క్రైమ్/లీగల్
సెల్ఫోన్స్ కంటైనర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నెల్లూరు, ఆగస్టు 14: జాతీయ రహదారులపై రెక్కీ నిర్వహిస్తూ విలువైన వస్తువులతో వెళ్లే కంటైనర్లను దారి మళ్లించి డ్రైవర్లను అతి కిరాతకంగా హత్యచేసి సరకులతో సహా ఆనవాళ్లు లేకుండా పరారయ్యే మధ్యప్రదేశ్కు చెందిన అత్యంత క్రూరమైన కంజర్భట్ గ్యాంగును నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. అక్కడి పోలీసులు పెద్దగా సహకరించకపోయినా నెల్లూరు పోలీసులు అత్యంత సాహసోపేతంగా ఈ కేసును చేధించారు. వీరితోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లను కూడా అరెస్టుచేసి తెలుగు పోలీసుల సత్తా దేశ వ్యాప్తంగా చాటారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ జిల్లా భైరవకేడి, చిడావర్, ట్యాంక్కుడ్ ప్రాంతాల్లో కంజర కులాకి చెందినవారు ఎక్కువగా ఉంటారు. దోపిడీ దొంగతనాలే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవించే వీరు మనుషులను అతిక్రూరంగా చంపి దోపిడులకు పాల్పడుతారు. ఎక్కువగా జాతీయ రహదారులను టార్గెట్ చేసుకుంటారు. ఇదే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన సుఖేష్అడ, సంతోష్ మరికొందరు హుండాయ్ కెట్రా కారులో రెక్కీ నిర్వహించుకుంటూ తమిళనాడుకు చేరుకున్నారు. తమిళనాడులోని పల్లికొండ ప్రాంతంలోని జాతీయరహదారిపై ఒక కంటైనర్ను అడ్డగించి డ్రైవర్ను అతి కిరాతకంగా హత్య చేశారు. కంటైనర్లో ఏమీ లేకపోవడంతో రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. గంగవరం సమీపంలో ఇదే తరహాలో కంటైనర్ డ్రైవర్ను హత్యచేయగా అక్కడ కూడా కంటైనర్లో ఏమీ లభించకపోవడంతో అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లా బనగానపల్లికి చేరుకుని మరో కంటైనర్ను ఆపగా అందులో పెద్దగా విలువైన వస్తువులు దొరకలేదు. డ్రైవర్ను మాత్రం హత్య చేశారు. అక్కడి నుంచి నెల్లూరు చేరుకున్నారు. తడ మండలం శ్రీసిటీ బయట రెండు రోజులపాటు రెక్కీ నిర్వహించారు. శ్రీసిటీ నుంచి కంటైనర్లు ఏఏ సమయాల్లో బయటకు వెడుతున్నాయో గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 12న తడ సమీపంలో శ్రీసిటీ రెడ్మి సెల్ఫోన్ తయారీ కేంద్రం నుంచి రూ.4.80 కోట్లు విలువైన సెల్ఫోన్ల లోడుతో కంటైనర్ జాతీయరహదారి మీదుగా కలకత్తా బయలుదేరింది. కంటైనర్ బయలుదేరినప్పటి నుంచి వెనుకే కారులో రెక్కీ నిర్వహిస్తూ వెళ్లిన కంజర్భట్ గ్యాంగు దగదర్తి వద్ద నిర్మానుష్య ప్రాంతంలో కంటైనర్ను అడ్డగించారు. డ్రైవర్ను చితకబాది కంటైనర్ను బలవంతంగా రోడ్డుపక్కగా ఎవరికీ కనిపించకుండా ఉండే ప్రాంతానికి తీసుకెళ్లారు. మరో లారీని అక్కడికి తీసుకెళ్లి కంటైనర్లో ఉన్న సెల్ఫోన్ల లోడును వీరు తీసుకెళ్లిన లారీలోకి మార్చుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లి బంగ్లాదేశ్కు తరలించే బ్రోకర్లకు విక్రయించారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి 20మంది పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు ఆరు నెలలపాటు ఈ బృందాలు ఎనిమిద రాష్ట్రాల్లో తిరిగి ఎట్టకేలకు అత్యంత ప్రతికూల పరిస్థితుల నడుమ కంజర్భట్ గ్యాంగులోని ఇద్దరిని, సెల్ఫోన్లు బంగ్లాదేశ్కు అమ్మిన మరో నలుగురు మధ్యవర్తులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.70లక్షల నగదు, లారీ, మహేంద్ర ఎక్స్ మూవీ కారు, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కేసు దర్యాప్తు సాగిందిలా..
నేరం జరిగిన వెంటనే ఎస్పీ ఐశ్వర్య రస్తోగి నిపుణులతో 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు నుంచి హైదరాబాదు మీదుగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ వరకు నేరానికి ఉపయోగించిన లారీలను ట్రాక్ చేశారు. ఈ పోలీసు టీమ్లు వేలగంటలు శ్రమించి అన్ని టోల్గేట్లలో సీసీ టీవీ పుటేజీలను స్కాన్ చేశారు.
సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నంబర్లేని కొత్త హుండాయ్ కెట్రా కార్ మరో లారీని రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఆ కారుకు కట్టిన రిబ్బన్ ఆధారంగా ఆ వాహన ఆచూకీని తెలుసుకున్నారు. చోరీ చేసిన వాహనం ఇండోర్ వెళ్లిన నేపథ్యంలో ఈ నేరానికి పాల్పడింది మధ్యప్రదేశ్లోని కంజర్భట్ గ్యాంగుగా నిర్ధారించి కొన్ని నెలలపాటు మధ్యప్రదేశ్లోనే ఉండి కంటైనర్ లారీడ్రైవర్ తెలిపిన సమాచారం ఆధారంగా నేరస్తులను గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఎనిమిది రాష్ట్రాల క్రైమ్రికార్డు బ్యూరోల నుంచి వేలిముద్రల డేటాను సేకరించారు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, తెలంగాణా రాష్ట్రాల్లో కంజర్భట్ గ్యాంగుల నేరచరిత్రను సేకరించారు. ముందుగా ఈ ఏడాది మే 3న గ్యాంగులోని ఇద్దరిని అరెస్టు చేశారు. వారి ద్వారా చోరీచేసిన సెల్ఫోన్లు కొనుగోలు చేసిన మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన అంకిత్ శ్రీవాత్సవ, పవన్చౌదరిలను గుర్తించారు. అంతర్జాతీయ స్మగ్లర్, చోరీ సొత్తును కొనుగోలు చేసే పశ్చిమ బెంగాల్కు చెందిన షేక్ హమీద్ జామన్ అలియాస్ రీతును గుర్తించి అతని పూర్తిచరిత్ర సేకరించారు. రీతు హైదరాబాదుకు వచ్చారని గుర్తించి అత్యంత కఠినపరిస్థితుల మధ్య అతనిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మరో బృందం మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు రిసీవర్లను అక్కడి పోలీసులు సహకరించకున్నా ఎంతో శ్రమకు ఓర్చి అదుపులోకి తీసుకున్నారు. కంజర్భట్ గ్యాంగు చోరీచేసిన సెల్ఫోన్లను మధ్యప్రదేశ్కు చెందిన రిసీవర్కు అమ్మగా, ఆ ఫోన్లు అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్కు చెందిన మరో రిసీవర్కు చేరాయి. అక్కడి నుంచి దేశ సరిహద్దు మీదుగా బంగ్లాదేశ్కు స్మగ్లింగ్ చేశారు. ఈ కేసు చేధించడానికి లక్ష గంటలకు పైగా శ్రమించారు. కేసును చేధించేందుకు ఏపీతో సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో దర్యాప్తు కొనసాగించారు
దర్యాప్తులో పాల్గొన్న
పోలీసు అధికారులు, సిబ్బంది
ఈ కేసు దర్యాప్తులో నెల్లూరు సీసీఎస్ సీఐలు పి.అక్కేశ్వరరావు, ప్రసాద్, బాబీజాన్ సైదా, బుచ్చి సీఐ బి.సురేష్బాబు, పొదలకూరు మాజీ సీఐ షేక్ ఫిరోజ్, చిల్లకూరు ఎస్సై షేక్ హుస్సేన్, దగదర్తి ఎస్సై జి.సుబ్బారావు, పోలీసు హెడ్క్వార్టర్స్ ఎస్సై ఎం బాబి, సీసీఎస్ ఎస్సైలు జేపీ శ్రీనివాసులురెడ్డి, జి అంకమ్మ, సైబర్ క్రైం ఎస్సై సురేష్బాబు, దగదర్తి ఏఎస్సై ఎన్ శ్రీనివాసులురెడ్డి, గూడూరు రూరల్ హెడ్కానిస్టేబుల్ ఆర్.వెంకటేశ్వరరావు, గూడూరు రూరల్ కానిస్టేబుల్ పి.ఆదినారాయణ, దగదర్తి కానిస్టేబుల్ పి.చెన్నకేశవ, బుచ్చి కానిస్టేబుల్ కె.జయచంద్ర, సైబర్ కానిస్టేబుల్ పి.నవీన్ జయకృష్ణ, బుచ్చి సర్కిల్ పోలీసు డ్రైవర్లు ప్రసాద్, వంశీ, బుచ్చి కానిస్టేబుళ్లు అనిల్, వెంకటేశ్వర్లు, సంగం కానిస్టేబుళ్లు హరిబాబు పాల్గొని అత్యంత ప్రతిభతో కేసును చేధించారని, వారికి రివార్డులు అందచేస్తామని ఎస్పీ ఐశ్వర్యరస్తోగి తెలిపారు.