క్రైమ్/లీగల్

బండ్ల గణేశ్‌పై క్రిమినల్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను హత్య చేసేందుకు తన ఇంటిపైకి కొందరు రౌడీలను బండ్లగణేశ్ పంపించారని ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్ వీ. పొట్లూరి (పీవీపీ) జూబ్లీహిల్స్ పోలీస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండ్ల గణేశ్, అతడి అనుచరుడు కిశోర్‌పై ఐపీసీ సెక్షన్లు 420, 448, 506, 109 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ రోడ్ నెంబర్ 82లో ఉండే ప్రసాద్ వీ. పొట్లూరి ఇంట్లోకి శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు చొరబడి అసభ్యపదజాలంతో దూషిస్తూ బండ్ల గణేశ్‌తో ఉన్న అర్థిక వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని బెదిరించారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయమై తన కార్యాలయంలో మాట్లాడుకుందామని చెబుతుండగానే తన పట్ల వారు దురుసుగా ప్రవర్తించారని ప్రసాద్ వీ పొట్లూరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టెంపర్ సినిమా నిర్మాణం కోసం బండ్ల గణేశ్ 2013లో తన వద్దకు వచ్చాడని, అందుకోసం రూ.30 కోట్లు రుణం ఇవ్వాల్సిందిగా అడిగాడని ఆయన తెలిపారు. దీనికి తాను ఒప్పుకుని, ఆమేరకు ఒప్పందం చేసుకుని అప్పు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఇందులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించి, బండ్ల గణేష్ మిగిలిన రూ.7 కోట్లను మాత్రం ఇవ్వకుండా ఇప్పటివరకూ నెట్టుకొచ్చాడన్నారు. మూడు నెలల్లో ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ ఇవ్వకపోగా ఆ మొత్తానికి సంబంధించి ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని, తనపై హత్యాయత్నం చేయాలనుకున్నారని, తనకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాల్సిందిగా పీవీపీ తన ఫిర్యాదులో కోరారు. ఇదిలావుండగా బండ్ల గణేశ్ శుక్రవారం రాత్రి పీవీపీపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయ సలహాల అనంతరం ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కళింగరావు వెల్లడించారు.