నేనే దేవుణ్ణి!
Published Saturday, 7 April 2018హజ్రత్ బయాజిద్ ఒకసారి దైవచింతనలో మునిగిపోయి, తనను తాను మరచిపోయాడు. ఏవుడు తప్ప అతనికి మరేమీ కనిపించలేదు.
పరవశంతో ‘నేనే దేవుణ్ణి! నేనే దేవుణ్ణి’ అని అరిచాడు.
దగ్గరే వున్న జనం ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు.
‘గౌరవనీయులయిన బయాజిద్గారూ! మీరింతకు ముందు అన్న మాటలకు మీకు అర్థం తెలుసా?’ అన్నారు. అప్పుడు బయాజిద్ మామూలు స్థితిలో వున్నారు.
వాళ్లు ‘మీరు ఎప్పుడూ మాకు శరీరం అన్నది దేవుడు కాడు అని బోధిస్తారు. కానీ కొన్ని క్షణాల క్రితం మీరేమో నేనే దేవుణ్ణని అన్నారు’ అని చెప్పారు.
బయాజిద్ ‘అంత తప్పు నేనెలా చేశాను? నేను కాదు. ఆ మాటలు ఇంకెవరో చెప్పినట్లున్నారు. ఇంకోసారి నేను అట్లాంటి మాటలంటే ముస్లిం న్యాయాన్ని అనుసరించి నన్ను శిక్షించండి’ అన్నాడు.
నాలుగు రోజులు గడిచాయి.
దైవచింతనలో పరవశంలో బయాజిద్ మళ్లీ ఒళ్లు మరిచి ‘నేనే దేవుణ్ణి! నేనే దేవుణ్ణి’ అని అరిచాడు.
ఆ మాటలు విన్న జనాలు, కత్తులు, గొడ్డళ్లు, కర్రలు, రాళ్లు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. అంతకు ముందే ఇస్లాం చట్టాన్ని అనుసరించి నేను మళ్లీ అట్లాంటి తప్పు చేస్తే నన్ను శిక్షించండి’ అని ఆయన అని వున్నాడు కదా! అందుకని ఆయన్ని దండించడానికి ఆయుధాలతో వచ్చాడు అప్పుడు జరిగిన ఘటన గురించి ఇలా చెబుతారు.
ఆకరు ఆయన మీద రాయి విసిరారు. ఆ రాయి విసిరిన అతని మీదకే తిరిగి వెళ్లి అతన్ని గాయపరచింది.
ఒకడు కత్తి విసిరాడు. అది తిరిగి వచ్చి అతనే్న తాకింది.
ఒకడు కర్రతో కొట్టాడు. ఆ కర్ర తిరిగి కొట్టిన వాణ్ణే బాదింది.
హజ్రత్ బయాజిద్కు ఎట్లాంటి గాయమూ కాలేదు. దెబ్బ తగల్లేదు. ఎంతగా ప్రయత్నించినా ఏ ఆయుధమూ ఆయన్ని గాయపరచలేదు. బయాజిద్ పరవశంలో మునిగి తేలియాడాడు.
‘నేనే దేవుణ్ణి! నేనే దేవుణ్ణి’ అంటూనే వున్నాడు.
జనం సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు.
*