S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 103 మీరే డిటెక్టివ్

పూర్ణచంద్రుడి లాంటి మొహం గల సీతతో రాముడు విచారంగా చెప్పాడు.
‘ఓ సీతా! నీ మామగారు మరణించారు. ఓ లక్ష్మణా! నువ్వు తండ్రి లేని వాడయ్యావు. మహారాజు మరణించాడనే విచారకరమైన వార్తని భరతుడు చెప్తున్నాడు’
రాముడి మాటలు విన్న కీర్తివంతులైన భరత, లక్ష్మణ, శతృఘ్నల కళ్ల నించి నీళ్లు కారాయి. సోదరులంతా రాముడ్ని ఓదార్చి, ‘తండ్రికి జలతర్పణాలు ఇవ్వు’ అని ప్రార్థించారు.
మామగారైన మహారాజు స్వర్గస్థుడయ్యాడని విన్న సీత కన్నీళ్లతో భర్తని చూడలేక పోయింది. రాముడు ఏడుస్తున్న సీతని ఓదార్చి, తను దుఃఖిస్తూ, దుఃఖించే లక్ష్మణుడితో చెప్పాడు.
‘మహాత్ముడైన తండ్రికి ఉత్తర క్రియలు చేయడానికి వెళ్తాను. తెలగపిండిని, ఉత్తరీయాన్ని తీసుకురా. సీత ముందు నడుస్తుంది. నువ్వు ఆమె వెనకే నడిచి వెళ్లు. నేను నీ వెనక వస్తాను. ఈ మరణ సంబంధమైన స్నానం కోసం మనం చేసే ఈ ప్రయాణం చాలా భయంకరమైనది.’
తర్వాత, సదా ఆ రాజకుమారులని అనుసరించి ఉండేవాడు, ప్రశస్తమైన బుద్ధి, గొప్ప ఆలోచనా శక్తి, మెత్తటి స్వభావం కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, శాంతుడు, రాముడి మీద దృఢ భక్తి గల సుమంత్రుడు ఆ రాజకుమారులు అందర్నీ ఓదార్చి, మంగళకరమైన గంగా నదిలో స్నానం చేయడం కోసం వారి చేతులని పట్టుకుని దింపాడు. గొప్ప కీర్తిగల ఆ సోదరులు మంచి రేవులు కల సుందరమైన, ఎల్లప్పుడూ పుష్పించిన అరణ్యాలు గల గంగా నదిని అతి కష్టంగా సమీపించి, బురద లేని మంగళకరమైన రేవులో దిగి, ‘తండ్రీ! ఈ జలం నీకు తృప్తిని కలిగించు గాక’ అని చెప్తూ దశరథుడికి జలతర్పణాలు ఇచ్చారు.
రాముడు దోసిలితో నీళ్లు పట్టుకుని ఉత్తరం వైపు తిరిగి ఏడుస్తూ చెప్పాడు.
‘రాజుల్లో శ్రేష్ఠుడైన ఓ తండ్రీ! పితృలోకంలో ఉన్న నీకు నేను ఇప్పుడు ఇచ్చే ఈ పవిత్రమైన నీళ్లు అక్షయమై నిన్ను చేరుగాక’
తర్వాత తేజశ్శాలైన రాముడు తమ్ముళ్లతో కలిసి, నది అవతలి తీరానికి వెళ్లి తండ్రికి పిండ ప్రదానం చేశాడు. రాముడు దర్భలు పరిచి, వాటి మీద రేగు పళ్లు కలిపిన తెలకపిండిని ముద్దలు చేసి ఉంచి, దుఃఖంతో ఏడుస్తూ చెప్పాడు.
‘మహారాజా! మేము తినే దానే్న నీకు పెడుతున్నాను. సంతోషంతో తిను. పురుషుడు ఏ అన్నం తింటాడో అతని దేవతలు కూడా ఆ అన్నానే్న తింటారు కదా?’
తర్వాత రాముడు నదీ తీరాన్ని దాటి అందమైన చరియలు గల చిత్రకూట పర్వతాన్ని ఎక్కాడు. జగత్పతైన ఆ రాముడు పర్ణశాల ద్వారం దగ్గరకు వెళ్లి భరత లక్ష్మణులని ఇద్దర్నీ చేతులతో కౌగిలించుకున్నాడు. ఆ సోదరులు, సీత ఏడవడంతో ఆ పర్వతం మీద సింహాలు గర్జించినప్పుడు కలిగే ప్రతిధ్వని లాంటిది కలిగింది.
తండ్రికి జలతర్పణాలు ఇస్తూ ఏడ్చే ఆ సోదరులు చేసే ధ్వనిని విని భరతుడి సైనికులు భయపడ్డారు. భరతుడు రాముడిని తప్పక కలిసి ఉంటాడు. ఈ ధ్వని మరణించిన తండ్రి గురించి ఏడుస్తున్న వారి రోదన ధ్వనే అని ఆ సైనికులు అనుకున్నారు. వారంతా తమతమ నివాసాలని విడిచి, ఒకే రకమైన ఆలోచనతో పరిగెత్తుతూ తమ తమ స్థానాలని అనుసరించి ఆ ధ్వని వైపు వెళ్లారు.
కొందరు గుర్రాల మీద, కొందరు ఏనుగుల మీద, సుకుమారులైన కొందరు చక్కగా అలంకరించి రథాల మీద, కొందరు కాలి నడకన వెళ్లారు. ఆ ప్రజలంతా కొద్ది కాలం క్రితమే ప్రవాసానికి వెళ్లిన రాముడ్ని చాలా కాలం క్రితం వెళ్లిన వాడిలా భావించి, అతన్ని చూడాలనే కోరికతో త్వరగా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ కలిసిన నలుగురు సోదరులని చూడాలనే తొందరలో ఆ ప్రజలంతా డెక్కల, చక్రాంతాల ధ్వనులతో చెదిరిపోయిన వివిధ వాహనాలు ఎక్కి వెళ్లారు. అనేక వాహనాలు, డెక్కలు, చక్రాంతాలు భూమిని నలక్కొట్టడంతో మేఘాలు కమ్మినప్పుడు ఆకాశం నించి వెలువడే శబ్దం లాంటి శబ్దం బయలుదేరింది. ఆ ధ్వనికి భయపడ్డ సింహాలు, ఆడ సింహాలు తమ వెంట రాగా మదపు వాసనని అంతటా వ్యాపింపచేస్తూ ఆ వనం నించి మరో వనానికి వెళ్లాయి. ఆ శబ్దం విని పందులు, తోడేళ్లు, దున్నపోతులు, పాములు, కోతులు, పులులు, ఆవుల చెవుల్లాంటి చెవులున్న లేళ్లు, గవయాలు, చుక్కల జింకలు భయపడ్డాయి. చక్రవాకాలు, నీటి కోళ్లు, హంసలు, కారండ పక్షులు, కొంగలు, కోకిలలు, క్రౌంచ పక్షులు ఆ ధ్వనికి భయపడి నాలుగు దిక్కులకి పారిపోయాయి. ఆ శబ్దానికి భయపడ్డ పక్షులతో నిండిన ఆకాశం, మనుషులతో నిండిన భూమి ఆ సమయంలో సమానంగా ప్రకాశించాయి.
తర్వాత ఆ ప్రజలు పురుషశ్రేష్ఠుడు, కీర్తివంతుడు, శతృసంహారకుడైన రాముడు నేల మీద కూర్చుని వుండడం చూశారు. వారంతా రాముడ్ని సమీపించి కైకేయి, మంధరలని నిందిస్తూ కన్నీళ్లు కార్చారు. తర్వాత ధర్మాత్ముడైన ఆ రాముడు చాలా దుఃఖిస్తూ కళ్లల్లో నీళ్లు నిండి ఉన్న వాదందరినీ చూసి వారిని కౌగిలించుకున్నాడు. అక్కడ రాముడు కొందర్ని కౌగిలించుకున్నాడు. కొందరు రాముడికి అభివాదం చేశారు. తన మిత్రులు, బంధువుల అందర్నీ రాముడు వారి అర్హతలని అనుసరించి గౌరవించాడు. అక్కడ ఆ మహాత్ముల రోదన ధ్వని భూమిని, ఆకాశాన్ని, పర్వత గుహలని, దిక్కులని ప్రతిధ్వనింప చేస్తూ మృదంగ ధ్వనిలా అవిచ్ఛిన్నంగా వినిపించింది. (అయోధ్యకాండ సర్గ 103-14వ శ్లోకం నించి)
రాముడ్ని చూడాలనే తీవ్రమైన కోరిక గల వశిష్ఠుడు దశరథుడి భార్యలతో ఆ ప్రదేశానికి రథం మీద వెళ్లాడు. రాజు భార్యలు మందాకినీ నది వైపు మెల్లగా నడుస్తూ రామలక్ష్మణులు ఉపయోగించే రేవుని చూశారు. దీనురాలైన కౌసల్య కన్నీటితో నిండి ఎండిపోతున్న మొహంతో, సుమిత్రతో, ఇతర రాజస్ర్తిలతో చెప్పింది.
‘దేశం నించి వెళ్లగొట్టబడి అనాథలై వనంలో నివసించే ఆ సీతారామలక్ష్మణులు వాడే రేవు ఇదే. సుమిత్రా! నీ కొడుకైన లక్ష్మణుడు నా కొడుకైన రాముడి కోసం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఇక్కడ నించి నీళ్లు తీసుకువెళ్తూంటాడు. నీ కొడుకు నీళ్లని తీసుకుని వచ్చే లాంటి నీచమైన పనులు చేసినా, ఆ పని నిందించతగ్గది కాదు. ఎందుకంటే, సోదరుడి కోసం చేసే అన్ని పనులూ గుణాల వల్ల విశిష్టమైనవే. ఇక మీదట రాముడు భరతుడి ప్రార్థనలతో రాజ్యాభిషిక్తుడు అవుతాడు కాబట్టి ఇలాంటి కష్టాలకి తగని నీ కొడుకు నీచము, అధిక దుఃఖకరమైన ఈ సేవని వదిలేస్తాడు.’
కౌసల్య నేల మీద దక్షిణం వైపు పరిచిన దర్భల మీద రాముడు తండ్రిని ఉద్దేశించి ఉంచిన ఇంగుదీ చెట్టు తెలగపిండిని చూసింది. తండ్రి కోసం విచారంతో నేల మీద రాముడు ఉంచిన ఆ పిండాన్ని చూసిన కౌసల్య దశరథుడి భార్యలు అందరితో చెప్పింది.
‘ఇక్ష్వాకు వంశ ప్రభువు, మహాత్ముడు, తండ్రైన దశరథుడికి రాముడు యధావిధిగా ఇచ్చిన ఈ పిండాన్ని చూడండి. దేవుడితో సమానుడు, అనేక భోగాలు అనుభవించినవాడు, మహాత్ముడైన ఆ రాజుకి ఇది తగిన ఆహారం కాదు. ఇంద్రుడితో సమానుడై, నాలుగు సముద్రాల వరకు వ్యాపించిన భూమిని పాలించిన ఆ మహారాజు ఇంగుదీ చెట్టు తెలగపిండిని ఎలా తినగలడు? ఐశ్వర్యవంతుడైన రాముడు తండ్రికి ఇంగుది కాయల పిండిని ఇచ్చాడే? ఇంతకంటే విచారించదగ్గది నాకు లోకంలో ఏదీ కనపడటం లేదు. రాముడు తండ్రికి ఇచ్చిన ఆ ఇంగుది పిండాన్ని చూసాక కూడా నా గుండె దుఃఖంతో వేయి ముక్కలవలేదు. ఎంతాశ్చర్యం! పురుషుడు తనేది తింటాడో దేవతలకి కూడా అదే ఆహారం అనే లోకప్రసిద్ధమైన మాటలు సత్యమని నేను అనుకుంటున్నాను.’
=============================================================
(అయోధ్యకాండ సర్గ 104వ సర్గ 15వ శ్లోకం దాకా)

హరిదాసు కథ ముగించి స్టేజి దిగాక ఓ వృద్ధ శ్రోత చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
‘ఈ హరిదాసు తప్పులు చెప్పకుండా హరికథని చెప్పడు కదా? ఈ రోజూ ఆరు తప్పులు చెప్పాడు.’

మీరు ఆ తప్పులని కనుక్కోగలరా?

1.ఇంకో రెండు, మూడు కాండలతో అది పూర్తయి సుందరకాండలోకి ప్రవేశిస్తాం అని హరిదాసు చెప్పిన ఈ మాటలు తప్పు. అయోధ్యకాండలో మొత్తం 115 కాండలు ఉంటే, హరిదాసు చెప్పింది 103 దాకానే.
2.హరిదాసు చెప్పిన మరో తప్పు తర్వాతి కాండ సుందర కాండ అన్నది. అయోధ్యకాండ తర్వాతది అరణ్యకాండ.
3.హనుమంతుడు తర్వాతి కాండలో వస్తాడని చెప్పడం కూడా తప్పు. అరణ్యకాండలో హనుమంతుడు రాడు.
4.దాసుడినైన నన్ను అనుగ్రహించి ‘దేవేంద్రుడిలా’ ఇప్పుడే పట్ట్భాషిక్తుడివి అవు అని భరతుడు రాముడితో చెప్పాడు. దేవేంద్రుడిలా అనే ముఖ్య పోలికని హరిదాసు చెప్పలేదు.
5.్భరతుడు ‘స్ర్తి అయిన నా తల్లి కైకేయి ప్రేరేపణతో మన తండ్రి తన కీర్తని నశింపచేసే ఈ మహాపాపం చేశాడు’ అని చెప్పాడు. కాని స్ర్తి అయిన నా తల్లి కైకేయి ప్రేరేపణతో అన్న ముఖ్యమైన మాటలని హరిదాసు చెప్పలేదు.
6.ఓ శ్రోత హరిదాసు మొత్తం నాలుగు తప్పులు ఉన్నాయని చెప్పడం తప్పు. హరిదాసు ఐదు తప్పులు చెప్పాడు.
===========================================================
మీకో ప్రశ్న

క్రౌంచ పక్షి అంటే ఏ పక్షి?

==============================================
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

అయోధ్యకాండలో ఉన్న, గాయత్రి మంత్రంలోని బీజాక్షరం ‘ణ’ ఏ సర్గ, ఏ శ్లోకంలో ఉందో చెప్పగలరా?
అయోధ్యకాండలో 99వ సర్గ, 25వ శ్లోకం. ఉటజే రామమాసీనం జటామండల ధారిణంలోని ‘ణ’.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి