సబ్ ఫీచర్

పట్నం కూలీలకు వేతన యాతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్నం అనగానే ఒక రంగుల ప్రపంచంలా- పెద్దపెద్ద భవంతులు, విలాసవంతమైన జీవితం, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, వాహనాల షోరూమ్స్, ఖరీదైన కార్పొరేట్ విద్యాలయాలు, పార్కులు, పబ్‌లు ఇలా ఎన్నో, మరెన్నో కన్పిస్తాయి. మన మిత్రులు గానీ, బంధువులు గానీ పట్నంలో ఉంటే వారిని ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో, పట్నంవాసులని గౌరవిస్తుంటాము. కానీ నేటి వర్తమాన కాలంలో పట్టణ సంస్కృతి, జీవన విధానం గ్రామాల్లోకి వచ్చింది. అయినా పట్నంలో విలాసవంతమైన జీవనం గడపాలంటే ధనవంతులు, వ్యాపారస్తులు, ఉద్యోగులకే పరిమితం గానీ పేద, మధ్యతరగతి కుటుంబాలు పడే ఇక్కట్లు వర్ణించలేని విధంగా ఉంటాయి. ఏ పట్టణాన్ని తీసుకున్నా అత్యధిక శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువున వున్నవారే వుంటారు. వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా అక్షరాస్యత గావించలేక, చదివిన ప్రాథమిక విద్యకే పరిమితమైపోయి, కుటుంబపోషణ నిమిత్తం, తక్షణ అవసరాల దృష్ట్యా దినసరి వేతనాలకు వివిధ రకాల పనులను చేస్తూ ఎంతోమంది జీవనం గడుపుతుంటారు.
అక్షరాస్యత కలిగిన కొంతమంది నెలసరి వేతనాలకు పనిచేస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితులలో గ్రామాల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. భూగర్భజలాలు ఎప్పటి నుండో అంతరించిపోతున్నాయి. కేవలం నదులు, సరస్సులు, చెరువులు ఉన్నచోట్ల, చుట్టుపక్కల , అక్కడక్కడ నీటి సదుపాయం మినహాయిస్తే, మరెక్కడా పంటలు పండిన పరిస్థితి కనిపించదు. వ్యవసాయదారులు వర్షాలపై ఆధారపడి పంటలు వేస్తే, పంట చేతికొచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి అనివార్యం. సరైన సమయంలో వర్షాలు కురవకపోతే పెట్టుబడి సైతం దక్కక, అప్పులపాలై భూములు, ఆస్తులు అమ్ముకొని పట్నాలకు వలసలువెళ్ళి దినసరి వేతనాలకు పనిచేయాల్సిందే. గ్రామాల్లో భూమిలేని వ్యవసాయ కూలీలు, వివిధ కులవృత్తుల కుటుంబాలు సైతం జీవనోపాధికై పట్నాల్లో వలస కూలీలుగా స్థిరపడుతుంటారు. ఈ విధంగా పట్నాల్లోవున్న పేదవారు కొందరు అక్కడక్కడ స్థిర నివాసాలు ఏర్పర్చుకున్నా, చాలామంది గుడిసెలు, టెంట్లతో ఆవాసాలు ఏర్పర్చుకుంటే, గ్రామాలనుండి వలస కార్మికులు మాత్రం మురికివాడల్లో, ఏదైనా ఖాళీగాఉన్నా ప్రభుత్వ స్థలాల్లో, రహదారుల పక్కన తాత్కాలిక గుడారాలను ఏర్పరచుకొని దినసరి వేతనాలకు పనిచేయక తప్పదు.
పట్నాలలో ఎక్కువగా గృహ నిర్మాణ రంగంలో కూలీలకు పని లభిస్తుంది. దానికోసం పొద్దునే లేచి, పనులు ముగించుకొని రోడ్డు మీదికి వచ్చి గుంపుగుంపులుగా నిలబడి పనికోసం వేచిచూస్తారు. ఆ అడ్డా దగ్గరికే మేస్ర్తిలు వచ్చి వారికి కావాల్సినంత మందిని కూలీకి తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి కొంతమందికి పని లభించకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పట్నానికి దగ్గరలోవుండే తోటల్లో, పార్కులలో, షాపులలో, ఫ్యాక్టరీలలో, కంపెనీలలో, సహాయకులుగా పనిచేసేవారు ఎందరో. కూలీలు విభిన్నరకాల పనులను వెతుక్కోవడం జరుగుతుంది. ధనవంతుల, వ్యాపారస్తుల, ఉద్యోగుల ఇళ్ళలో గ్రామీణ మహిళలు వంట మనుషులుగా, పిల్లలను చూసుకోవడానికి, పనిమనుషులుగా చేస్తుంటారు. నిర్మాణ రంగంలో, మూటలు మోయడానికి, ఇళ్లకు రంగులు వేయడానికి, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, కాపలాదారులుగా ఉండటానికి పురుషులు వెళుతుంటారు. ఏదైతేనేమి గ్రామాల్లోకంటే పట్నాల్లో ఏవో ఒకరకమైన పనులు లభించినప్పటికీ, కూలీలకు వేతనాలు సరిపోక అష్టకష్టాలు తప్పవు. నిత్యావసర సరకుల ధరలు పెరగడం మూలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి దాపురిస్తుంది.
పట్టణాల్లో దినసరి వేతనాలకు పనిచేసే కూలీలకు నెలంతా పని దొరుకుతుందనే నమ్మకం లేకపోగా, పని చేసిన రోజుల్లో సైతం అరకొర వేతనాలతో గడుపుతున్నారు. పీల్చేగాలికి తప్ప మిగతా అన్నింటికీ కొంత ధర చెల్లిస్తేగానీ దొరకని పరిస్థితి, వంట సరుకులు, నీళ్ళు, ఫోన్ల రీఛార్జ్, కేబుల్ బిల్లు, బట్టలు, బస్ చార్జీలు, పిల్లల ఖర్చులు ఇలా ఎన్నోరకాల ఖర్చులతో ఇబ్బందులను ఎదుర్కొంటూ పూట గడుపుతున్నారే తప్ప ఆదాయాన్ని భద్రపర్చలేక పోతున్నారు.
ప్రభుత్వం ఏం చేయాలి..?
* పట్టణాలకు గ్రామాల నుంచి వలసలను ఆపాలి. అక్కడే ప్రభుత్వం తరఫున జాతీయ ఉపాధిహామీ పథకాలను కట్టుదిట్టం చేస్తూ, పలువురికి ఉపయోగకరమైన పనులు చేయిస్తూ, ఖర్చులను పరిగణనలోకి తీసుకొని దినసరి వేతనాలను పెంచి, ఎక్కువరోజులు పనిని కల్పించేందుకు కృషిచేయాలి.
* పట్టణాలలో సైతం దారిద్య్రరేఖకు దిగువనున్న పేద ప్రజలకు ప్రభుత్వం జాతీయ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి, మొక్కలు నాటడమో, చెట్లకు నీళ్ళుపోయడమో, పరిశుభ్రతకు సంబంధించిన పనులను కల్పిస్తూ, ఖర్చుల మేరకు దినసరి వేతనాలను ఇవ్వాలి.
* పక్కా ఇళ్ళు లేనివారికి, మురికివాడల్లో నివసించే పేదలకు సంబంధించి సర్వేలు నిర్వహించి, వారికి ప్రభుత్వమే పక్కాఇళ్లను నిర్మించి ఇవ్వాలి. అలాగే పట్టణాలలో విధించే కొన్ని పన్నుల నుండి ఇలాంటి పేదలకు రాయితీలనివ్వాలి.
* ప్రభుత్వపరంగానే ఒక వ్యవస్థను రూపొందించి కుటీర పరిశ్రమలు, చిన్నచిన్న వస్తువులను తయారుచేసే కంపెనీలను ప్రారంభించి, పట్టణ పేదలకు అందులో పనిచేసే అవకాశాన్ని కల్పించాలి.
* కూలీల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలను కల్పించి, వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
* పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రభుత్వమే నేరుగా కల్పించుకొని మహిళలకు, పురుషులకు దినసరి వేతనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది.
* పట్టణాల్లో వుండే పేదవారిపై అధికారులు, వ్యాపారస్తులు, ధనవంతులు ఎలాంటి అజమాయిషీ చేయకుండా, వారిని గౌరవప్రదంగా చూడాలి.
పట్టణాలంటేనే వ్యాపారానికి పుట్టినిల్లు, ధనవంతులు స్థాపించే వ్యాపారాలలో పనులు చేయాలంటే కూలీలు ఉండాల్సిందే. ఇంటి పని, వంట పని, తోటపనులు చేయడానికి, ఇంటి కాపలా కాయడానికి, ధనవంతులు చేసుకోలేని ప్రతి పనిని పేదవారే చేస్తారనడం నిజం. వీరు పనులను ఆపేస్తే ఎంతటి సంపన్నులైనా ఇబ్బందులు పడక తప్పదు. ధనవంతులు, వ్యాపారస్తులు, ప్రభుత్వం పట్నంలోని కూలీల పరిస్థితిని అర్థం చేసుకొని, వారి భవిష్యత్‌కు మంచి మార్గం చూపడానికి ప్రయత్నించాలి.

-డా. పోలం సైదులు 94419 30361