డైలీ సీరియల్

కోపమా! నీవెందుకే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలు జారినా ఫర్వాలేదు కానీ నోరు జారితే మళ్లీ తీసుకోలేమని విజ్ఞులు చెబుతారు. నిజమే. ఈమాట ఏకాలానికైనా అవసరమే. తొందరపడి ఒక మాట ఎదురువారు బలహీనులుగా ఉన్నారనో, మనకన్నా తక్కువగా ఉన్నారనో అనేస్తే సంపదలు, హోదాలు ఇవన్నీ కాలచక్రంతోపాటు తిరుగుతుంటాయి. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. అట్లాంటివాటిని చూసుకొని ఇతరులను అవమానించడం తగదని మహాభారతం కూడా చెబుతుంది.
ఓసారి భరద్వాజుడు ఘృతాచిని చూసినపుడు స్కలనం అయిన శుక్లాన్ని ద్రోణం పట్టి ఉంచాడు. ఆద్రోణం నుంచి ఒక బాలుడు ఉదయించాడు. ద్రోణం నుంచి పుట్టాడు కనుక ద్రోణుడనే పేరుతో పిలువబడ్డాడు. ఈ ద్రోణుడు భరద్వాజుని దగ్గరే చదువుసంధ్యలు నేర్చుకున్నాడు.అక్కడే వృషతుని కుమారుడు ద్రుపదునితో స్నేహం చేశాడు. ఇద్దరూ అస్తశ్రస్తవ్రిద్యలన్నీ నేర్చుకున్నారు.
స్నేహాన్ని మించినది ఏదీలేదుకదా ద్రుపదుడు, ద్రోణుడు వారిద్దరి మధ్య ఉన్న హోదాఅంతరాలను మరిచి ఎంతోస్నేహంగా ఉండేవాడు. విద్యాభ్యాసం పూర్తిచేసుకొని ఎవరి దోవన వారు వెళ్లిపోయారు. ఇద్దరూ గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టారు. వృషతుని మరణం వల్ల ద్రుపదుడు పాంచాలదేశానికి రాజు అయ్యాడు. భరద్వాజుని పుత్రుడు కృపాచార్యుని చెల్లెలి మగడు అయినందువల్ల ద్రోణాచార్యుడు ఆచార్యుడుగా మిగిలాడు పైగా దారిద్య్రబాధలను అనుభవించేవాడు. దానితోడు కృపి వల్ల ఆయన అశ్వత్థామ పుట్టాడు.
పరశురాముడు బ్రాహ్మణులను సన్మానిస్తున్నాడని విని ద్రోణుడు అక్కడికి వెళ్లితే అన్నీ పంచేసిన పరశురాముడు తన దివ్యాస్త్రాలను తీసుకోమని అడిగాడు. అవే పదివేలని వాటినిమించిన సంపద లేదని ఎంతో గౌరవంగా ఆనందంగా పరశురాముని దివ్యఅస్త్ర సంపదను తీసుకొచ్చాడు. కానీ వాటివల్ల ద్రోణుని దారిద్య్రం తీరలేదు. ఓ రోజు అతని దగ్గర చదువుకునే రాజకుమారులు పాలు తాగామని అశ్వత్థామకు చెబితే అట్లాంటి పాలు తనకూ కావాలని అశ్వత్థామ పట్టుపట్టాడు. కానీ కృపి గోవు లేనందున పాలు ఇవ్వలేకపోయింది. ఈ సంగతి ద్రోణునితో చెప్పి నీ స్నేహితుడైన పాంచలరాజు ఉన్నాడు కదా. అతనిని అడిగి కనీసం ఒక గోవును తీసుకొని రండి. మన బిడ్డకు పాలివ్వచ్చు అని సలహాచెప్పింది.
కృపి మాటలను విశ్వసించి నిజమే కదా ద్రుపదుడు ఎంతో స్నేహితుడు. పైగా తాను రాజు అనే భేదాన్ని పాటించక నీకు ఎప్పుడు అవసరమైనా నా దగ్గరకు యథేచ్చగా రావచ్చు అన్నాడు కదా మరి వెళ్దాం అని వెంటనే ద్రుపదుని దగ్గరకు వెళ్లాడు. మిత్రుని చూశానన్న ఆనందంతో చాలా చనువుగా స్నేహతత్త్వంతో ద్రోణుడు మాట్లాడాడు. కానీ అహంకారం పెంచుకున్న నిస్సంతు అయిన ద్రుపదుడు ద్రోణుడిని అవమానించాడు.
బడుగు బాపడైన నీకు నాకు స్నేహం ఏమిటి? అని ఎద్దేవా చేశాడు. తూలనాడాడు. దానితో ద్రోణుడు ఖిన్నుడైయ్యాడు. క్రోధ బీజం అంకురించింది. అతనిలో అగ్నిజ్వాల రేగింది. ప్రతీకార వాంఛ బయలుదేరింది. తాను పేదవాడైనా గురుకులంలో స్నేహం చేసిన బాస చేసినందువల్లే ఇక్కడి దాకా వచ్చాను కానీ వీని మదోన్నతి చూసి వచ్చానా వీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకొన్నాడు.
ఆ క్రోధం ఉన్న సమయంలోనే భీష్ముడు పరిచయం అయ్యాడు. అతడు తన బిడ్డలకు కురుపాండవులకు ఆచార్యుడు అవ్వమని తనకు ఏ లోటు రానీయ్యకుండా చూస్తానని చెప్పాడు. అదే చాలనుకొని వెంటనే కురుపాండవులకు ఆచార్యుడు అయ్యాడు. కానీ ద్రుపదుడు చేసిన అవమానాగ్ని ద్రోణునిలో చల్లారలేదు.
తన శిష్యులతో ద్రుపదునిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నాడు. వెంటనే కురుపాండవులను ఎవరు తన కోర్కె తీరుస్తారని అడిగాడు. అర్జునుడు నేనున్నానన్నాడు. మనసులో ఉన్న కోర్కె తీరడానికి అనువుగా అర్జునుడికి అన్నీ విద్యలనూ నేర్పారు. అందరికీ విద్యాబోధన చేస్తున్నా తన పని చేసిపెడతానన్న అర్జునుడిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
చివరకు విద్యాభ్యాసం పూర్తి అయి గురుదక్షిణ ఇచ్చే సమయంలో ద్రుపదుడిని జయించి వస్తే అదే అతని గురుదక్షిణ అనిద్రోణుడు అన్నాడు. వెంటనే కౌరవులు పరుగెత్తి వెళ్లి ద్రుపదుడితో పోరబోయి అతని ధాటికి తట్టుకోలేక వెనక్కి వచ్చేశారు. అపుడు బాణకౌశలంతో అర్జునుడు ద్రుపదుడిని ఎదుర్కొన్నాడు. ద్రుపదుడు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. తన రథచక్రాలకు కట్టుకుని ద్రుపదుడిని తీసుకుని వచ్చి ద్రోణుడి పాదాల ముందు పడేశాడు అర్జునుడు.
అపుడు ద్రోణుడి కోపావేశం తగ్గింది. ద్రుపదుడిని అవమానించి నీవు చేసిన అవమానానికి ఇది ప్రతీకారం అని చెప్పి పంపించి వేశాడు.
కానీ ద్రుపదుడు తాను చేసిన పొరపాటుకు గదా ఇలా జరిగిందన్న ఆలోచనలేక ద్రోణుడిపై కక్షను పెంచుకున్నాడు. వెంటనే యాగం చేసి యజ్ఞగుండం నుంచి ద్రోణుడిని చంపగల శక్తి ఉన్న దుష్టద్యుమ్నుడిని, అర్జునుడిని చేపట్టగల స్ర్తిమూర్తిని ద్రుపదుడు పొందాడు.
ఈసంగతి తిరిగి ద్రోణుడికి తెలిసింది. తనను చంపడానికి యజ్ఞం చేసి కొడుకు కన్నాడన్న కోపంతోనే చివరకు తన జీవితాన్ని సాగించాడు ద్రోణుడు. దానివల్లనే అధర్ములైనా దుర్యోధనుని పక్షానే ద్రోణుడు నిలిచాడు. ఇలా ఒకరికి దురాలోచన మరొకరి కోపంగా మారింది. ఒకరి అవమానపు దృష్టి మరొకరిలో మరణహేతువును సృష్టించేట్టుచేసింది.
కానీ మనిషి అన్నవాని జీవితం బుద్భుదప్రాయం. మరుజన్మకు కేవలం వాసనారూపంలో ఈ కర్మావశేషాలనే మూటగట్టుకుపోతారు కానీ సంపదలు తీసుకొనిపోలేరు. ఆ విషయం అందరికీ తెలిసినా కూడా లిప్తం కాలంపాటు ఉండే సంపద్విశేషాన్ని చూసుకొని అహంకరిస్తారు. ఎందుకీ అహంకారం అని ఆలోచిస్తే మహాభారతంలో ద్రోణుడి కథైనా, ద్రుపదుని కథైనా వేరుగా ఉండేదేమో. ఇట్లాంటి వాటిని గుర్తుతెచ్చుకుంటూ మనుష్యులందరూ వర్తమాన జీవితం లో కోపం, పగ,ద్వేషం లాంటివి దూరం చేసుకోవాలి.

- ఆర్. పురందర్