ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

వైఫల్యమా? దీర్ఘకాల ప్రయోజనమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రతిపక్షంతోపాటు అధికార పక్షానికి చెందిన కొందరు సభ్యులు కూడా నరేంద్రమోదీపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బి.జె.పి సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తదితరులు మోదీ ఆర్థిక విధానాలపై పెద్దఎత్తున దుమ్మెత్తిపోశారు. ఆర్.ఎస్.ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ దసరా పండుగ సందర్భంగా నాగ్‌పూర్‌లో జరిగిన వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఎన్.డి.ఏ ప్రభుత్వం ఆర్థిక విధానాలను తప్పుబట్టారు. ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ప్రభుత్వం ఆర్థిక విధానాలు, నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్న తీరును విమర్శించటాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం తప్పులను, ప్రధాన మంత్రి వ్యవహరిస్తున్న తీరును విమర్శించటం ప్రతిపక్షం హక్కు. రాహుల్ గాంధీ ప్రతిపక్షం నేతగా తన విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వం తప్పొప్పులను ఎత్తిచూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ చెబుతున్న దాంట్లో నిజానిజాలు ఏమిటో ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ప్రతిపక్షం నాయకుడి హోదాలో విమర్శించేందుకే విమర్శిస్తే దానిని పట్టించుకోవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. కాంగ్రెస్ మాదిరిగానే బి.జె.పి ప్రభుత్వం కూడా ఉపాధి కల్పనలో ఘోరంగా విఫలమైందని రాహుల్ గాంధీ విమర్శించారు. రాహుల్ గాంధీ తన నిజాయితీని చాటుకునేందుకు బి.జె.పి ప్రభుత్వంతోపాటు గత కాంగ్రెస్ ప్రభుత్వాలను కూడా విమర్శించటం గమనార్హం. రాహుల్ గాంధీ మొదటి రోజు నుండి నరేంద్ర మోదీని విమర్శిస్తూనే ఉన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ‘సూట్ బూట్‌కీ సర్కార్’ అంటే సూటు, బూటు వేసుకునే వారి కోసం పనిచేస్తోంది తప్ప సగటు మనిషి అభివృద్ధి కోసం పనిచేయని ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించి ప్రజాదరణ కోసం ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీని ఎవరైనా సీరియస్‌గా తీసుకుంటారా? యువతకు ఉపాధి కల్పించటంలో ఎన్.డి.ఎ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదనేది నిజమే. లక్ష, కోటి ఉద్యోగాల గురించి మాట్లాడిన ఎన్.డి.ఏ ప్రభుత్వం దీనిని సాధించటంలో విజయం సాధించలేకపోయింది. రాహుల్ గాంధీ మాదిరిగానే యశ్వంత్ సిన్హా కూడా మొదటి నుండి నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలతోపాటు ఇతర విధానాలను కూడా తప్పు పడుతూనే ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా చిత్తశుద్ధితో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించటం లేదు. ఆయనకు రాజకీయ లక్ష్యాలున్నాయనేది అందరికి తెలిసిందే. నరేంద్ర మోదీ అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టిలను యశ్వంత్ సిన్హా తీవ్రంగా విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు రంగాల్లో ఘోరంగా విఫలమైందని అన్నారు. తాను ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే చరిత్ర క్షమించదంటూ తన విమర్శలకు ఆయన ఔన్నత్యాన్ని ఆపాదించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు అనాలోచిత చర్య అని చెప్పటంతోపాటు జి.ఎస్.టిని తొందరపడి అమలు చేయటం వలన ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది, జి.డి.పి పడిపోతోందని యశ్వంత్ సిన్హా విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అనాలోచితంగా చేపట్టారంటూ యశ్వంత్ సిన్హా చేసిన విమర్శలో నిజం లేకపోలేదు. పెద్ద నోట్లను రద్దు చేసే ముందు దీని వలన ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవటం నరేంద్రమోదీ, అరుణ్‌జైట్లి తప్పిదమే. చలామణిలో ఉన్న మొత్తం నోట్ల నుండి కనీసం మూడు లక్షల నోట్లు వెనక్కి రావని నరేంద్ర మోదీ, అరుణ్‌జైట్లి భావించారు. అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయి. చలామణిలో ఉన్న మొత్తం నోట్లు బ్యాంకుల్లోకి తిరిగి రావటంతో మోదీ, జైట్లీలు నోరు వెళ్లపెట్టక తప్పలేదు. రిజర్వు బ్యాంకుతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడటంతో నల్లధనం కాస్తా తెల్లధనంగా మారిపోయింది. నల్లధనం తెల్లధనంగా మారటాన్ని అరికట్టటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. జి.ఎస్.టిని అమలు చేయటంలోకూడా కొంత తొందరపాటును ప్రదర్శించారు.
ఆర్.ఎస్.ఎస్ అధినాయకుడు మోహన్ భగవత్ చేసిన విమర్శల్లో కూడా నిజం ఉన్నది. మోహన్ భగవత్ నీతి ఆయోగ్‌తోపాటు ఎన్.డి.ఎ ప్రభుత్వం ఆర్థిక సలహాదారులను తప్పుపట్టారు. పాత ఆర్థిక విధానాలను పక్కనపెట్టి దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు సహేతుకమైన సమాధానాలు, పరిష్కారాలను వెతకాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీ, యశ్వంత్ సిన్హాలు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తే మోహన్ భగవత్ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విమర్శించారు. వీరితోపాటు పలువురు ఇతర నాయకులు, ఆర్థిక నిపుణులు ఎన్.డి.ఎ ప్రభుత్వం ఆర్థిక విధానాలపై చేస్తున్న విమర్శల్లో కొంత నిజం ఉన్నా అసలు నిర్ణయాలే తప్పు అని చెప్పటం మంచిది కాదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానాల్లో తప్పు లేదు. కానీ వాటిని అమలు చేయటంలో ఎన్.డి.ఎ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో విజయం సాధించటం లేదు. పెద్ద నోట్లరద్దు అనేది మంచి నిర్ణయం. అయితే దీనిని పకడ్బందీగా అమలు చేయటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అవినీతిని అరికట్టే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం కొత్త అవినీతికి అవకాశం కల్పించింది. బ్యాంకు అధికారులు, సిబ్బంది అవినీతి మూలంగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చివరకు అపహాస్యంగా మారుతోంది. రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు తమ పాత నోట్లను బ్యాంకు అధికారుల సహాయంతో సునాయాసంగా కొత్త నోట్లుగా మార్చుకున్నారు. చివరకు సగటు మనిషికి పెద్ద నోట్ల రద్దు వలన తీరని నష్టం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరక్షరాస్యులు, నిరుపేదలకు నష్టం జరిగింది. పెద్ద నోట్ల రద్దు మూలంగా ఏ మేరకు అక్రమ డబ్బు వెలుగులోకి వచ్చిందనే ప్రశ్నకు మోదీ ప్రభుత్వం ఈరోజు వరకు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతోందంటే ఈ పథకం ఎంత వరకు విజయవంతమైందనేది సులభంగానే ఊహించుకోవచ్చు. పెద్ద నోట్ల రద్దు ఆశించిన లక్ష్యాన్ని సాధించి ఉంటే నరేంద్ర మోదీ ఈ పాటికి పెద్దఎత్తున ప్రచారం చేసుకునే వాడు. కానీ అలా జరగలేదు. జి.ఎస్.టిని అమలు చేయటంలో కొంత తొందర పాటు ప్రదర్శించారనే వాదన ఏ మేరకు నిజమనేది ఇప్పుడే చెప్పలేము. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు తమకు నచ్చనిది, తమకు అనుకూలంగా లేని దానిని ఎంతమాత్రం అంగీకరించరనేది అందరికి తెలిసిందే. దేశమంతా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయటం అనేది వ్యాపారస్తులకు ఎంత మాత్రం రుచించని పని. అందుకే వారు దాన్ని గట్టిగా వ్యతిరేకించారు.
పెద్దనోట్ల రద్దు, జి.ఎస్.టిని అమలు చేయటం వలన దేశం ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందనే ఆరోపణలో నిజం లేకపోయినా జి.డి.పి 5.7 శాతానికి పడిపోయింది. జి.డి.పి పడిపోవటంతోపాటు వస్తువుల ధరలు పెరుగుతుంటే ద్రవ్యోల్బణం పడిపోవటం ఎవ్వరికీ అర్థం కాని విషయం. ఎందుకిలా జరుగుతోందనే ప్రశ్నకు ఆర్థిక నిపుణుల వద్ద కూడా సరైన వివరణ లేదు. పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టిని అమలు చేయటం వంటి నిర్ణయాలను ఈరోజు కాకపోతే రేపైనా తీసుకోవలసిందే. నరేంద్ర మోదీ ధైర్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనను ప్రశంసించాల్సిందే. పెద్దనోట్ల రద్దు, జి.ఎస్.టి అమలు వలన ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపించకపోయినా ముందు, ముందు ఇవి మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పకతప్పదు. నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయాలు తీసుకున్నారు తప్ప తన స్వార్థం కోసం కాదనేది నిజం. గతంలో అధికారంలో ఉన్న వారు ఏం చేసినా అందులో పార్టీ, కుటుంబ ప్రయోజనం ఇమిడి ఉండేదనేది అందరికి తెలిసిందే. నరేంద్ర మోదీ నిర్ణయాలకు అలాంటి దుర్బుద్ధి, దురాలోచనలను ఆపాదించలేము. దేశం బాగుపడాలంటే నరేంద్ర మోదీలా గట్టి నిర్ణయాలు తీసుకొనక తప్పదు. నరేంద్ర మోదీ విధానాలను విమర్శిస్తున్న వారెవ్వరు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను సూచించలేదు. నరేంద్ర మోదీలాంటి బలమైన నాయకుడు కూడా దేశాభివృద్ధి కోసం గట్టి నిర్ణయాలు తీసుకొనకపోతే మరే ఇతర నాయకుడు గట్టి నిర్ణయాలు తీసుకోలేడు. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు ముందు, ముందు మంచి ఫలితాలు ఉంటాయనేందుకు డోక్లామ్ సంఘటన ఒక మంచి ఉదాహరణ. నల్ల డబ్బు అంతా బ్యాంకుల్లోకి వచ్చి తెల్ల డబ్బుగా మారిందని చాలామంది సంతోషించవచ్చు. కానీ ఈ డబ్బుకు సంబంధించిన మూడు లక్షల కేసుల పరిశీలనలో దొంగల బండారం తప్పకుండా బయటపడుతుంది.

కె కైలాష్