ఈ వారం కథ

ప్రకృతి గెలిచింది (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్త మానవ ప్రపంచం ఒక్కసారిగా కలవరపడింది. అంతరిక్షంలోని ఒక తెలియని శక్తి భూ ఆవరణలోకి ప్రవేశించి మానవులను ఎగరేసుకుపోతోంది. పిల్లా పాప, చిన్నా పెద్ద, ముసలి ముతక, ఎంతటివారైనా ఎవ్వరికీ ఏ భేదం లేదన్నట్లు, ఎవరో లాక్కుపోతున్నట్లు ఎగిరి మాయమవుతున్నారు. వీరంతా భూ ఆవరణాన్ని దాటి తెలియని ఒక బిలంలోకి పోతున్నారు. మనుష్యుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. కాని అవి ఎవ్వరి దరి చేరటంలేదు. ఎవరికివారు అందులో పడిపోయేవారమేనన్న జ్ఞానరేఖ ఆ చివరి క్షణంలో వారికి స్ఫురించింది. చిత్రమేమిటో పైకి ఎగిరిపోయి, భూ ఆవరణ దాటి ఆ బిలంలోకి పడిపోతున్న వాళ్ళు తమతో ఏమీ తీసుకుపోవటం లేదు. పైకి ఎగిరిపోతున్నవాళ్ళు వాళ్ళ స్మృతులను, స్పృహను సైతం కోల్పోతున్నారు. ఎవరికి వారు తమకు తాము ఎవరికీ ఏమీ అవము అన్నట్లుగా గుర్తు కూడా లేకుండా అయిపోయారు.
మానవుడు ఈ భూమీద తాను సృష్టించిన సమస్తం అన్ని ఎక్కడికి అక్కడే మిగిలిపోతున్నాయి. బొక్కసాల్లో దాచుకున్న డబ్బు, నగా నట్రా కూడా భూమి మీదే నిలిచిపోతున్నాయి. ఆ భయంకర చీకటి బిలంలోకి కేవలం మానవజాతి మాత్రమే లాగబడుతోంది. జీవం వున్న చెట్లూ చేమలూ, జంతుజాలం, ఇతర ప్రకృతి సంబంధ జీవులకు ఎలాంటి ముప్పు వాటిల్లటంలేదు.
ఈ ప్రపంచ మానవ జనాభా అంతా అందులో పడిపోతుందా? లేక కొందరు మానవులైనా బ్రతికి బట్టకడతారా అన్న సందేహం కొందరికి తట్టింది. ఈ భూమి మీద ఇన్ని ప్రాణులుంటే కేవలం మానవులకే ఎందుకు ఈ అగత్యం పట్టింది? మానవుడు ప్రకృతి పట్ల వ్యవహరించిన విధ్వంసపూరిత దాడికి ప్రతిదాడిగా ఏదైనా అదృశ్యశక్తి ఏమన్నా మానవుడిపై చర్యలు తీసుకుంటోందా అనే ప్రశ్న వారిలో మొదటిసారిగా ఉదయించింది.
మానవులే ఎందుకు ఒక్కసారిగా ఆ బిలంలోకి పడిపోతున్నారో శాస్తజ్ఞ్రులకు సైతం అంతుపట్టటంలేదు. కొందరు శాస్తవ్రేత్తలు మనం రేపటిలోపు ఆ బిలంలోకి పడిపోతామని అంటుంటే కాదు కొన్ని గంటల్లోనే పడిపోతామని వారిలో వారే ఇంకా వాదులాడుకుంటున్నారు.
మనిషిలోని స్వార్థమే దీనికి మూలమని, నింగినీ, నేలను ఏకం చేసి అడ్డూ ఆపూ లేకుండా చెట్లు, చేమలను తొలగించటమేనని, భూగర్భ సంపద కోసం యంత్రాలతో సొరంగాలు త్రవ్వి అంతులేని పెద్ద పెద్ద గుంటలు చేయటం, త్రవ్విన మట్టిని, రాళ్ళను రాశులు, గుట్టలు మార్చటం, భూమిని నిత్యం త్రవ్విపోస్తూ భూపొరలను పటాపంచలు చేయటం, ప్రకృతిలో ఉండే ఇతర జీవులను పరిమార్చటం, స్వార్థ చింతన మనిషిలో పెరగటంవల్లే మానవ జాతిని ఈ విధంగా తెలియని ఒక అదృశ్యశక్తి కబళిస్తోందని వారికి రూఢీ అయ్యింది. కాదు.. కాదు వారికి తత్వం బోధపడింది. ఆ బిలంలోకి పడిపోయినా కూడా అక్కడ ఒకవేళ బ్రతకగలిగితే ఏదైనా శాస్త్ర పరిశోధనలు చేయొచ్చులే అనుకుంటూ ఆశగా కొంతమంది చమత్కరించుకుంటూ శాస్త్ర పరికరాలను కావలించుకుని పట్టుకుని ఉన్నారు. రాజకీయ నేతలు తమ పదవి కుర్చీలను ఆలాగే పట్టుకున్నారు. కుర్చీలను పట్టుకున్న నాయకులు ఆ బిలం వైపు అయస్కాంతంలాగా లాగివేయబడటంతో చేసేది లేక వదలివేయటంతో అమాంతం వెళ్లి ఆ బిలంలోకి పడిపోతున్నారు. సామాన్యులు, వ్యాపారులు కూడా దీనికి అతీతం కానట్లు వారిదీ అదే పరిస్థితి. సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం లోపల విశ్వమానవ జాతి అంతా ఆ బిలంలో పడిపోయింది.
భూమిమీద మానవుని పుట్టుక, చావులను నిర్థారించే జాడలు తప్ప ఒక్క మానవ ప్రాణి కూడా లేకుండా పోయింది. మానవుడు ప్రకృతి పట్ల చేసిన తప్పులకు జలప్రళయం రాలేదు. అగ్ని పర్వతాలు ప్రేలలేదు. భూకంపాలు సంభవించలేదు. సముద్రాలు పొంగలేదు. ప్రకృతిని, పర్యావరణాన్ని వందల సంవత్సరాలుగా రాచి రంపాన పెట్టి తానొక్కడినే ఈ భూమి మీద బ్రతకాలని చేసిన ప్రపంచ దేశాల ఆదేశాలు, తీర్మానాలు మానవ నిర్మూలనతో రద్దయిపోయాయి. మనిషి తాను బ్రతికినన్నాళ్ళు సుఖం కోసం తాపత్రయపడి నిరంతరం తన స్వార్థం కోసం ఆలోచించిన మనిషి పీడ ఈ ప్రకృతికి వదిలింది. ఊర్లకు ఊర్లు, దేశాలకు దేశాలు మానవరహిత ప్రకృతివనంగా మారబోతున్న ఛాయలు గోచరిస్తున్నాయి.
ఎందుకన్నట్లో ఏమో భూగోళమంతా జోరున వర్షం కురిసింది. మనిషి జాడ భూమిమీద పూర్తిగా లేకుండా పోయింది. ప్రకృతి కోల్పోయిన జీవ ప్రశాంతత పునఃప్రారంభం అయ్యే కాలం రానే వచ్చింది. నగరాలకు ఆనుకుని ఉన్న పట్టణాలు, వాటికి ఆనుకుని వున్న పల్లెలు మానవుడి ఛాయలు లేకపోవటంతో అవన్నీ అడవిలో కలిసిపోయాయి. మానవుడు చెరిపేసిన అడవి సరిహద్దులు ఎలాంటి ఆటంకం లేకుండానే విస్తరించాయి. వృక్షాలు వేళ్ళూనుకుంటూ ఆకాశంవైపు పెరుగుతున్నాయి. ఊడల మధ్యన చిక్కుకున్న భవనాలు, కట్టడాలు, స్మారకాలు భూమిలోకి అదిమివేయబడ్డాయి. మానవుడు జంతువులను, పక్షులను బంధించి ఉంచిన జంతుప్రదర్శనశాలల నుంచి అవి అతి కష్టంమీద బయటపడ్డాయి. వాటికి పూర్ణ స్వేచ్ఛ లభించింది. రహదారులు పచ్చికమయమయ్యాయి. వృక్షాల వేర్లు ఆకాశహర్మ్యాల పునాదులను కదిలించి కూల్చివేశాయి. కూలిపోయిన కుప్పలపై మొక్కలు మొలిచి వృక్షాలుగా మారబోతున్నాయి. నదులు నిండుగా ప్రవహిస్తూ అడ్డుకట్టగా వేసిన ఆనకట్టలను కూల్చి సముద్రాన్ని చేరాయి. సముద్ర జలాల్లో స్వచ్ఛమైన నీరు చేరి ఉప్పదనం, ఆమ్లతత్వం తగ్గి ఆమ్లజని పెరిగి సముద్ర జీవజాతులు పెరిగాయి. సముద్రపు తాబేళ్ళు బెదురులేక తీరానికి చేరి గుడ్లు పెట్టి పిల్లల్ని కని యధేచ్చగా సముద్రంలోకి తిరుగు ప్రయాణం అవుతున్నాయి.
మానవుడి గొడ్డళ్ళకు, రంపాలకు బలైన వృక్షజాతులు ఒక్కొక్కటే నిలదొక్కుకుంటున్నాయి. కత్తులకు బలయ్యే జంతువులు కానరావటంలేదు. పక్షులు గూడు కట్టుకోవటానికి అనువైన చెట్లు పెరిగాయి. ప్రకృతి సంగమ చర్యల్లో జంతుజాలం వృద్ధి అవుతోంది. పశుపక్ష్యాదులకు ఆహార లోటు లేకుండా పోయింది. ప్రకృతి యధాస్థితిని పొందింది.
మానవరహిత భూగోళంలో ఇపుడు ప్రకృతిపై దాడి లేదు. ప్రకృతితో ఆటలాడినందుకు మానవుడు మూల్యం చెల్లించాడు. అర్థరహిత విధ్వంసకర అభివృద్ధి చేసిన మానవునికి ప్రకృతి తగిన గుణపాఠం చెప్పింది. ప్రకృతి గోడు విన్న అదృశ్యశక్తి మానవుడిని రక్తపాతం జరగకుండానే ఒక పెద్ద గుండుసున్నా చుట్టినట్లు చుట్టి పైకి ఎగరేసుకుని వెళ్ళి చీకటి బిలంలో పడేసి సమాధి చేసింది. ఇప్పుడు ప్రకృతి వనరుల కబ్జా లేదు. ఆధిపత్యం లేదు. ప్రకృతిని అదిలించే వీలు లేదు. ‘‘మానవుని జనన మరణాల మధ్య జీవనం అంతా ప్రకృతి, పర్యావరణాన్ని చెరపట్టటమేగా?’’- అందుకే మానవుడు భూమి మీద మిగలలేదు. పర్యావరణాన్ని కాదని నశించాడు. అవును ప్రకృతి గెలిచింది. పర్యావరణం నిలిచింది.. మానవుడు ఓడిపోయాడు. *

-కప్పగంతు వెంకట రమణమూర్తి