సంపాదకీయం

రక్షణ సన్నద్ధత..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాల ఉమ్మడి దురాక్రమణ పొంచి ఉన్న నేపథ్యంలో మన రక్షణ వ్యయం గణనీయంగా పెరగవలసి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల ఐదవ తేదీన పార్లమెంటుకు సమర్పించిన నూతన వర్ష ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’- బడ్జెట్‌లో ఈ పెరుగుదల తగినంతగా కనిపించకపోవడం విచిత్రమైన వ్యవహారం. లోక్‌సభ ఎన్నికలకు పూర్వం గత ఫిబ్రవరిలో తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తాత్కాలిక ఆదాయ వ్యయ ప్రణాళిక- ఇంటరిమ్ బడ్జెట్-కు నిర్మలా సీతారామన్ ‘బడ్జెట్’ పునరావృత్తి! అందువల్ల రక్షణ రంగానికి నిధులను తగినంతగా పెంచక పోవడమన్న వైపరీత్యం గత ఫిబ్రవరిలోనే ప్రస్ఫుటించింది. నిజానికి దశాబ్దుల తరబడి ఈ వైపరీత్యం కొనసాగుతోంది. ఈ దశాబ్దుల కాల వ్యవధిలో పాకిస్తాన్ తన బడ్జెట్‌లో సగటున ఇరవై మూడు, ఇరవై నాలుగు శాతం నిధులను సైనిక వ్యయం కోసం ఖర్చుచేసింది. చైనా తన బడ్జెట్‌లో పదునాలుగు నుంచి పదహారు శాతం నిధులను సైనిక వ్యవస్థకు ఖర్చుచేస్తుండడం అధికార గణాంకాలు వివరిస్తున్న వాస్తవం. చైనాలో నిరంకుశ ఏకపక్ష రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉంది. అందువల్ల బహుళ పక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలలో వలె చైనా ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత లేదు. చైనా ఆధికారికంగా వెల్లడిస్తున్న సైనిక వ్యయం కంటె దాదాపు రెట్టింపు ఖర్చు చేస్తోందని పాశ్చాత్య ప్రభుత్వాలు, ప్రసార ప్రచార మాధ్యమాలు ఏళ్లతరబడి ఆరోపించడం అంతర్జాతీయ వాస్తవం. కానీ మన ప్రభుత్వం మాత్రం సగటున పదకొండు, పనె్నండు శాతం మాత్రమే రక్షణ రంగానికి కేటాయిస్తుండడం బడ్జెట్‌లో నిహితమై ఉన్న వైపరీత్యం. నిర్మలా సీతారామన్ సమర్పించిన వార్షిక ఆదాయ వ్యయం పరిమాణం దాదాపు ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు! ఇరవై ఏడు లక్షల ఎనబయి ఆరు వేల మూడు వందల నలబయి తొమ్మిది కోట్ల రూపాయల ఈ బడ్జెట్‌లో రక్షణకు మూడు లక్షల ఐదువేల రెండువందల తొంబయి ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే మొత్తం వార్షిక వ్యయంలో రక్షణ వ్యయం పదకొండు శాతం కంటె తక్కువే. పీయూష్ గోయెల్ గత ఫిబ్రవరిలో సమర్పించిన బడ్జెట్ పరిమాణం, రక్షణ వ్యయం కూడ దాదాపు ఇంతే! అందువల్ల గత ఏడాది కంటె (2018-2019 ఆర్థిక వత్సరం కంటె) ప్రస్తుత 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రక్షణ వ్యయం తగ్గింది. ఇరుగుపొరుగు శత్రు దేశాలవారు సైనిక వ్యయం పెంచుకుంటూ పోతున్న సమయంలో మన రక్షణ వ్యయం ఇలా తగ్గిపోవడం ఏమిటి? ఇదంతా అతార్కిక రక్షణ విధానానికి నిదర్శనం కాదా??
గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2018-2019 సంవత్సరానికి- గత ఆర్థిక సంవత్సరానికి- ప్రతిపాదించి ఖర్చుపెట్టిన మొత్తం వ్యయం దాదాపు ఇరవై నాలుగున్నర లక్షల కోట్లు రూపాయలు! ఇందులో రక్షణ వ్యయం రెండు లక్షల తొంబయి ఐదువేల కోట్ల రూపాయలు. అంటే గత ఏడాది మొత్తం వ్యయంలో రక్షణ వ్యయం పనె్నండు శాతం కంటె ఎక్కువ. ఈ 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రక్షణ వ్యయం మొత్తం వ్యయంలో పదకొండు తక్కువ శాతానికి పడిపోవడానికి హేతువు ఏమిటి? చైనా దురాక్రమణ విస్తరిస్తున్న నేపథ్యంలో మన రక్షణ వ్యయం పరిమాణం కానీ, బడ్జెట్‌లో దాని శాతం కాని నిరంతరం పెరగడం సతార్కికం. కానీ తగ్గుతోంది. గత ఏడాది కంటె ఈ ఏడాది పదివేల కోట్ల రూపాయలు మాత్రం పెరిగింది. ద్రవ్యోల్బణం, రూపాయి విలువ భారీగా పతనం కావడం వంటి వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ విలువల ప్రాతిపదికగా నిర్ధారించినట్టయితే ఈ ‘పెరుగుదల’ ఇంకా తగ్గిపోతుంది. చైనా మన లడక్‌లో అక్రమంగా తిష్ఠవేసి ఉంది. ఇది దశాబ్దులనతిగమించిన భౌతిక దురాక్రమణ. పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూ కశ్మీర్‌లోకి చైనా సైనికులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, చైనా సంబంధ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు చొఱబడి స్థిరపడి ఉండడం భౌతిక దురాక్రమణకు విస్తరణ. పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడాలన్న లక్ష్యంతో బలూచిస్థాన్ ప్రజలు ఉద్యమిస్తున్నారు. కానీ బలూచిస్థాన్‌లోని గ్వాడార్ రేవునుంచి చైనా అధీనంలో ఉన్న సింకియాంగ్- ఝింజియాంగ్-లోని కష్‌గఢ్ వరకూ చైనా,పాకిస్తాన్ ప్రభుత్వాలు ఉమ్మడిగా ‘ఆర్థిక ప్రాంగణాన్ని- ఎకనామిక్ కారిడార్‌ను- నిర్మిస్తుండడం కూడ ఈ భౌతిక దురాక్రమణకు విస్తరణ! ఈ నేపథ్యంలో మనం రక్షణ వ్యయాన్ని ప్రమాదానికి అనుగుణమైన స్థాయిలో పెంచక పోవడం విచిత్రమైన వ్యవహారం...
వర్తమాన- 2019-2020- ఆర్థిక సంవత్సరంలో చైనా పనె్నండు లక్షల నలబయి ఆరు కోట్ల రూపాయల సైనిక వ్యయం చేస్తోంది. ఇవి ఆధాకారిక గణాంకాలు. ఈ అధికార వ్యయమే మన రక్షణ వ్యయం కంటె నాలుగు రెట్లు ఎక్కువ. నూట డెబ్బయి ఎనిమిది బిలియన్ల రక్షణ వ్యయం చేస్తున్నట్టు గత మార్చిలో ‘జాతీయ ప్రజామహాసభ’- నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్- ఎన్‌పిసి- చైనా సర్వోన్నత విధానసభ-కు సమర్పించిన వార్షిక ఆదాయ వ్యయ ప్రణాళికలో తెలిపారు. ఈ రక్షణ వ్యయం 2018-2019లో జరిగిన దానికంటె ఏడున్నర శాతం ఎక్కువ. అంతకుముందు సంవత్సరం కంటె 2018-2019లో వ్యయం ఎనిమిది శాతం పెరిగింది. కానీ మన రక్షణ వ్యయం గత ఏడాది కంటె ఈఏడు కేవలం నాలుగు శాతం పెరిగింది. అనధికార గణాంకాల ప్రకారం చైనా మరో ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా సైనిక ఆయుధ వ్యయం చేస్తోందన్న ‘నిర్ధారణ’ను పరిగణించినట్టయితే చైనా సైనిక వ్యయం మనకంటె ఆరు రెట్లు ఎక్కువ. ఇదికాక అంతర్గత భద్రత పేరుతో సైనిక వ్యయంలో దాదాపు సగానికి సమానమైన వ్యయాన్ని చైనా చేస్తోంది. ఇదంతా బహిరంగ రహస్యమైనప్పటికీ మన ప్రభుత్వం మాత్రం రక్షణ వ్యయాన్ని పెంచడం లేదు. మన రక్షణ వ్యయంలో దాదాపు నాలుగవ వంతు ఏటా విదేశాల సంస్థలకు లభిస్తోంది. భారీగా ఆయుధ సామగ్రిని రక్షణోత్పత్తులను మనం దిగుమతి చేసుకుంటుండడం ఇందుకు కారణం. సైనికులు పయనించడానికి, సరిహద్దు సీమలలో సామగ్రిని పంపిణీ చేయడానికి అవసరమైన బస్సులను, ట్రక్కులను సైతం మన విదేశాల నుంచి దిగుమతి చేసుకొనడం సిగ్గుచేటైన కఠోర వాస్తవం. గగన శకటాలను- హెలికాప్టర్లను కూడ మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఈ గగన శకటాలు గగన యుద్ధ శకటాలు కూడ కాదు, కేవలం ప్రముఖులు ప్రయాణించడం కోసం ‘అగస్టా’ అన్న విదేశీయ సంస్థ వద్ద హెలికాప్టర్లను కొనుగోలు చేశాము. దాదాపు ప్రతి దిగుమతి ఒప్పందంలోను అవినీతి నిహితమై ఉండడం లేదా ఉందన్న ఆరోపణలు రావడం నడుస్తున్న చరిత్ర. ‘అంకురాలు’ పథకం ‘్భరత్ నిర్మించండి’ పథకం స్వజాతీయ స్వాభిమాన స్వయం సమృద్ధ లక్ష్యాలకు ప్రతీకలని ప్రచారం జరుగుతోంది. మరోవైపు రక్షణ రంగంలోకి సైతం భారీగా విదేశీయుల పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. వైరుధ్యాలు నిహితమై ఉన్న ఈ ‘రక్షణ’ విధానానికి తార్కికమైన ప్రాతిపదిక ఏమిటన్నది పరిపాలకులు స్పష్టం చేయవలసి ఉంది.
గతంలో కాంగ్రెస్ నిర్వహణలోని ప్రభుత్వాలు చేసిన తప్పులన్నీ తప్పులే! అదే తప్పులను ‘జాతీయ భావనిష్ఠ. సమైక్య, సమగ్రతల పట్ల నిబద్ధత కలిగి ఉన్న’ భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వం చేస్తే ఆ తప్పులు తప్పులు కాకుండా పోతాయా? ‘మానదండం’ ఒక్కొటి కాదా?? ‘చతికిలపడి ఉండిన’ వారికీ ‘సాయుధ చికిత్సకుల’కు మధ్య అంతరం కొంతైనా ఉండాలి కదా!