జాతీయ వార్తలు
‘బంగ్లాదేశీయుడి’ మృతిపై విచారణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తేజ్పూర్ (అస్సాం), అక్టోబర్ 16: అస్సాంలోని తేజ్పూర్ జిల్లాలో గల ఫారినర్స్ డిటెన్షన్ సెంటర్లో దులాల్ పౌల్ అనే బంగ్లాదేశీయుడు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. దులాల్ పౌల్ మృతదేహాన్ని తీసుకోవడానికి అతని ఏకైక కుమారుడు ఆశీశ్ పౌల్ నిరాకరించాడు. తన తండ్రిని భారతీయ పౌరుడిగా ప్రకటించేంత వరకు మృతదేహాన్ని తీసుకోబోనని ఆశీశ్ పౌల్ కరాఖండిగా చెప్పాడని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. దులాల్ పౌల్ బంగ్లాదేశీయుడని ఫారినర్స్ ట్రిబ్యునల్ 2017లో ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి అతడిని తేజ్పూర్లోని ‘జైల్ కమ్ డిటెన్షన్ సెంటర్’లో ఉంచారని దాని సూపరింటెండెంట్ మృన్మయ్ డావ్కా తెలిపారు. గౌహతి వైద్య కళాశాల ఆసుపత్రి (జీఎంసీహెచ్)లో చికిత్స పొందుతూ 65 ఏళ్ల పౌల్ మృతి చెందిన ఘటనపై అదనపు డీసీ పరాగ్ కకోటితో విచారణ జరిపించనున్నట్టు డిప్యూటి కమిషనర్ మానవేంద్ర ప్రతాప్ సింగ్ ఒక వార్తాసంస్థకు చెప్పారు. పౌల్ మృతిపై విచారణ జరిపించాలని ‘బెంగాలీ ఫెడరేషన్ ఆఫ్ అస్సాం’ కూడా వినతిపత్రం సమర్పించిందని ఆయన పేర్కొన్నారు. తేజ్పూర్ వైద్య కళాశాల, ఆసుపత్రి (టీఎంసీహెచ్) వైద్యులు అక్టోబర్ 11న పౌల్ను పరీక్షించి, మధుమేహం, మానసిక రుగ్మతలకు చికిత్స చేశారు. అనంతరం అదే రోజున పౌల్ను తిరిగి డిటెన్షన్ సెంటర్కు తీసుకు రావడం జరిగిందని డావ్కా తెలిపారు. అయితే, అతను మరుసటి రోజు తిరిగి అస్వస్థతకు గురయ్యాడని, దాంతో అతడిని టీఎంసీహెచ్కు తీసికెళ్లడం జరిగిందని చెప్పారు. అయితే, టీఎంసీహెచ్లో వైద్యులు అతడిని జీఎంసీహెచ్కు తీసుకెళ్లాలని సిఫార్సు చేశారని తెలిపారు.
జీఎంసీహెచ్కు తీసికెళ్లగా అక్కడ అతను చికిత్స పొందుతూ అక్టోబర్ 13న మృతి చెందాడని డావ్కా వివరించారు. పౌల్ ఏకైక కుమారుడు మోటర్ మెకానిక్ అయిన ఆశీశ్ పౌల్ తన తండ్రి మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో అతడి మృతదేహం ఇప్పటికీ జీఎంసీహెచ్ మార్చురీలోనే ఉందని ఆయన వివరించారు.