సంపాదకీయం

‘వైవిధ్య’ వారసత్వం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలోని జీవ వైవిధ్య సంపద మనకు గర్వకారణమన్నది ప్రధానమంత్రి మనసులోని మాట... జీవ వైవిధ్యం ప్రకృతి స్వరూపం, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం నిహితమై ఉండడం ప్రకృతి స్వభావం! స్వరూపం ఛిన్నాభిన్నం అవుతుండడం శతాబ్దుల వైపరీత్యం, ఫలితంగా ప్రకృతిలో నిహితమైఉన్న స్వభావ సమన్వయం కూడ నశించిపోతోంది! వృక్షజాలం, జంతుజాలం పరస్పరం పరిపోషకాలు కావడం ప్రకృతి సతత హరిత శోభలకు ప్రాతిపదిక! ఈ ప్రాతిపదిక చెడని రీతిలో అనాదిగా వృక్షజాలం, మానవేతర జంతుజాలం మనుగడ సాగించడం జీవ వైవిధ్య పరిరక్షణ వ్యవస్థ... ‘విచక్షణ’లేని వృక్షజాలం, మానవేతర జంతుజాలం ‘స్వభావసిద్ధం’గా ప్రకృతి నష్టంకాని రీతిలో జీవించాయి, జీవిస్తున్నాయి. ‘విచక్షణ’ విలక్షణ గుణమైన మానవులు ప్రకృతిని పరిరక్షించడం ఈ దేశంలో సహజ జీవన విధానం! ప్రకృతిలో తాను అవిభాజ్య భాగస్వామినని మానవుడు భావించడం ఈ విచక్షణ! అందువల్లనే పంచభూతాలను, పంచభూత భాసితమైన ప్రకృతిని అనాదిగా ఈ దేశంలో దివ్యరూపాలుగా భావించారు. ఇదీ ‘జీవ వైవిధ్యం’ మనకు గర్వకారణం కావడం... ఆకాశానికి ప్రతీకలైన సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు హైందవ జాతీయ జీవనంలో మార్గదర్శక ప్రతీకలు కావడం వైవిధ్య స్వరూపాల మధ్యకల స్వభావ ఏకత్వం... ఈ అద్వైత వాస్తవం గాలిని, నిప్పును, నీటిని, నేలను జీవవైవిధ్యాల సమన్వయ కుటుంబంగా రూపొందించింది. ఈ సమన్వయ పరివారం ప్రకృతి. నేల తల్లి, నింగి తండ్రి, జలవాయువులు సహోదరులు, నిప్పు-అగ్నిదేవుడు- పురోహితుడు కావడం ఈ ప్రాకృతిక కుటుంబం! అందువల్ల పంచభూతముల- ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి,-లో ఏది గాయపడినప్పటికీ మొత్తం ప్రకృతి గాయపడుతోంది. పంచభూతములలో ఏది పరిపుష్టం అయినప్పటికీ అది మొత్తం ప్రకృతికి పరిపుష్టిని కలిగించడానికి దోహదవౌతోంది... ఇదీ జీవవైవిధ్యాల మధ్య సంతులనానికి, సమన్వయ వ్యవస్థకు ప్రత్యక్ష ప్రమాణం! అందువల్లనే అనాదిగా మన దేశంలో విచక్షణకల మానవులు ప్రకృతితో మమకారబద్ధులయ్యారు. ఈ మమకారం ప్రకృతి ఆరాధన అయింది, దేశభక్తిగా ప్రస్ఫుటించింది. ఈ సహజమైన మమకారమే మాతృభూమి ప్రాతిపదికగా హైందవ జాతీయ జీవన వికాసంగా పరిణతి నొందింది. పుట్టను, చెట్టును, చెఱువుకట్టను, కొండ గట్టును, వివిధ జంతువులను పక్షులను, వన చరాలను, జల చరాలను దివ్యత్వపు ప్రతీకలుగా సంభావించి సమాదరించిన హైందవ జాతీయ జీవనం అనాదిగా జీవవైవిధ్య వ్యవస్థను పరిరక్షించింది, పెంపొందించింది. జీవవైవిధ్య రక్షణ ప్రవృత్తి వైరుధ్యాలు లేని భావవైవిధ్య వ్యవస్థగా ప్రస్ఫుటించడం భారత జాతీయ జీవనం... నరేంద్ర మోదీ ప్రస్తావించిన గర్వకారణం!!
కానీ ఈ ప్రాకృతిక సహజ సనాతన వాస్తవాన్ని పరిగణించని, పరిగణించలేని ‘‘్భరతదేశపు వెలుపలి మానవులు’’ ప్రకృతిని అవసరాలకోసం కాక దోపిడీ చేయడంకోసం విపరీత పద్ధతులలో వాడుకున్నారు. మానవుని ‘విచక్షణ’ జీవవైవిధ్య పరిరక్షణకు ఉపయోగపడడం భారతీయ జీవనం. ఇదే ‘విచక్షణ’ జీవ వైవిధ్య విధ్వంసానికి దోహదంచేయడం భారతదేశపు వెలుపలి చరిత్ర! విదేశీయుల దురాక్రమణ కొనసాగిన సమయంలో ప్రధానంగా బ్రిటన్‌వారి బీభత్సపు పెత్తనం నడచిన సమయంలో ఈ ‘విదేశీయ విచక్షణ’ మన దేశపు జీవన స్వభావాన్ని సైతం ఆవహించింది, ప్రభావితం చేసింది మన దేశపు భూమి పట్ల. ఈ భూమిని ఆవహించి ఉన్న ప్రకృతి పట్ల ‘మమకారం’లేని విదేశీయులు జీవవైవిధ్య విధ్వంసానికి శ్రీకారం చుట్టడం చరిత్ర! బ్రిటన్‌వారు మన అడవులను ధ్వంసంచేసి, కలపను తరలించుకొనిపోయారు. ఇలా అత్యాశతో మితిమీరిన స్వార్థంతో చెట్లను నరికివేసే వికృత ప్రవృత్తి మన దేశ ప్రజలకు కూడ వ్యాపించింది, ప్రస్తుతం కొనసాగుతోంది!! తుపాకులతో విచక్షణ రహితంగా వనచర జంతువులను వేటాడడం, గోసంతతిని, పశుసంతతిని సామూహికంగా హత్యచేయడం వంటి వైపరీత్యాలు క్రమంగా జీవవైవిధ్యం ధ్వంసం కావడానికి దోహదం చేసింది...
భూసారం కొట్టుకొనిపోయి భూమి నిర్జీవంకావడానికి, అతివృష్టి అనావృష్టి వంటి ఈతిబాధలు ఏర్పడడానికి దేశం కాలుష్య వాటికగా మారడానికి ఇలా దశాబ్దుల తరబడి జీవవైవిధ్యం నష్టం కావడం కారణం! ఒక పక్షి ‘తెగ’ అంతరించిపోయినట్టయితే ఒక ‘వృక్షజాతి’ అంతరించిపోతోంది. ఆవుపేడ, అడవి ఆకులు దొరకని వ్యవసాయ భూములు విష రసాయనాలతో నిండిపోతున్నాయి. ఈ రసాయన కాలుష్య వైపరీత్యానికి గురయి అనేక పక్షిజాతులు, జలచరాలు అంతరించిపోతున్నట్టు దాదాపు ప్రతిరోజు అధ్యయనాలు ఆవిష్కృతం అవుతుండడం నరేంద్ర మోదీ ప్రస్తావించిన ‘జీవ వైవిధ్య’ వారసత్వానికి వ్యతిరేక నేపథ్యం... లక్షలాది జల చరాలు ఊపిరాడక ఉసురుకోల్పోతున్నాయి, ఆ మృత దేహాలన్నీ సముద్ర తీరాలకు కొట్టుకొని వస్తున్నాయి! ఇలా జీవ వైవిధ్యం ధ్వంసమైపోతున్న సమయంలో కొత్తకొత్త తెగల ‘జీవజాలం’ ఆవిష్కృతం అవుతుండడం సమాంతర పరిణామం... అంతరించి పోయాయని భావిస్తున్న జీవవైవిధ్యాలు ఎక్కడో మిగిలి ఉండడం ఈ సమాంతర పరిణామం... మేఘాలయ ప్రాంతంలోని కొండ గుహలలో అపురూపమైన అతిపెద్ద తెగకు సంబంధించిన చేపలు జీవిస్తున్నట్టు ఇటీవల కనుగొన్నారట... నరేంద్ర మోదీ తన ‘మన్‌కీ బాత్’- మనసులోని మాట- ద్వారా ఈ సంగతిని వెల్లడించాడు. మన చుట్టూ నెలకొని ఉన్న, ఆవహించి ఉన్న ఇలాంటి మరిన్ని జీవవైవిధ్య రహస్యాలను ఆవిష్కరించడానికి నిష్ఠతో పరిశోధనలు జరగాలన్నది నరేంద్ర మోదీ చెప్పిన మాట... సృష్ట్యాదిలో సత్యవ్రతుడనే ఋషి సముద్రంలో భయకంపిత అయిన చిట్టి చేపను రక్షించి, పెంచి పెద్ద చేసిన కథ జీవవైవిధ్య ప్రవృత్తికి నిదర్శనం... ఇలా ‘‘నితాంత అపార భూత దయ’’ విచక్షణకల మానవుల స్వభావంగా మళ్లీ రూపొందడం జీవ వైవిధ్య పరిరక్షణ దోహదం చేయగలదు...
కృత్రిమ రసాయన విషాలకు విరుగుడు సహజమైన ప్రాకృతికమైన ధాతువులు! ‘ప్లాస్టిక్’కాలుష్యం భూమండల పరిధిని అతిక్రమించి అంతరిక్షమంతటా అలముకొంటోందట! భూమండల సమీప అంతరిక్షంలో కోట్లకొలది ప్లాస్టిక్ ముక్కలు తేలియాడుతున్నాయన్నది పరిశోధకులు నిగ్గుతేల్చిన కాలుష్య వాస్తవం! ‘ప్లాస్టిక్’కు విరుగుడు పత్తి! ప్లాస్టిక్ కాలుష్యాన్ని కేంద్రీకరిస్తోంది. పత్తి స్వచ్ఛతను విస్తృతంగా వికేంద్రీకరించడం తరతరాల వాస్తవం! బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహాత్మాగాంధీ ‘రాట్నం’- చరఖా- ప్రతీకగా ఈ స్వచ్ఛ ఉద్యమ జీవనాన్ని పునరుద్ధరించాడు. సోమవారం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్భించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘చరఖా’తో దారంతీసే ప్రక్రియను చూసి సంభ్రమానికి గురిఅయ్యాడు. పత్తితో దారం తీయడాన్ని ఆయన నేర్చుకునే ప్రయత్నం చేయడం ‘పత్తి స్వచ్ఛత’ను పునరుద్ధరించడానికి బహుశా దోహదం చేయవచ్చు! ‘చరఖా’లను ప్రదర్శించడం మాత్రమేకాక విరివిగా వినియోగించడానికి, ఎగుమతి చేయడానికి కృషిజరగాలి. ‘ప్లాస్టిక్’ దారం జీవవైవిధ్యాన్ని హతం చేస్తోంది... నూలు దారం ప్రాణంపోసే ‘సూత్రం’.