శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

రాముడికి సమాధానం చెప్పిన లక్ష్మణుడు( అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతగానో కలత చెందిన మనసుకల శ్రీరామచంద్రుడు, సీతాదేవి రాక్షసుల చేతిలో చిక్కి మరణించిందేమోనని అనుమానపడతాడు. అలా కాకపోతే ఇంతలోనే ఎక్కడికి పోయి ఉంటుందని అనుకుంటాడు. ‘అయ్యో! అందమైన కమ్మలతో, చంద్రబింబం, కమలాలతో సమానమైన సీత ముఖం ఇప్పటికే ఎంత వాడిపోయిందో కదా? మనోహరమైన సంపెంగ పూవులాగా వుండే ఆమె పచ్చని దేహంతో ముత్యాల సరాలు ఆమె వొంటి మీద వేలాడుతుంటే, ఆమెను అదే పనిగా అరుస్తుంటే రాక్షసులు నరికి వేశారేమో? చిగురైన, కోమలమైన ఆమె చేతులను తెగే విధంగా విరిచి చెరుకు తుంటలాగా తింటున్నారేమో? చెరకు తుంటలాగా భావించి ఆమె నడుమును రెండుగా విరిచి పాపాత్ములు తింటున్నారేమో? దుష్ట రాక్షసులు సీతను చంపారేమో? అన్నా! లక్ష్మణా! నేను చిత్తభ్రమలో వున్నాను కాబట్టి, బహుశా, నాకు సీత కనపడలేదేమో? నీకైనా కనిపించిందా? చిన్నారి చిన్నదానా! నిన్ను నేను మళ్లీ చూడగలనా?’ ఇలా ఏడుస్తూ శ్రీరాముడు వేగంగా ఒక వనం తరువాత మరో వనంలో వెతుకుతూ, భ్రమతో, సీతా సీతా అని పిలుస్తూ వెర్రివాడిలాగా శోకించాడు.
సీతాదేవిని తలుచుకుంటూ శ్రీరాముడు భయంతో, శోకంతో రెండు చేతులెత్తి ‘హో’ అని ఏడ్చాడు. అలా ఏడుస్తూనే, ‘ఏరా తమ్ముడా! లక్ష్మణా! సీత ఆశ్రమంలో లేదు కదరా? ఎక్కడికి పోయిందో కదరా? ఘాతుకంగా ఏదైనా తిన్నదేమో? ఎవరైనా ఎత్తుకుని పోయారేమో కదరా? కమలాల లాంటి కళ్లున్న సీతాదేవిని విడిచి నేను ఒక్క నిమిషమైనా బ్రతకగలనా? నా చెలీ! మళ్లీ నిన్ను కళ్లారా చూడగలనా? అయ్యో! స్ర్తి రత్నమా! బాలారత్నమా, నా ఏడుపు అలా వుండనీ, నువ్వు మచ్చిక చేసుకున్నందున నీతో తిరిగిన క్రీడా మృగాలు నిన్ను విడిచినందువల్ల విశేషంగా ఏడుస్తున్నాయే? అది కూడా నీకు తెలియదా? సీతాదేవిని విడిచిన దుఃఖాతిశయంతో మరణించి స్వర్గానికి పోతే, అక్కడ నా తండ్రి ‘ఏమిరా! రామా! నీకు నేనేం చెప్పానురా? పధ్నాలుగు సంవత్సరాలు అడవిలో వుండమన్నాను కదా? ఆ గడువు ముగిసిందా? ఇక్కడికి వచ్చావెందుకురా? ఛీ!’ అని అసత్యవాదిని, మోసగాడిని, మర్యాద తప్పిన వాడిని అయిన నన్ను చీవాట్లు పెడ్తాడు. నా మంచి కీర్తి అంతా వదిలిపోయే విధంగా నా మీద దయ లేకుండా నన్ను వదిలి నువ్వు ఇలా పోవచ్చా? నన్ను విడిచి నువ్వు ఎక్కడికో పోగలిగావు కానీ, నేనలా పోలేను కదా? ఇంక నా గతేంటి? ఈ శరీరాన్ని నేనెలా మోసుకుని తిరగ్గలను?’ అంటాడు.
సీతాదేవిని ఇలా వెతుక్కుంటూ బురదలో మునిగిన ఏనుగులాగా సహించలేని బాధతో ఉన్న అన్నకు లక్ష్మణుడు హితవాక్యాలను చెప్పాడిలా.
‘అన్నా! ఎందుకిలా దుఃఖంతో బాధపడతావు? ఈ వంకల్లో, వాగుల్లో, గుహలలో, లోయలలో, కానలలో, కోనలలో, కొండ గుహల్లో, సీతను వెతికితే ఆమె కనిపించదా? ఎక్కడా వుండకుండా ఎక్కడికి పోతుంది? ధీరుల్లో శ్రేష్టుడా! లే.. లెమ్ము. సీతాదేవికి వనసంచారం అంటే ఇష్టమని నీకు తెలియదా? స్నానానికే పోయిందో, వికసించిన కమలాల కోసమే పోయిందో, నవ్వులాటకై దాక్కుందేమో లేక మనల్ని భయపెట్టటానికి దాక్కుందేమో? సీతాదేవి ఎక్కడికి పోగలదు? మనం ప్రయత్నం చేసి వెతుకుతే దొరక్కపోతుందా? అవశ్యం దొరుకుతుంది. నువ్వు బాధను వదులుకో. దుఃఖపడవద్దు’ ఈ మాటలు విన్న రాముడు మళ్లీ లేచి అడవిలో తిరిగి వెతకడం మొదలుపెట్టాడు.
కొండలు, గుట్టలు, కోనలు, నదులు, కానలు, కొలకులు వెతికి వెతికి సీతాదేవి జాడ లేకపోయేసరికి రామచంద్రమూర్తి లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ‘లక్ష్మణా! దండకారణ్యం అంతా వెతికాం. వృథా కష్టం అయింది కదా? ఆ మదగజగామిని ఎక్కడికి పోయిందో, ఏమో? నేనేమి చేయాలిప్పుడు?’ జవాబుగా లక్ష్మణుడు, ‘అన్నా, పూర్వం బలి దగ్గర నుండి బలాత్కారంగా భూమిని గ్రహించినట్లు నువ్వు సీతను మళ్లీ పొందగలవు’ అప్పుడు రామచంద్రమూర్తి ఇలా అన్నాడు.
‘ఈ ప్రదేశమంతా వెతికాం. శ్రమ కలిగిందే కానీ సీతైతే కనబడలేదు. ఈ పర్వతంలో అనేక గుహలున్నాయి. ఎక్కడని మనం వెతకగలం?’ అని అంటూ, కాసేపు మూర్ఛపోవడం, కాసేపు నేలమీద పడడం, కాసేపు ఏడవటం, ‘బాలా! సీతా! సీతా! ఎక్కడికి పోయావే?’ అని నేల మీద పడిపోయాడు. తమ్ముడు లక్ష్మణుడు సమాధాన పరచడానికి ఏవేవో మాటలు చెప్పినా వాటిని అంగీకరించకుండా దుఃఖంతో బాధపడుతూ పరితపించాడు. సీతాదేవిని కానక రామచంద్రుడు, తానూ భరించాల్సిన భార్యను ఆపదల నుండి రక్షించ లేదే అనుకుంటాడు. ఆశ్రీతురాలైన పతివ్రతను వదలడం మహా పాపకార్యం అనుకుంటాడు. మన్మథ బాణ పీడితుడైన రాముడు ‘సీతా’ అని గట్టిగా ఏడ్చాడు.
-సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12