S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శరభంగాశ్రమంలో శ్రీరాముడికి కష్టాలు చెప్పి శరణు వేడిన మునీంద్రులు -- శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

వాసుదాసు వ్యాఖ్యానం
అరణ్యకాండ-15

భయంతో - శోకంతో ఖిన్నురాలై వున్న సీతాదేవిని ఓదార్చిన శ్రీరాముడు, తమ్ముడు లక్ష్మణుడితో శరభంగాశ్రమానికి పోవడానికి దారి బాగు చేయమని అంటాడు. అక్కడికి పోయి మహాత్ముడైన వాడిని, దేవ - గంధర్వులు, సిద్ధులు, గొప్ప ఋషులు స్తోత్రం చేసేవాడిని, విశేష బ్రహ్మ తేజస్సు గల శరభంగుండితో సంభాషిస్తున్న ఇంద్రుడిని చూశారు సీతా రామలక్ష్మణులు. అప్పుడు లక్ష్మణుడితో శ్రీరాముడిలా అన్నాడు. ‘ప్రకాశిస్తున్న కాంతిగల ఇంద్రుడిని చూశావా? లక్ష్మణా నువ్విక్కడే సీత దగ్గర ఉండు. ఆ ఇంద్రుడి వృత్తాంతం, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకొని వస్తా’ అని ముని ఆశ్రమానికి చేరబోయాడు. శ్రీరాముడు రావడం చూసిన ఇంద్రుడు, శరభంగుండితో రహస్యంగా, శ్రీరామచంద్రుడు తనను చూడడానికి వస్తున్నాడనీ, ఆయన్ను తానిప్పుడు చూడకూడదనీ అంటాడు. శ్రీరాముడు చేయాల్సిన అసాధ్య కార్యం, రావణాధికం ముందున్నదనీ, అది చేయనివ్వాలనీ, అది ఇతరులు చేయలేనిదనీ, దాంట్లో విజయం సాధించిన తరువాత - కీర్తి పొందిన తరువాత, తానే ఆయన్ను సమీపించి సంభాషిస్తాననీ చెప్పి ఇంద్రుడు రథం ఎక్కి ఆకాశానికి పోయాడు. అలా ఇంద్రుడు పోగానే, వెనక్కు తిరిగి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి, సీతాలక్ష్మణులను కలిసి, వారితో సహా అగ్నిహోత్రంతో ప్రకాశిస్తున్న శరభంగ మహర్షిని భక్తితో సమీపించాడు. చేరి ఆయన పాదాలకు శిరస్సు వంచి మొక్కాడు. మొక్కి ముగ్గురూ నిలుచున్నారు. వారికి ఆసనానికి తగిన పీటలను అమర్చారు ముని. వారు కూర్చొనిన తరువాత, శ్రీరామచంద్రమూర్తి ఇంద్రుడు అక్కడకు రావడానికి కారణం ఏంటని శరభంగుండిని అడిగాడు. జవాబుగా శరభంగుండు ఇలా చెప్పాడు.
‘రామచంద్ర దేవా! నేను తపస్సు చేసి క్షుద్రులు పొందలేని బ్రహ్మలోకాన్ని సంపాదించాను. అక్కడకు నన్ను పిలుచుకొని పోవడానికి ఇంద్రుడు ఇక్కడకు వచ్చాడు. ఆ బ్రహ్మలోకానికంటే కూడా ప్రియమై కోరాల్సిన నువ్వు అతిథిగా నా దగ్గరకు వస్తున్నావని తెలిసి, బ్రహ్మలోక ప్రాప్తికంటే కూడా నీ దర్శనం శ్రేష్ఠం కాబట్టి ఇంద్రుడితో పోవడానికి మనసొప్పలేదు. ఫలితంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక దేవతలు దర్శించే త్రిదివమునకు పోతాను. నేను తపస్సుతో సంపాదించినవన్నీ ఎప్పటికీ తరిగిపోనివి.. పుణ్యలోకాలు కలిగిస్తాయి. నిన్ను దర్శించకుండా నేను బ్రహ్మలోకానికి పోతే ఎలా? స్వర్గలోకంలోని భోగస్థానాలను, బ్రహ్మలోకంలోని భోగస్థానాలను, సంపాదించడానికి నేను చేసిన పుణ్యమంతా నీకిస్తాను. గ్రహించు.’ అప్పుడు సకల శాస్తవ్రేత్త అయిన శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు: ‘మునీంద్రా! నీ పుణ్యాన్నంతా నేను తీసుకుంటా. మేముండడానికి నివాసయోగ్యమైన స్థలమేదో చెప్పు’. జవాబుగా శరభంగుడిలా అన్నాడు: ‘మీరుండడానికి సరైన స్థలం సుతీక్ష్ణుడనే ముని చెప్తాడు. ఈ అడవిలోనే ఆయన ఉన్నాడు. రామచంద్రా! మీరు ఇక్కడ నుండి తూర్పుగా పారుతున్న ఈ పుణ్యనదికి ఎదురెక్కి, పడమటగా పొండి. మధ్యలో పూల గుంపులు నదిలో కనిపిస్తాయి. అదే సరైన తోవ. రామచంద్రా! పోవద్దు. కాసేపుండు. శరీరాన్ని వదులుతా’ అని అంటూనే తన శరీరాన్ని అగ్నిలో ప్రవేశింపచేశాడు. భస్మమైన శరభంగుడు మళ్లీ కుమారుడి రూపాన్ని దాల్చాడు. ఆ రూపంతో బయల్దేరి పోయి, పరబ్రహ్మ లోకంలో భగవన్మూర్తిని చూశాడు. ఆయన కూడా మునిని సుఖంగా వచ్చావా? అని అడిగాడు. సీతారామలక్ష్మణులు ముగ్గురూ ముని శక్తికి ఆశ్చర్యపడ్డారు.
శరభంగుడా విధంగా పరమపదం చేరగా, దివ్యతేజస్సు గల రామచంద్రమూర్తిని, అక్కడున్న ఋషులు కలిసి రక్షించమని వేడుకున్నారు. ఆత్మరక్షణ విషయంలో తాము సమర్థులం కామని, పరాధీనులమనీ, భగవంతుడొక్కడే ఆపద్భాంధవుడనీ భావించిన వీరంతా గొప్ప తపో మహిమ వల్ల కీర్తి పొంది నువ్వే దిక్కని నమ్మారు. క్షత్రియులు, వైశ్యులు కూడా స్వశక్తితో తమ్ము కాపాడుకునే శక్తి కలవారు కాదు. దుష్టులైన రాక్షసులు పెట్టే బాధలు సహించలేక పోతున్నారు. ఇక నువ్వు ఉపేక్షించకూడదు. మా మీద ప్రేమతో మాకు అభయం ఇవ్వు. మాకు భయం లేకుండా చేయి. శ్రీరామచంద్రా! రాక్షస సమూహాల వల్ల హింసించబడ్డ మునుల దేహాల నుండి వెడలిన ఎముకలు దూరంగా పడి ఉన్నాయి. మా వెంట రా.. చూపిస్తాం. మందాకినీ తీరంలో పంపానది ఒడ్డున, చిత్రకూట పర్వతం దగ్గర నివసిస్తున్న ఋషులను రాక్షసులు బాధించి చంపుతున్నారు. మృత్యువును లక్ష్యపెట్టక తపస్సు చేసే మాకెందుకు మరణభీతి అంటావేమో? మాకుగా మేం దుఃఖించడంలేదు. సంసారాన్ని వదలి అడవులకు వచ్చి తపస్సు చేసుకుంటున్న మునిజనులకు కలుగుతున్న అపకారాన్ని చూసి మేం సహించలేక పోతున్నాం. కాబట్టి నువ్వు రక్షించాలి. అమోఘ బలవంతుడివి కాబట్టి నిన్ను రక్షించమని శరణుజొచ్చాం. మేం రాక్షసుల చేతిలో చావకుండా నీ దయాగుణంతో ఆలోచించి మమ్మల్ని కాపాడు. మమ్మల్ని కాపాడమని నిన్ను నిర్బంధించం. నీ కళ్యాణ గుణాలకు హాని రాకుండా కాపాడుకో. మేం అనన్యులం. కాబట్టే.. నీ రక్షకత్వాన్ని కోరి, నువ్వెప్పుడు అవతరిస్తావా? ఎప్పుడు దర్శనమిస్తావా? ఎప్పుడు మమ్మల్ని కృతార్థులను చేసి రక్షిస్తావా? అని ఎదురుచూస్తున్నాం. నువ్వు తప్ప మాకు వేరే గతిలేదు. మా విషయంలో దయ చూపాలా? వద్దా? అనే విషయం సీతాదేవిని అడిగి చూడు..’

-సశేషం

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12