S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జగ్గన్నతోట ప్రభల తీర్థం

కోనసీమ నడుమ తరతరాల నుండి సంక్రాంతిలో వైభవోపేతంగా జరుగుచున్న జగ్గన్నతోట ప్రభల తీర్థ వైభవాన్ని చూద్దాం..
మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్యకాలంలో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, అతి పురాతనమైన, పవిత్రమైన ప్రభల తీర్థం. ప్రభల తీర్థాలలోనే మొట్టమొదటి ప్రభల తీర్థం జగ్గన్నతోట ప్రభల తీర్థం. ప్రాచీన కాలంలోనే మొట్టమొదటగా జగ్గన్నతోటలోనే ప్రభల తీర్థం నిర్వహించబడినదని చారిత్రాత్మక కథనం. జగ్గన్నతోటలో ఏ విధమైన గుడిగానీ, గోపురంగానీ ఉండవు. అంతా కొబ్బరి తోటలే. ఏకాదశ రుద్రులు కొలువు తీరడం వలన జగ్గన్నతోట ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను, చారిత్రాత్మక విశిష్ఠతను సంతరించుకున్నది.
జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల కొలువు. హిందూ శాస్త్రం ప్రకారం ఏకాదశ రుద్రులు ఒకచోట కొలువు తీరేది మన దేశం మొత్తం మీద జగ్గన్నతోట ఒక్కటే. లోక కల్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్నతోటలో సమావేశమవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో సంక్రాంతిలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటి నుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్థము నిర్వహించబడుచున్నదని చారిత్రాత్మక కథనం. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు (జగ్గన్న) గారు ప్రభల తీర్థానికి విచ్చేసి, ఏకాదశ రుద్రులను దర్శించి, ప్రభల తీర్థం ఘనంగా నిర్వహించేందుకు అవిరళ కృషి సల్పారనీ, నాటి జగ్గన్న పూజల ఫలితంగానే ప్రభల తీర్థం జరుగు ప్రదేశం ‘జగ్గన్న’తోటగా పిలువబడుచున్నదని కథనం.
ప్రభల తీర్థం నాడు ఏకాదశ రుద్ర గ్రామాలలో కొలువున్న స్వామివార్లు గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వరస్వామి, గంగలకుర్రు - చెన్నమల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం - వ్యాఘ్రేశ్వరస్వామి, పెదపూడి - మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ - ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక - కాశీ విశే్వశ్వరస్వామి, నేదునూరు - చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల - రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి - మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి - చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు - అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వార్లను ప్రభలపై మేళతాళాలతో, బాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో జగ్గన్నతోటకు ఊరేగింపుగా తీసుకొని రావడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రభల తీర్థానికి ఆతిథ్యమిచ్చు మొసలపల్లి - మధుమానంత భోగేశ్వరస్వామి వారు అన్ని ప్రభలకన్నా ముందుగా జగ్గన్నతోటకు చేరుకొని, ప్రభలు అన్నింటికీ ఆహ్వానం పలికి తిరిగి వెళ్లేవరకూ ఉండటం సంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అధ్యక్షత వహించు వ్యాఘ్రేశ్వరం - వ్యాఘ్రేశ్వరస్వామి వారి ప్రభ తీర్థం లోనికి ప్రవేశించినపుడు మిగిలిన రుద్ర ప్రభలను ఒకసారి పైకి లేపడం సంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ప్రత్యేక విశిష్టతను సంతరించుకున్న గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వరస్వామి, గంగలకుర్రు - చెన్నమల్లేశ్వరస్వామి వార్ల ప్రభా వాహనాలను కౌశికలో నుండి అవతలి ఒడ్డుకు చేర్చడం వంటి రమణీయ దృశ్యాలు చూడటానికి రెండు కన్నులూ చాలవు.
ముఖ్యంగా జగ్గన్నతోట ప్రభల తీర్థములో ప్రత్యేక ఆకర్షణగా విరాజిల్లుచూ, చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండి, అన్ని ప్రభలకన్నా ఆఖరుగా వచ్చు గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వరస్వామి ప్రభా వాహనం తీర్థంలోనికి వచ్చు వరకూ మిగిలిన ప్రభలు కూడా వేచి ఉండటం విశేషం. నిండు ప్రవాహంలో వీరేశ్వరస్వామి వారిని ఓలలాడిస్తూ కౌశికను దాటించే తీరు కన్నులారా తిలకించే భక్త జనసందోహ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు. అలా ఏకకాలంలో ఏకాదశ రుద్రులను ఒకే వేదికపై దర్శించి, తరించే భాగ్యం మరియే ఉత్సవాలలోనూ జరగదు. అదే ఈ ప్రభల తీర్థం ప్రత్యేకత.
ప్రభ కౌశికలో ప్రవేశించడానికి ముందు వరిచేలలో నుండి వచ్చినపుడు పంటను తొక్కుకుంటూ వచ్చిననూ రైతులు ఏమీ బాధ పడక, సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ పొలాల గుండా వెళ్లడం వారి పూర్వజన్మ సుకృతంగా విశ్వసిస్తారు.

- శివకేశవ యూత్, గంగలకుర్రు అగ్రహారం