శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

రావణుడిని నిందించిన శూర్పణఖ ( అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావణుడిని నిందిస్తూ శూర్పణఖ ఇంకా ఇలా అంది. ‘ఇంత వయసు వచ్చినా అవివేకం పోలేదు నీకు. వివేకం రాలేదు. ఏమేమి తెలుసుకోవాలో అది నీకు తెలియదు. ఇలాంటి వాడివి రాజై ఎలా బాగుపడుతావు? తనకు స్వంత వేగుల వాళ్లు లేకుండా, ఇతరులు ఏర్పాటు చేసిన వేగుల వాళ్ల మాటలు నమ్మి ప్రవర్తించేవాడు, కోశాగారానికి ఇతరులకు పెత్తనమిచ్చేవాడు, ఇతరులు చెప్పిన నీతులు అనుసరించేవాడు, వాడెంత గొప్పవాడైనా పామరుడితో సమానమే. దూర దేశాల్లో జరిగే సంగతులు వేగుల వాళ్ల ద్వారా తెలుసుకుంటే, అది తన సమక్షంలోనే చూసినట్లు ఉంటుంది. కాబట్టే రాజుకు దీర్ఘ చక్షువు అని పేరు. నీకు వేగులు లేరు కాబట్టి నీకా పేరు లేదు.. నీకా చూపూ లేదు. ఇలా నువ్వుండడం వల్లే, నీ మంత్రుల గుంపు సేవిస్తుంటే వారి మాటలు వింటూ వుండడం వల్లే, అలా సుఖానికి అలవాటు పడడం వల్లే, నీ జనస్థానంలో నీ బంధువులందరూ చచ్చిన వార్త నీకెలా తెలుస్తుంది? ఖర దూషణాది బంధువులతో సహా పద్నాలుగు వేల మంది రాక్షసులను రామచంద్రమూర్తి ఒక్కడే తన విల్లు బలంతో యుద్ధ్భూమిలో నాశనం చేశాడు. నీ తమ్ములను, బంధువులను, అందరినీ ఒక్కడు కూడా లేకుండా చంపాడు. నీకు విరోధులై, నీ కీడు కోరే రాక్షసులకు ఇక రావణుడి భయం లేదు. తాను రక్షిస్తానని చెప్పాడు. దండకారణ్యంలో నీ వాళ్ల భయం లేకుండా చేశాడు. ఇవన్నీ అతి బలవంతుడైన రామచంద్రుడు ఒక్కడే చేశాడు.’
‘నువ్వు లోభివి కాబట్టి వేగుల వాళ్లకు జీతాలు ఇవ్వవు కనుక వారంతా జరిగే విషయాలు నీకు తక్షణమే చెప్పరు. నువ్వేమో ఇతరులకు స్వాధీనపడి స్వతంత్ర శక్తి లేక, ఆ మంత్రి, ఈ మంత్రి చెప్పినట్లు వింటున్నావు. రాగల కీడు తెలుసుకోలేక పోతున్నావు. నీ దేశంలోనే భయం కలగడం నీకింతవరకూ తెలియదు కదా? రావణా నినే్నమనాలి? కష్టానికి తగ్గట్లు సేవకులకు జీతాలివ్వవు. ఇలాంటి క్రూరుడికి, మదం పట్టిన వాడికి, పొగరుబోతుకు, ద్రోహికి ఆపదలు కలిగినప్పుడు సేవకుల్లో ఒక్కడైనా సహాయం చేయడానికి ముందుకు రాడు. కారణం లేకుండా కోప్పడే రాజును, ఇతరులు భయపడేట్లు ప్రవర్తించే రాజును, గర్వంతో తనను తానే పొగడుకునే రాజును, వాడి బంధువులు, వాడి సేవకులే చంపుతారు. తన తప్పులు తెలుసుకుంటూ చక్కటి ఆలోచనతో పనులు చక్కదిద్దకుండా వుండే రాజుకు ఐశ్వర్యమంతా నాశనమై పోయి, వాడు సన్నగడ్డితో సమానమై దుఃఖపడుతుంటే, వాడిని అందరూ అలక్ష్యంగా చూస్తారు కాని, అయ్యో పాపం! వాడికి ఇలాంటి గతి పట్టిందే అని ఒక్కరైనా బాధపడరు’
‘లోకంలో దేనికీ పనికిరానివైనా ఏదో ఒక సమయంలో పనికొస్తాయేమో కాని, రాజుగా వుండి రాజ్యాన్ని పోగొట్టుకున్న వాడు గవ్వకైనా కొరగాడు. రాజుగా ఉండి భ్రష్టుడైన వాడు ఎంత గొప్పగా బతికినా, కొరకానివాడే. ఇవన్నీ తెలుసుకొని పరులు తనకు చేసిన మేలు మరవకుండా, ధర్మస్వభావుడైన రాజు దీర్ఘకాలం సంపదతో సుఖపడతాడు. దుర్మార్గులు తామెంత అధర్మంగా ఉన్నా, పరులకు హితోపదేశం చేసేటప్పుడు ధర్మానే్న చెప్తారు. దోషుల మీద కోపం, సాధువుల మీద దయ కనబరుస్తూ నీతిమార్గంలో నడిచే రాజును సర్వసేవకులు భయభక్తులతో కొలుస్తారు. అవివేకీ నీలో ఎంత వెతికి చూసినా రాజులకుండాల్సిన గుణాలు ఒక్కటైనా లేవు. అకాలంలో పడ్డ పిడుగులాగా దండకారణ్యంలో నువ్వు కాపుగా వుంచిన వారంతా యుద్ధంలో చావడం వేగులు లేనందున నీకు తెలియదు. సుఖంలో మునిగి నిన్ను చంపనున్న శత్రువులను ఉపేక్షిస్తున్నావు. అన్నీ మనకనుకూలమైన దేశాలే అనుకుంటున్నావు. అన్ని కాలాలు మనకు అనుకూలమైనవే అనుకుంటున్నావు. కానీ, భిన్న దేశాలలో, భిన్న కాలాలలో జరిగే విషయాలు కామలోలుడవైన నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. ఎవరిలో ఎక్కడ ఏ మంచి కలదో, ఏ చెడ్డ కలదో తెలుసుకునే శక్తి నీకు లేదు. కాబట్టి, ఓ రాక్షసరాజా! శీఘ్రకాలంలోనే నీ సంపదను పోగొట్టుకుంటావు.
(తన వికార స్వరూపంతో, నిండు కొలువులో రాజు మంత్రులతో ఉన్న సమయంలో, ఒక ఆడది, రాజు చెల్లెలు, అంతఃపురంలో వుండాల్సింది, బజారు మనిషిలాగా ఇంత మందిలోకి వచ్చి, ఎవరికేమి కోపం వస్తుందో అని ఏ మాత్రం ఆలోచించకుండా, మాట్లాడినపుడే శూర్పణఖ సిగ్గు, బిడియం విడిచిందని స్పష్టమైంది. ఇంతవరకు శూర్పణఖ తన పరాభవ కారణం కానీ, పరాభవించిన వాడి పేరు కానీ చెప్పలేదు. ఎందుకు? ఆ విషయం ముందే చెప్తే, ఆమెను అవమానించిన కారణాన తనను దూషిస్తున్నదని అభిప్రాయ పడతాడేమో! అలాంటి అభిప్రాయం కలిగితే, తాను చెప్పినట్లు చేయకపోవచ్చేమో అన్న అనుమానం. చేయకపోతే రాముడిని పరాభవించాలన్న తన కోరిక తీరదు కదా! దశరథుడి విషయంలో కైక ఎలాంటి ఉపాయం చేసిందో అలాగే శూర్పణఖ కూడా ఇక్కడ చేసింది. అక్కడ కామం.. ఇక్కడ కోపం.)
-సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12