జనాంతికం - బుద్దా మురళి

ఓటరుకో విగ్రహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దేశంలో ఎత్తయిన విగ్రహం ఏదో తెలుసా?’’
‘‘ మోదీ మాట నిలబెట్టుకుంటే పటేల్ విగ్రహం, కెసిఆర్ నిర్మించే అంబేద్కర్ విగ్రహం, లేదంటే బాబు గారి అంబేద్కర్ విగ్రహం.. కానీ నాకైతే ఈ మూడూ అనుమానంగానే ఉన్నాయి. ’’
‘‘ విగ్రహాల గురించి అడిగితే, రాజకీయాల గురించి చెబుతున్నావ్’’
‘‘రెండూ ఒకటే. భోజరాజుకు సాలభంజికలు కథలు చెప్పినట్టు ప్రతి విగ్రహం వెనుక రాజకీయ కథ ఉంటుంది.’’
‘‘ గుజరాత్ అనగానే మహాత్మాగాంధీ గుర్తుకు వస్తారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మహాత్మున్ని పటేల్‌తో రీ ప్లేస్ చేస్తూ, గుజరాత్‌లో పటేళ్ల ఓటు బ్యాంకును పదిల పరుచుకోవడానికే మోదీ ప్రపంచంలోకెల్లా ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు’’
‘‘పటేల్ ఈ దేశం కోసం ఏమీ చేయలేదా? ’’
‘‘గాంధీ, పటేల్ మాత్రమే కాదు వారి కన్నా ముందు, వారి తరువాత ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. అయితే విగ్రహాలకు వారి త్యాగాలు కాదు, వారి ఓటు బ్యాంకే కొలమానం. ’’
‘‘ పటేళ్లే మోదీకి తలనొప్పిగా మారారని వార్తలొస్తున్నాయి. ’’
‘‘ పటేల్ విగ్రహ ఏర్పాటు సైతం నెమ్మదించింది అందుకేనేమో! ఇంటికో ఇటుక సేకరించి రామ మందిరం నిర్మిస్తామని, ఆ నినాదంతోనే అధికారంలోకి వచ్చిన వాళ్లు ఆ సంగతి మరిచిపోయారు. దేవుడినే బురిడీ కొట్టించినప్పుడు రాజకీయ వారసులు కూడా లేని పటేల్‌ను పక్కన పెట్టలేరా? ’’
‘‘రాజకీయాలకు విగ్రహాలకు సంబంధం అంటే నమ్మలేకపోతున్నాను? ’’
‘‘ విగ్రహాలకు రాజకీయాలకు ప్రపంచ వ్యాప్తంగా అవినాభావ సంబంధం ఉంది. రెండు వేల ఏళ్ల క్రితమే బుద్ధుడు విగ్రహారాధనను వ్యతిరేకించారు. ప్రపంచంలో కెల్లా ఎక్కువ విగ్రహాలు, ఎత్తయిన విగ్రహాలు, ఎక్కువ దేశాల్లో విగ్రహాలు ఉన్నది బుద్ధుడికే. ప్రపంచంలో అత్యధికులు దేవునిగా పూజించేది విగ్రహారాధనను వ్యతిరేకించిన బుద్ధ విగ్రహాలనే.. ఆఫ్ఘానిస్తాన్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధ విగ్రహాన్ని తాలిబాన్లు కూల్చేశారు!! ’’
‘‘ అవును కూలిస్తే ? ’’
‘‘ ఆఫ్ఘానిస్తాన్ బుద్ధ దేశంగా ఉన్నప్పుడు బుద్ధుని విగ్రహాలు వెలిశాయి, రాజకీయాల్లో మార్పులు వచ్చి తాలిబానిజం పెరిగినప్పుడు విగ్రహాలు కూలాయి. విగ్రహారాధనను వ్యతిరేకించి మతంలానే వ్యక్తి పూజను వ్యతిరేకించే దేశా లు పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్లూ విగ్రహారాధనకు, విగ్రహ పూజకు అతీతులు కారు. ’’
‘‘ వాళ్లెవరు? ’’
‘‘ సోవియట్ రష్యా... శ్రీశ్రీ చెప్పినట్టు గర్జించు రష్యా గాండ్రించు రష్యా అనే నినాదాలతో ఓ వెలుగు వెలిగినప్పుడు లెనిన్ విగ్రహాలు పూజలందుకునేవి. 75ఏళ్ల వయసులో వృద్ధాప్యం మీద పడి గాండ్రించే రష్యా కాస్తా చతికిల పడ్డ రష్యాగా మారినప్పుడు లెనిన్ విగ్రహాలను కూల్చేశారు. రాజకీయం మారినప్పుడు విగ్రహాల స్థానం మారుతుంది.’’
‘‘ ఏ విగ్రహం కూడా శాశ్వతం కాదన్నమాట’’
‘‘ రాజకీయంగా ప్రయోజనం ఉన్నంత వరకే ఆ విగ్రహం శాశ్వతం. మనువాద పార్టీలు అంటూ బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పుట్టిన బిఎస్‌పి మాయావతి బహెన్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చాక ఉత్తరప్రదేశ్‌లో భారీ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ’’
‘‘ కానీ ఆమెనే బ్రాహ్మణులకు ఎక్కువ టికెట్లు ఇచ్చారట కదా? ’’
‘‘ నిజమే ఉత్తర ప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా బ్రాహ్మాణులకు టికెట్‌లు ఇచ్చిన ఘనత ఆమెదే. 70మందికి పైగా టికెట్‌లు ఇచ్చారు. ఎన్టీఆర్ సావిత్రి, అక్కినేని వాణిశ్రీ, చిరంజీవి విజయశాంతి హిట్ పేయిర్ అంటూ తెలుగు సినిమా జంటలు ఉండేవి తెలుసు కదా? ఈ జంట కలిసి నటిస్తే సినిమా సూపర్ హిట్ అని గట్టి నమ్మకం ఉండేది. కుటుంబ నియంత్రణపై పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో ఒక్కో సినీ కుటుంబం నుంచి డజన్ల కొద్ది హీరోలు వచ్చి వాలిపోతున్నారు. అలానే ఫ్యాక్షన్ కథలకు ఒకప్పుడు మినిమం గ్యారంటీ ఉండేది. రాజకీయాల్లో సైతం సరిగ్గా ఇంతే. బహుజన నినాదంతో రాజకీయంగా బలమైన శక్తిగా నిలిచిన మాయావతి హిట్ కాంబినేషన్ కోసం దళిత, బ్రాహ్మణ వాదాన్ని మిక్స్ చేశారు. దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అన్నారు. ములాయం బిసి, మైనారిటీ కాంబినేషన్‌తో విజయం సాధించారు. లేకపోతే ఉత్తర ప్రదేశ్‌లో అతి పెద్ద మనువు విగ్రహాలు ఏర్పాటయి ఉండేవి కూడా? ’’
‘‘???’’
‘‘ రాజకీయాల్లో విగ్రహాలను నమ్ముకున్న వాళ్లు ఎవరూ చెడిపోలేదు. ఎన్టీఆర్‌ను దించేసిన బాబే శ్రీకృష్ణునిగా ఎన్టీఆర్ విగ్రహం చేయించారు. జగన్ ముందు చూపుతో వైఎస్‌ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్లనే కదా బలమైన విపక్షంగా నిలిచింది. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను కూల్చేశాక కేంద్రం సైతం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగం చేసింది. ’’
‘‘ ఆ విగ్రహాలను విజయవాడకు పార్సిల్ చేస్తాను అని కెసిఆర్ చెబితే, మేం తీసుకుంటాం అని సినీ పెద్ద మురళీ మోహన్ అన్నారు. కెసిఆరే ఇప్పుడు ఎన్టీఆర్ జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటామని చెబుతున్నారు. ’’
‘‘ ఆ మాటల్లో నిజంగా ప్రేమ ఉందంటావా? మీ దేశం మీరు వెళ్లండి మీరు వదిలిన విగ్రహాలను మేం జాగ్రత్తగా చూసుకుంటాం అని అప్పగింతలు చెప్పడం అయితే కాదు కదా? ’’
‘‘ ఏమో నాయకుల మాటలకు అర్ధాలే వేరు? దీని కంతటికీ కారణం ఏమంటావు? ’’
‘‘ నెహ్రూతో పాటు ఆనాటి జాతీయ నాయకులంతా కారణం? ’’
‘‘ ఇంకా నయం జగన్ కారణం అనలేదు? వాళ్లేం చేశారు. ’’
‘‘స్వాతంత్య్రానికి ముందులా కొందరికే ఓటు హక్కు ఉంటే కొందరి విగ్రహాలే కనిపించేవి. సార్వజనీన వయోజన ఓటు హక్కు వల్ల ఓటున్న సామాజిక వర్గాలన్నింటికి విగ్రహాలు వస్తాయి . ’’
‘‘ ఆర్‌కె లక్ష్మణ్ కామన్ మ్యాన్ విగ్రహంలా సింబాలిక్‌గా ఓటరుకే భారీ విగ్రహం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఆ పార్టీకే అంతా ఓటు వేస్తారు కదా? ’’
‘‘ఓటరు దేవుళ్లు అని పూజించే నాయకులు ఓటరుకు విగ్రహాన్ని నిర్మించే రోజులు కూడా వస్తాయి’’