సబ్ ఫీచర్

తెలుగునేల కీర్తి పాములపర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రధాన మంత్రి పదవిని అధిష్ఠించిన తొలి దక్షిణాది నేత.. అందునా తెలుగువాడైన పాములపర్తి వేంకట నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. 1921 జూన్ 28న జన్మించిన ఆయన రాజకీయాల్లోనే కాదు, బహుభాషావేత్తగా, మంచి రచయితగానూ రాణించారు. ‘పీవీ’గా లబ్దప్రతిష్ఠుడైన ఆయన స్నాతకోత్తర న్యాయశాస్త్ర పారంగతుడిగా, అపర చాణక్యునిగా పేరొందారు. కుంటుపడిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడి’గా కీర్తినార్జించిన ఆయన తన పదవీ కాలంలో ఎనె్నన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఆయన మన దేశానికి స్వా తంత్య్రం వచ్చిన రోజున (1947 ఆగస్టు 15న) అటవీ క్షేత్రంలో పోరాట క్రమంలోనే ఉన్నారు. 1957లో శాసనసభ్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన పీవీ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా తన మేధాశక్తితో క్రమానుగతంగా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న రాజనీతిజ్ఞుడు. కాంగ్రెస్ హయాంలో పూర్తి సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని తన చాకచక్యంతో, చాణక్యనీతితో పూర్తికాలం నడిపించారు. 1957లోమంథని నుండి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. వరుసగా నాలుగుసార్లు గెలిచారు. 1962లో మొదటి సారి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి, న్యాయ, సమాచార శాఖల మంత్రిగా రెండేళ్లు, 1964నుండి 1967వరకు దేవాదాయ,న్యాయశాఖలను, 1967లో వైద్య, ఆరోగ్యశాఖలను, 1968 నుండి 1971వరకు న్యాయ, సమాచార శాఖలను నిర్వహించారు. 1971 సెప్టెంబర్ నుండి 1973 జనవరి వరకు ముఖ్యమంత్రిగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించగానే అసమ్మతి ఎదురైంది. ఈ విషయమై అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీ- హైదరాబాద్‌ల మధ్య తిరిగేందుకే ఆయనకు సమయం సరిపోయింది. పట్టణ భూగరిష్ఠ చట్టాన్ని తెచ్చిందీ ఆయనే. తర్వాత ఆయన కార్యక్షేత్రం ఢిల్లీకి మారింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తూనే మొదటిసారి హన్మకొండ నుండి లోకసభకు ఎన్నికయ్యారు. ఎనిమిది, తొమ్మిదవ లోకసభలకు రాంటెక్ నుండి ప్రాతినిధ్యం వహించారు. నంద్యాల నియోజకవర్గం నుంచి ఉపఎన్నికలో 5లక్షల వోట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచి దేశ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించారు. 1980-81లో కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, మానవవనరుల అభివృద్ధి శాఖలు చేపట్టారు.
రాజీవ్‌గాంధీ హత్య అనంతరం 1991లో సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండానే దేశ 10వ ప్రధానిగా పీవీ బాధ్యతలను చేపట్టారు. ప్రధానిగా ఆయన ఎన్నో ఘన విజయాలతో పాటు అవినీతి ఆరోపణలూ ఎదుర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం పీపీ చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇచ్చాయి. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, ఆర్థిక శాస్తవ్రేత్తగా ఉన్న డాక్టర్ మన్మోహన్‌సింగ్‌ను పిలిచి దేశ ఆర్థిక మంత్రిని చేయడం పీవీకే చెల్లింది. 1992లో నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజిలో కంప్యూటర్ ఆధారిత వ్యాపార పద్ధతిని ప్రారంభించారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని అణచివేయడంలో పీవీ సఫలీకృతులయ్యారు. కశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు, వారి డిమాండ్లను లక్ష్యపెట్టక బందీలను పిడిపించిన ఘనత కూడా ఆయనదే. ఇజ్రాయిల్‌తో దౌత్య సంబందాలు, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయట పెట్టి ఆగ్నేయాసియా దేశాలతో మంచి సంబంధాలను కలిగి ఉండడం పీవీ ప్రభుత్వం సాధించిన మరో విజయం.
17 భాషలలో అలవోకగా మాట్లాడ గలిగిన మేధావి పీవీ. 1940లో తన సోదరులతో కలిసి కాకతీయ పత్రికలో ఎన్నో వ్యాసాలు రాసారు. 1948నుండి 51వరకు కాకతీయ పత్రిక సంపాదకునిగా పనిచేశారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయి పడగలు’ నవలను ‘సహస్ర ఫణ్’ పేరుతో హిందీలో అనువాదం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 1968-74 మధ్య తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఉన్నారు. 1983లో స్పానిష్ భాషలో ప్రసంగించి, అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో క్యూబా అధ్యక్షుడు కాస్ట్రోను అబ్బుర పరిచిన గొప్పతనం ఆయనది. నిరాడంబరుడిగానే ఆయన రాజకీయ జీవితం సాగింది. తన పిల్లలను సైతం ప్రధాని కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయితీ పరుడు. జీవిత చరమాంకంలో కోర్టుల్లో విచారణలకు తిరగడానికి ఆస్తులను అమ్ముకున్న వ్యక్తి. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పీవీ నరసింహారావు 2004 డిసెంబర్ 23న తుదిశ్వాస వదిలారు.

-సంగనభట్ల రామకిష్టయ్య