క్రీడాభూమి
ఆస్ట్రేలియాపై కివీస్ గెలుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ధర్మశాల: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో టీమిండియాను మట్టికరిపించి ఈ టోర్నీలో శుభారంభాన్ని సాధించిన న్యూజిలాండ్ జట్టు శుక్రవారం మధ్యాహ్నం ధర్మశాలలో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఎనిమిది పరుగుల తేడాతో ఓడించి సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకునే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు సాధించింది. అనంతరం న్యూజిలాండ్ బౌలర్లు మరోసారి అద్భుత ప్రదర్శనతో విజృంభించి ప్రత్యర్థులను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే రాబట్టడంతో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో నాటకీయ రీతిలో విజయం సాధించింది. 17 పరుగులకే 3 వికెట్లు కైవసం చేసుకుని న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన మెక్క్లెనఘన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ముఖ్యమైన బ్యాట్స్మన్లంతా సరిగా రాణించలేకపోవడంతో ఆ జట్టు కీలక సమయాల్లో వత్తిడిని అధిగమించలేక చతికిలబడింది. 143 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ జట్టుకు ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (38), షేన్ వాట్సన్ (13) 42 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఆ తర్వాత ఆ జట్టు కేవలం 14 పరుగుల వ్యవధిలో ఖ్వాజా, వాట్సన్లతో పాటు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (6), డేవిడ్ వార్నర్ (6) వికెట్లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో గ్లెన్ మ్యాక్స్వెల్, మిఛెల్ స్టార్ కొద్దిసేపు స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్కు వీరు 36 పరుగులు జోడించిన తర్వాత మ్యాక్స్వెల్ (22) ఇష్ సోధీ బౌలింగ్లో కాన్ విలియమ్సన్ చేతికి చిక్కగా, కొద్దిసేపటికి మార్ష్ (24), అస్టోన్ అగర్ (9) మెక్క్లెనఘన్ బౌలింగ్లో నిష్క్రమించారు. దీంతో విజయం కోసం చివరి ఓవర్లో 19 పరుగులు సాధించాల్సిన ఆస్ట్రేలియా జట్టు జేమ్స్ ఫాల్క్నర్ (2), నాథన్ కౌల్టర్ నీల్ (1) వికెట్లను కూడా కోల్పోగా, వికెట్ కీపర్ పీటర్ నెవిల్ (7), ఆడమ్ జంపా (1) అజేయంగా నిలిచారు. దీంతో ఆ ఓవర్లో 11 పరుగులు మాత్రమే రాబట్టిన ఆస్ట్రేలియా జట్టు 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అంతకుముందు న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 27 బంతుల్లోనే 39 పరుగులు సాధించగా, కెప్టెన్ కాన్ విలియమ్సన్ (20 బంతుల్లో 24 పరుగులు), కోలిన్ మన్రో (26 బంతుల్లో 23 పరుగులు), గ్రాంట్ ఇలియట్ (20 బంతుల్లో 27 పరుగులు) తమవంతు రాణించారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు సాధించింది.