కొత్త ఆలోచనలు (సండేగీత )
Published Saturday, 24 August 2019కొత్త విషయాలు తెలుసుకోవడం,
చదవడం,
అధ్యయనం చేయడం కొంతమందికి ఓ నిరంతర ప్రక్రియ.
ఈ విషయంలో సివిల్ సర్వెంట్స్ విషయంలో న్యాయవాదుల విషయంలో ఓ గమ్మతె్తైన కామెంట్ ఉంది. ఐ.ఏ.ఎస్. ఐ.పి.ఎస్.లు కావడానికి వాళ్లు రోజుకి 20 గంటలు చదువుతారు. సాధిస్తారు. ఆ తరువాత చదవడం మానేస్తారు. ఈ కామెంట్ అందరికీ వర్తించదు.
న్యాయవాదుల విషయానికి వస్తే వాళ్లు తమ చదువుని ఆషామాషీగా తీసుకుంటారని, పరీక్షల ముందు నాలుగు ప్రశ్నలు గట్టిగా చదువుకొని గట్టెక్కుతారని ప్రసిద్ధి. ఒక్కసారి న్యాయవాదిగా మారిన తరువాత పరిస్థితి మారిపోతుంది. మంచి న్యాయవాదిగా ఎదగాలంటే నిరంతరం చదవాలి. చట్టాల్లో తీర్పుల్లో వస్తున్న మార్పులని నిశితంగా గమనించాల్సి ఉంటుంది.
ఈ రెండు కామెంట్లలో కొంత వాస్తవం వున్నప్పటికీ ఇది అందరికీ రుచించకపోవచ్చు.
ఇక ఇతరుల విషయానికి వస్తే కొంతకాలం వరకు బాగా చదువుతారు. ఉద్యోగం వచ్చేంతవరకు బాగా కష్టపడి చదువుతారు. ఆ తరువాత మానేస్తారు. చాలామంది ఇలాగే ఉంటారు.
కానీ, నిరంతరం చదవాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది. అనుభవం మీద కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇతరుల అనుభవాల మీద మరెన్నో విషయాలు తెలుస్తాయి. నిరంతరం చదవాలన్న కాంక్ష ప్రబలంగా వుండాలి. దానివల్ల మనకున్న నైపుణ్యం పెరుగుతుంది. మన సామర్థ్యం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి.
కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం, చదవడం ఎంత ముఖ్యమో అందరితో కలవడం కూడా ముఖ్యమే. వారి పట్ల మన అవగాహన పెరుగుతుంది. సమాజం గురించి, కుటుంబం గురించి, రాజకీయాల గురించి, ప్రభుత్వం గురించి, ప్రేమా, స్నేహభావం, సహకారం గురించి ఎన్నో విషయాలు బోధపడతాయి.
కొత్త ఆలోచనలు రావాలంటే, జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలంటే చదవాలి. అధ్యయనం చేయాలి. మనుషులని కలవాలి. అభిప్రాయాలని పంచుకోవాలి.