మెయన్ ఫీచర్

‘భావ ప్రకటన’ అంటే ఇష్టారాజ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ నశించిపోయింది’- అంటూ మన దేశంలో అభ్యుదయ రచయితలు, అపర మేధావులుగా చలామణి అవుతున్నవారు తెగ గగ్గోలు పెడుతుండడం మనకు తెలిసిందే. అక్కడికి భావప్రకటన స్వేచ్ఛ అనేది తమ గుత్తసొత్తు అయినట్లు వీరు వీరంగాలు వేస్తుంటారు.
భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటి? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే తనకు తోచినట్లు మాట్లాడటం కాదు. ఎదుటివారి ఆలోచనలను, భావాలను స్వాగతించడం, వాటిని గౌరవించడం. అవసరమైతే వ్యక్తిగతంగా కాని సామాజికంగా కాని వాటిని అనుసరించడం.
భూమి బల్లపరుపుగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. క్రైస్తవ మత దేశాలన్నీ అదే విషయాన్ని నమ్మాయి. కాని పదహారవ శతాబ్దంలో గెలీలియో భూమి బల్లపరుపుగా కాదు, గుండ్రంగా ఉంటుందని అంటే క్రైస్తవ మత విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడని ఆ మత పెద్దలు అతనిని వ్యతిరేకించారు. ఖగోళ శాస్త్రానికి సంబంధించి అతడు చేసిన సైద్ధాంతిక ప్రతిపాదనలను మార్చుకొమ్మని బలవంతం చేస్తూ అప్పటి పోప్ అతనిని గృహ నిర్బంధం చేసి అతని కదలికలపై ఆంక్షలు విధించాడు. తన సిద్ధాంతాలను మార్చుకొంటేనే గెలీలియోను విడుదల చేస్తామన్నారు.
దేని గురించైనా ప్రామాణిక నిర్వచనం కావాలంటే ‘అమరకోశం’ పేరు చెప్తారు హిందువులు. ఇది క్రీస్తుపూర్వమే వ్రాయబడింది. ఇందులో భూమి గురించి ఏమని వర్ణించి ఉన్నారో తెలుసా? ‘‘్భమి- గోళః ఇవ అస్థి అచలతి’’అంటే భూమి గోళాకారంలో ఉంటుంది కానీ కదలకుండా ఉంటుంది అని అర్థం. మరి క్రీస్తుశకం ఐదవ శతాబ్దం వాడైన ప్రముఖ ఖగోళ శాస్తవ్రేత్త ఆర్యభట్టు ఏమన్నాడో తెలుసా? ‘‘్భమి- గోళః ఇవ అస్థి చలతి పరస్తు అచలతి ఇవ భావయతి’’అంటే భూమి గోళాకారంలో ఉంటుంది, కదులుతూ ఉంటుంది కానీ భూమిపై ఉన్న వారికి కదలనట్లే ఉంటుంది అని. మరి అమరకోశానికి విరుద్ధంగా చెప్పాడని ఆర్యభట్టుని ఎవరూ ఖండించలేదే? ఆయనకి ఎవ్వరూ ఏ శిక్ష వెయ్యలేదే! ఆయన చెప్పిన దానినే మనం శాస్త్ర ప్రమాణంగా స్వీకరించాం కదా.
మరో విశేషం ఏమిటంటే అమరకోశం వ్రాసిన అమరసింహుడు క్రీస్తుపూర్వానికి చెందిన బౌద్ధ చక్రవర్తి. బౌద్ధులు వేదాలను ఖండిస్తారన్న విషయం అందరికీ తెలిసినదే. అలాంటిది అమరసింహుడు వ్రాసిన అమరకోశాన్ని మనమందరం ప్రామాణికంగానే స్వీకరించాం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకాదా?
శంకరాచార్యులు, మండనమిశ్రుల వాదన జరుగుతున్నప్పుడు మండన మిశ్రుని భార్య భారతి న్యాయనిర్ణేతగా ఉంటుంది. ఆ వాదనలో శంకరుడే విజయుడని నిర్ణయిస్తుంది. మరి భావప్రకటన స్వేచ్ఛలేకపోతే ఇది సాధ్యమా?
మన దేశంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, ఆగమ శాస్త్రాలు ఎన్నో వెలిశాయి. గత రెండు వేల సంవత్సరాలలో ఒక్క భగవద్గీతపై వెయ్యికి పైగా వ్యాఖ్యానాలు వచ్చేయి. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. రామాయణ, మహాభారతాలను ఎంతోమంది తమ మనసుకి నచ్చినట్లుగా మళ్ళీమళ్ళీ వ్రాస్తున్నారు. మన జానపదాలలో అయితే రామాయణం, మహాభారతాల గురించి ఎన్నిరకాల కథలున్నాయో! వీరిలో ఎవరూ ఎవరినీ ఖండించలేదే! ఇదంతా భావప్రకటన స్వేచ్ఛ కాదా?
ఇంకా మన సమాజంలో విలసిల్లిన ఎన్నో భాషలు, కళలు, ఆచారాలు, ఆరాధనా పద్ధతులు ఇవన్నీ భావప్రకటన స్వేచ్ఛను తెలియజేయడం లేదా? శ్రీకృష్ణుడు నరకాసుడి వధానంతరం అతని కుమార్తె శైబ్యను ద్వారకకు తీసుకువెళ్ళి ఆమె ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాడు. ఆమె కోసం నరకాసురుడి పూజా మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు కూడా. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదా?
మన దేశంలో చార్వాకుల సంప్రదాయం ఉండేది. వీరు నాస్తికవాదులు. మరి వీరిపై ఎవరూ యుద్ధాలు చేయలేదే? మరి నేటి కాలపు ప్రసిద్ధ శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకిన్స్ దైవం ఉనికినే ప్రశ్నిస్తే అతనిని చర్చిల్లోకి రాకుండా క్రైస్తవ మత పెద్దలు ఆంక్షలు విధించలేదా? ఆచార్య నాగార్జునుడు శూన్యవాదం ప్రకటించి, సృష్టికి మూలం కార్యాకారణ సంబంధం అన్నాడు. ఆదిశంకరుడు మాయావాదం ప్రతిపాదించాడు. మన దేశంలో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సంప్రదాయాలున్నాయి. శాక్తేయ, గాణపత్య సంప్రదాయాలున్నాయి. ఇవన్నీ ఒకదానితోఒకటి విభేదిస్తూనే ఉంటాయి. కర్ణాటకలో బసవేశ్వరుడు బసవ సంప్రదాయాన్ని ప్రారంభించేడు. మన సమాజంలోని కులవ్యవస్థను అంగీకరించరు వీళ్ళు. కానీ వీళ్ళంతా కలసి ఒక సమూహంగా ఏర్పడిపోయారు. వీరిని మనలో కలిపేసుకున్నామే కాని వెలివేసి చూడలేదే! ఇది భావప్రకటన స్వేచ్ఛ కాదా?
సాల్మన్ రష్దీ ‘సాటానిక్ వర్సెస్’ పేరిట వివాదాస్పద పుస్తకం రాస్తే అతని తలను ఖండించి తెచ్చినవారికి విలువైన బహుమతి ఇస్తానని ఫత్వా జారీచేసాడు అయెతుల్లా ఖొమైనీ. 2013లో లండన్‌లోని ఒక విద్యాలయంలో పండ్ల ప్రదర్శన ఏర్పాటుచేసారు. తమాషాకోసం అక్కడ ఉన్న ప్రతి పండుకు ఒక చారిత్రిక ప్రముఖుని పేరుపెట్టారు. అక్కడున్న ఒక అనాస పండుకి మహ్మద్ ప్రవక్త పేరుపెట్టడాన్ని నిరసిస్తూ కొందరు సందర్శకులు చాలా గొడవ చేసారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు క్షమాపణ చెప్పేవరకు వదలలేదు. డెన్మార్క్‌లో ఒకాయన ప్రవక్తకు సంబంధించిన బొమ్మ గీచాడని అతనిని హింసించారు. ప్రపంచంలో బహారుూ సంప్రదాయం వారు ఉన్నారు. వారుకూడా అల్లాని ఆరాధిస్తారు. ఖురాన్ని నమ్ముతారు. ఒకేఒక్క తేడా ఏమిటంటే మహమ్మద్ ప్రవక్త మరో రూపంలో వస్తాడని వారు అన్నారు. అంతే ఒక్క టెహరాన్ (ఇరాన్ రాజధాని)లో ఒక్క గంట వ్యవధిలో ఏభై ఆరువేల మంది బహారుూలను ఊచకోత కోశారు. మరి ఇది భావప్రకటన స్వేచ్ఛ అవుతుందా?
బంగ్లాదేశ్‌లో హిందూ యువతులపై జరిగే అత్యాచారాల గురించి ‘లజ్జ’ నవల వ్రాసిన రచయిత్రి తస్లీమా నజ్రీన్‌కి ఎలాంటి గౌరవ సత్కారాలు లభించేయో మనకి తెలిసినదే. ఆమె రాసిన పుస్తకాన్ని పశ్చిమ బెంగాల్‌లో నిషేధించారు. భారతదేశంలో ఆమెకు వ్యతిరేకంగా అయిదు ఫత్వాలు జారీ అయ్యాయి. ఆమెను పశ్చిమ బెంగాల్ నుంచి తరిమేశారు. ఢిల్లీలో అనేక నెలలపాటు గృహ నిర్బంధంలో ఉంచారు. సునీల్ గంగూలీ, శంఖఘోష్ వంటి ప్రముఖ రచయితలు ఆమె పుస్తకాన్ని నిషేధించాలని అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను కోరారు. ఇస్లామిక్ మతవాదుల వ్ఢ్యౌన్ని ధైర్యంగా ఎదిరించిన రచయిత్రిగా అంతర్జాతీయ ఖ్యాతిగడించిన తస్లిమా నస్రీన్ తల నరికిన వారికి ఐదు లక్షల రూపాయల బహుమానాన్ని ప్రకటించారు ముస్లిం మత పెద్దలు. ప్రాణభయంతో వచ్చి ఆమె కోల్‌కతలో తలదాచుకొన్నా, ముస్లిం మతవర్గాల దాష్టీకానికి తల ఒగ్గి వామపక్ష, ప్రగతిశీల విశుద్ధాత్ముల ప్రభుత్వం ఆమెను వెళ్ళగొట్టింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని తప్పుపడుతూ ‘రిడిల్స్ ఆఫ్ రామాయణ’ పుస్తకం వ్రాశారు. మరి ఆయనపై ఎవరూ విరుచుకుపడలేదే? ఆ పుస్తకాన్ని ఖండించమని ఎవరూ గొడవలు చేయలేదే?
సాల్మన్ రష్దీ, తస్లీమా నస్రీన్‌ల పుస్తకాలను నిషేధించిన విధంగా, నార్ల వెంకటేశ్వరరావు సీతను, భగవద్గీతను ఎగతాళి చేస్తూ చేసిన రచనలను ఎవరూ నిషేధించలేదు. తాపీ ధర్మారావు హిందూ దేవతలను కించపరుస్తూ ‘దేవాలయంలో బూతుబొమ్మలెందుకు?’, ‘సాహితీ మొర్మొరాలు’ అన్న రచనలు చేస్తే ఎవరూ విరుచుకుపడలేదే? ఎంతటి తీవ్రభావాలు వెల్లడించినా శ్రీశ్రీని నెత్తిన పెట్టుకొన్నాం. ‘నాల్గుపడగల హైందవ నాగరాజు’ అన్న జాషువాను మనం కవిగా ఆదరించాం. ఆయన శత జయంతిని ఘనమైన వేడుకలుగా జరుపుకున్నాం. రామాయణ విషవృక్షం అన్నా, శ్రీకృష్ణుడు దొంగోడు, రాసలీలల వాడు అని అవమానించినా, వినాయకుడిపై కార్టూన్లు వేసినా, సరస్వతీ దేవిని నగ్నంగా చిత్రీకరించినా హత్యలు జరగలేదు కదా!
సెప్టెంబర్ 11, 1893న చికాగో సర్వమత సభలలో మాట్లాడుతూ స్వామి వివేకానంద- ‘సహనము, సార్వజనిక ఆమోదాన్ని ప్రపంచానికి బోధించిన మతానికి చెందిన వాడనైనందుకు నేనెంతో గర్విస్తున్నాను. ప్రపంచంలోని వివిధ మతాల పట్ల సహనం వహించడం మాత్రమే కాదు వాటన్నింటినీ సత్యాలుగా అంగీకరించి గౌరవించిన దేశం మా దేశం. రోమనుల దురాగతాలకు గురై తమ దేవాలయాలన్నీ విధ్వంసం కాగా ప్రపంచమంతటా చెల్లాచెదురైపోయిన యూదులకు ఒక్క భారతదేశంలోనే శాంతియుత ఆశ్రయం లభించింది. ప్రపంచం నలుమూలల నుండి శరణార్థులై వచ్చిన వివిధ మతాలకు, వివిధ దేశాలకు చెందిన వారందరికీ సాదరంగా ఆశ్రయమిచ్చింది మా దేశం. ఇస్లాం మతస్తులను, క్రైస్తవ మిషనరీలను, వివిధ దేశాల నుండి వచ్చిన వ్యాపారస్తులను సగౌరవంగా ఆహ్వానించిన దేశం భారత దేశం. ఇది హిందూ సంస్కృతిలోని గొప్పదనం. అటువంటి దేశానికి చెందినందుకు నేనెంతో గర్వపడుతున్నాను’- అని అన్నాడు. ఈ విషయాలేవీ తెలియకుండా భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛ మంటగలిసిపోతోందంటూ మేధావులమనుకునేవారు పెడబొబ్బలు పెడుతున్నారంటే అది వారి అజ్ఞానమే అవుతుంది.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690