మెయిన్ ఫీచర్

జీవితాలను ఆర్పేస్తున్న కట్నదాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి మహిళ అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా కూడా ఇంకా పురుషాధిక్యత నిండిన సమాజంలో చాలావాటికి బలికావాల్సి వస్తోంది. అందులో ముఖ్యమైనది వరకట్నం. పూర్వపు రోజుల్లో కన్యాశుల్కంగా ఆడపిల్లల్ని డబ్బులు చెల్లించి పెళ్లిచేసుకునేవారు. అది కాలక్రమేణా మార్పులకు గురిఅవుతూ నేడు అబ్బాయిలను కట్నంతో కొనుక్కోవాల్సి వస్తోంది. కన్యాశుల్కం కాస్తా వరకట్నంగా పేరు మారింది. 80, 90 దశకాలలో ఈ వరకట్న దురాచారం చాలా తీవ్రంగా వుండేది. ఆడపిల్ల పెళ్లి చెయ్యాలి అంటే మధ్యతరగతి తల్లిదండ్రులకు పెద్ద గండంగా ఉండేది. ఆడపిల్ల చదువుకోవడమే కష్టం అనుకుంటే ఉన్నత చదువులు చదివించడం గుదిబండగా మారింది. తక్కువ చదువు చదివిస్తే దానికి తగ్గట్టు ఎవరికో ఒకరికి పెళ్లిచేయొచ్చు అని భావించేవారు. అప్పట్లో కొంచెం తక్కువ ఇచ్చినా అమ్మాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి సర్దుకుపోయేవారు.
ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అయిపోయిందో అప్పటినుండి అబ్బాయిల తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. అత్యాశ పెరిగిపోయింది. అబ్బాయిని కట్నం తెచ్చేవాడిగా పెంచడం మొదలు అయ్యింది. లక్షలకు లక్షలు కట్నంగా అమ్మాయిలు తీసుకురావాలని ఆశపడుతున్నారు. అబ్బాయి చదువు, హోదా, ఆస్తులు వుంటే ఇక కట్నాల మార్కెట్‌లో బాగా ధర పలుకుతాడు. అసలు కట్నం ఎందుకు తీసుకోవాలి అని ఆలోచిస్తే అక్కడ కూడా ఆడపిల్లల కోణం నుంచే ఆలోచిస్తున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో అమ్మాయి, అబ్బాయి వుంటే.. అమ్మాయిని మామూలుగా చదివించి అబ్బాయిని పెద్దచదువులు చదివిస్తున్నారు. మంచి ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడితే ఇంక పండగే.. లక్షల కట్నం గుంజుతున్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే, తమకి కూడా ఒక అమ్మాయి ఉంది అని, మేము కూడా మరొకరికి కట్నం ఇవ్వాలని చిత్రమైన సమాధానం చెబుతున్నారు. అంటే ఒక నష్టం పూడ్చడానికి మరో లాభాన్ని వెతుక్కుంటున్నారు. అమ్మాయిల తరఫువాళ్ళు బాగా ఉన్నవాళ్లు అయితే ఇచ్చుకోగలరు కానీ మధ్యతరగతివారు, పేదరికంలో వున్నవారు ఎలా భరించగలరు? పెళ్లి అయి మూడు నెలలు కాకముందే అదనపుకట్నం తెమ్మని అత్తా, మామ, భర్త, ఆడబిడ్డలు హింసిస్తుంటే ఆ పెళ్లికూతురు ఎలా భరించగలదు. అయినా సరే పుట్టింటివారికి మచ్చ తీసుకురావద్దు అని బాధల్ని వౌనంగా భరిస్తున్నారు. మన తలరాత ఇంతే అంటూ పిరికితనాన్ని నూరిపోస్తున్నారు. అమ్మాయి ఉన్నతమైన చదువు చదివినా కూడా కట్నం ఇచ్చుకోవాలి. అబ్బాయితో సరిసమానమైన ఉద్యోగం చేస్తున్నా కూడా కట్నం ఇవ్వాల్సిందే. పైగా చదువుకుంది, ఉద్యోగం చేస్తోంది, ఎంత పొగరో చూడు అన్న సూటిపోటి మాటలతో అత్తింటివాళ్ళ హింసలకు అంతే ఉండదు.
ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961, వరకట్న నిషేధ చట్టం ప్రకారం కట్న కానుకలను ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. దీన్ని నిరోధించేందుకు మాత్రమే ఈ చట్టం రూపొందించబడింది. కట్నం డబ్బురూపంలో ఇచ్చినా, కానుకల రూపంలో ఇచ్చినా కూడా నేరమే. అయితే ఎంతో చదువుకున్న మహిళలకి కూడా ఈ చట్టం గురించిన చైతన్యం, అవగాహన లేదనే చెప్పాలి. మన చట్టాలలో వున్న లోపాలు కూడా ఫిర్యాదు చేసేదానికి లేదు. దానికితోడు సంకోచిస్తారు. పరువు పోతుంది అన్న భయంతో ఎన్ని బాధలనైనా భరిస్తారు. చివరికి మృత్యువే దిక్కని అర్థాంతరంగా నిప్పంటించుకొనో, ఉరి వేసుకునో జీవితాల్ని చాలిస్తున్నారు. కట్నం తెమ్మని వేధించడం కూడా హింసకిందకు వస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం, 2005 ప్రకారం కట్టుకున్న భార్యని ఎలాంటి వేధింపులకు గురిచెయ్యరాదు. కానీ ఇక్కడ ప్రతినిత్యం అత్త, భర్త, మరిది, ఆడబిడ్డలరూపంలో నిత్యం నరకం చూస్తోంది.
గృహహింస చట్టం, 2005 మహిళలను ఇంటిలో జరిగే హింసనుంచి (శారీరకంగా, మానసికంగా బాధలు పెట్టడం, సూటిపోటి మాటలతో బాధపెట్టడం). ఇది ప్రతి మహిళకి రక్షణ ఇచ్చే చట్టం. అదృష్టవశాత్తు ఇప్పటి తల్లిదండ్రులు కూడా ధైర్యంగా గృహహింస, కట్నపు వేధింపులకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
ఈ దురాచారాన్ని అరికట్టాలి అంటే ముందుగా అబ్బాయిలలో మార్పు రావాలి. చదువుకున్న తోటి మహిళని గౌరవించాలి. అమ్మాయి అమ్మగా మారుతుంది అని గౌరవం ఇచ్చి సహృదయతతో అక్కున చేర్చుకోవాలి. అలాగే ఇప్పటి అత్తలు కూడా నిన్నటి కోడళ్లే అన్న సంగతిని గుర్తెరిగి మసలుకోవాలి. తమకి ఒక కూతురుంటే, తాను కూడా ఇలాంటి వేధింపులే ఎదుర్కోవాల్సి వస్తే.. ఎంత బాధగా వుంటుందో తెలుసుకోవాలి. తరతరాలుగా వస్తున్న ఈ దురాచారాన్ని ఒక్కరోజులో రూపుమాపలేకపోయినా.. దీన్ని అరికట్టాలనే సంకల్పంతో అందరూ కలిసి కృషి చేస్తే రేపటి తరానికైనా ఈ కట్నపు బాధ ఉండదు. అదృష్టవశాత్తు ఇప్పుడిప్పుడే నేటి యువతరంలో అవేర్‌నెస్ పెరుగుతోంది. ఆడపిల్లల్ని హింసించడం తప్పు అని తెలుసుకుంటోంది. ఎంతోమంది నేటి కాలం అబ్బాయిలు సామాజిక మాధ్యమాల ద్వారా తమకి నచ్చినవాళ్ళని పెద్దలను ఎదిరించి వారికిష్టమైన రీతిలో జీవితాన్ని లీడ్ చేసుకుంటున్నారు. వెబ్‌సైట్స్ కూడా అంతో ఇంతో దోహదం చేస్తున్నాయి. డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.ఐడోంట్ వాంట్ డౌరీ.కామ్ అనే వెబ్‌సైట్స్‌లో అయితే పైసా కట్నం లేకుండా అమ్మాయిని పెళ్లిచేసుకునేవాళ్లు మాత్రమే ఇందులో రిజిష్టర్ అవుతారు. ఇప్పటికే వేల సంఖ్యలో రిజిష్టర్ అవ్వడం గొప్ప విషయం.
ఉదయం లేస్తే మహాలక్ష్మిగా పిలుచుకునే ఆడపిల్లలు కట్న దురాచారానికి, అత్తింటి ఆరళ్ళకు బలి అయింది అన్న వార్తలు చూసినపుడు ఎవరికైనా మనసు చలించక మానదు. ఇక ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కూతురిని కుంపటిగా భావించకుండా తమ కాళ్ళమీద తాము నిలబడేలా చదివించి పైకి తీసుకురావాలి. నేటి మహిళల్లో చైతన్యం వెల్లివిరిసినపుడే ఈ దురాచారాన్ని పూర్తిగా అరికట్టగలం.

-పుష్యమీ సాగర్ 9032215609