రివ్యూ

పదునులేని పోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ** ఫర్వాలేదు
**
తారాగణం: విజయ్‌కుమార్, యజ్ఞశెట్టి, శ్రీతేజ్ తదితరులు
రచన: వర్మ, నరేంద్రాచారి
కెమెరా: రామి
సంగీతం: కళ్యాణి మాలిక్
నిర్మాత: రాకేష్‌రెడ్డి, దీప్తి బాలగిరి
దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ, అగస్త్యా మంజు
**
మహానటుడు అన్న నందమూరి తారక రామారావు జీవిత కథతో సినిమా చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నపుడు ఎన్టీఆర్ బయోపిక్‌లోని మరో కోణంలో సినిమా వస్తే దాన్ని ఇంకో కోణంలో వివాద్పాద కథతో సినిమా తీసే ప్రయత్నం చేశాడు సంచలనాలకు మారుపేరైన వర్మ. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన తరువాత ఏం జరిగింది? అన్న ఆసక్తితో చంద్రబాబు వెన్నుపోటు అంశాన్ని ముఖ్యంగా తీసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశాడు. సవాలక్ష వివాదాల మధ్య సినిమా విడుదలైంది. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎలాంటి విశేషాలున్నాయి, వెన్నుపోటు తీవ్రత ఎంత? ఒక్కసారి చూద్దాం.
కథ: మహా నటుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ 1983లో పార్టీ పెట్టి కేవలం తొమ్మిది నెలలకే ముఖ్యమంత్రి అయ్యాడు. తరువాత 1989లో జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో ఒకరకమైన నైరాశ్యంలో ఒంటరిగానే ఉంటాడు ఎన్టీఆర్ (విజయ్‌కుమార్). అదే సమయంలో ఆయనంటే ఆరాధించే లక్ష్మీపార్వతి (యజ్ఞశెట్టి) ఆయన జీవిత కథ రాయాలన్న ఉద్దేశ్యంతో అక్కడికి వస్తుంది. తన జీవితకథ రాసేందుకు ఎన్టీఆర్ పర్మిషన్ ఇవ్వడంతో రోజూ ఆయన వద్దకు వస్తూ వెళ్తూ ఉంటుంది. ఈక్రమంలో లక్ష్మి మనస్తత్వం బాగా నచ్చడంతో ఎన్టీఆర్‌కు బాగా దగ్గరవుతుంది. ఆమె రాకతో ఎన్టీఆర్‌లో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. ఇన్నాళ్లూ నైరాశ్యంలోవున్న ఆయన మళ్లీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈక్రమంలో ఎన్టీఆర్‌తో లక్ష్మీపార్వతి ఉండటాన్ని ఎన్టీఆర్ కొడుకులు, కోడళ్లు జీర్ణించుకోలేరు. ఆమెను ఇంట్లోంచి పంపేయాలని ఎన్టీఆర్‌తో చెబుతారు. కానీ ఆమె నాతోనే ఉంటుంది, మీరే బయటకు వెళ్లండి అంటూ వారిని వెళ్లగొడతాడు. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి- ఎన్టీఆర్‌లపై రోజుకో న్యూస్ ప్రచారం జరుగుతుంది. అప్పటికే లక్ష్మీ పార్వతికి పెళ్ళై కొడుకు కూడా ఉంటాడు. ఈ గాసిప్స్‌పై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో, ఎన్టీఆర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు. దాంతో ఎన్టీఆర్ ఇంట్లో ఈ విషయంపై పెద్ద రాద్ధాంతమవుతుంది. ఎవరెన్ని చెప్పినా ఎన్టీఆర్ లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు. తరువాత పార్టీ ప్రచారంలో లక్ష్మీతో కలిసి పాల్గొన్న ఎన్టీఆర్, మళ్లీ తన పార్టీకి పూర్వవైభవం తెస్తాడు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుంది. ఇదంతా గమనిస్తున్న ఆయన అల్లుడు బాబు (శ్రీతేజ్) లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ రాజకీయ వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉందంటూ పార్టీలో నిరసనలు క్రియేట్ చేస్తాడు. దాంతో పార్టీలో ముసలం ఏర్పడుతుంది. తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడా? లక్ష్మీపార్వతిని తన వారసురాలిగా ప్రకటించాడా? ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బాబు వెన్నుపోటు పొడిచాడా? అన్నది మిగతా కథ.
నటీనటుల గురించి చెప్పాలంటే కథ మొత్తంగా ముగ్గురి చుట్టే తిరిగింది. అందులో ఎన్టీఆర్ పాత్రలో విజయ్‌కుమార్ ఫర్వాలేదనిపించాడు. పోలికల విషయంలో అంతగా సూట్ కాకున్నా, హావభావాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయన వాయిస్‌ని మిమిక్రీ చేయించడంతో ఆ పాత్ర బాగా రక్తికట్టింది. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ బాగా చేశాడు. చాలాసార్లు చంద్రబాబును గుర్తుకుతెచ్చేలా కనిపించి హైలెట్‌గా నిలిచాడు. ఇక లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞశెట్టి నటన సినిమాకే హైలెట్ అనిపించింది. ఎన్టీఆర్- చంద్రబాబు పాత్రలు అనుకరణలుగా అనిపిస్తాయి. కానీ లక్ష్మీపార్వతి పాత్ర మాత్రం ఒరిజినల్‌గా ఉండేలా ప్లాన్ చేశారు. ఇక మిగతా పాత్రల్లో చేసినవాళ్లు వారి వారి పాత్రల్లో జస్ట్ ఓకె అనిపించారు.
జనరల్‌గా వర్మ సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. ఈ సినిమాలోనూ అదే జరిగింది. కల్యాణి మాలిక్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ గాయకుడు బాలుపాడిన ‘నువ్వే నా సర్వస్వం’ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. రామి ఫొటోగ్రఫీ ఫర్వాలేదు. వర్మ సినిమాల విషయంలో పాటించే క్వాలిటీ ఈ సినిమాలో లేదు. కొన్నిచోట్ల బి గ్రేడ్ సినిమాను తలపించేలా ఉంది. ఎడిటింగ్ విషయంలో వర్మ కేర్ కనిపించలేదు. ద్వితీయ భాగంలో సాగదీత ఎక్కువైంది. ఇక దర్శక ద్వయం రామ్‌గోపాల్‌వర్మ - అగస్త్యలు ఏమాత్రం ప్రత్యేకత చూపించలేదు. వర్మ గత సినిమాలతో పోలిస్తే కాస్త బెటర్, కానీ వర్మ రేంజ్‌లో తీసే సినిమా మాత్రం కాదనిపిస్తుంది. ఇక కథ మొత్తం ఒకే కోణంలో చూపించడం, కావాలని కొన్ని కల్పిత సన్నివేశాలు జోడించడం లాంటివి బోర్ కొట్టిస్తాయి. అక్కడక్కడా కొన్ని సంభాషణలు ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతితో పెళ్లి, చంద్రబాబు వెన్నుపోటు లాంటి అంశాలు తీసుకుని తీసిన సినిమా అంత ఆసక్తికరంగా సాగదు. కేవలం లక్ష్మీపార్వతి కోణంలోనే చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు. ఇదివరకే వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నిజాలు చూపించలేదనే విమర్శలు వినిపించాయి. కానీ లక్ష్మీపార్వతి సినిమాలో చంద్రబాబు వెన్నుపోటును ప్రధాన అంశంగా తీసుకుని కధ అల్లేసుకుని చేసిన సినిమాలో, పెద్దగా కొత్తదనమేమీ లేదు. మొదటినుండి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై వున్న ఆసక్తిని నీరుగార్చే ప్రయత్నం చేశారు. కేవలం లక్ష్మీపార్వతి కోణంలో కథను రాసుకోవడం, పైగా కథ విషయంలో లక్ష్మీపార్వతిని కలవలేదని, ఆమెకు ఈ కథతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన వర్మ మాటలకు ఈ సినిమాకు ఎక్కడా సంబంధం లేదు. ఎందుకంటే లక్ష్మీపార్వతి కోణంలోనే సినిమా సాగడం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించలేదు.

-త్రివేది