సంపాదకీయం

‘పరిభాష’ పట్టనివారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ బీభత్సం- అన్న పదాలను కల్పించిన రాజకీయ పక్షాల వారిని ‘వోటర్’లు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో శిక్షిస్తారన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార సభలలో చెబుతున్న మాట! కానీ ఈ ‘‘హిందూ బీభత్స’’- హిందూ టెర్రర్- శబ్ద ‘ప్రయోక్త’లను, సృష్టికర్తలను ‘వోటర్’లు ఇదివరకే 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో శిక్షించడం చరిత్ర. 2004- 2014 సంవత్సరాల మధ్య కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన రాజకీయ వేత్తలు కొందరు ఈ ‘పదజాలాన్ని’ కల్పించారు, మిగిలిన ప్రభుత్వ నిర్వాహకులు ఆమోదించారు. అందువల్ల 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఈ ప్రభుత్వ నిర్వాహక కూటమి మొత్తం శిక్షకు గురి అయింది. ఈ శిక్ష అధికారచ్యుతి, పదవీచ్యుతి! ఈ చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోనివారు మళ్లీమళ్లీ ఈ లేని ‘హిందూ బీభత్సకాండ’ను ఉన్నట్టుగా చూపించడానికి యత్నించారన్నది మోదీ మాటల సారాంశం! జిహాదీ బీభత్సకాండ దశాబ్దులుగా మన దేశ ప్రజలను హత్యచేసింది. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి సమయంలో అఖండ భారత్ విభజన జరిగిన పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం ‘అవశేష భారత్’ అయిన మన దేశంలోకి జిహాదీ బీభత్సకారులను ఉసిగొల్పుతోంది! ‘జిహాదీ’లు ఇస్లాం మతస్థులు. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలనూ నిర్మూలించి ఇస్లాం మతాన్ని ఏకైక మతంగా ప్రతిష్ఠించడం ‘జిహాద్’ లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు జిహాదీలు ఎంచుకున్న మాధ్యమం ఇస్లాం మతేతరులకు వ్యతిరేకంగా బీభత్సకాండను జరుపడం! ఇస్లాం మతేతరులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, ఇస్లాం మతేతరులను చంపడం, తరిమి వేయడం, ఇస్లామేతర మతాలకు చెందిన మహిళలను లైంగిక అత్యాచారాలకు గురిచేయడం.. ఈ నాలుగు పద్ధతులు జిహాదీ బీభత్సకాండలో భాగం. క్రీస్తుశకం 712లో ‘మహమ్మద్ బిన్ కాసిమ్’ అఖండ భారత్‌లోని సింధు ప్రాంతంలోకి చొరబడి ఈ భయంకర బీభత్సకాండను ప్రారంభించాడు. బిన్ కాసిమ్ అరేబియాకు చెందిన బీభత్సకారుడు. సింధులోని దేవల పట్టణంలోని భారతీయుల- హిందువుల-ను మొత్తం కాసిమ్ ఊచకోత కోయడం చరిత్ర. రెండువేల మంది హిందూ యువతులను బందీలుగా తీసుకొనివెళ్లి పశ్చిమ ఆసియాలో విక్రయించడం చరిత్ర! ఈ జిహాదీ బీభత్సకాండ ఫలితంగానే శతాబ్దులపాటు భారతీయ- హిందూ- మతాలవారు ఇస్లాంలోకి మతం మార్పిడికి గురి అయ్యారు. ఇలా బలవంతంగా విదేశీయ ఇస్లాంలోకి మార్పిడి చేయబడిన భారతీయ మతాలవారు తరాలు గడిచిన తరువాత తాము తమ పూర్వులు అనాదిగా ఇస్లాం మతస్థులమేనని భ్రమించడం చారిత్రక వైపరీత్యం. అఫ్ఘానిస్థాన్, బర్మా, శ్రీలంక, మాల్ దీవులు, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లలోని నేటి ఇస్లాం మతస్థుల పూర్వజులు అందరూ భారతీయ- హిందూ-మతాలవారే! విదేశాల నుంచి వ్యాపించిన ‘ఇస్లాం’లోకి ఈ భారతీయ మతాలలోని కొందరు పనె్నండు శతాబ్దుల పూర్వం మారి ఉండవచ్చు, మరికొందరు పనె్నండు దశాబ్దుల క్రితం మారి ఉండవచ్చు!
ఇలా ప్రస్తుత భారతీయ ఇస్లాం మతస్థులు శతాబ్దుల తరబడి జిహాదీ బీభత్సకాండకు బలైపోయి మతం మార్చుకున్న ఇస్లామేతర భారతీయ మతాల వారు. ఇస్లాం మతం సిద్ధాంతాలు నచ్చి విదేశాలనుంచి వ్యాపించిన ఈ మతంలోని శతాబ్దుల తరబడి స్వచ్ఛందంగా మారిన భారతీయ మతాలవారి సంఖ్య చాలా తక్కువ. అందువల్ల విదేశాలనుంచి చొరబడిన జిహాదీల భయంకర బీభత్సకాండకు శాశ్వతంగా బలైపోయినవారు భారతీయ ఇస్లాం మతస్థులు, వీరి పూర్వజులు! అనేక లక్షల మంది భారతీయులు హత్యకు గురికాగా, అనేక కోట్లమంది భారతీయులు మతం మార్పిడికి గురికావడం పదమూడు శతాబ్దుల ‘జిహాద్’కు ఫలితం! ఈ కాలఖండంలో కాని అంతకు పూర్వం యుగాలు గాని భారతీయులు- హిందువులు- విదేశాలలోకి చొరబడి దాడులు చేయలేదు, ధ్వంసం చేయలేదు, మతాలను బలవంతంగా మార్చలేదు, మహిళలను అత్యాచారాలకు గురిచేయలేదు. ప్రపంచంలో ఇతర జాతులను హత్యచేయని జాతి, ఇతర జాతులకు అన్నం పెట్టిన జాతి హిందూ జాతి. హిందువులు ఎవ్వరూ బీభత్సకారులు కాదన్న వాస్తవాన్ని చరిత్ర ధ్రువపరుస్తోందని నరేంద్ర మోదీ చెప్పిన మాటకు ఇదీ నేపథ్యం..
ఈ హైందవ స్వభావం సమష్టి జాతీయ స్వభావం. ఈ హైందవ జాతిలో దేశంలోని అన్ని మతాల వారు-ఇస్లాం, క్రైస్తవ మతాలు సహా- సమాన భాగస్వాములు. వివిధ మతాలు, భాషలు, ఆహారాలు, ఆహార్యాలు, అనేక ఇతర వైవిధ్యాలు ఉన్నప్పటికీ అనాదిగా ఈ దేశపు సంస్కృతి ఒక్కటే! జాతీయత ఒక్కటే! ఇది సనాతన జాతి, అజనాభం, భారత జాతి, హిందూ జాతి! ఇవన్నీ పర్యాయ పదాలు. హిందూ జాతి అన్నప్పటికీ భారత జాతి అన్నప్పటికీ ఒక్కటే! క్రీస్తుశకం ఒకటవ శతాబ్దిలో భారత జాతీయ సమ్రాట్ శాలివాహనుడు విదేశీయ బీభత్సకారులను శిక్షించి తరిమివేశాడు, ఈ దేశానికి ‘హిందూస్థానం’ అన్న పేరుపెట్టాడు. ‘హిందూ స్థానం ఇతిజ్లేయం’-అన్నది పురాణ వాక్యం. అప్పటి దేశంలో అనేక వేద మతాలు ఉన్నాయి, వేదాన్ని అంగీకరించని మతాలున్నాయి. ఈ మతాలన్నీ అప్పటికీ, అంతకు పూర్వం నుంచీ, ఇప్పటికీ కూడ ఈ ‘అనాది జాతి’లో భాగం. అందువల్ల క్రీస్తుశకం ఒకటవ శతాబ్ది తరువాత కొత్త మతాలు ఈ దేశంలోకి వ్యాపించినంత మాత్రాన ఈ దేశపు ‘జాతీయత’ మారదు.. అది హిందూ జాతీయత! విదేశాల నుంచి వచ్చిన మతాలను స్వీకరించిన స్వజాతీయులు కూడ లేదా విదేశాల నుంచి విస్తరించిన మతాలలోకి మార్పిడి జరిగిన స్వజాతీయులు కూడ- ఇలా మతాలు మారక పూర్వం, మారిన తరువాత- స్వజాతీయులే, హిందువులే! హిందువులంటే ఈ దేశాన్ని ప్రేమించి ఈ దేశం తమ మాతృభూమి అన్న వాస్తవాన్ని గుర్తించిన అన్ని మతాలవారు.. ఈ వాస్తవాన్ని బ్రిటన్ దురాక్రమణదారులు వక్రీకరించడం చరిత్ర! ‘హిందుత్వం’ జాతి కాదని కేవలం ఒక మతమని బ్రిటన్‌వారు చెప్పి వెళ్లడం ఈ వక్రీకరణ! ‘జాతి’ ఒక ఇల్లు.. మతాలు గదులు! అన్ని గదులతో కూడిన సర్వసమగ్రమైన ఇంటిని కేవలం ఒక గది అని బ్రిటన్ విద్యావంతులు, మేధావులు నిర్ధారించిపోయారు! ‘హిందుత్వం’ జాతి, ఇల్లు.. తోట జాతి, చెట్లు మతాలు! కానీ బ్రిటన్‌వారు వృక్ష సమాహారమైన వనం కేవలం ఒక చెట్టు అని చెప్పారు. ఫలితంగా వాస్తవాలు తలకిందులయ్యాయి! ‘జాతీయత’ను ‘మతం’అన్న భ్రమ కొనసాగుతోంది!
బ్రిటన్‌వారు ఇలా చెఱచిపోయిన ‘పరిభాష’ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ‘పరిభాష’ మారిపోవడం వల్ల బ్రిటన్ దురాక్రమణ సమయంలోను, బ్రిటన్ విముక్తి జరిగిన తరువాత కూడ జరిగిన, జరిగిపోతున్న అనర్థం అంతా ఇంతాకాదు! ఈ దేశపు జాతీయతకు సంబంధించిన ప్రతి అంశాన్ని ‘సంకుచిత’ మతతత్త్వంగా రకరకాలవారు చిత్రీకరిస్తుండడానికి కారణం ఇలా ‘పరిభాష’ వక్రీకృతం కావడం! బ్రిటన్ దుండగులు వక్రీకరించక పూర్వం నాటి భారతీయ ‘పరిభాష’ను పునరుద్ధరించుకున్నట్టయితే హిందువులూ భారతీయులూ ఒక్కరేనని స్పష్టమతుంది. ఈ వాస్తవ పరిభాషలో ఈ దేశంలో అనాదిగా ఉన్న, ఆ తరువాత వచ్చిన అన్ని మతాలకు చెందినవారు ఒకే జాతీయులు, హిందువులు లేదా భారతీయులు! హిందువులు ఇతర దేశాలపై దాడిచేయలేదన్న, హిందువులు బీభత్సకారులు కాదన్న ప్రధానమంత్రి మాటల ‘పరిభాష’ ఇది. ఈ ‘పరిభాష’ను ‘మరచిన’వారు మాత్రమే బీభత్సకారులపై సైనికులు ‘ప్రతీకారం’ తీర్చుకున్నారని, ‘కసి తీర్చుకున్నారని’ ‘పగ సాధించారని’ప్రచారం చేస్తున్నారు! హిందువు పగతీర్చుకోడు, పగ పట్టడు కనుక. హిందువు కసి తీర్చుకోడు, ప్రతీకారం చేయడు. ‘పరివెత్తు విరోధిని పట్టి కౌగిటన్ గుచ్చిన జాతిరా ఇది..’ అని కరుణశ్రీ మహాకవి అన్నట్టు హైందవ జాతి అనాదిగా దురాక్రమించిన శత్రు దేశాలను సైతం క్షమించింది! మరీ బీభత్సకారులు బరితెగించినప్పుడు శిక్షించింది. అంతేకానీ ‘కసి’తీర్చుకోలేదు!! ఇదీ పరిభాష! ఈ ‘పరిభాష’ తెలిసినవారు మన సైనికులు పాకిస్తానీ బీభత్సకారులను ‘శిక్షించారని’ మాత్రమే భావిస్తున్నారు! కసి తీర్చుకున్నట్టు, పగ సాధించినట్టు, ప్రతీకారం చేసినట్టు భావించరు. దోషిని దండించే ప్రభుత్వం, న్యాయస్థానం పగ సాధించడం లేదు, ప్రతీకారం చేయడం లేదు, కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి! మన సైనికులు కశ్మీర్‌లోని ‘అధీన రేఖ’వద్ద పొంచి ఉన్న, బీభత్సం జరిపిన నేరస్థులను శిక్షించారు! ఇదీ ‘పరిభాష’. సైనికులు ‘కసి’ ‘పగ’ ప్రతీకారం తీర్చుకోలేదు, దోషులను దండించారు.. ఇదీ సరైన ‘పరిభాష..