఈ నైశ్విక సాక్షాత్కారం చేతనే వాటికి మూలమైన తాదాత్మ్యం చేతనే, శోకం చేతనే, హృదయ సంవాదం చేతనే కవులు మానవ నాగరికతకు ఆదిమకర్తలయ్యారు. వాళ్లే ధర్మశాస్త్రాలు చెప్పారు. వాళ్ళే వైద్యము, జ్యోతిష్యము, వ్యవసాయము, రాజనీతి, వాస్తు ఇత్యాది శాస్త్రాలకు బీజాలు వేశారు. కవి అంటే సర్వజ్ఞుడైన జ్ఞాని. నాదోద్భవకాలంలోనే క్రాంత దర్శనులైనారు ఈ పనులన్నీ చేశారు. వారు కవులే. ఈ విధంగా కవి ఒక రకం మత గురువే. అయితే ఒక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి. కవి మతంలో దేవుడు మానవుడే. ఆనాడు-ఈనాడు కూడా. కారణం కవిత్వానికి మూలధాతువు శోకం. అధర్మ పీడితుల శోకంతో తాదాత్మ్యం చెందిన కవి తను అనుభవించే శోకమే మూలం. కనుకనే భవభూతి ‘ఏకో రసః కరుణ’ అన్నాడు. ‘రాత’లకిది అనూహ్యం; అంటదు. కనుకనే కావ్యతత్త్వ విజ్ఞానం రుద్రట రాజశేఖరులు చేసిన మహోపకారం ఏమిటంటే కవిత్వం సర్వజన సాధ్యమంటూనే దానికి కావలసిన ‘సాధన తంత్రం’ అవలంబించాలని నిష్కర్షగా స్పష్టంచెయ్యటం. ఇక్కడే మన ‘రాతలు’ కౌలీన కండూతిని విప్పి చెప్పుకున్నాడే; సాధన తంత్రం మార్గం మళ్లింది. ప్రతిభ సర్వజీవరాసుల్లోనూ వున్న చైతన్యం. ‘సర్వ చైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి, బుద్ధిం యానః ప్రచోదయాత్’ అని దేవీ భాగవతం. యానాం మొక్కల పెంపక కేంద్రంలో పూచే గులాబీకి-మన పెరట్లో పూలకుండీలో పెరిగే గులాబీకి తేడా వుంటుంది- గమనిస్తే. అక్కడ పూచినంత పెద్ద పూలు ఇక్కడ పూయవు. కానీ ఆ వాతావరణం, ఆ శ్రద్ధ, ఆ పోషణ వగైరా ఎసగొల్పులు మన పెరటికి కల్పిస్తే యానాం పూవుల్ని ఇక్కడ కూడా పూయించవచ్చు. అంటే ఫలితం దైవాధీనం కాదన్నమాట. కృషి చేత ఫలితం సిద్ధించింది. ఈ ఫల -పుష్పాదుల విషయంలో వ్యవసాయం అంటారు- కవిత్వం విషయంలో ‘తపస్సు’ అంటారు. లేక సమాధియోగమంటారు. ‘రాత’లకివి చెల్లునా? చెల్లవు. కారణం ఈ ‘రాత’ల తీరు వేరు. ముఖ్యంగా భాష వేరు. వారి ప్రవర్తన వేరు. త్రపారహితాపత్రయం వేరు. వీటన్నిటిలో పైకి కన్పించేది భాష కనుక-్భషే కారణమందామా అంటే ఇది భాషకున్న సమస్య కాదు. కవిలో ఒక భావం పుట్టే తీరులో ఆ తీరు భాషా రూపం సంతరించుకునే విన్యాసవైఖరిలో వున్న సమస్య. ఈ సమస్య పరిచయం- అభ్యాసం- అలవాటు అనే సోపానత్రయం అధిరోహించకండా ఎలా పరిష్కరించబడుతుంది? కనుక ఇవి తప్పనిసరి అని తెలుసుకున్ననాడు-కవిత్వ భాష జన్మిస్తుంది. ఇన్ని చెప్పినా ఈ జాతి వాళ్ళిది ఒప్పుకోరు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా వీరికీ వ్యాధి అస్థిగతమై పోయింది. పుఱ్ఱెతో పుట్టిన బుద్ధి ఎట్లా పోవాలి? పైగా వీళ్ళు ఇన్ని దశాబ్దాలు ఏళ్ళు తెలియకుండానే ముఠాతత్త్వ విషవాయువుల్ని పీలుస్తూ పెరిగారు. పెరగి తదనుగుణమైన ముఠాల్ని పెంచి పోషించుకుంటూ వచ్చారు. కవిత్వ విద్యలో వీరు ఏమీ కాకపోగా పరిణత ప్రజ్ఞావంతులతో కూడా స్పర్థించగలరు. అసలు కవిత్వానికి భవిష్యత్తులో నిలబడే శక్తి వుండాలనే కదా అందరి తాపత్రయం. ఈ తాపత్రయానికేది ఆధారమవుతోంది? కావ్యంలో ప్రతిబింబితమైన సాంఘిక సమస్యయా లేక కవి యొక్క ప్రతిభయా? అభ్యుదయ కవులందరి కావ్య వస్తువు దాదాపు ఒకటేగదా. వారి సాంఘికాభిప్రాయాలు ఒకటే గదా! మరి వారందరిలోను శ్రీశ్రీయే ఎందుకు ప్రత్యేకంగా గుర్తించబడినాడు? అటే వారందరిలోను మృగ్యమైనదేదో ఒకానొక శక్తి శ్రీశ్రీ యొద్ద కలదన్నమాటేగా! కాబట్టి సర్వకవిత్వానికి మూలం ఆ శక్తి. ఆ శక్తినిబట్టే హెచ్చుతగ్గులు పేరు ప్రతిష్ఠలూన్నూ. అది గుర్తుంచుకోండి. ఎవర్నెవరు ఏ పేరుతో పిలిచినా- పిలిచినవారంతా ప్రజలే. అభ్యుదయ సంఘం వాళ్ళకు ఆ వర్గం వారు ప్రజలు. పూర్వ సంప్రదాయానుకూలురకు ఆ వర్గం వారు ప్రజలు. సమర్థులెప్పుడూ స్వశక్తిమీదనే ఆధారపడి పైకి వస్తారు. అసమర్థులు ఎప్పుడూ సంఘాలనాశ్రయించుకునే బ్రతుకుతారు.
సాహిత్యానికి సంఘాలు పెట్టింది వీళ్లే. వీరి ‘రాత’ల కై వడి వీరి ఊచకోలలు. వీరి కథ (గాడిద-ఒంటె) ‘పరస్పరం ప్రశంసంతి అహోరూపమహోధ్వనిః’ అన్నట్లుంటుంది. కనుక ‘రాతల కై వడి’ కన్నా ‘వ్రాతల కై మడి’ ముఖ్యం. చివరగా ఒక ధ్యానానంతర ప్రసక్తి. ఇది ఒక జాతి తన అంతఃశోధన చేసుకోవటానికి ప్రేరితం చేసే ప్రసక్తి. నీతి కోల్పోయి నిర్వీర్యమైన జాతిలోనుంచి కనీసం గడ్డి కూడా మొలవదు. ధైర్యం కోల్పోయిన సాహిత్యం (దేశం) దరిద్ర భావ దేవతకు దేవాలయం. దొంగలకు రహదారి. ఉన్నత సంస్కారానికి సజీవ సమాధి. ఒక మంచి కవిత్వం పుట్టాలంటే ఆ జాతిలో ఎంతో సత్యముండాలి. ఎంతో సాహసముండాలి. ఎన్నో యుద్ధాలకు ఎన్నో జయాపజయాలకు-ఎన్నో ఆక్రందనలకు-ఎన్నో మానవ వైక్లబ్యాలకు జాతి గురికాబడి వుండాలి. అలా గురి అయిపోయి మిగిలిన నిశ్శబ్దంలోంచి కవిత్వం పుట్టాలంటే కవి అన్నవాడు కూడా ఆ జాతివాడై వుండి-సంవేదనాత్మకమైన చింతనాగ్నిలోంచి తల పైకెత్తాలి. ఎత్తిన తలతో పాటు అలంకారమో- ప్రతికయో-బింబమో- ప్రస్ఫుటమవ్వాలి. ఇదంతా ఆత్మశిక్షణకు పరాకాష్ఠ. జీవితం జీవితంమీద చేసే అపచారాలలో అతి ఘోరమైన అపచారం ఏ రకమైన సంవేదన లేకపోవటం. దీని పర్యవసానమే ఒక జాతి సాహిత్య సృజనాశక్తిని కోల్పోతుంది. ఒక అలంకారం చచ్చిపోయిందంటే ఒక నాగరికత చచ్చిపోయిందనే అర్థమని ఆర్చిబాల్డ్ మెక్లిష్ అంటాడు. కనుక ‘రాతపతుల ప్రాజాపత్యం’ రచనలవైపు తొంగి చూడకుండా వుండటమే మేలు. వారి శరీర ధ్యాసను నిరాక్షేపణీయంగా నిర్వహించుకోవచ్చు. దానికి కవిత్వం ఆలంబనా కాదు; అవసరమూ లేదు.

- సాంధ్యశ్రీ, 8106897404