మెయిన్ ఫీచర్

తెలుగు సాహితీ సూరీడు సీ.పీ. బ్రౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

===========================================
బ్రౌన్ సంస్కృత భాషలో మంచి దిట్ట. శంకరాచార్యుల సౌందర్య లహరికి, లితోపాఖ్యానానికి వ్యాఖ్యానాలు రాశారు. జ్యోతిషం, శిల్పశాస్త్రం, గణితం తదితర అంశాలపై 106 వ్యాసాలు రాసి ప్రచురించారు. చెన్నై ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ గ్రంథాలయంలో బ్రౌన్ సేకరించిన వివిధ సంపుటాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. లండన్‌లోని భారత్
కార్యాలయాల గ్రంథాలయాల్లో
52 ముద్రిత, అముద్రిత సంపుటాలను కూడా భద్రపరచి ఉంచారు.
===========================================

స్వాతంత్య్రం రాకముందు ఉద్యోగరీత్యా మన దేశానికి వచ్చి తెలుగు ప్రాంతాల్లో విశేష సేవలందించిన ఇద్దరు ఆంగ్లేయులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. అందులో సర్ ఆర్థర్ కాటన్, సి.పి.బ్రౌన్. రెండు ముఖ్యనదులపై ఆనకట్టలుకట్టి విశేష సేవలు అందించిన కాటన్ ఒకరయితే తెలుగు భాష వికాసానికి అనన్య సామాన్యమయిన సేవలందించిన సి.పి.బ్రౌన్ చిరస్మరణీయులు. కొడిగడుతున్న తెలుగు సాహిత్య దీపాన్ని ప్రజ్వలింపజేసి ‘తెలుగు సూరీడుగా’ అందరి మనసులను దోచుకున్నాడు. సి.పి.బ్రౌన్‌గా అందరికి సుపరిచితులైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1798 నవంబరు 10న కోల్‌కత్తాలో జన్మించారు. ఆయన తండ్రి మత ప్రచారకుడు. తండ్రి మరణం తరువాత ఆయన కుటుంబమంతా ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళిపోయింది. ఆ తరువాత బ్రౌన్ తిరిగి మన దేశానికి చేరుకొని 1817 ఆగస్టు 4న మద్రాసు ఈస్టిండియా కంపెనీలో చేరారు. వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగు వర్ణమాలను నేర్చుకున్నారు. అనతి కాలంలోనే తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1820లో సర్.్థమస్ మన్రో మద్రాసు గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులంతా దేశ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలని తెలుగు భాషలోనే ప్రభుత్వ కార్యకలాపాలు సాగించాలని ఆదేశించాడు. ఈ మాట బ్రౌన్ మనస్సులో బాగా నాటుకుంది. పిమ్మట ఆయన కడపలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1820-22వరకూ అక్కడే పనిచేశారు. ఆ తరువాత బందరు, గుంటూరు, చిత్తూరు, తిరునల్వేలి తదితర ప్రాంతాల్లో పనిచేశారు.
1826-29 మధ్య కడపలో తిరిగి ఉద్యోగం చేశారు. ఆ సమయంలో తెలుగు భాష పరిశోధనకు శ్రీకారం చుట్టారు. ప్రాచీన కావ్యాలను వెలికితీసి మనుచరిత్ర, వసుచరిత్రల వంటి ప్రబంధాలను పోతనామాత్యుని భాగవతాన్ని పండిత ప్రకాండులచే పరిష్కరింపజేశారు. వాటికి వ్యాఖ్యానాలు రాయించేందుకు ఎనలేని కృషిచేశారు. 1837 ప్రాంతంలో తెలుగు భారతం 18 పర్వాలను పరిష్కరింపజేసేందుకు, శుద్ధ ప్రతులను తయారుచేసేందుకు రూ.2714 మొత్తాన్ని ఆరోజుల్లో ఖర్చుచేసిన వితరణ ఆయనది. పలనాటి వీర చరిత్రను వెలికితీసి కొత్త ప్రతులను రాయించాడు. ఆయన సాహితీ కృషికి కడప వేదికైంది. పండితులను నియమించి తన సాహితీ సేద్యాన్ని నిర్విరామంగా కొనసాగించాడు. వేమన పద్యాలను వెలికితీసి 1829, 1839 సంవత్సరాలలో ప్రచురించారు. తెలుగువారి వేమనను తిరిగి బతికించారు. 1840లో తెలుగు వ్యాకరణాన్ని ప్రచురించారు. ఆంధ్ర గీర్వాన చ్ఛందాలను తులనాత్మకంగా పరిశీలించి స్వయంగా గ్రంథాలను రాశారు. తెలుగు-ఆంగ్లం, ఆంగ్లం-తెలుగు నిఘంటువు, మిశ్ర భాషా నిఘంటువు దేశంలో తొలిసారిగా వెలువరించారు. తెలుగు నేర్చే ఇంగ్లీషువారికోసం ఇంగ్లీషు నేర్చదలచిన తెలుగు వారికోసం తానే స్వయంగా సిలబస్‌ను రూపొందించి వాచకాలను తయారుచేయించి తరువాతి తరాలకు అందించేందుకు కల్నల్ మెకంజీ కైఫీయత్తులను పరిష్కరింపజేశారు. బ్రౌన్ సంస్కృత భాషలో మంచి దిట్ట. శంకరాచార్యుల సౌందర్య లహరికి, లితోపాఖ్యానానికి వ్యాఖ్యానాలు రాశారు. జ్యోతిషం, శిల్పశాస్త్రం, గణితం తదితర అంశాలపై 106 వ్యాసాలు రాసి ప్రచురించారు. చెన్నై ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ గ్రంథాలయంలో బ్రౌన్ సేకరించిన వివిధ సంపుటాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. లండన్‌లోని భారత్ కార్యాలయాల గ్రంథాలయాల్లో 52 ముద్రిత, అముద్రిత సంపుటాలను కూడా భద్రపరచి ఉంచారు. తాను పనిచేసిన ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి పలు చర్యలు తీసుకున్నారు. కడప, మచిలీపట్నాల్లో రెండేసి ఉచిత పాఠశాలలను ఏర్పాటుచేసి విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలను కల్పించారు. వీటి నిర్వహణకు తన వేతనంనుంచి నిధులను సమకూర్చేవారు. కడపలో ఓ బంగళాను కొని సొంత ఖర్చుతో పదిహేను మంది పండితులను నియమించి తెలుగులో పరిశోధన కార్యక్రమాలను నిర్వహించేవారు. బ్రౌన్ నివసించిన బంగళాను పది లక్షల వ్యయంతో నిర్మించి ఆయన పేరుతోనే గొప్ప గ్రంథాలయాన్ని ఏర్పాటుచేయించిన ఘనత జానమద్ది హనుమచ్ఛాస్ర్తీకి దక్కుతుంది. అంచేత ఆయనను బ్రౌన్ శాస్ర్తీగా పిలుస్తారు. ఇందులో డెబ్భైవేల గ్రంథాలున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది. దీనిని సి.పి.బ్రౌన్ భాషాభివృద్ధి పరిశోధన కేంద్రంగా మార్పుచేశారు.
ఉద్యోగరీత్యా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పలుచోట్ల పనిచేశారు. 1820లో కడప కలెక్టరుగా, తరువాత కృష్ణా జిల్లా కోర్టు రిజిస్ట్రార్‌గా, ఇన్‌ఛార్జి కలెక్టరుగా, జిల్లా మెజిస్ట్రేట్‌గా, రాజమహేంద్రవరం అదనపు జడ్జిగా, గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టరుగా పనిచేశారు. 1837లో పోస్టుమాస్టరు జనరల్‌గా సేవలందించారు. ఓవైపు సాహితీ సేవలను అందిస్తూనే ఉద్యోగ విధులను ఎన్నడూ విస్మరించకుండా సామాన్య ప్రజల శ్రేయస్సుకోసం పాటుపడేవారు. కరవు పరిస్థితులను అధిగమించే చర్యల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయించారు. కరవు నివారణ పథకాలను ఆ రోజుల్లో వినూత్నంగా చేపట్టారు. సతీ సహగమనాన్ని రూపుమాపడంలో ఎంతో కృషిచేశారు. పరిపాలనాదక్షునిగా సాహితీ సేవకునిగా ప్రజల హృదయాల్లో బ్రౌన్ చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగు భాష సాహిత్యానికి ఆయన చేసిన సేవలు నిరుపమానమైనవి. 1854లో బ్రౌన్ పదవీ విరమణ చేసి లండన్‌లో స్థిరపడ్డారు. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా కొంతకాలం పనిచేశారు. బ్రౌన్ సాహిత్య కృషిని గూర్చి మన రాష్ట్రంలో ఎంతోమంది అధ్యయనం చేశారు. పరిశోధనలు జరిపారు. ఆరుద్ర, బంగోరె, కొత్తపల్లి వీరభద్రరావు, విద్వాన్ కట్టా నరసింహులు, వేటూరి ప్రభాకరశాస్ర్తీ, జి.ఎన్.రెడ్డి, చల్లా రాధాకృష్ణశర్మ, తదితరులు ఇందులో ముఖ్యులు. 1884 డిసెంబర్ 12న తన 87వ ఏట తుది శ్వాస విడిచారు. తెలుగు సాహిత్య సరస్వతిని స్వాగతించిన ఆ వాగ్దేవిని నిండు ముత్తయిదువువలె నడయాడేలా చేయగలిగిన మహానుభావుడని పండితులు, మేధావులు కీర్తించారు. తన జీతాన్ని, జీవితాన్ని తెలుగు భాషా సాహిత్యాల కోసం ఖర్చుచేసిన మహానుభావుడాయన.

-- వాండ్రంగి కొండలరావు, 9490528730