ఎపిటాప్( సండేగీత)
Published Saturday, 17 August 2019మన దేశంలో మనుషులు చనిపోయిన తరువాత రకరకాల పద్ధతుల్లో ఆ పార్ధివ శరీరాన్ని అంతం చేస్తారు. కొంతమంది దహనం చేస్తారు. మరి కొంతమంది సముద్రంలో వదిలిపెట్టి అక్కడి జంతుజాలానికి ఆహారంగా ఉపయోగపడాలని ఆశిస్తారు. పార్సీలు పక్షులకి సమర్పిస్తారు. చాలామంది ఖననం చేస్తారు. సమాధి కడతారు.
సమాధుల మీద కొన్ని రాతలు కూడా కన్పిస్తాయి. సాదత్ హసన్ మంటో ప్రఖ్యాత కథా రచయిత. ఆయన సమాధి మీద ఏమి రాసి ఉండాలో ఆయనే రాసిపెట్టాడు. కథ గురించిన రహస్యాలు తెలిసిన మహా రచయిత ఈ మట్టి క్రింద కప్పబడి ఉన్నాడు. భగవంతుని కన్నా తానే గొప్ప రచయితనని అతను ఇప్పుడు కూడా భావిస్తున్నాడు. ఇది వాస్తవం. అతిశయోక్తి కాదు. అతను గొప్ప రచయిత. నేటికీ అతని రచనలు సంబంధితంగా ఉన్నాయని అనుకోవడంలో బాధా ఉంది. సంతోషం ఉంది.
చాలామంది తమ రిస్యూమ్ (బయోడేటా) రాసుకోవడంలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు. అది కొంత అవసరమే. కానీ అది తాత్కాలికమైనది. మన వారసత్వం చాలా ముఖ్యమైనది.
మనం ఈ సమాజానికి ఏమి వదిలిపెట్టి వెళ్లామన్నది మరీ ముఖ్యం.
అల్ప విషయాల మీద నుంచి మన దృష్టి మరల్చి చాలాకాలం నిలిచే పనుల మీద, సమాజానికి ఉపయోగపడే పనుల మీద మన దృష్టిని కేంద్రీకరించాలి.
చిరకాలం వుండే పనుల వైపు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. తాత్కాలికమైన విషయాల మీద కాదు.
మంటో మాదిరిగా మన ‘ఎపిటాప్’ని మనం రాసుకోక పోయినా పర్వాలేదు. మన గురించి ఓ నాలుగు మంచి వాక్యాలు మరెవరో రాసే విధంగా మనం పనిచేస్తే చాలు.
మన కలలు సాఫల్యం చేసుకోవడానికి మన ప్రయత్నం నిరంతరం కొనసాగాలి.
సమాధి లేకపోయినా సమాధిపై వుండే రాతలు మనం పోయిన తరువాత నలుగురు మాట్లాడుకుంటే చాలు.