ఈ వారం స్పెషల్

క్రీస్తు జననం - లోకాళికి సమాధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను - లూకా 2:14.
క్రీస్తు జననములో ముందుగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగింది. కారణం ఆయన తెచ్చిన సమాధానమును బట్టి. క్రీస్తు జన్మము వలన దేవునికి మహిమ ఆయన కిష్టులుగా ఉన్నవారికి సమాధానము.
ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో అప్పుడే దేవునికీ మానవునికీ మధ్య సమాధానము తెగిపోయింది. కారణం - ఆయన సమాధానము. సమాధానకర్త చెప్పినట్టు చేస్తేనే సమాధానము. లేకుంటే లేదు.
ఆయన మన సమాధానమై యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్తమ్రును, తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.
దేవుడిచ్చిన సమాధానమును, ఆజ్ఞాతిక్రమము ద్వారా పోగొట్టుకున్న లోకానికి, ప్రేమగల దేవుడు గనుక తిరిగి సమాధానము ఇవ్వాలని దూతల ద్వారా ప్రవక్తల ద్వారా యాజకుల ద్వారా దైవజనుల ద్వారా పంపిన ప్రభువు మాటను పట్టించుకొనక పోయినా చివరిగా లోకము నశించుట ఇష్టము లేదు గనుక దేవుడు తానే నరావతారిగా ఈ లోకానికి కన్నియ మరియ గర్భాన ఉద్భవించాడు. తన మహిమను వదిలి ఒక సేవకునిగా ఈ లోకానికి రావటంలో దేవుని తగ్గింపు చూడగలము. రాజు ఒక సేవకునిగా రావటంలో దేవుని ప్రేమను మనము చూడగలము.
ఆదికాండము 3:15లో చెప్పబడినట్లు - నీకును స్ర్తికిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదనని చెప్పిన దేవుని మాట ప్రకారము - పురుష సంబంధము లేకుండా కన్నియ మరియ గర్భమందు పరిశుద్ధాత్ముని శక్తి వలన యేసు జన్మించెను. అంతేకాదు ‘నిన్ను గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును’ అని ఆదికాండము 12వ అధ్యాయము 2,3 వచనాలలో అబ్రహామునకు అతని సంతతికిని ఇవ్వబడిన వాగ్దానములన్నియు రెండు వేల సంవత్సరాల తరువాత అబ్రహాము సంతతియైన యేసు క్రీస్తునందు నెరవేరెను. దేవునికి మహిమ కలుగును గాక. రెండు వేల సంవత్సరాలైన మూడు వేల సంవత్సరాలైనా దేవుని మాటంటే మాటే. మాట తప్పే దేవుడు కాడు. అబ్రహామునకు ఇచ్చిన ఇంకొక వాగ్దానము ‘నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి- నీ సంతానము ఆలాగవున’ని చెప్పెను.- ఆదికాండం 15:5. అలానే ఆయన సంతానము భూమి మీద వర్థిల్లుతూనే ఉంది. ఆయన విశ్వాసులకే తండ్రి గనుక, భూ దిగంతముల నుండి విశ్వాసులకు తండ్రియైన అబ్రహాము ఖాతాలో అనేకులు చేరుతూనే ఉన్నారు.
అయితే కొంతమంది భావించినట్లు బైబిల్ సొంతంగా వ్రాసుకున్నది కాదని గ్రహించాలి. ఆత్మావేశము ద్వారా వ్రాయబడిన మాటలు కనుకనే కొన్ని వాగ్దానాలు వేల సంవత్సరాల తరువాత కూడా నెరవేర్చబడ్డాయి. చెప్పిన మాట చెప్పినట్లు జరుగుతూనే ఉంది. అంతేకాదు కాలమానం కూడా క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అని విభజింపబడింది. ఎంతో సామాన్య కుటుంబములో పుట్టిన క్రీస్తుకు ఆ ఆధిక్యత వచ్చింది.
క్రీ.శ.360లో డెనిస్ ది లిటిల్ అనే పురావస్తు శాస్తవ్రేత్త రోమన్ లైబ్రరీ నుండి యెరూషలేము దేవాలయం యొక్క రికార్డ్స్ తీసి, ఆ రికార్డులో ఉన్న యేసుక్రీస్తు యొక్క సున్నతి దినమును గుర్తించారు. సున్నతి జరిగిన ఎనిమిది రోజులు ముందుకు లెక్కించి వారి కేలండర్ నుండి మనం వాడే కేలండర్‌లోకి మార్చి, ఆ లెక్క ప్రకారం డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టిన రోజు అని నిర్ధారణ చేశారు. ఆ కాలంలో యూదులు పుట్టిన పిల్లవాడికి సున్నతి చేసి, పేరు పెట్టేప్పుడు ఆ పిల్లవాడి వివరాలను దేవాలయం రికార్డ్స్‌లో నోట్ చేసేవాళ్లు. అలాగే యేసుక్రీస్తుకు కూడా సున్నతి చేసినట్లుగా బైబిల్‌లో ఉంది. ఆ రికార్డ్స్ ఇప్పుడు కూడా రోమన్ లైబ్రరీలో మనం చూడవచ్చు.
ప్రవచనాలు
ఆదికాండము 49:10 - యూదా గోత్రము నుండి మెస్సయ్య జన్మిస్తాడని, షిలోహు వచ్చువరకు అనగా మెస్సయ్య వచ్చువరకు యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు.
మత్తయి 1:1-3 - అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి . అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఆ యూదా గోత్రీకుడైన యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యయైన మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.
బెత్లెహేములో జన్మిస్తాడని...
మీకా 5:2 - బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
మత్తయి 2:1 - రాజైన హేరోదు దినముల యందు, యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి.
యెరూషలేమునకు 9 కి.మీ. దక్షిణాన ఉన్న చిన్న పట్టణమే యేసు ప్రభువు జన్మస్థలమైన బెత్లెహేము. సముద్రము నుండి 2 వేల అడుగుల ఎత్తున ఈ గ్రామం ఉంది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థము. ఎఫ్రాతా అనగా ఫలభరితము. దీనికి దావీదు పురమని కూడా పేరు కలదు. మిక్కిలి సమృద్ధి గల ఊరు గనుక రొట్టెల ఇల్లు అని పేరు వచ్చి ఉండవచ్చు. ఈ పేరు గలిలయలోని ఇంకొక ఊరుకు ఉంది కనుక దీనిని యూదయ బెత్లెహేము అని అంటారు. ఈ బెత్లెహేము రూతు విశ్వాసములో యాకోబు ప్రార్థనతో దావీదు స్తుతి ఆరాధనతో ప్రభువు రాక కొరకు సిద్ధపడి ఉంది.
కన్యక గర్భమున జన్మించుట...
యెషయా 7:14 - కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును.
మత్తయి 1:22- కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
క్రీస్తు జన్మ సమయంలో పసిపిల్లలు చంపబడుట..
యిర్మియా 31:15 - యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. రామాలో అంగలార్పును మహా రోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోనందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.
మత్తయి 2:15-16 - ఆ జ్ఞానులు తన్ను అపహరించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగ తెలిసికొనిన కాలమునుబట్టి, బెత్లెహేములో దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరిని వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను. ఏడ్పును మహా రోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.
రామాలో అంగలార్పు పసిపిల్లలు చంపబడుటకు కారణము - మత్తయి 2:1 నుండి 17వ వచనము వరకు జరిగిన సంగతిని బట్టి, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు ప్రభువు పుట్టిన పిమ్మట తూర్పు నుండి జ్ఞానులు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి, ఆయన పూజింప వచ్చితిమని చెప్పిరి. వార్త విని కలవరపడిన హేరోదు ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగినట్లుగా - యూదయ బెత్లెహేములోనే అని ప్రవక్తల ప్రవచనాలు వినిపించిరి. సంగతి వినిన హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిచి పూజింతును, నాకు తెలుపుమని వారిని బెత్లెహేమునకు పంపెను. జ్ఞాను లు ప్రభువును చూచి సాగిలపడి ఆయనను పూజించి బంగారు సాంబ్రాణిని బోళమును కానుకలుగా అర్పించి, దూత మాట ప్రకారము హేరోదు దగ్గరకు వెళ్లక వేరొక మార్గమున వెళ్లిపోయిరి. జ్ఞానులు ఎంతకూ తిరిగి రాకపోవుట వల్ల హేరోదు కోపముతో జ్ఞానులు చెప్పిన వివరాన్నిబట్టి, రెండు సంవత్సరములలోపు ఉన్న మగ పిల్లలందరిని వధించెను. రామాలో
అంగలార్పు మహారోదనమునకు కారణము ఇదే.
సుమారు 580 సంవత్సరాలకు ముందు ప్రవక్త యిర్మియా వ్రాసిన ప్రవచనాల గురించి హేరోదు రాజుకు తెలియదు. జ్ఞానులకు తెలియదు. కానీ క్రీస్తు పుట్టినప్పుడు రెండు సంవత్సరాలలోపు మగ పిల్లలు చంపబడుట రామాలో అంటే బెత్లెహేములో అంగలార్పు ఉంటుందని, హేరోదుకు ప్రవచనానుసారంగా ఇది జరిగిన సంగతి తెలియదు. దీనిని బట్టి ప్రవచనములు పరిశుద్ధాత్మ ద్వారా తెలియబడితే, అవి కొన్ని వందల సంవత్సరాల తరువాతయైనా నెరవేరుతాయని అర్థమవుతోంది.
ముందుగా ఒకరు మార్గము సిద్ధపరచుట..
యెషయా 40:3 - ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా - అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
మలాకీ 3:1 - ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మత్తయి 3:3 - ఆ దినముల యందు బాప్తీస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి యున్నది. మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.
ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేక వేయు నొకని శబ్దము విని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే.
మొద్దు నుండి చిగురు
యెషయా 11:1 - యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును.
ఇశ్రాయేలీయులు అవిధేయులై దేవునికి దూరమయ్యారు. నిత్యము వింటున్నారు గాని గ్రహింపులేదు. నిత్యము చూచుచున్నారు కానీ తెలిసికోవటం లేదు. కనుక ప్రభువు కోపించి ఆ దేశమును నిర్జనముగా చేసినపుడు పదియవ భాగము మాత్రము విడువబడింది. సిందూర మస్తకీ వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి యుండు మొద్దు వలె ఉన్నది. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టెను. దావీదు సామ్రాజ్యము పొరుగు దేశాల వల్ల పతనమై పోయింది. యెషయా దావీదు తండ్రి ఆ చెట్టు నరికివేయబడింది. దాని వేళ్లు మాత్రము ఉన్నాయి. ప్రేమగల దేవుడు ఆ శేషించిన జనాంగాన్ని రక్షించేందుకు, మోడుబారిన జీవితాలను చిగురింప చేయటానికి వచ్చాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది. మంచి లేని లోకములోనికి నీతి న్యాయములు లేని లోకములోనికి నీతి చిగురించింది.
యిర్మియా 29:5 - యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును.
యిర్మియా 33:15 - ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయముల ననుసరించి జరిగించును.
జకర్యా 3:8 - చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.
జకర్యా 6:13 - చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును.
యెష్షయా మొద్దు నుండి చిగురు రావటం అద్భుతం. ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి వారిని శిక్షించి ఆయా దేశాలలో చెదరగొట్టెను. అయినా శేషించిన జనములో నుండి యెష్షయా కుమారుడైన దావీదు నుండి రాజవంశములో నుండి ఒక రాజుగా పుట్టించి నీతి న్యాయములు జరుగునట్లు చేసెను.
ప్రవక్త
(క్రీ.పూ.1400) ద్వితీయోదేశ కాండము 18:18 - వారి మధ్యలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోటను నా మాటలను ఉంచెదను. నేను అతని కాజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను.
మత్తయి 21:11 - జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.
కన్యక గర్భవతియై కుమారుని కనుట
యెషయా 7:14 - కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మాయేలను

పేరు పెట్టును.
లూకా 1:26 - ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము. ప్రభువు నీకు తోడై యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభ వచనమేమోయని ఆలోచించుకొనుచుండగా దూత - మరియ భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను.
గర్భము ధరించక మునుపే వచ్చి దూత తెల్పిన వార్త - నీవు గర్భము ధరించి కుమారుని కందువు అని. (2వేల సంవత్సరాల క్రితం ఎటువంటి అల్ట్రా సౌండ్ స్కాన్‌లు లేవు)
మరియ
విధేయత గల దైవ సేవకురాలు. దేవుని యందు నమ్మకముంచి ఇష్టపూర్వకముగా దేవదూత సందేశాన్ని అంగీకరించింది. యూదా గోత్రీకురాలు స్ర్తిలలో ఆశీర్వదించబడినది. దయాప్రాప్తురాలు. నజరేతు వాస్తవ్యురాలు.

చాలా పేద కుటుంబం. ఆమె సహోదరి సలోమి. యోహాను యాకోబుల తల్లి. ఎలిజబెత్ బంధువు. ఎలిజబెత్ భర్త జకర్యా యాజకుడు. వారిరువురు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. వారిరువురు బహుకాలము గడచిన వృద్ధులు. వారి ప్రార్థన ఆలకించి గొడ్రాలైన ఎలిజబెత్‌ను దేవుని దూత ఆశీర్వదించింది. గొడ్రాలైన ఎలిజబెత్ వృద్ధాప్యములో గర్భము ధరించినది. కన్యక గర్భము ధరించుట. వృద్ధురాలైన ఎలిజబెత్ గర్భము ధరించుట దేవుని అద్భుత కార్యాలు. దీనిని బట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని అర్థవౌతోంది.
యోసేపు
యోసేపు దావీదు వంశస్థుడు. నీతిమంతుడు. పాత నిబంధన భక్తుడు అని తెలుస్తుంది. ఈయన తండ్రి యాకోబు.
పుట్టుక సమయము
దానియేలు 9:25 - యెరూషలేమును మీరు కట్టించవచ్చును అని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణ రాచవీధులును కందకములును మరల కట్టబడును.
లూకా 2:1,2 - ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనను కైసర ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య.
జ్ఞానులు
తూర్పు దేశము నుండి నక్షత్రమును చూస్తూ ముందు యెరూషలేమునకు అక్కడ నుండి బెత్లెహేమునకు చేరుకున్నారు. అక్కడ తల్లియైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా యేసు ప్రభువుకు సమర్పించిరి. రాజుల రాజని బంగారము, యాజకుడేయని సాంబ్రాణిని, మృత్యుంజయుడని బోళమును సమర్పించారు.
జ్ఞానులను రాజులని యోగీ అని కూడా అనేవారు. వీరు పర్షియాలో భాగమైన మాదియ దేశస్థులు. వీరు పర్షియా రాజుకు గురువులుగా ఉండిరి. వీరు సత్ప్రవర్తన గల వారును జ్ఞానులు నగుదురు. వీరు జ్యోతిషశాస్త్రం ఎరిగినటువంటి వారు. తత్త్వ జ్ఞానము వైద్యము విజ్ఞానము వంటి వాటిలో వీరు ప్రవీణులు.
వీరు ప్రాచీన బబులోను సమీపమునగల పార్తియా దేశము నుండి వచ్చినవారని మరొక అభిప్రాయము కలదు. ఆ కాలమందు అచటి ప్రజలు జ్యోమునందు నమ్మిక కలిగి యుండిరి.
యెసారి అనగా ఒక రాజకుమారుని జననము అని అర్థము. యెసారి ఒక గొప్ప నక్షత్రము ఉదయించగా రాజు జన్మకు ఆనవాలుగా ఉన్నది. ఎట్లైనను ఒక నక్షత్రము ఉదయించితే అది ఒక నూతన రాజు పుట్టుకను గూర్చి చాటించుచున్నదిన జ్ఞానులు పరిశోధించి తెలుసుకొనిరి.
ఈ జ్ఞానులు పలు దేశములకు చెందినవారను అభిప్రాయము కలదు. అది నిజమైతే ప్రపంచములోని పలు స్థలముల నుండి జ్ఞానులు వచ్చి ప్రభువును ఆరాధించిరని చెప్పవచ్చును. ఇండియా కూడా తూర్పు దేశమే గనుక మన దేశము నుండి కూడా వెళ్లి ఉండవచ్చును. ఇశ్రాయేలీయులలోని ఏర్పరచబడిన ప్రజలు ప్రభువును స్వీకరించబోవుటయు, ఇతర దేశస్థులు ఆయనను ఎరుగుటను బట్టి క్రీస్తు యూదుల రాజు మాత్రమే కాదు లోకమంతటికి రాజుగా జన్మించెనని దీని ద్వారా మత్తయి సువార్తికుడు నిరూపించెను. జ్ఞానులు ఇచ్చిన బహుమానములు బాలుడైన యేసును ఐగుప్తు దేశమునకు తీసుకువెళ్లినపుడు వారి అవసరాలకు దేవుని ఏర్పాటు వలె ఉంది.
కేరెల్స్
మొట్టమొదట 129 సం.లో కేరల్స్‌ను క్రిస్మస్ పండుగ సందర్భంగా రోమన్ బిషప్ ‘దూత పాట’ పాడించి ప్రారంభించారు. 760 సం.లో కామర్ ‘యెరూషలేములో కొత్త పాట’ వ్రాశాడు. మెల్లగా ఐరోపా అంతా కేరెల్స్ మొదలైనది. క్రీ.శ.1223లో సెయింట్ ఫ్రాన్సిస్ ఇటలీలో మొదలుపెట్టారు. అదొక నాటకం. ఆ నాటకంలో వారు పాటలు పాడి వాక్యాలు చెప్పేవారు. ఇలా లాటిన్ భాషలో మొదలై ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ.. ఇంకా ఐరోపాలో అనేక ప్రాంతాలకు వెళ్లింది. దాని తరువాత అధికారిక కేరెల్స్ ప్రారంభమయ్యాయి. వారిని ‘వెయిల్స్’ అనేవారు. వీరు మాత్రమే క్రిస్మస్ ఈవ్‌లో కేరెల్స్ పాడుతూండేవారు. రాన్రాను ఆర్కెస్ట్రా బృందం వారు, క్వైర్ వారు కేరెల్స్ మొదలుపెట్టారు. వాటిలో ‘ఎ ఫెస్టివల్ ఆఫ్ నైన్ లెసన్స్ అండ్ కేరెల్స్’ బాగా ప్రాచుర్యం పొందింది.
నేటివిటీ సీన్
క్రీ.శ.1223లో సెయింట్ ఫ్రాన్సిస్ ఇటలీలో ‘నేటివిటీ సీన్’ని ప్రారంభించారు. క్రిస్మస్ దినాన గొల్లలు, జ్ఞానులు రావటం కానుకలు ఇవ్వటం, మరియ యోసేపు బాలుడైన యేసు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టెలో ఉండుట, పశువులు, పశువుల తొట్టెను చూయిస్తూ క్రిస్మస్‌లో జరిగిన సంఘటనలు అందరికీ గుర్తు చేసేందుకు ఈ ‘సీన్’ని ఉంచుతారు.
కేండీ కేన్స్
ఈ కేండీ కేన్స్ ‘గొల్లలను’ గుర్తు చేస్తాయి. మొదట ప్రభువును చూసింది గొల్లలే. అసలు కాపరి యేసు అని గుర్తు కోసం ‘కేండీ కేన్స్’ దానికి చుట్టి ఉన్న తెల్లరంగు రిబ్బన్ కన్య మరియకు పుట్టిన క్రీస్తు పవిత్రతను సూచిస్తున్నది. ఎర్రరంగు రిబ్బన్ క్రీస్తు మానవాళి కొరకు చిందించిన రక్తాన్ని సూచిస్తుంది.
* * *
ఈ పండుగకు ఇంట్లో బూజు దులపటం, శుభ్రం చేయటం, ఇల్లు కడగటం, రంగులు వేయటం, పిండి వంటలు, కేకులు, బిర్యానీలు ఇలా రకరకాలుగా చేసుకొంటూ హడావిడిగా ఉంటారు. క్రొత్త బట్టలు వేసుకోవటం లాంటి పనులలో మునిగి ఉంటారు. అయితే మన హృదయాలలో ఉన్న మలినాన్ని శుభ్రం చేసి క్రీస్తును హృదయంలో చేర్చుకోవటం అన్నిటికంటె ముఖ్యమైనది.
ఆయనను హృదయములో చేర్చుకొని, ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ, ఆయనకు ఇష్టులముగా ఉంటే, భూమి మీద సమాధానముంటుంది. సమాధానము కొరకు ఎక్కడెక్కడికో వెళ్లనవసరం లేదు. ఏదేదో చేయనవసరం లేదు కానీ మనలను వెదుకుతూ పరలోకము నుండి వచ్చిన ప్రభువును హృదయాలలో చేర్చుకుంటే సమాధానము శాంతి మనకు లభిస్తుంది. ఆయనను నమ్మి హృదయములో చేర్చుకొని పూజించి ఆరాధించి కానుక లివ్వటమే అసలు క్రిస్మస్.
దేవుడు మానవాళికి ఇచ్చిన ఈ అవకాశాన్ని వాడుకొని క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించి హృదయాలలో చేర్చుకొని సమాధానంగా సంతోషంగా ఉండటమే అసలు క్రిస్మస్.
సమాధానం పొందుకున్నవారు
సమాధాన పరుస్తూనే ఉంటారు.
వారు దేవుని కుమారులనబడుదురు.
దేవుని రాజ్యవారసులౌతారు.
నక్షత్రం
తూర్పు దిక్కున ప్రభువు నక్షత్రమును చూసిన జ్ఞానులు నక్షత్రమును వెంబడించి బెత్లెహేములో శిశువు ఉన్న చోటికి వచ్చి అత్యానందముతో సాగిలపడి ఆయనను పూజించారు.
పాత నిబంధనలో కూడా అరణ్యంలో చీకటిలో ఉన్న ఇశ్రాయేలీయులకు అగ్నిస్తంభం వెలుగునిచ్చింది. మార్గము చూపింది. అలాగే జ్ఞానులను ఈ నక్షత్రము వెలుగు ప్రభువు ఉన్న చోటుకు జ్ఞానులను నడిపించింది. దానికి ముందు మండుచున్న పొద నుండి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడి ‘నీ తండ్రియైన దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను’ అని తెలిపాడు. ఇప్పుడు ఆయన వాక్యము మన పాదములకు దీపముగా త్రోవకు వెలుగుగా ఉండి నడిపిస్తుంది. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ వెలుగు క్రీస్తే.

దేవదూతలు
దేవుని యొద్ద నుండి వార్తలను తెచ్చేవారే దేవదూతలు. దేవుని ప్రజలను కాపాడుట ఉత్సాహపరచుట మార్గము చూపుట శిక్షను నెరవేర్చుట భూమి మీద తిరుగులాడు దురాత్మలతో పోరాడుట దేవుని స్తుతించుట. వీరే క్రీస్తు జననాన్ని గొల్లలకు, జెకర్యాకు మరియ యోసేపులకు తెలియజేసింది. వీరిలో ఎక్కువగా వినపడే పేర్లు గాబ్రియేలు, మిఖాయేలు.
శాంతాక్లాజ్
సెయింట్ నికోలన్ 4వ శతాబ్దపు బిషప్. టర్కీ దేశస్థుడు. గొప్ప ధనిక కుటుంబంలో జన్మించాడు. ఆయన యవ్వనంలో తల్లిదండ్రులు మరణించారు. చాలా ఆస్తిపాస్తులు వదిలివెళ్లారు. దాతృత్వం కలలవాడు గనుక పేదవారికి ‘సీక్రెట్ గిఫ్ట్స్’ ఇచ్చి సహాయపడుతూ ఉండేవాడనేది ఒక కథనం. వాటిలో ముఖ్యమైనది - ఒక పేదవానికి ముగ్గురు కుమార్తెలున్నారు. కట్నకానుకలు ఇవ్వలేకపోవటంతో వారి పెళ్లిళ్లు ఆలస్యమయ్యాయని తెలిసిన నికోలస్ బంగారపు సంచిని వారి ఇంటి ముందు ఉంచాడు. పెద్ద కూతురు వివాహమైంది. రెండో కుమార్తె వివాహానికి ఆ విధంగానే సహాయం అందింది. ఐతే - ఈసారి ఆ సహాయాన్ని అందిస్తున్నది నికోలస్ అని తండ్రికి తెలిసింది. కానీ నికోలస్ తన పేరును ఎవరికీ చెప్పవద్దన్నాడు. ఎవరికి సహాయం వచ్చినా ఆ బహుమతి నికోలస్ చేశాడని అనుకునేవారట. ఆయన దాతృత్వాన్ని గుర్తించి ఆయనకు ‘సెయింట్’ బిరుదు ఇచ్చారు.
క్రిస్మస్ ట్రీ
‘సరివి’ చెట్టు ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. ఏ కాలంలోనైనా పచ్చగా ఉండటం వాటి లక్షణం. గనుక ‘జీవితానికి’ గుర్తుగా ఈ చెట్టును ఇళ్లల్లో పెట్టుకొనేవారు. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ క్రిస్మస్ ముందు అడవిలో నడుస్తూ చెట్లసందులలోని చుక్కల వెలుగును చూస్తూ నక్షత్రాల వెలుగును క్రీస్తు భూమి మీదనే ఉంచాడని, అది ఆయన పుట్టినప్పటి దృశ్యాన్ని గుర్తు చేస్తుందని, ఇంటి లోపల ఆ ‘చెట్టు’ను పెట్టినట్లు తెలుస్తోంది. దాని చుట్టూ నక్షత్రానికి గుర్తుగా కొవ్వొత్తులు వెలిగించడం, బహుమతులు పెట్టడం ఒక ఆచారమైంది. థామస్ ఎడిసన్ అల్వా ‘ఎలక్ట్రిక్ బల్బ్’ కనుగొన్నప్పటి నుండి కొవ్వొత్తులకు బదులుగా ఎలక్ట్రిక్ లైట్స్ అలంకరణ మొదలైంది. ప్రపంచంలో అతి పెద్ద క్రిస్మస్ చెట్టు ఎత్తు 52 మీటర్లు. దీనినే ‘పీస్ ట్రీ’ అంటారు. పచ్చని ఆకులు నిత్య జీవానికి గుర్తుగా వాడతారు.

గొల్లలు
ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రనువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి.
గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టుచున్న పేతురును పిలిచిన దేవుడు ఇక్కడ రాత్రివేళ తమ గొర్రెలను కాయుచున్న కాపరులను ఎన్నుకొని వారికి ఒక శుభవర్తమానము చెప్పెను. దీనిని బట్టి అతి సామాన్యులైన వారిని కష్టపడి పని చేయువారిని దేవుడు ఎన్నుకొని వారికి ఈ శుభవార్తను తెలియజేసినట్టు తెలుస్తోంది. మత గురువులకు, పెద్దలకు, అధికారులకు, ఆస్తిపరులకు ఈ గొప్ప శుభవార్త తెలుపలేదు గానీ సామాన్యులకు, వినయ విధేయులకు, దీనులకు తెలియజేయబడింది.

-మద్దు పీటర్ 9490651256