Others

బడుగువర్గాల బంధువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చంద్రవౌళి స్పీకింగ్... రుూజ్ జ్వాలా దేర్...?’- అని ఫోన్లో కంచు గొంతుకతో అడిగే మాజీ ఐఏఎస్ అధికారి కొద్దిరోజుల క్రితం శాశ్వతంగా కన్నుమూశారు. ఎనభై రెండేళ్లు జీవించిన ఆ బడుగు జన బాంధవుడు తన చివరిరోజుల్లో అనారోగ్యానికి గురైనందున ఆయనను కలవడానికి వెళ్లే నాలాంటి సన్నిహితులతో ఎక్కువగా సంభాషించలేకపోయేవారు. చివరిసారిగా ఆయనను నేను ఏడాది క్రితం డాక్టర్ ఏపీ రంగారావుతో కలసి వెళ్లి పలకరించినపుడు ఒకింత బాధ కలిగింది. ఉద్యోగం చేసినంత కాలం- ఎవరికో ఒకరికి ఏదో ఒక విధంగా సహాయపడాలనే ఆరాటంతో, నవ్వుతూ నవ్విస్తూ, ప్రతివార్నీ ప్రోత్సహించే చంద్రవౌళి ఆయనేనా? అనే బాధ కలిగింది.
డాక్టర్ వి.చంద్రవౌళి 1937లో తమిళనాడులో జన్మించారు. ఎంఏ ఆర్థికశాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్. హిస్టరీలోనూ పీజీ చేసి, సోషల్ యాంత్రపాలజీలో డాక్టరేట్ పొందారు. రెండేళ్లు మద్రాసులో అధ్యాపకుడిగా పనిచేశారు. ఐఏఎస్ అధికారిగా 33 ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేశారు. రెవెన్యూ, గిరిజన, సాంఘిక సంక్షేమం, ఆహార పౌర సరఫరాలశాఖ, కార్మిక సంక్షేమ శాఖల్లో సేవలందించారు. గవర్నర్లుగా ఉన్న శంకర్‌దయాళ్ శర్మ దగ్గర, కుముద్‌బెన్ జోషి దగ్గర కార్యదర్శిగా పనిచేశారు. భారత రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ విభాగానికి చైర్మన్‌గా ఉన్నారు. ఆంగ్లంలో తొమ్మిది పుస్తకాలు రాశారు. వాటిలో మూడు పుస్తకాలకు (హైదరాబాద్, చెన్నై, గోవా) నేను సహ రచయితను. అప్పట్లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌గా వ్యవహరించబడ్డ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో డైరెక్టర్ జనరల్‌గా చంద్రవౌళి 1995లో పదవీ విరమణ చేశారు.
చంద్రవౌళి గారిని మా బంధువైన డాక్టర్ రంగారావు ద్వారా 1984-85 లో తొలిసారిగా కలిశాను. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రవౌళి సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా, డాక్టర్ రంగారావు వికలాంగుల కార్పొరేషన్ ఎండీగా పనిచేవారు. హైదరాబాద్‌లో అప్పట్లో నెలకొల్పిన ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హాండీకాప్డ్’(ఎన్‌ఐఎంహెచ్)కు చంద్రవౌళిని ప్రత్యేక అధికారిగా, డాక్టర్ రంగారావును తాత్కాలిక ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఎన్‌ఐఎంహెచ్‌లో ‘డాక్యుమెంటేషన్ కమ్ లైబ్రరీ’ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో దానికి అవసరమైన ప్రాజెక్టు రిపోర్టును తయారుచేయమని అప్పట్లో బీహెచ్‌ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న నన్ను అడిగారు చంద్రవౌళి, రంగారావులు. నేను ఇచ్చిన నివేదిక బాగుందని అంటూ, ఆ ఉద్యోగం నాకిస్తామని చెప్పారు. నాకన్నా ఎక్కువ అర్హతలున్న నా క్లాస్‌మేట్ హరికృష్ణారెడ్డికి ఆ ఉద్యోగం వచ్చింది. అలా చంద్రవౌళిగారితో అయిన పరిచయం ఆయన చనిపోయేదాకా కొనసాగింది.
నాకు ఎన్‌ఐఎంహెచ్‌లో ఉద్యోగం ఇవ్వలేకపోయాననే భావన చంద్రవౌళిగారిలో వుండేది. నవంబర్ 1985లో శంకర్‌దయాళ్ శర్మ స్థానంలో కుముద్‌బెన్ జోషి గవర్నర్‌గా వచ్చారు. చంద్రవౌళి చొరవతో బీహెచ్‌ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న నాకు తాజ్ భవన్లో ఉద్యోగం ఇప్పించడానికి నిర్ణయించుకున్నారు కుముద్‌బెన్ జోషి. అంతకు ఏడేళ్ళక్రితం శారదా ముఖర్జీ గవర్నర్‌గా వున్నప్పుడు స్థాపించిన చేతన స్వచ్ఛంద సంస్థను పునరుద్ధరించడంతోపాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, పలు కార్యక్రమాలను చేపట్టారు. చేతన స్వచ్ఛంద సంస్థలో నన్ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా నియమించారు చంద్రవౌళి. వాస్తవానికి నాకు అప్పగించిన పనుల్లో రాజ్‌భవన్ లైబ్రరీ పునరుద్ధరణ కూడా వుంది. చంద్రవౌళి గారు నన్ను తక్షణమే రిలీవ్ చేయాలని బీహెచ్‌ఇఎల్ అధికారులకు చెప్పడంతో నేను అక్కడ రిలీవ్ అయి రాజ్‌భవన్‌లో జనవరి 1, 1986న కొత్త ఉద్యోగంలో చేరాను. రాజ్‌భవన్ క్వార్టర్స్‌లో నాకు ఇంటిని కేటాయించారు. కారణాంతరాల వల్ల ఆ ఇంటిని ఖాళీచేయమని కుముద్‌బెన్ జోషి తరువాత వచ్చిన గవర్నర్ కృష్ణకాంత్ నన్ను ఆదేశించినప్పుడు ఆయన ఆదేశాలను నేను హైకోర్టులో సవాలుచేసిన సందర్భంలో చంద్రవౌళి ఎంతగానో సహాయపడ్డారు.
చంద్రవౌళి రాజ్‌భవన్‌లో అన్నీ తానే అయి పనిచేసేవారు. గవర్నర్ కుముద్‌బెన్ జోషికి ఆయన సలహాలు, సూచనలు చాలా ఇష్టం. ఆమె చంద్రవౌళికి అమితమైన గౌరవం ఇచ్చేవారు. ‘నీసా’ స్వచ్ఛంద సంస్థ ఆరంభించడంలో, ‘చేతన’ స్వచ్ఛంద సంస్థను పునరుద్ధరించడంలో ఆయన పాత్ర కీలకం. జోగినీ వ్యవస్థను రూపుమాపడానికి ‘నీసా’ ద్వారా చేసిన కృషిలో భాగంగా చంద్రవౌళి చొరవతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్ణిలో లవణం, హేమలతా లవణంల తోడ్పాటుతో ‘చెల్లి నిలయం’ కార్యాచరణ వ్యవస్థ ఏర్పాటు, దరిమిలా రాజ్‌భవన్ దర్బార్ హాలులో నాటి సీఎం ఎన్టీఆర్, కేంద్ర మంత్రి జలగం వెంగళరావు, గవర్నర్ కుముద్‌బెన్ జోషి సమక్షంలో ముగ్గురు జోగినులకు వివాహం జరిపించాము. ఢిల్లీలో జోగిన్ల సంక్షేమం మీద జాతీయ స్థాయి సదస్సు నిర్వహించాము.
రెడ్‌క్రాస్ ద్వారా వరద బాధితులకు సహాయం, వయోధికాశ్రమం ఏర్పాటు, ఉద్యమంలా మొక్కలు నాటడం, భారత-పాకిస్తాన్ బెనిఫీషియరీ క్రికెట్ మాచ్ లాంటివి చంద్రవౌళి చొరవతోనే జరిగాయి. ‘చేతన’ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం చంద్రవౌళి పుణ్యమే. అప్పటి పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరో కాదు, నేటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆ క్రికెట్ మ్యాచ్ నిర్వహణలో మాజీ మంత్రి గీతారెడ్డి, నేను చురుగ్గా పాల్గొన్నాం.
‘చేతన’ సంస్థలో పనిచేస్తున్న ఒక డ్రైవర్ రాజ్‌భవన్ క్వార్టర్లలో నివసిస్తున్నప్పటికీ, తనకు 24 గంటలు పని వున్నందున అదనంగా హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె అలవెన్స్) ఇవ్వమని అభ్యర్థించాడు. దానికి ఆమోదిస్తూ చంద్రవౌళి హెచ్‌ఆర్‌ఏ అంటే ‘‘హార్డిప్ రెమ్యూనరేటివ్ అలవెన్స్’’ అని భాష్యం చెప్పారు. సహాయం చేయాలనుకుంటే ఎన్నో మార్గాలున్నాయని ఆయన చెప్పేవారు. ఆయన వ్యక్తులకే కాకుండా ఎన్నో సంస్థలకు సహాయం అడక్కుండా చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్‌కు చంద్రవౌళి అంటే చాలా ఇష్టం.
చంద్రవౌళి ఎక్కడ ఉద్యోగం చేసినా నన్ను అక్కడికి ఏదోఒక కారణంతో డిప్యుటేషన్ మీద తీసుకెళ్ళేవారు. రాజ్‌భవన్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడే డిప్యుటేషన్ మీద మర్రి చెన్నారెడ్డి దగ్గర పీఆర్వోగా పనిచేసి, టర్మ్ అయిన తరువాత వెనక్కువస్తే అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ వల్ల నా ఉద్యోగం పోతే, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా వున్న చంద్రవౌళి తనశాఖ పరిధిలోని హస్తకళల అభివృద్ధిసంస్థ ఎండీ గాయత్రి రామచంద్రన్‌కు చెప్పి సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగం ఇప్పించారు. ఇండస్ట్రీస్ కార్యదర్శిగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సుమారు మూడెకరాల భూమిని హస్తకళల అభివృద్ధి సంస్థకు కేటాయించారు ఆయన. అక్కడే ఇప్పుడు మనకు కనిపిస్తున్న (ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం) సుమారు వంద కోట్లకు పైగా విలువ చేసే గోల్కొండ హస్తకళల ఎంపోరియం కట్టడం జరిగింది.
హస్తకళల అభివృద్ధి సంస్థలో నేను పనిచేస్తున్నప్పుడే నాలుగేళ్ల తరువాత ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థకు డీజీగా వెళ్లడం, వెళ్ళిన కొన్నాళ్ళకే నన్ను అక్కడికి ఫాకల్టీ మెంబర్‌గా డిప్యుటేషన్ మీద తీసుకుపోవడం జరిగింది. ఆ సంస్థ అభివృద్ధికి ఆయన హయాంలోనే అంకురార్పణ జరిగింది. ఇప్పుడున్న హాస్టల్, గెస్ట్‌హౌస్ భవనాల శంకుస్థాపన ఆయన హయాంలోనే జరిగింది. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఉన్నతాధికారిగా వున్నప్పుడు ప్రస్తుతం వున్న ఆ కార్యాలయ భవన సముదాయాన్ని కట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టించాడని ఆయన్ను ఆక్షేపించినవారు కూడా లేకపోలేదు. కడప కలెక్టర్‌గా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ అక్కడి ప్రజలు గుర్తుంచుకుంటారు.
నిబద్ధత, నిజాయితీ, నైపుణ్యం, సమర్ధత, బడుగువర్గాల బంధువు అనే మాటలకు చంద్రవౌళి పర్యాయపదం అంటే అతిశయోక్తికాదు.

-వనం జ్వాలా నరసింహారావు